పాడి పంటలు

Showing posts with label పాడి - పంట. Show all posts
Showing posts with label పాడి - పంట. Show all posts

Tuesday, March 27, 2012

సేద్యం ఇక సాధ్యమా?

భారతదేశం మళ్ళీ డెబ్భై, ఎనభై దశకాల్లోకి వెళ్లి పోతోందా? ప్రత్యక్ష పన్నులపై ఆధారపడే ప్రగతిశీల పన్ను విధానం నుంచి, ప్రజలందరికీ భారమయ్యే పరోక్ష పన్నుల విధానం వైపు మళ్ళుతోందా? గతంలో సంక్షేమ పథకాల మాటున గారడీ చేసిన యూపీఏ ప్రభుత్వం హఠాత్తుగా ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించేసింది. ప్రణబ్ కొత్త బడ్జెట్టు, రైతుల సాగు ఖర్చును విపరీతంగా పెంచే ఎరువులు మరింత కరువయ్యేలా, బరువయ్యేలా, సబ్సిడీల తగ్గింపును చేపట్టింది. పన్నులు విపరీతంగా బాదేసింది. http://harddrink.files.wordpress.com/2011/07/indian-farmer-ploughing.jpg
వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడి, సరఫరా గొలుసులోని సమస్యలను సరిదిద్దడం, రహదారుల అభివృద్ధి, విమానయానం లాంటి పదాలు వున్నా, సమ్మిళిత అభివృద్ధి లాంటి పదాలు బడ్జెట్టులో మాయం చేసింది. ఆమ్ ఆద్మీ ఊసే లేదు. వృద్ధి ఇంకా కావాలి అని కాకుండా ఉన్న వృద్ధిని కాపాడుకొందాము అని, పైగా దానికి దేశీయ డిమాండు రికవరీ కావాలని సెలవిచ్చారు ఆర్థిక మంత్రి. వృద్ధి ద్వారా సంపద సృష్టి అనే 21వ శతాబ్ద సిద్ధాంతం మానేసి ఎనభైలలోని దేశీయ డిమాండు పెంపొందించటం అనే దృష్టి మళ్ళీ వచ్చేసిందేమో తేలీదు కానీ పన్నులని ఎడా పెడా పెంచేశారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మీద పెను ప్రభావం చూపించే సర్వీస్ పన్నులు పెంచారు. సబ్సిడీ తగ్గిస్తాము అంటూ, ఎరువుల ధరలు పెంచుతామని అన్యాపదేశంగానే చెప్పారు.

ప్రణబ్ బడ్జెట్టులోని లెక్కలు సరికావాలంటే పన్నేతర ఆదాయం 31.96 శాతం పెరగాలి. అంటే మళ్ళీ వేలం పాట (లేక 3 జి, 4 జి) పెట్టుబడుల ఉపసంహరణ లాంటి వాటి మీద ఆధారపడాలి. సబ్సిడీ బిల్లు కనీసం 12 శాతం తగ్గాలి. కానీ ఆహార సబ్సిడీ బిల్లే 30 వేల కోట్లు తినేస్తుంది. ద్రవ్యలోటుని 5.1 శాతానికి తెస్తామని చెప్పారు గానీ అది వీలుకాదని తెలుస్తూనే వుంది. కేల్కర్ కమిటీ ప్రకారం మార్కెట్టు నుంచి అప్పు చేయాలి. ఈ నేపథ్యంలో జీతాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు లాంటి వాటికి కూడా ప్రభుత్వం అప్పు చెయ్యబోతోంది. ఇంత అప్పు, ఇన్ని పన్ను లు ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుందో ప్రణబ్ మహాశయుడే చెప్పాలి.

ఎక్సైజ్ పన్ను రాబడి పెరిగింది; సర్వీస్ పన్నులని విపరీతంగా పెంచారు; కానీ ఇంకా మన స్థూల ఆర్థిక వనరులు అస్తవ్యస్తంగానే వున్నాయి. 2011 సంవత్సరం బడ్జెట్ సమయంలో గొప్పగా తన బడ్జెట్ ఆదాయానికి ఖర్చుకి తేడా -అంటే ద్రవ్యలోటు- కేవలం 4.6 శాతం మాత్రమే అని ప్రకటించారు ప్రణబ్. అందరూ ఆశ్చర్యపోయారు. చాలా మంది తప్పుబట్టారు. ఎందుకంటే ఆహారం, చమురు, ఎరువుల మీద ఖర్చు 2010 సంవత్సరంలోని లక్షా యాభైవేల కోట్ల కంటే తగ్గించి కేవలం లక్షా ముప్పైనాలుగు వేల కోట్లు మాత్రమే చూపించారు. చమురు, ఎరువులు, ఆహార ఖర్చు పెరుగుతాయే కానీ ఎలా తగ్గుతాయో ప్రజలెవ్వరికీ అర్థం కాలేదు. ప్రస్తుతానికి వస్తే బడ్జెట్‌లో ప్రణబ్ అసలు నిజాన్ని ప్రకటించారు.

పై మూడు పద్దుల కింద అయిన ఖర్చు 2,16,297 కోట్లు. దాదాపు 80 వేల కోట్లు క్రితం సారి తగ్గించి చూపించి అసలు ద్రవ్యలోటు అదుపు లోనే వుందన్నట్టు చూపించారు. క్రితంసారి 5.9 శాతం ఉన్న ద్రవ్యలోటుని ఈ సారి 5.1 శాతానికి తగ్గిస్తానని ప్రణబ్ చెప్పారు. కానీ ఇదెంత అసంబద్ధమంటే పన్నులన్నీ సరిగ్గా వసూలై, సబ్సిడీలు 26 వేల కోట్లు తగ్గిస్తే, ఆహార బిల్లు అమల్లోకి రాకపోతే కూడా కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే సాధ్యమవుతుంది.

ఈసారి పన్నుల రూపంలో దాదాపు 44 వేల కోట్లు అదనంగా వడ్డించారని బాధపడుతున్న ప్రజలకి రాబోయే నెలల్లో ఆహారం, ఎరువులు, చమురు మీద పడబోయే అదనపు భారం వివరాలు తలచుకుంటే చెమటలు పట్టక మానవు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆహార, చమురు, ఎరువుల సబ్సిడీ మీద ప్రభుత్వ ఖర్చు లక్షా తొంభై వేల కోట్లకు పడిపోతుందట! అంటే వాటి ధరలు తగ్గు తాయని కాదు.

ప్రభుత్వ సబ్సిడీని దశల వారీగా తగ్గిస్తూ రెండు శాతానికి పరిమితం చేస్తారని ! పెట్రోలు ఉత్పత్తుల మీద ఈ సంవత్సరం 68, 481 కోట్లు ఖర్చు పెడితే, రాబోయే సంవత్సరంలో దీన్ని 43, 580 కోట్లకి పరిమితం చేశారు. పెట్రో ఉత్పత్తుల డీ రెగ్యులేషన్ పేరుతో వాటి మీద దాదాపు యాభై శాతానికి పైగా పన్నును విధిస్తూనే, పెరిగే ధరలతో తనకు సంబంధం లేదని చెప్తోంది యూపీయే ప్రభుత్వం. అంటే ఆయిల్ కంపెనీలకు నష్టాలు అనే సాకుతో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచటం తథ్యం. డీజిల్ ధరలు పెరిగితే సామాన్యులు బస్సు చార్జీలనించి రైతుల సాగు ధరల వరకు అన్నీ పెరగడం అనివార్యం.
http://im.rediff.com/money/2011/feb/02agri1.jpg
వ్యవసాయానికి క్రితం సంవత్సరాని కంటే మూడు వేల కోట్లు ఎక్కువిచ్చామని ప్రణబ్ గొప్పగా చెప్పారు. కానీ ఎరువుల మీద క్రితం సంవత్సరం ఇచ్చిన 67, 198 కోట్ల కంటే ఈసారి పదిశాతానికి పైగా తక్కువ ఖర్చు పెడతామని చెప్పారు. మొన్న ఫిబ్రవరిలో నిర్ధారించిన ఎరువుల సబ్సిడీని పరిగణనలోకి తీసుకొంటే డీఏపీ, యూరియా, ఎంబిసీ మొదలగు వాటిపై 60, 974 కోట్లు మాత్రమే వస్తుంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వ సబ్సిడీ బకాయిలతో కలిపి దాదాపు 93,000 కోట్లకు చేరింది. దాన్ని ఇప్పుడు అరవైవేల కోట్లకు పరిమితం చేయడమంటే అంతర్జాతీయ ధరల పెరుగుదలను రైతుకు బదిలీ చెయ్యబోతున్నారన్న మాట. రైతులకి ఎరువుల ధరలు చుక్కలు చూపించబోతున్నాయి.

చమురు రేట్లు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతి చేసుకొనే ఎరువుల రేట్లు సహజంగానే పెరిగే అవకాశం ఉంది. యూరియా మూడవ వంతు, మిగతా ఎరువులను భారత్ సింహ భాగం దిగుమతి చేసుకొంటున్న నేపథ్యంలో, ఎరువులు మీద సబ్సిడీలను దశల వారీగా తగ్గిస్తామని చెప్పడం రైతుకు ఆశనిపాతమే. రైతుకి ఎరువుల ధరలు ఇంకా పెరిగితే సాగు ధర ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే సాగుధరకి, మద్దతు ధరకి ఎక్కడా సాపత్యం కుదరక తల్లడిల్లుతున్న రైతుకి ఎరువుల ధరలు ఇంకా పెరగడం రైతుకే కాదు, వినియోగదారులకీ నష్టమే.
http://www.microdinero.com/files/noticias/2298_2170_rural.jpg
ఇక రైతుని దొంగ దెబ్బ తీయబోయే అతి తీవ్రమైన సమస్య ఆహార సబ్సిడీ పథకం. 2012 కి ఆహార సబ్సిడీ కోసం 75 వేల కోట్లు చూపించారు. ఈ సారి ఆహార సబ్సిడీ పథకం అమలుచేస్తే కావాల్సింది సంవత్సరానికి 1, 02,000 కోట్లు. ఇప్పుడిచ్చినది కాకుండా మిగిలినది ఎలా ఇస్తారో ప్రభుత్వం చెప్పలేదు. ఈ ప్రభుత్వమే గొప్పగా నియమించిన స్వామినాథన్ కమిటీ అమలు గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. బహుశా ఆ సిఫార్సులు అమలు చెయ్యలేమని చెప్పిన శరద్ పవార్ స్ఫూర్తి గాబోలు. రైతులకి రుణాలు అయిదు లక్షల పాతిక వేల కోట్లకు పెంచామని అన్నారు. http://www.instablogsimages.com/images/2007/05/29/agriculture-scheme-pm_26.jpg
కానీ రైతులందరినీ సంస్థాగత రుణాల పరిధిలోకి తేవాలంటే కనీసం పది లక్షల కోట్ల రుణాలు పంపిణీ కావాలి. పైపెచ్చు ఇప్పుడు ప్రకటించిన రుణాలు ఇచ్చేది ప్రభుత్వం కాదు, బ్యాంకులు. వాటి మీద అదుపు లేనప్పుడు ఎన్ని కోట్లు ప్రకటించినా ప్రస్తుతం వున్న 30 శాతం లబ్ధిదారుల కంటే పెరిగే అవకాశమే లేదు. వ్యవసాయ ఉత్పత్తి రేటు 2.5 శాతానికి పడిపోయిన ఈ సమయంలో రైతులు ఆర్థిక మంత్రి వైపు ఆశగా చూసారు. కొన్ని వ్యవసాయ మిషన్లు ఏర్పాటుచేయడం తప్పిస్తే, పంట దిగుబడి పెంచే చర్యలు పెద్దగా కనబడవు.

స్థూలంగా వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడానికి కావాల్సిన ఫ్రేం వర్కు బడ్జెట్టులో లేదు. పైపెచ్చు రైతు నడ్డి విరిచే సబ్సిడీల తగ్గింపు వంటి చర్యలు వున్నాయి. ఈసారి ప్రణబ్, మన్మోహన్ ఇద్దరూ భారత ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పనిసరి అని చెప్తూ వచ్చారు. మన్మోహన్ అయితే మరో అడుగు ముందుకు వేసి సబ్సిడీ బుల్లెట్లు కొరకాల్సిందే అని పోకిరీ టైపులో సెలవిచ్చారు. కానీ ఆయన ఆర్థిక వేత్తగా మరిచిపోయిన దేమిటంటే, తమ ప్రభుత్వం ఆహార సబ్సిడీ అనే ఫక్తు వోటుబ్యాంకు పథకానికి ముప్పై వేల కోట్లకు పైగా సబ్సిడీ ఇవ్వబోతోందని. దానికి లేని ఇబ్బంది రైతులకి ఎరువుల సబ్సిడీ ఇవ్వడంలో ఎందుకు?
http://india.targetgenx.com/files/2008/04/farmer1.jpg
ఈ రైతు వ్యతిరేక చర్యలన్నీ ఒకే ప్రశ్న వేస్తాయి. దేశంలోని 60 శాతం పైగా ఉన్న రైతులకు ఉపయోగపడని డబ్బు, వృద్ధి ఎవరి కోసం? ప్రభుత్వం తన దగ్గర ఉన్న సంపదని నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి చేర్చకుండా, ఉన్న కాస్త సబ్సిడీలను తీసేస్తూ వాళ్ళ మీద ఇంకా పన్నులేస్తూ ఎవరి కోసం పని చేస్తున్నట్టు? http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-02.jpg
ఇంతటి హ్రస్వ దృష్టినీ, చిత్తశుద్ధి లేమినీ, విధాన రాహిత్యాన్నీ నిలదీయాల్సిన పని, పోరాటం చేయాల్సిన పనీ రాజకీయ పార్టీలది. సాగు ఖర్చులు మూడొందల శాతం పైగా పెరిగి రైతు చితికి పోతూ ఉంటే ప్రతి పక్షంలోని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు పాలక పక్షాలపై ముప్పేట దాడిచేసి రైతుకు ఏదో మేరకు సాంత్వన చేకూర్చాలి. మేధావులెందరో అంటున్నారు గానీ, నిజానికి వ్యవసాయం సంక్షోభంలో లేదు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కంపెనీలు ఎవరూ సంక్షోభంలో లేరు.

మిల్లర్లు, దళారులూ కూడా సంక్షోభంలో లేరు. ప్రభుత్వ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని మరీ ఇబ్బడి ముబ్బడిగా పండిస్తున్నారు మన రైతన్నలు. ఈ రకంగా ఆహార సంక్షోభమూ లేదు. సంక్షోభంలో ఉన్నది రైతులు. రైతు కూలీలు, కౌలు రైతులు. వీరిని గట్టెక్కించే దీర్ఘకాలిక విధానాల రూపకల్పనలోనూ దీర్ఘకాలిక పోరాటాలలోనూ కలిసికట్టుగా పనిచేయడం రాజకీయ పక్షాల బాధ్యత.
http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-15.jpg
చిత్రంగా మన రాష్ట్రంలో మాత్రం, రైతు మిత్రులమని చెప్పుకునే చిట్టి పొట్టి పార్టీలు తమ పోరాటం ప్రధాన ప్రతిపక్షం పైన మళ్లిస్తూ ప్రజాగ్రహాన్ని పలుచన చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను చీలుస్తూ తాము (పైపైకి మాత్రమే అయినా సరే) వ్యతిరేకించే ప్రజా వ్యతిరేకులకే మేలు చేస్తూ వస్తున్నారు. పైపై మెరుగుల సింబాలిక్ ఉద్యమాలూ, స్వంత డబ్బాలూ కొంత మానుకుని రైతన్న ఏం ఆశిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం ఇకనైనా మొదలుపెట్టాలి.

- శ్రీశైల్ రెడ్డి పంజుగుల
తెలుగుదేశం వ్యవసాయ అధ్యయన కమిటీ సభ్యులు
- నీలయపాలెం విజయకుమార్
రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు

Saturday, March 3, 2012

చెరకు చెత్తే కదా అని కాల్చేయొద్దు


  చెరకు తోటలు నరికిన తర్వాత చాలా మంది రైతులు చెత్తను కాల్చేస్తుంటారు. అయితే దీనివల్ల వారికి ఎంతో నష్టం జరుగుతోంది. ఎందుకంటే ఈ చెత్త చెరకు పైరు సాగులో పలు రకాలుగా ఉపయోగపడుతుంది. చెరకు చెత్తను కాల్చేయడం వల్ల నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలనే కాకుండా భూసారాన్ని, భూ భౌతిక స్వభావాన్ని పెంచే సేంద్రియ పదార్థాన్ని కూడా నష్టపోతున్నాము.కాబట్టి చెరకు చెత్తను పైరులో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీనివల్ల ఒనగూడే ప్రయోజనాలేమిటి అనే విషయాలపై రైతులు అవగాహన కలిగి ఉండడం అవసరం.చెరకు చెత్తలో నార పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కుళ్లబెడితే చివికిన సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇది పైరుకు పోషక పదార్థాల్ని అందిస్తుంది. చెరకు చెత్తను మొక్క, పిలక తోటల్లో వేసుకోవచ్చు.
ఎలా కుళ్లబెట్టాలి?

చెరకు చెత్తను కుళ్లబెట్టే శిలీంద్రాలు ఉంటాయి. రెండున్నర ఎకరాల తోటకు మూడు కిలోల శిలీంద్రాలు అవసరమవుతాయి. బాగా చివికిన పశువుల ఎరువు లేదా ఫిల్టరు మడ్డికి ఈ శిలీంద్ర సముదాయాన్ని కలపాలి. దానిపై పలచగా నీరు చల్లి నీడలో ఉంచాలి. దానిపై గోనె సంచి లేదా వరి గడ్డి కప్పాలి. ఆ తర్వాత శిలీంద్రం వృద్ధి చెందడానికి వారం రోజుల సమయం పడుతుంది. అనంతరం దానిని సాళ్ల మధ్య పరచిన చెరకు చెత్త పైన పలచగా చల్లుకోవాలి. ఆ సమయంలో కొద్దిపాటి తేమ ఉండాలి.

ఎలా వాడాలి?

పైన తెలిపిన విధంగా అభివృద్ధి చేసిన శిలీంద్ర సముదాయాన్ని మొక్క తోటల్లోనూ, కార్శి తోటల్లోనూ వాడుకోవచ్చు. మొక్క తోటల్లో అయితే ముచ్చెలు నాటిన మూడో రోజున చెరకు చెత్తను పొలంలో పలచగా పరవాలి. ఇందుకోసం ఎకరానికి సువూరు 1.25 టన్నుల చెత్త అవసరమవుతుంది. వర్షాకాలంలో కాలువలు ఎగదోసే సమయంలో 1.25 కిలోల శిలీంద్రం, ఎనిమిది కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్‌ను కలిపి ఆ మిశ్రవూన్ని ఎకరం విస్తీర్ణంలో పరచిన చెరకు చెత్తపై చల్లి మట్టితో కప్పాలి. అప్పుడు ఆ చెత్త మంచి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది.

ఇక కార్శి (పిలక) పంట తీసుకునే వారు మొక్క తోటలు నరికిన తర్వాత చెరకు చెత్తను (ఎకరానికి 1.25 టన్నులు) సాళ్లలో వేసి, దానిపై ఎకరానికి 10 కిలోల చొప్పున సూపర్ ఫాస్ఫేట్, ఎనిమిది కిలోల యూరియా, 1.25 కిలోల శిలీంద్రం కలిపి చేనంతా కలిసేలా చల్లాలి.కార్శి మోళ్లకు ఆనుకొని లోతుగా నాగలితో దున్నినట్లయితే మొదళ్ల వద్ద ఉన్న పాత వేర్లు తెగి కొత్త వేర్లు పుట్టుకొస్తాయి. అప్పుడు కొత్తగా వచ్చే పిలకలు బాగా మొలుస్తాయి. నేలలో వేసిన చెరకు చెత్త కుళ్లి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. మిగిలిపోయిన చెరకు చెత్తను సాళ్ల మధ్య పలచగా పరచుకోవచ్చు.


ఉపయోగాలివే

చెరకు చెత్తను సాళ్లలో పరిచి, కుళ్లబెట్టి సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకుంటే పలు ప్రయోజనాలు చేకూరుతాయి. సాళ్ల మధ్యలో చెరకు చెత్తను కప్పితే తేమ చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. వర్షాధారపు చెరకు సాగుకు ఇది ఎంతో ఉపయోగకరం.

సాళ్లలో చెత్తను పరిస్తే నాటిన/కార్శి చేసిన తొలి దశలో కలుపు మొక్కలు మొలవకుండా నివారించవచ్చు. అంతేకాదు... పీక పురుగు ఉధృతి కూడా తగ్గుతుంది. ఎందుకంటే భూమిలో తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు పీక పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.చెరకు చెత్తను కప్పడం వల్ల భూమిలో తేమ చాలా కాలం పాటు అలాగే ఉంటుంది. వేసవిలో తోటకు సరిగా నీరు పెట్టలేకపోయినప్పటికీ భూమిలో నిల్వ ఉన్న తేమ వల్ల పైరు వడలిపోదు. నీటి తడులు తక్కువగా ఇచ్చినా సరిపోతుంది. చెరకు చెత్తను కాలిస్తే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీనిని సాళ్ల మధ్య పరవడం ద్వారా ఆ కాలుష్యాన్ని నివారించవచ్చు. పాల చౌడు, చౌడు భూముల్లో చెరకు చెత్తను సాళ్లలో పరిచి తేమను కాపాడి, భూమిలోని లవణాల్ని వేర్ల దగ్గరికి రాకుండా చేయడం వల్ల పైరు బలంగా పెరిగి మంచి దిగుబడులు ఇస్తుంది.


చెత్తను నేరుగా...
చెరకు చెత్తను నేరుగా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. టన్ను చెరకు చెత్తను కంపోస్ట్‌గా మార్చాలంటే మీటరు లోతు, రెండు మీటర్ల వెడల్పు, ఆరు మీటర్ల పొడవుతో గొయ్యి తీయాలి. అందులో 15 సెంటీమీటర్ల మందాన చెరకు చెత్త పరిచి, తేమగా ఉండేందుకు నీరు చిలకరించాలి.

దాని పైన పేడ నీటిని చల్లాలి. మళ్లీ దాని పైన కిలో శిలీంద్ర సముదాయం, ఎనిమిది కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చల్లాలి. ఆ తర్వాత ఒకటి రెండు సెంటీమీటర్ల మందాన మట్టి కప్పాలి. నాలుగు నెలల్లో చెరకు చెత్త కుళ్లి కంపోస్ట్‌గా మారుతుంది. దానిని నేరుగా పొలంలో వేసుకోవచ్చు. ఇలా పొరలు పొరలుగా చెరకు చెత్తను గోతిలో వేస్తూ కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవచ్చు.


ఈ పోషకాలు లభిస్తాయి

చెరకు చెత్తలో 0.41 శాతం నత్రజని, 0.16 శాతం భాస్వరం, 0.72 శాతం పొటాష్‌తో పాటు కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఇనుము, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు 0.2 నుండి 0.9 శాతం వరకూ ఉంటాయి.
- వలేటి గోపీచంద్
ఎమ్మెస్సీ అగ్రికల్చర్
ఆకాశవాణి, హైదరాబాద్

Sunday, July 17, 2011

ఉత్తమ రైతు ఊరీకే అవలేదు

"మా నాన్నగారు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ ఉద్యోగి. నా బాల్యమంతా షిప్‌యార్డ్ కాలనీలోనే గడిచింది. మా చుట్టాలుపక్కాలంతా ఉద్యోగస్తులే. ఎవరూ వ్యాపారంలో లేరు. దాని వల్ల ఒకటి - నాకు పల్లెటూళ్ల గురించి ఏమీ తెలియదు. పల్లెటూరే తెలియకపోతే పశువుల గురించి ఏం తెలుస్తుంది చెప్పండి? రెండు - వ్యాపారానికి సంబంధించిన ఓనమాలు కూడా తెలియవు. ఇలాంటి నేపథ్యంలో నేను పత్రికలో ఒక ప్రకటన చూశాను.

పాయకరావుపేటలో శ్రీప్రకాశ్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడైన నరసింహారావుగారు డెయిరీ పెట్టాలనుకునే ఔత్సాహికులకు ఒక సెమినార్ నిర్వహిస్తున్నారని. దానికి హాజరయ్యాక ఆయన ఆర్నెల్ల పాటు ఇచ్చే శిక్షణను తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నిజానికి నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్‌కామ్ చదువుతున్నప్పుడే నలుగురూ నడిచిన బాటలో నడవకూడదని, సొంతంగా ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాను.

ఏం చెయ్యాలి అన్నది మాత్రం స్పష్టంగా తెలిసేది కాదు. 2007 ఆగస్టులో ఈ సెమినార్‌కు హాజరయిన తర్వాత 'నేను డెయిరీ పెట్టాలి, అందులోనే రాణించాలి' అన్నది ధ్యేయంగా పెట్టుకున్నాను. ఆర్నెల్లపాటు నరసింహారావుగారి దగ్గర శిక్షణకు చేరాను. నాతోపాటూ మొత్తం ముప్ఫైమంది చేరారు. కాని చివరకు మిగిలింది న లుగురమే. అందులో ఇద్దరు 'గోపాలమిత్ర' ఉద్యోగాల్లో చేరారు. ఇద్దరు మాత్రం డెయిరీలు ప్రారంచాలని నిర్ణయించుకున్నాం.

నేర్చుకుంటూ...

అప్పటికి నాకున్నదల్లా విశాఖకు వంద కిలోమీటర్ల దూరంలోని ఏటికొప్పాక గ్రామం దగ్గర 9 ఎకరాల భూమి, రెండు ఆవులు, రెండు గేదెలు. అంతే. నగరాన్ని వదిలేశాను. అక్కడే నివసించడం మొదలుపెట్టాను. లక్షల పెట్టుబడి ఏమీ పెట్టలేదు నేను. నా దగ్గర అంత డబ్బు ఉండేదే కాదు. నెలకో రెండు చొప్పున జెర్సీ ఆవులను కొనడం ప్రారంభించాను. పాల డబ్బులు కూడినప్పుడల్లా ఆవులను కొనేవాణ్ని. దానివల్ల ఒకేసారి బరువు పడినట్టు అనిపించలేదు.

ఇంకొక జాగ్రత్త ఏం తీసుకున్నానంటే శిక్షణలో కొంత, వైద్యుల నుంచి కొంత, పుస్తకాలు చదివి కొంతా - వెరసి పశువైద్యానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను నేర్చుకున్నాను. అనారోగ్య లక్షణాలను గుర్తించడం, సరైన మందులివ్వడం, ఇంజెక్షన్లు చేయడం వంటివన్నీ నాకు వచ్చు. వైద్యులు వచ్చే వరకూ ఆగి, అప్పుడు చికిత్స ప్రారంభిస్తే ఒకోసారి చేయిదాటిపోతుంది.

అలాకాకుండా అన్ని రకాల మందులూ నా దగ్గర నిల్వ ఉంచుకుంటాను. ఇక్కడ ఒక నిజం మాత్రం చెప్పి తీరాలి. ఒకటి మాత్రం నిజం - మీరు మనసు పెట్టి డెయిరీ నిర్వహణకు ముందుకొస్తే మాత్రం ప్రభుత్వం వందశాతం సహకారాన్ని అందిస్తుంది. నాకు పశుసంవర్థక శాఖ అధికారులు, వైద్యులు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను డెయిరీ పెట్ట్టిన రెండు మూడేళ్లలోనే పాలు లీటరు తొమ్మిది రూపాయల నుంచి ఇరవైకి చేరుకున్నాయి. డిమాండు చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పెరిగే అవకాశమూ ఉంది. ప్రభుత్వ డెయిరీలే కాకుండా ప్రైవేటు డెయిరీలు సైతంగా బాగా విజయవంతంగా నడుస్తున్నాయి. వాటన్నిటికీ పాల అవసరం ఉంది. అందువల్ల ఉత్సాహమున్న యువ త ఎవరైనా డెయిరీ వ్యాపారంలోకి రావొచ్చు. అయితే డెయిరీ నిర్వహణకు పెట్టుబడి డబ్బు ఒక్కటే కాదు. బోలెడంత ఓపిక, సహనం ఉంటేనే ఇందులోకి రావాలి.

ఎక్కడ ఫెయిలవుతున్నారంటే...

నిజానికి చాలామందే ఉత్సాహంగా వచ్చి డెయిరీలు పెడుతుంటారు. కానీ విజయం సాధించలేక చతికిలబడుతున్నారు. నేను విశ్లేషించినదాన్ని బట్టి దీనికి ముఖ్య కారణాలు కొన్ని ఉన్నాయి. 'నేను డబ్బు పెట్టి అజమాయిషీ చేస్తాను, నువ్వు పనిచెయ్యి' అనే ధోరణి ఈ వ్యాపారంలో అస్సలు పనికిరాదు. రోజూ ఉదయం మూడు నాలుగు గంటలు, సాయంత్రం నాలుగ్గంటలు - మొత్తం ఎనిమిది పది గంటలు కొట్టంలో గడపాల్సిందే.

రెండోది పశువుల మేత. ఏది చవగ్గా వస్తే అది పెడుతుంటారు యజమానులు. పసిపిల్లలకూ, మనుషులకూ లాగానే పశువులకూ సమీకృత ఆహారాన్ని అందించాలి. పాలు ఎక్కువ కావాలి, దాణా ఏదోటి పెడతామనే ఆలోచన వదులుకోవాలి. నేను ఎనిమిది రకాల ఆహారాన్ని అందిస్తాను. గోధుమ పొట్టు, పత్తిగింజల చెక్క, కొమ్ముశెనగలు, మినప్పొట్టు, వరినూకలను పచ్చిగడ్డిలో కలిపి పెడతాం.

ఉదయం మధ్యాహ్నం సాయంత్రాల్లో వేర్వేరు రకాలు - అదికూడా పశువుకో బేసిన్లో చొప్పున వేసి పెడతాం. దీనివల్ల ఏ ఆవు ఏం తిన్నది, ఎంత తిన్నది, ఆహారం తీసుకోవడంలో ఎక్కడైనా సమస్యలున్నాయా అన్నది తెలుస్తుంది. నాకున్న తొమ్మిది ఎకరాలుగాక మరికొంత భూమిని రైతుల నుంచి కౌలుకు తీసుకొని ఐదు రకాల గడ్డిని పెంచుతున్నాను. పూణె, కోయంబత్తూరుల నుంచి విత్తనాలు తీసుకొచ్చి పంట వేశాం. వీటికి తోడు వరిగడ్డిని ఎప్పుడూ అందుబాటులో ఉంచుతాం. మూడోది - పశువుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ప్రతిరోజూ పర్యవేక్షించి తెలుసుకోవాలి.

మా దగ్గరున్న ప్రతీ ఆవూ ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు ఈనిందో, ఎప్పుడే అనారోగ్యానికి గురయిందో, ఏ మందులు వాడామో, ఏ రోజు ఎన్ని పాలు ఇచ్చిందో... ఇలా అన్ని వివరాలనూ ల్యాప్‌టాప్‌లో భద్రపరిచాను. దీంతో ప్రతి ఆవు గురించిన మొత్తం సమాచారం నాకు క్షుణ్ణంగా తెలుసు. నాలుగో అంశం పరిశుభ్రత.

అధిక దిగుబడినిస్తాయని అందరూ జెర్సీ ఆవులనే కొంటారు. కానీ అవి వేడి వాతావరణంలో మనలేవు. అందుకే రేకుల షెడ్లలో ఉండలేక రోగాల పాలయి నీరసించి మరణిస్తాయి. దీనికి విరుగుడుగా నేనేం చేశానంటే - డబ్బు సమకూరేదాకా తాటాకులతోనే పైకప్పు వేయించా. కాస్త నిలదొక్కుకున్నాక బంగాళా పెంకులు రెండు వరుసలుగా వేయించటంతో మా షెడ్లు చల్లగా ఉంటాయి. గాలీవెలుతురూ ధారాళంగా వస్తాయి.

రోజుకు మూడు నాలుగుసార్లు పేడ ఎత్తేస్తాం, మూత్రమంతా పంట పొలాల్లోకి వెళ్లేలా కాలువలు తీశాం. దీనివల్ల ఎప్పుడు చూసినా ఇదంతా శుభ్రంగా ఉంటుంది. అలాగే అన్ని పశువులనూ ఒకేచోట ఉంచను. చిన్న పెయ్యలన్నీ ఒక షెడ్లో, చూడి ఆవులన్నీ ఒకచోట... ఇలా విభజించుకుంటాను. దీనివల్ల వాటికి మేత వెయ్యడం, బాగోగులు చూడటం సులువు. ఇన్సూరెన్స్ కూడా సరిగా చేసుకోవాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే లాభాల బాట పట్టడం ఎవ్వరికైనా సాధ్యమే.

సాంకేతికానుభవం...

ఎంత పెట్టుబడి పెట్టినా, ఎంత శ్రమించినా మానవ వనరులను జాగ్రత్తగా చూసుకోవడం వీటన్నిటి కన్నా ముఖ్యం. ప్రస్తుతానికి నాతో సహా పద్నాలుగు మందిమి పనిచేస్తున్నాం. వాళ్లందరికీ మంచి వేతనాలు, భోజనం అందేలా చూసుకుంటాను. అలాగే ఊళ్లో ఎవరి పశువులకు ఏ అవసరం వచ్చినా వెళ్లి చూస్తాను. కొత్త తరం తమ సాంకేతికతను పెద్దల అనుభవంతో మేళవించి ముందడుగు వెయ్యాలన్నదే నేను నేర్చుకున్న సూత్రం.

ఇప్పుడు నా దగ్గర మొత్తం నా దగ్గర 135 (హెచ్.ఎఫ్ - హోలిస్టీన్ ఫ్రెష్యన్ అనే జాతి) ఆవులున్నాయి. అందులో ఎనభై ఇక్కడ పుట్టినవే. అలాగే రోజుకు 500 లీటర్ల పాల దిగుబడి ఉంది. రెండేళ్లలో నా దగ్గర పుట్టినవే వంద ఆవులుండాలని, రోజుకు వెయ్యి లీటర్ల పాల దిగుబడి ఉండాలన్నది నా లక్ష్యం. "మనం వేసే ప్రతి అడుగుకూ అంగుళం దూరంలో ధ్యేయాన్ని పెడతాడు దేవుడు. అందుకే స్వర్గాన్ని అంత ఎత్తులో కట్టాడు.

కొందరే అక్కడికి చేరుకోగలరు అంగలేసి అలసిపోనివాళ్లు....'' ఈ కొటేషన్ ఎప్పుడూ నాకు గుర్తుంటుంది. అందుకే నేను ధ్యేయాన్ని అందుకోవడం కోసం ఎన్ని అంగలైనా వెయ్యదలచుకున్నాను...
తక్కువ మొత్తాల్లో డబ్బుకు ఆశపడి పెయ్యలను అమ్మేస్తుంటారు యజమానులు. అవే ఎదిగి ఆవులైనప్పుడు కొనాలంటే చాలా సొమ్ము వెచ్చించాలి. నేను పెయ్యలనూ, ఆవులనూ ఎంత దగ్గరివారికైనా ఇవ్వను. ఒకసారి మాత్రం ఒకాయన చాలా బలవంతపెట్టి ఒకావును తీసుకెళ్లాడు. దాన్ని చెట్టు నీడన కట్టేసి ఇంత గడ్డి పడేసేవాడు. అది అనారోగ్యంతో చనిపోయింది. ఆరోజు మాత్రం చాలా బాధ పడ్డాను. సరైన శ్రద్ధ పెడితే అది బతికి ఉండేది కదా అనిపిస్తుంది.

-పిన్నమనేని సుబ్బరాజు సెల్ నంబర్ : 9295404698 
* అరుణ పప్పు, విశాఖపట్నం, ఫోటోలు : వై. రామకృష్ణ

Saturday, July 16, 2011

సెలబ్రిటీ ఆవు

ఒకప్పుడు విస్తృత సంఖ్యలో ఉన్న పుంగనూరు పశుజాతి సంఖ్య ప్రస్తుతం అనూహ్యంగా పడిపోయింది. రాష్ట్రం మొత్తంమీద వీటి సంఖ్య 70. హైదరాబాద్‌లో ఇరవై వరకు ఉన్నాయి. ఎంపీ నందమూరి హరికృష్ణతో పాటు బంజారాహిల్స్‌కు చెందిన పొనుగోటి శ్రీనివాసరావు, ఎల్బీనగర్‌కు చెందిన నాగేశ్వరరావు, ఉప్పల్‌లో రామదాస్‌లతో పాటు నగర శివారులోని నర్సాపూర్ సువిజ్ఞాన ఆశ్రమంలో పుంగనూరు ఆవులను సంరక్షిస్తున్నారు. వీరితో పాటు నగరంలో మరో ముగ్గురు న్యాయమూర్తులు, సినీనటులతో పాటు ఓ ఎమ్మెల్యే వద్ద కూడా ఈ ఆవులున్నాయి. ప్రస్తుతం పుంగనూరు ఆవు కోసం ఎంత మొత్తమైనా వెచ్చించేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారు.

లీటరు పాల ధర.. వందల్లో...

పుంగనూరు ఆవులు అరుదైన పోషక విలువలతో కూడిన పాలను ఇస్తాయి. ఇందులో 10 నుంచి 12 శాతం వెన్న లభిస్తుంది. సాధారణంగా ఆవుపాలలో అత్యధిక వెన్నశాతం 4 మాత్రమే. ఏడాదిలో తొమ్మిది నెలల పాటు పాలిస్తాయి. ఈ పాలను ఆయుర్వేద ఔషధ తయారీలోనూ వాడుతుండటంతో లీటరు పాల ధర రూ.వందల్లో పలుకుతోంది.

ఇంటింటా.. సెంటిమెంట్...

పుంగనూరు ఆవు ఉండటం ఓ సెంటిమెంట్‌గా చాలామంది భావిస్తున్నారు. ఉదయం లేవగానే ఈ ఆవు మొహం చూసే ఇతర పనులు చేసే వీఐపీలున్నారు.

కుటుంబ సభ్యుల కన్నా మిన్నగా...
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారిక సమీక్ష సమావేశాలకు క్యాంప్ కార్యాలయానికి వెళ్లేవాడ్ని. ఒక సారి వైఎస్సార్‌కు పుంగనూరు జాతి గురించి వివరించా. ఆయన సహకారంతో రెండు ఆవుల్ని తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ఉచితంగా పొందా. ప్రస్తుతం మా ఇంట్లో మూడు ఆవులున్నాయి. కుటుంబసభ్యులకంటే మిన్నగా పెంచుకుంటా. పోషణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా. ప్రత్యేక షెడ్డు, రెండు ఫ్యాన్లు, దోమతెరలు ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశా. పట్టణాల్లో పెంచుకోవడం చాలా సులువు.
-రాందాస్, బోడుప్పల్

ఎన్నో ఔషధగుణాలు...

పుంగనూరు జాతి ఈ ప్రాంతానికి, వాతావరణానికి ఎంతో అనువైంది. ఈ ఆవు పాలల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వివిధ సమస్యలపై మా ఆశ్రమానికి వ చ్చేవారికి పుంగనూరు ఆవుపాలతో కూడిన ఔషధాన్ని ఇస్తాం. మంచి ఫలితాలు వస్తున్నాయి.
- గురు సత్యవీర్,
సువిజ్ఞాన ఆశ్రమం, నర్సాపూర్

ఇష్టమనే పెంచుతున్నా...

పుంగనూరు పశువులంటే ఎంతో ప్రేమ. ఈ ఆవుల్ని పెంచితే అంతా మంచే జరుగుతుందన్న సెంటిమెంట్ ఉంది. ఈ జాతి ఆవులు మార్కెట్లో లేకపోవడం వల్ల పెంచుకోవాలనే ఇష్టపడే వారు రూ.లక్ష వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
- ఉలిపెద్ది నాగేశ్వరరావు

ఎన్టీఆర్ హయాంలో...

ఆంధ్రప్రదేశ్‌లో పుంగనూ రు జాతి ఆవులు అంతరించిపోతున్నాయని 1983లో అప్పటి సీఎం నందమూరి తారకరామారావు ఈ జాతిని కాపాడాలని గుజ రాత్ నుంచి ఆవులను కొనుగోలు చేసి కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులకు సబ్సిడీ ద్వారా అందజేశారు.

కృషి చేస్తా...

పుంగనూరు జాతి అంటే ఎంతో మక్కువ. వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. వీటి పరిరక్షణకు కృషి చేస్తా.
- పొనుగోటి శ్రీనివాసరావు

Tuesday, April 19, 2011

హంస! * చిక్కటి పాలవంటి విలువలకు, ఆ పల్లెవాసులకు మధ్య అనుబంధాలే ‘రిలేషన్‌షిప్స్’

పాలూ నీళ్లను వేరుచేస్తుంది హంస.
నీళ్లు కలపని పాలు పోస్తుంది కాళ్లకూరు.
కాకిలా బతకొద్దనీ, కల్మషాలు కూడదనీ...
కష్టపడి పని చేయాలనీ చెబుతోంది.
ఆచరిస్తోంది.
అందుకే అది హంసలాంటి ఊరు అయింది.
ఆ ఊరికి ఇంతటి సంస్కారాన్ని నేర్పింది...
అమ్మమాటను జవదాటని పుత్రధర్మం, కన్నఊరిని మరువలేని ఒక బాంధవ్యం!
చిక్కటి పాలవంటి విలువలకు,ఆ పల్లెవాసులకు మధ్య అనుబంధాలే  - ఈ  ‘రిలేషన్‌షిప్స్’

చుక్క నీరు కలపకుండా చిక్కని పాలు పోసే వాళ్లు దొరికితే ఏం చేస్తాం? బహుశా ‘నీతిరత్న’ అనే బిరుదు ఇచ్చి సన్మానం చేస్తామేమో! అలాగైతే కాళ్లకూరు గ్రామంలోని రైతులు ఆ బిరుదు అందుకోవడానికి క్యూలో నిలబడవలసి వస్తుంది. ఎందుకంటే ఈ గ్రామంలో వందలాది మంది పాల రైతులు నీళ్లు కలపని చిక్కని పాలు మాత్రమే విక్రయిస్తున్నారు. అమెరికాలో వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ వేగేశ్న పృథ్వీరాజు (72)కు ఐదేళ్ల క్రితం వచ్చిన ఆలోచనతో అంకురించిన కాళ్లకూరు పాల ఉత్పత్తిదారుల సంఘం(కె.ఎమ్.పి)... పాలలో నీళ్లు కలపకపోవడంలోనే కాదు, ఆలోచనల్లో నిజాయితీని కలపడంలోనూ ముందుంది. ఈ సంఘస్థాపన ఒక ప్రయోగమని, అందుకే దీనిని ‘కాళ్లకూరు ప్రయోగం’ అని పేర్కొంటున్నామని పృథ్వీరాజు చెప్పారు.
అమ్మ ‘ఊరు’ కోలేదు...
పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్లకూరు గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వేగేశ్న పృథ్వీరాజును ఉన్నత చదువులు, ఉద్యోగాలు విదేశాలకు తీసుకువెళ్లినా... జన్మనిచ్చిన పల్లెటూరు, దాని జ్ఞాపకాల నుంచి దూరం జరపలేకపోయాయి. దాదాపు నలభైఏళ్ల పాటు పుట్టిన ఊరుకు దూరంగా గడిపిన పృథ్వీరాజు, తన తండ్రి మరణించారన్న సమాచారంతో కాళ్లకూరుకు వచ్చారు. తిరిగి వెళ్లబోతుంటే... ‘‘నావి చివరి రోజులు నాయనా... నా తుదిశ్వాస విడిచే వరకూ నన్ను విడిచిపోకు’’ అంటూ తల్లి కోరారు. ఆమె కోరికను మన్నిస్తూ ఒక రోజు రెండ్రోజులు కాదు.. ఆరేళ్ల్ల పాటు తల్లి దగ్గరే ఉండిపోయారు. ఆ సమయంలోనే పృథ్వీరాజుకు ఆ ఊరు తను మునుపటిలా లేదని తెలిసింది. తను తప్పటడుగులు వేసిన చోట... అనేక మంది తప్పుటడుగులు వేస్తున్నారని అర్థమైంది. కష్టాన్ని అసహ్యించుకోవడం, తాగుడు, అబద్ధాలు, నోటుకు ఓటును అమ్ముకోవడం, పరస్పరం మోసాలు చేసుకోవడం... వంటి ఆధునిక ప్రపంచపు అవలక్షణాలన్నీ అమాయక పల్లెను వశం చేసుకుంటున్నాయని అర్థమైంది. దాంతో తన వంతుగా పుట్టిన ఊరిబాగు కోసం ఉపక్రమించారు.

విదేశాల్లో స్థిరపడిన తొలి రోజుల్లోనే తను స్థానిక పెద్దల సహకారంతో ప్రారంభించిన ‘సత్య సేవాట్రస్ట్’కు తన సంపాదన లోంచి రూ.25లక్షల్ని అప్పట్లో పృథ్వీరాజు కేటాయించారు. అత్యవసర సమయాల్లో గ్రామస్థులను ఆర్థికంగా ఆదుకోవడమే దీని లక్ష్యం. అయితే అది అంత మంచి ఫలితాన్నివటం లేదని ఆయన గ్రహించారు. పేదరికం పోవాలంటే వారికి చేయాల్సింది ఆర్ధికసాయం కాదని, చూపాల్సింది ఆదాయ పొందే మార్గమని అర్థం చేసుకున్నారు.

పల్లె ప్రయో‘జనం’ కోసం
కష్టపడడం, నిజాయితీగా సంపాదించిన దానిలోకొంత తోటివారి మేలుకు ఉపయోగించడం, కలసికట్టుగా ఊరిని అభివృద్ధి పథంలో నిలపడం... ఈ లక్ష్యాలతో చేపట్టిందే కాళ్లకూరు ప్రయోగం. దీనిలో భాగంగా మొదట ఒక పాల సేకరణ కేంద్రాన్ని పృథ్వీరాజు నెలకొల్పారు. నీళ్లు కలపని పాలకు తగిన రేటు కట్టి ఇస్తూ పాల రైతులను సంఘటితం చేశారు. పాలలో నీళ్లు కలపకపోవడం, ఓటును అమ్ముకోకపోవడం.. వంటి విలువలకు కట్టుబడితేనే... ‘సంఘంలో సభ్యత్వం’ అని షరతు విధించి, హామీ పత్రం తీసుకున్నారు. ట్రస్ట్ తరపున గేదెలు కొనే స్థోమత లేని వారికి రుణాలు అందించారు. ‘‘మేం యాచకులం కాము పోషకులం’’ అని మా ఊరివాళ్లు సగర్వంగా చెప్పుకునేలా ఈ ప్రయోగాన్ని చేపట్టాం’’ అని పృథ్వీరాజు అంటారు. పాలను విక్రయించగా వచ్చిన లాభాలను కూడా ప్రతి ఏటా పాల రైతులకే బోనస్‌గా ఇవ్వడం ఈ కేంద్రం మరో ప్రత్యేకత.

‘‘గత ఏడాది ఇలా వచ్చిన రూ.1.60 లక్షల్ని రైతులకి అందించాం’’ అని పృథ్వీరాజు చెప్పారు. అంతే కాకుండా ప్రతి లీటరు అమ్మకం విలువ నుంచీ మూడు పైసల్ని విరాళంగా ఇవ్వాలనేది మరో నిబంధన. ‘‘ఆ మూడు పైసల విరాళం నుంచి గ్రామంలో 50 మందికి పైగా వృద్ధులకు కొద్ది మొత్తంలో పింఛన్లు అందిస్తున్నాం. అలాగే రూ.3.50 లక్షలతో ఏర్పాటు చేసుకున్న వాటర్ ప్లాంట్ కోసం తీసుకున్న రుణాన్ని కూడా అందులోంచే తిరిగి చెల్లిస్తున్నాం’’ అని తెలిపారు ఆయన. ఈ ప్లాంట్ ద్వారా కాళ్లకూరు గ్రామంలోని ఎనిమిది పాఠశాలల్లో చదువుకుంటున్న 450 మంది విద్యార్థ్ధులకు ఉచితంగా మంచినీటిని అందిస్తున్నారు. ‘‘మూడు పైసల పవిత్రతగా దీన్ని మేం పేర్కొంటున్నాం. ఎందుకంటే ఇది కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన డబ్బు. అంతే పవిత్రమైన కార్యక్రమాలకు ఇది ఉపయోగిస్తున్నాం’’ అని సంఘం బాధ్యతలు నిర్వర్తిస్తున్న వి.రామరాజు అన్నారు.

పృథ్వీరాజు ప్రవేశపెట్టిన ప్రయోగం త్వరితంగానే సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. కేవలం పది మందితో ప్రారంభమైన పాల ఉత్పత్తిదారుల సంఘం... రెండొందలకి చేరింది. నాలుగేళ్లుగా స్థానికులు సాధిస్తున్న సమష్టి ప్రగతి సమీప గ్రామాలకూ అనుసరణీయంగా మారుతోంది. ప్రస్తుతం వీరి బాటలోనే దొడ్డనపూడి గ్రామస్థులు కూడా ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ‘‘ఇక్కడి రైతుల చేత విరివిగా కూరగాయలు సాగు చేయించి వాటికి కూడా ఇలాగే మంచి రేటు వచ్చేలా చేయడం, తర్వాత తర్వాత రైసు మిల్లర్లకు లాభాల పంట పండిస్తున్న వీరి కష్టాన్ని వీరే అనుభవించేలా చేయడం... వంటి మరికొన్ని లక్ష్యాలు కూడా మాకు ఉన్నాయి’’ అని పృథ్వీరాజు వివరించారు.

మసకబారిపోతున్న తన స్వచ్ఛతను ఇపుడు ఒక పల్లె తిరిగి సముపార్జించుకుంటోంది. తమ కష్టమే పెట్టుబడి చేసుకుని నీతిగా బతకగలమనే నూతన ధైర్యాన్ని సంతరించుకుంటోంది. అమ్మకు ఇచ్చిన మాట కోసం ఆరేళ్ల పాటు తన పల్లెలో ఉండిపోయిన పృధ్వీరాజు... అమ్మ ఆశ నెరవేర్చారు. అమ్మలాంటి ఊరును మార్చారు. అందుకు అమ్మ తప్పకుండా సంతోషిస్తుంది. ఏ లోకాన ఉన్నా కుమారుడి ఆశయం నెరవేరాలంటూ దీవెనలు అందిస్తుంది.


పాలల్లో నీళ్లు కలిపి అమ్మడం ఎంత తప్పో... నోటుకు ఓటు అమ్ముకోవడం ఎంత ముప్పో... ఇపుడు మా గ్రామస్థులకు అర్ధమవుతోంది. నీతిగా నిజాయితీగా ఉండడం గ్రామానికి మంచి చేస్తోం ది. ఇపుడు ఎన్నో మంచి పనులు చేసుకోగలు గుతున్నాం. - సుబ్బరాజు, కె.ఎం.పి సభ్యుడు, కాళ్లకూరు

సంఘంలో చేరాక మేం తీసుకువచ్చే చిక్కని పాలకు తగిన రేటు వస్తోంది. మా ఊరిలో ఉన్న ముసిలోళ్లకి కొంచెం పింఛను డబ్బులు కూడా వస్తున్నాయి. అందరం ఒక మాట మీద ఉండడం వల్ల ఊళ్లో అందరికీ లాభం కలుగుతోంది. - సీతారాముడు, కె.ఎం.పి సభ్యులు


- ఎస్.సత్యబాబు

Sunday, March 13, 2011

ద్రాక్షరత్న

నాకు ఎక్కువ పేరొచ్చింది విదేశాల్లోనే!

"నాకు ఎనిమిదేళ్ల వయసుండగా నాన్న ముత్యం రెడ్డి అల్వాల్‌లో వందెకరాల ఆసామిగా ఉండేవారు. కాయగూరలు, వరి సాగు చేస్తుండేవారు. నేను పన్నెండో తరగతి చదివాక ఏదైనా ఉద్యోగం చేసుకోమన్నారు మా వాళ్లు. కాని నాకు వ్యవసాయరంగం అంటే చాలా ఆసక్తి. అప్పటికే మా పొలం పక్కన గోదావరి జిల్లా వాసులైన మంతెన ఆదినారాయణ రాజుకి ద్రాక్షతోట ఉండేది. వారికి లక్షల్లో ఆదాయాలు వచ్చేవి. ' ఏంటి రెడ్డిగారు..ఎన్నాళ్లు ఈ వరీ,కూరగాయలు...ద్రాక్ష పెట్టకూడదూ' అన్నారాయన.

పక్కనే ఉండటంతో ద్రాక్షసాగు విషయాలన్నీ తెలుసుకున్నాం. నాన్నకు తోడు నేను, అన్నయ్య శంకర్‌రెడ్డి ద్రాక్షసాగులోకి దిగాం. మొదట్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా వాతావరణం అనుకూలించడంతో ముందుకు సాగాము. అల్వాల్, గోధుమకుంట, కీసర, రాంపల్లి....ఇలా చాలా చోట్ల భూములు తీసుకుని ద్రాక్షసాగు చేశాం. మమ్మల్ని చూసి చాలామంది ఈ రంగంలోకి వచ్చారు. మొదట్లో బాగానే ఆదాయం కళ్ల చూసినా..రాను రాను నష్టాల రుచి కూడా చూశారు. దాంతో మెల్లగా కొందరు రైతులు ద్రాక్షకు గుడ్‌బై చెప్పారు. కొందరంటే ఒకరిద్దరు కాదు రియలెస్టేట్ బూమ్‌లో పడి చాలామంది ద్రాక్షకు దూరమయ్యారు.

ద్రాక్ష రత్న అవార్డు...

ఎవరు ఏ కారంణంతో పక్కకు జరిగినా...మేము మాత్రం ద్రాక్ష తోటలోనే నడిచాం. ద్రాక్షసాగులో నేర్చుకున్న మెళకువలు రంగారెడ్డి జిల్లాలో నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పలుకుబడే గ్రేప్ గార్డెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ని చేసింది. పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్ వంటి విషయాల్లో చాలామంది రైతులు నా వద్ద సలహాలు తీసుకోవడం మొదలుపెట్టారు. జిల్లాలో పెద్దఎత్తున ద్రాక్ష పండిస్తున్న రైతుగా నన్ను గుర్తించి 1990లో గవర్నరు ద్రాక్షరత్న బిరుదును ప్రదానం చేశారు.

సేంద్రీయ ద్రాక్ష...

లాభాలకోసం రైతులు రసాయనాల వెంటపడడం మొదలుపెట్టాక లక్షరూపాయలయ్యే పెట్టుబడి రెండు లక్షలకు పెరిగింది. ఎంతో ఆశతో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టిన రైతులు అకాలవర్షాల వల్ల, తుఫాన్ల వల్ల నష్టాలబాట పట్టాల్సి వచ్చింది. దాంతో చాలామంది రైతులు ద్రాక్షకు దణ్ణం పెట్టారు. నేనూ అలా దెబ్బ తిన్నవాణ్ణే. సమస్యను చూసి పారిపోవడం కన్నా..పరిష్కారం కనుగొని పదిమందికి ఆదర్శంగా నిలవాలని అనుకున్నాను. ద్రాక్షసాగుకి కావాల్సింది ఎన్‌పికే( నైట్రోజన్,ఫాస్పరస్, పొటాషియం). ఇవన్నీ కూడా రసాయనాల రూపంలో చెట్టుకు అందిస్తున్నాం. ఈ పోషకాలను సహజసిద్దంగా తయారుచేయగలిగితే చాలనుకున్నాను. ద్రాక్ష చెట్లమధ్య మొలిచే గడ్డిని ఎప్పటికప్పుడు తీసేసి శుభ్రంగా ఉంచుతారు.

నేను అలా చేయకుండా గడ్డిని అలాగే వదిలేసాను. వానాకాలం ఏపుగా పెరిగేది, ఎండకాలం ఎండిపోయేది. అలా ఎండిన గడ్డి వర్షాకాలంలో కుళ్లిపోయేది. కుళ్లిన గడ్డికింద ఉన్న మట్టిలో వానపాములు చేరేవి. చెట్టుకు కావలసిన ఎరువు దొరికిందనుకున్నాను. ఎందుకంటే ఒక వానపాము ఆయుఃప్రమాణం 120 రోజులు. రోజూ వందల సంఖ్యలో పుట్టుకొచ్చే వానపాములు రోజుల వ్యవధిలోనే చనిపోతూ ఉంటాయి. ఇలా చనిపోయిన వానపాముల వల్లే ఎన్‌పికే తయారవుతుంది. నేల పైపొరలో చనిపోయిన వానపాముల్ని తినడానికి రెండు మూడు అడుగుల లోతునుంచి రకరకాల సూక్ష్మజీవులు వస్తాయి.

వీటి వల్ల మట్టి గుల్లబడుతుంది. చెట్టు ఆరోగ్యంగా ఎదగడానికి కావలసిన పక్రియ అది. చెట్టు మొదలు దగ్గర ఒక గంప పేడ వేసి డ్రిప్‌లతో నీళ్లు పెట్టి వదిలేసాను. చెట్టుకు ఇంజెక్షన్లు ఇచ్చి కాపాడుకునే పరిస్థితికి నేను కనిపెట్టిన ఈ విధానం తిరుగులేని ప్రత్యామ్నాయమైంది. రెండేళ్ల పాటు ఈ సహజపద్ధతిని పాటించాను. మునుపెన్నడూ లేని దిగుబడిని చూశాను. దురదృష్టం ఏంటంటే...అందరూ వచ్చి నా సేంద్రీయ ద్రాక్షను చూశారు, తిన్నారు కాని ఏ రైతు కూడా నేను చేసిన ప్రయోగం చేయడం లేదు.

విటమిన్ ఎ బియ్యం...

ద్రాక్షపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాక...నా దృష్టి వరిపైకి మళ్లింది. 2004లోనే వరిసాగులో అధిక దిగుబడితో ఆరోగ్యకరమైన ఆహారం పండించాలని అనుకున్నాను. మనం తినే ఆహారంలో ఆరోగ్యంకన్నా, హాని ఎక్కువున్నదని పరిశోధకులు మొత్తుకుంటున్నారు. కారణం పంటలకు వాడే రసాయనాలు. మనుషులు ఆరోగ్యంగా ఉండాలన్నా...ఒంటికి సరిపడా ఆహారం కావాలన్నా ప్రకృతి ఇచ్చే ఆహారాన్ని తినాలి. వాటి బదులు మనం తయారుచేసుకున్న టాబ్లెట్లు, టానిక్‌లు తింటే ఏమవుతుంది. ఒకటి రెండు రోజులు బాగానే ఉంటుంది. ఆ తరువాత ఒళ్లంతా మందులమయమైపోయి జీవకళ పోతుంది. అలాగే విత్తు మొలిచే చోట రసాయనాలు గుమ్మరిస్తే నేలంతా నిస్సారమవుతుంది.

దిగుబడులు రాకపోగా...రసాయనాలతో పండించే ఆహారాన్ని తినాల్సివస్తుంది. ప్రస్తుతం రైతులందరూ చేస్తున్నది ఇదే. అప్పటివరకూ బీడుగా ఉన్న నేలలో మొదటిసారి వరి నాటితే పంట దిగుబడి అద్భుతంగా వస్తుంది. దానికి ఎలాంటి మందులు వేయక్కర్లేదు. ఎందుకంటే మట్టిలో సారం ఎక్కువగా ఉంటుంది. అదే నాలుగు పంటలయిన తర్వాత సారం పోతుంది కాబట్టి రసాయనాలపైన ఆధారపడాల్సి వస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు తల్లిని బలమైన ఆహారం ఎక్కువగా తీసుకోమని చెబుతారు డాక్టర్లు. ఈ సూత్రాన్ని వరి పంటకు వాడాను. సేంద్రీయ ఎరువులు వేసి వరి నాటాక... వరి పొట్టకు వచ్చే సమయంలో సహజంగా పొలం బీటలు వారుతుంది. ఆ సమయంలో నీళ్లు, రసాయన ఎరువులు బాగావేస్తే గింజ తోడుకుంటుంది. మట్టిలో బలం ఉంటేనే... లేకపోతే తోడుకోవు. నేను దీనికి ప్రత్నామ్నాయం ఆలోచించాను.

నీటిలో మట్టి కలిపి...
వరి నాటే ముందు ఒక్కొక్క మడిలో ఒక్కో చోట పది అడుగుల లోతు గొయ్యి తవ్వి ఎకరానికి టన్ను చొప్పున మట్టి తవ్వి పక్కన పెట్టుకోవాలి. ఆ గోతిలో మడిలో ఉన్న పైపైన మట్టిని వేసి పూడ్చేయాలి. వరి పొట్టకు వచ్చే సమయంలో మడుల్లోకి పారే నీళ్లలో ముందుగా తీసి పెట్టుకున్న మట్టిని కలపాలి. దీనికి మోటారు దగ్గర ఒక నీళ్లట్యాంకుని కట్టుకుని అందులో మట్టి కలుపుకోవాలి. పంట కోతకు వచ్చే లోపు ఈ పద్ధతిలో నాలుగైదు తడులు పెట్టాలి. మనం వేసిన కొత్త మట్టిలో ఉన్న సారమంతా నీళ్ల ద్వారా పొలంలోకి వెళుతుంది. దీని వల్ల చేను ఎండినా బీటలు రాకుండా ఉంటాయి. మట్టిలో ఉన్న బలమైన పోషకాలు గింజని గట్టిపడేలా చేస్తాయి. ఇలా పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న పరిశోధకులు కొన్ని రోజులపాటు చేసిన పరిశోధనలో తేల్చారు.

అరవై దేశాల్లో అంగీకరించాయి...

నేను పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని మన పరిశోధకులు నిర్ధారించాక, ఈ అంశంపై 32 పేజీల రికార్డు రాసి జెనీవాలోని అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థకు పంపాను. అక్కడ మొదట 35 దేశాల కూటమి నేను పంపిన అంశంపై ప్రత్యేక అధ్యయనం చేసింది. ఎనిమిది నెలల తర్వాత నా బియ్యంలో విటమిన్ ఎ ఉందని అంగీకరించి ఆయా దేశాల్లో నాకు పేటెంట్ హక్కులు కల్పించారు. యూరప్ వెబ్‌సైట్‌లో నా పరిశోధన గురించి వివరంగా పెట్టారు. నేను మొత్తం 75 దేశాలకు నా పరిశోధన వివరాలు పంపిస్తే దాదాపు 60 దేశాలు నా ప్రయోగాన్ని అంగీకరించి వారి దేశాల్లో పేటెంట్ హక్కుల్ని కల్పించాయి. 2006లో మన రాష్ట్రం వచ్చిన జార్జ్‌బుష్ నాతో ప్రత్యేకంగా ఈ విషయం గురించి మాట్లాడారు.

నా ఆరోగ్యమే నిదర్శనం...

2003 నుంచి నేను ఈ సేంద్రీయ వరి పంటనే పండిస్తున్నాను. అప్పటి నుంచి మా ఇంట్లో ఇవే బియ్యాన్ని తింటున్నాం. నాకు కంటిచూపు తగ్గడంతో అద్దాలు వాడేవాడిని. అలాంటిది నాలుగేళ్ల నుంచి అద్దాలు లేకుండానే పేపరు చదువుతున్నాను. అప్పటివరకూ ఉన్న మోకాళ్ల నొప్పులు, అజీర్తి, ఆయాసం వంటి జబ్బులన్నీ ఎగిరిపోయాయి. నాలో నాకు తెలియని కొత్త శక్తి వచ్చింది. రసాయనాలతో పండించిన ఆహారానికి, సహజ పోషకాలతో పండిన ఆహారానికి ఉన్న తేడాని నేను స్వయంగా చూశాను. ఈ బియ్యాన్ని ఎవరు తిన్నా...తినకపోయినా ముందుగా మన దేశంలో ఉన్న రైతులందరూ తినాలి. వాళ్లు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకే ఈ పంటపై పేటెంటు హక్కుని పొందినప్పటికీ రైతులు పండించుకుని తినడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు.

విత్తే మిషన్ వచ్చింది...

వరి పంటపై చేసిన ప్రయోగం ముగియగానే వరినాటుని సులభతరం చేసుకోవాలని అనుకున్నాను. రోజురోజుకూ పెరుగుతున్న కూలీల కొరత, మొలకల ఎదుగుదలలో మిషన్ చేసే సాయం వంటి విషయాలపై ఆలోచించాను. ఒకచోట వేసిన నారుని తీసి మరో చోట నాటడం వల్ల వేళ్లు తెగి, అవి మళ్లీ భూమిలోకి వెళ్లి అప్పుడు పిలకలు వేయడం దీని వల్ల చాలా సమయం వృధా అవుతుంది. అలాగే వరి కర్రలు కూడా చాలా తక్కువగా వస్తాయి. అందుకే ఒకటే విత్తుని విత్తితే అది మొక్క మొలిచి తనకున్న స్థలంలో చక్కగా వేళ్లూనుకుని పదుల సంఖ్యలో పిలకలు వచ్చే అవకాశం ఉంది.

అయితే ఒక్కొక్క గింజ నాటడం చాలా కష్టం. దీని కోసం ఒక మెషిన్ తయారుచేశాను. దీని వల్ల నేరుగా గింజభూమిలోకి వెళుతుంది. అదే సమయంలో గింజకు రెండువైపులా నేలను చదును కూడా చేస్తుంది. ఈ మిషన్‌తో ఒక్క వరి విత్తనాలే కాదు గోధుమ, సజ్జ, మొక్కజొన్న, పెసలు, మినుములు...అన్ని రకాల విత్తనాలు సులువుగా నాటుకోవచ్చు. ఈ మిషన్‌కి పేటెంట్ కోసం చెన్నైలోని పరిశోధనా సంస్థకు పంపించాను. వారు నా మిషన్ గురించి వారి వెబ్‌సైట్‌లో పెట్టారు. అది చూసిన అమెరికావాళ్లు అక్కడ తమ దినపత్రికలలో రాశారు.

జూ భువనేశ్వరి
ఫొటోలు: సాయి

Friday, January 28, 2011

పల్లె పచ్చని కూరగాయలు

పెరట్లో సేంద్రియ కూరగాయల పెంపకం...
ఇంటి ల్లిపాదికీ బాగు బాగు
తీగ జాతి కూరగాయల సాగుకు ఇదే అదను
ఆకుకూరలు, టమాటా, వంగ..
ఏ కాలంలోనైనా చక్కగా ఎదుగుతాయి
ప్రత్యేక మడుల్లో అధిక దిగుబడులు సాధ్యం


శీతాకాలం వెళ్లిపోతోంది. ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. సాధారణంగా గ్రామాల్లో ఇళ్ల దగ్గర కాస్తో కూస్తో పెరటి స్థలం ఉంటుంది. పెద్దగా ఖాళీ స్థలం లేకపోయినా ఐదూ పది గజాల స్థలమైనా ప్రతి ఇంటి ముందో, వెనుకో, పక్కనో ఉంటుంది. ఈ కాస్త జాగాలో ఏం పండిస్తాంలే అననుకోకుండా.. కాస్త మనసు పెట్టి సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, అనేక రకాల కూరగాయలు పెద్దగా ప్రయాస లేకుండానే పండించుకోవచ్చు.

రాబోయే రోజుల్లో ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ఇంటిల్లిపాదీ తినడానికి ఈ రోజే పని ప్రారంభించడం ఉత్తమం. ఒకవైపు కూరగాయల్లో విష రసాయనాల అవశేషాలు, మరోవైపు అంతకంతకూ పెరుగుతున్న ధరలు... ఏ విధంగా చూసుకున్నా.. ఉన్నంత స్థలంలో కొన్ని రకాలైనా ఇంటి పట్టున పండించుకోవడం ఉత్తమం కదండీ....!

పశువుల నుంచి రక్షణ అవసరం
గ్రామాల్లో ఇళ్ల దగ్గర ఎంతో కొంత ఖాళీ స్థలం ఉంటుంది. కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పశువులు మొక్కల్ని బతకనివ్వవు. ప్రహరీ లోపలైతే ఫర్వాలేదు. కనీసం ముళ్ల కంచె అయినా గట్టిగా కట్టుకొని మొక్కలు పెంచడానికి శ్రీరారం చుట్టాలి. పల్లెల్లో మొక్కలకు పశువులే కాదు.. కోళ్ల బెడద కూడా ఎక్కువే. ఇతరులవే కాదు మనకూ కోళ్లుంటాయి. వాటిని తిరగకుండా కట్టడి చేసుకుంటే తప్ప మొక్కలు ఎక్కిరావు.
ప్రణాళికతో ఏడాది పొడవునా పెరటి కూరగాయలు
అన్ని కూరగాయలు, ఆకుకూరలూ ఒకే రోజు విత్తుకోకూడదు. ఇప్పుడు గుప్పెడు గింజలు, వారం పది రోజులు గడిచాక మరికొన్ని గింజలు.. అలా విడతల వారీగా చల్లుకోవాలి. ప్రతి వారం ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులో ఉంచుకోవాలంటే ఇలాంటి ఉపాయం అవసరమే. ఈ విధంగా ఏడాది పొడవునా పుష్కలంగా ఆకుకూరలతోపాటు కూరగాయలు కూడా ప్రణాళిక ప్రకారం పెంచుకోవచ్చు.

ఏ ఏ రకాల సాగుకు తగిన సీజన్ ఇది?
ఆకుకూరలకు ప్రత్యేకంగా సీజన్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా చక్కగా పెరుగుతాయి. పాలకూర, చుక్కకూర.. తదితర ఆకుకూరలు మూడు, నాలుగు వారాల్లో కోతకు వస్తాయి. మొక్కలను కత్తిరిస్తే మళ్లీ పిలకలు వేస్తాయి. కత్తిరించిన తర్వాత మట్టిని గుల్ల చేసి చారెడు కంపోస్టు చల్లి నీరుపోస్తే చాలు. పిలకలు పెరిగాక కోసుకొని.. మళ్లీ విత్తనాలు చల్లుకోవాలి. మెంతి మొక్కల్ని మూడుసార్ల వరకూ కత్తిరించుకోవచ్చు. గోంగూర మొక్క నుంచి ఆకుల్ని కోసుకోవాలి. పూత, పిందె వచ్చేంత కోసుకుంటూ ఉండొచ్చు. మొక్క బచ్చలి మాత్రం 45 రోజులకు కోతకు వస్తుంది.

పందిళ్లతో అధిక దిగుబడులు
పెరటి తోటల్లో తీగజాతి మొక్కల పెంపకానికి ఇది చక్కటి సీజన్. బీర, పొట్ల, కాకర, దోస తీగలను చక్కగా పందిళ్లు వేసి పండిస్తే అధిక దిగుబడి వస్తుంది. భారీగా పందిళ్లు అక్కర్లేదు. ఇంట్లో వాళ్లే తీరిక ఉన్నప్పుడు నాలుగు పురికొసలో, ఇనుప తీగలో కట్టి వాటిపైకి మొక్కల్ని పాకిస్తే చాలు. కొంచెం ఆసరా ఇస్తే చాలు. ఇంటి మీదకో, పందిరి మీదకో అల్లుకొని చక్కని దిగుబడినిస్తాయి. తీగ బచ్చలి వేసుకుంటే ఏడాది పొడవునా ఆకుకూర అందుబాటులో ఉంటుంది. దొండ పాదు నాటుకుంటే మూడేళ్ల వరకూ దిగుబడి ఇస్తూనే ఉంటుంది.

బెండకూ ఈ సీజన్ భేష్
బెండ సాగుకూ ఇది మంచి సీజన్. రెండు నెలల్లో కాపుకొస్తుంది. ఒకటిన్నర నెలలు కాస్తుంది. ఇంట్లో ఎందరు ఉంటారనే దాన్ని బట్టి ఎన్ని మొక్కలు వేసుకోవాలో చూసుకోవాలి. గోరుచిక్కుడు, మొక్కజొన్న.. టమాటా, వంగ వంటి పంటల గురించి ఇక చెప్పనక్కర్లేదు. బీర విత్తనం నాటిన నెలన్నర, రెండు నెలల్లో కాయలు కోతకు వస్తాయి.

పొట్ల తీగను పందిరిపైకి పాకిస్తే మంచి దిగుబడి వస్తుంది. కాయలు వంకరైపోకుండా రాయి కట్టాలి. వంగ మూడు నెలల్లో కాపుకొస్తుంది. 6 నెలల వరకూ కాపు ఉంటుంది. తర్వాత చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి.. కొంచెం కంపోస్టు వేస్తే.. మళ్లీ ఏపుగా పెరిగి కాపుకొస్తుంది. ఏడాదికిపైగా వంకాయలకు ఢోకా ఉండదు. వంగకే పురుగుల బెడద ఎక్కువ. ఏ రెమ్మకు తెగులు వచ్చినా అక్కడికి తుంచేసి నాశనం చేయడం అవసరం. టమాటా మొక్క వేసిన 2 నెలల్లో కాపుకొస్తుంది. రెండు నెలల పాటు కాయలు ఇస్తుంది.

సేంద్రియ ఆహారమే ఆరోగ్యం
రసాయనాలు వాడకుండా పెంచుకున్న కూరగాయలు, ఆకుకూరలే ఆరోగ్యం, కమ్మటి రుచి కూడా. ఖాళీ ఉంది కదా అని గొయ్యి తీసి ఆ మట్టి ఎలా ఉన్నా విత్తనం వేస్తే సరిగ్గా పెరగకపోవచ్చు. అందుకే... మట్టి, పశువుల ఎరువు, వర్మి కంపోస్టు లేదా ఇంటి వద్ద తయారుచేసుకున్న ఆకుల ఎరువు(లీఫీ మౌల్డ్) కలిపి ప్రత్యేకంగా సిద్ధంచేసుకున్న మిశ్రమం వాడితే ఫలితం బావుంటుంది. ఈ మట్టి మిశ్రమంతో ప్రత్యేకంగామడులను తయారుచేసుకొని కూరగాయలు, ఆకుకూరలు పెంచుకుంటే మామూలుగా కన్నా 3 నుంచి 5 రెట్లు అధిక దిగుబడి వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ఎరమ్రట్టి వాడితే ఇసుక కలపనక్కర్లేదు
కొన్ని ప్రాంతాల్లో నల్లమట్టి, మరికొన్ని ప్రాంతాల్లో ఎరమ్రట్టి ఉంటుంది. నల్లమట్టికి త్వరగా గట్టిపడి పిడచకట్టుకుపోయే స్వభావం ఉంది. దీనివల్ల మొక్కలు బాగా పెరగవు. అందుకని ఎరమ్రట్టి వాడితే మంచిది. నల్లమట్టే వాడాల్సి వస్తే కంపోస్టు, పశువుల ఎరువు వంటి వాటితోపాటు ఇసుకను కూడా కలపడం మంచిది. ఎరమ్రట్టి రెండుపాళ్లలో మిగతా సేంద్రియ ఎరువులు ఒక్కోపాళ్లలో కలిపి మొక్కలు పెంచొచ్చు. నల్లమట్టి అయితే ఒక పాలు కలిపితే మంచిది.
వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు తగినంత దొరక్కపోతే మట్టి, కంపోస్టు సమపాళ్లలో వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే... 65 శాతం మట్టి, మిగతా భాగం సేంద్రియ ఎరువులు కలిపి వాడొచ్చు. వేప పిండి, కానుగ పిండి, ఆముదం పిండి, మాగిన కొబ్బరి పొట్టు సాధ్యమైనంత కలుపుకుంటే మొక్కలను చీడపీడలు అంతగా ఆశించకుండా ఉంటాయి. ఇవి మొక్కలకు బలం కూడా. కొబ్బరి పొట్టు వల్ల వేళ్లు అధికంగా ఏర్పడడానికి వీలవుతుంది. మట్టిలో తేమ త్వరగా ఆరిపోకుండా కొబ్బరి పొట్టు చూస్తుంది. మట్టిని పక్కన పెట్టి కేవలం ఆకుల ఎరువు లేదా శుద్ధిచేసిన కొబ్బరి పొట్టునే వాడుతూ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. మట్టిలోకన్నా అనేక రెట్లు ఎక్కువ దిగుబడి తీస్తున్నారు కూడా.

ప్రత్యేక మడులు...

ఇటుకలు మూడు వరుసలు పేర్చి లేదా చెక్క ముక్కలు చుట్టూ కట్టి మధ్యలో మట్టి మిశ్రమం పోసి ప్రత్యేక మడిని సిద్ధం చేయొచ్చు. అడుగున ఇటుకలు పరిచి.. దాని పైన కొంచెం మట్టి పోసి.. అక్కడక్కడా బెజ్జాలు(ఎక్కువైన నీరు కిందికి పోవడానికి) పెట్టిన పాలిథిన్ షీట్ పరిచి.. ఆపైన ఇటుకలు మూడు వరుసలు పేర్చి మట్టి మిశ్రమం పోస్తే.. పెరటి స్థలంలో ప్రత్యేక మడి సిద్ధమైనట్టే. వర్షం పడినా మడి కింద నేల చెదిరిపోకుండా ఉండడానికి, కలుపు పెద్దగా రాకుండా ఉండడానికి ఇలా చేస్తున్నారు.

ఆకుల రసాలు, కషాయాలతో చీడపీడలకు చెక్
కూరగాయ మొక్కలు, ఆకుకూరలకు చీడపీడలు రాకుండా, ఏవైనా పురుగు సోకినా.. ఆకుల రసాలనో, కషాయాలనో వాడొచ్చు. వేప నూనెను సైతం వాడొచ్చనిహైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అగ్రికల్చర్, హార్టికల్చరల్ సొసైటీ అధ్యక్షుడు, ఉద్యాన శాఖలో అదనపు సంచాలకునిగా రిటైరైన మిద్దెల అనంతరెడ్డి ‘ఇంటి పంట’తో చెప్పారు. ఈ కషాయాలను ఎవరికి వారు ఇంటి దగ్గరే తయారుచేసుకోవచ్చని తెలిపారు. వేప ఆకులు, శీతాఫల ఆకులు, వావిలి ఆకులను మెత్తగా నూరి, రసం తీసి, వడపోసిన తర్వాత.. అంతకు 20 రెట్లు నీటిలో కలిపి పెరటి మొక్కలపై చల్లుకోవచ్చన్నారు. ఈ ఆకులను ఉడకబెట్టి కషాయాన్నయినా చల్లవచ్చన్నారు. ఈ ఆకుల వాసన ఘాటుగా ఉంటుంది. రసం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడితే చాలు. వేపకాయల రసం కూడా వాడొచ్చన్నారు. పచ్చిమిరప కాయలను గాని లేదా వెల్లుల్లిని గాని దంచి... కిరోసిన్‌లో ఒక రాత్రి నానబెట్టి తర్వాత నీటిలో కలిపి మొక్కలపై చల్లవచ్చన్నారు. చీడపీడలు ఆశించక ముందే 15 రోజులకోసారి వీటిని చల్లవచ్చని అంటూ.. పురుగుల గుడ్లు ఉన్నా నశిస్తాయన్నారు. ఈ రసాల వాసనకు చీడపీడలు పెరటి తోటల దరిదాపులకు కూడా రావన్నారు.

సంప్రదించవచ్చు..
ఉద్యాన శాఖలో అదనపు సంచాలకునిగా రిటైరైన మిద్దెల అనంతరెడ్డికి పెరటి తోటలు, పండ్ల తోటల సాగులో మంచి అనుభవం ఉంది. 57 ఏళ్లుగా ఉచిత సేవలందిస్తున్న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని ‘అగ్రికల్చర్, హార్టికల్చరల్ సొసైటీ’తో ఆయనకు ముప్పయ్యేళ్లుగా అనుబంధం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉద్యాన మిషన్‌కు అనుబంధంగా ఉన్న సాంకేతిక సలహా బృందం(టీఎస్‌జీ)లో ఆయన సభ్యులు. పట్నమైనా పల్లెలైనా ఇంటి పట్టున కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వారు సందేహాలేమైనా ఉంటే 92461 08262 నంబరులో ఆయనను సంప్రదించవచ్చు.

Thursday, January 13, 2011

ఒక్కసారి అంకాపూర్ వెళ్లొద్దామా...!?

 రాత్రనకా పగలనకా శ్రమించి, ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకొని పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభించకపోతే... రైతన్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అయితే ఆ గ్రామ రైతులకు అలాంటి ఇబ్బంది ఏదీ ఎదురవదు. వ్యవసాయోత్పత్తులు కొనుగోలు చేయండంటూ వ్యాపారుల చుట్టూ తిరగడం వారి ఇంటా వంటా లేదు. వారికి తెలిసిం దల్లా ... నాణ్యమైన పంటలు పండించడం, వాటిని తామే మార్కెట్ చేసుకోవడం. ఎప్పటికప్పుడు మార్కెట్ పోకడల్ని గమనిస్తూ వాటికి అనుగుణంగా పంటలు సాగు చేయడం, వ్యాపారులనే తమ చుట్టూ తిప్పించుకోవడం వీరికి ‘సాగు’తో పెట్టిన విద్య.

అందుకే ఆ గ్రామ రైతులు వ్యవసాయంలో సిరులు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘వ్యవసాయం చేస్తే ఏం లాభ ం... మట్టి బుక్కడం... మట్టి కక్కడం తప్ప’ అన్న నానుడిని చెరిపేసి ‘మట్టి పిసికి... సిరులు పండించడం’ అని తిరగరాస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ వాసులు.


సమష్టి సేద్యం, మార్కెటింగ్‌లో మెలకువలు ఈ గ్రామానికి రాష్టవ్య్రాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అంకాపూర్ గ్రామంలోకి వెళితే మనకు ఇంద్రభవనాన్ని తలదన్నే ఇళ్లు, ఖరీదైన కార్లు ఎన్నో దర్శనమిస్తాయి. కేవలం వ్యవసాయంతోనే ఆ ఆస్తుల్ని సముపార్జించుకున్నారంటే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాల్సిందే! పది వేల లోపు జనాభా ఉన్న ఈ గ్రామంలో మూడు వందలకు పైగా ఖరీదైన కార్లు ఉన్నాయంటేనే పరిస్థితి అర్థమవుతుంది. పొలానికి కారులో వెళ్లి పనులు ముగించుకొని వచ్చే స్థాయికి ఇక్కడి రైతులు ఎదిగారు. ఇది నూటికి నూరు పాళ్లు నిజం.


ఇది రాజన్న చలువే...

అంకాపూర్ అభివృద్ధి ప్రస్థానం 70వ దశకంలోనే ప్రారంభమైంది. సంకర జాతి విత్తనాలతో పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చన్న విషయాన్ని అర్థం చేసుకొన్న అప్పటి గ్రామ సర్పంచ్ రాజన్న గ్రామానికి హైబ్రిడ్ విత్తనాల్ని పరిచయం చేశారు. 1976లో అప్పటి వ్యవసాయాధికారి శ్యాంసుందర్ అంకాపూర్‌ను మోడల్ గ్రామంగా ఎంపిక చేసి సజ్జ పంట సాగు చేయించారు. ఎకరానికి 12 నుండి 18 క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతులు లాభాలు చవి చూశారు. దీంతో వారంతా వ్యవసాయంపై మక్కువ పెంచుకొన్నారు.

అప్పటి నుండి గ్రామ స్వరూపమే మారిపోయింది. 1977లో అక్కడ ఆంధ్రా బ్యాంక్ శాఖను ఏర్పాటు చేశారు. వ్యవసాయం ద్వారా సంపాదించిన డబ్బుతో గ్రామానికి చెందిన 56 మంది అమెరికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే 15 కుటుంబాలు స్థిరపడ్డాయి.


పసుపు పంట చేతికి రాగానే ఇక్కడి రైతులు కొత్త మోడల్ కార్లను కొనుగోలు చేస్తారంటే అతిశయోక్తి కాదు. దిగుబడులు చేతికి వచ్చే సమయంలో కార్ల కంపెనీలు గ్రామంలో మేళా నిర్వహించడం, ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం చూస్తే పరిస్థితి ఎంత మారిందో అర్థమవుతుంది.


డిమాండ్‌ను పసిగట్టి...

అంకాపూర్ వాసులు ఏడాదికి మూడు పంటలు పండిస్తారు. ఉత్తర భారతదేశంలో ఎర్ర జొన్నలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టిన అంకాపూర్ రైతులు ఎరజ్రొన్న విత్తనోత్పత్తి వైపు అడుగులు వేశారు. అయితే కేవలం ఒకరిద్దరు వేస్తే ఫలితం ఉండదని భావించి ఎక్కువ మంది కలిసి సమష్టి వ్యవసాయం సాగించాలని నిర్ణయించారు. ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ పటిష్టంగా ఉండటంతో రైతుల ఆలోచన కార్యరూపం దాల్చింది.
పక్కపక్కన ఉన్న పొలాల్లో వేర్వేరు రకాల విత్తనాలు వేస్తే గాలి, కీటకాల ద్వారా పుప్పొడి పక్క పొలాల్లోకి చేరి విత్తనాలు కల్తీ అయి నాణ్యత లోపిస్తుందనే ఉద్దేశంతో అందరూ ఒకే రకం విత్తనాలు సాగు చేస్తున్నారు. నిజాంసాగర్ జలాలు విడుదల చేసిన వెంటనే కాలువ నుండి విద్యుత్ మోటార్ల ద్వారా నీటిని పంప్ చేసి చెరువు నింపుకుంటారు.


ప్రాసెసింగ్‌పై దృష్టి

కేవలం పంటల సాగు పైనే దృష్టి సారిస్తే పెద్దగా లాభం ఉండబోదని గ్రహించిన రైతులు గ్రామ శివారులో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించారు. ప్రస్తుతం గ్రామంలో 29 ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. పంటను విక్రయించడానికి వ్యాపారుల చుట్టూ తిరగడమేమిటి? వారినే మన చుట్టూ తిరిగేలా చేద్దామన్న ఆలోచన వచ్చిందే తడవుగా మార్కెట్ యార్డు నిర్మించుకున్నారు. దీని ద్వారా ప్రస్తుతం రోజూ సగటున పది లక్షల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతోంది. చుట్టు పక్కల గ్రామాల రైతులు కూడా అంకాపూర్ మార్కెట్ యార్డు ద్వారానే తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నారు. ఇక్కడ పండించిన పసుపును మహారాష్టల్రోని సాంఘ్లీ మార్కెట్‌కు ఎగుమతి చేస్తారు.

గ్రామ రైతులు ఎక్కువగా పసుపు, ఎర్ర జొన్న, కూరగాయలు సాగు చేస్తారు. పైరు వేసేటప్పుడే రైతులు తమ పంటల అమ్మకానికి సంబంధించి వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటారు. అలా చేయడం వల్ల వారికి గిట్టుబాటు ధర లభిస్తోంది. అందరు రైతుల మాదిరిగానే తామూ పంటలు పండిస్తున్నామని, అయితే కలసికట్టుగా ఉండడం, పంటల ఉత్పత్తిలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుండడంతో మంచి ఆదాయం పొందుతున్నామని సర్పంచ్ పెర్కిట్ రవి తెలిపారు. మరి మనందరం ఒక్కసారి అంకాపూర్ వెళ్లొద్దామా?


కొత్తిమీరతో లక్షల ఆదాయం!


అంకాపూర్‌లో పండించిన కూరగాయలు గుం టూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. అంకాపూర్ మార్కెట్‌కు సరుకు రావడమే తరువాయి... కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉండటం రైతులకు కలిసొస్తోంది. అంకాపూర్‌లో కొత్తిమీర సాగుతో లక్షల రూపాయలు సంపాదించిన వారు ఉన్నారు. ఎకరం భూమిలో కొత్తిమీర వేసి 45 రోజుల్లో లక్ష రూపాయలు ఆర్జిస్తున్నారు.

రాష్టవ్య్రాప్తంగా రైతులు కూరగాయలు పండిస్తున్నప్పటికీ పంటను మార్కెటింగ్ చేసుకోవడం, ఎగుమతి చేసే విధానం తెలియక నష్టాలు చవిచూస్తున్నారు. మార్కెటింగ్‌లో మెలకువలు నేర్చిన అంకాపూర్ వాసుల్ని ఆదర్శంగా తీసుకుంటే వ్యవసాయం పండుగే అవుతుంది మరి. అక్కడి రైతుల నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. 

వి.అమృతరావు

పాడి - పంట * పుష్టికరమైన మేతతో ఎన్నో లాభాలు!

పాడి పశువులకు పుష్టికరమైన, నాణ్యమైన మేత అందించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఈతకు, ఈతకు మధ్య దూరం తగ్గి ఎక్కువ ఈతలు వస్తాయి. దీనివల్ల పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని అమలాపురం పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జి.లక్ష్మణస్వామి తెలిపారు.పాడి పశువుల్లో విటమిన్-ఎ, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషక పదార్థాల లోపాల వల్ల పునరుత్పత్తి సామర్థ్యం పడిపోతుంది. పోషకాల లోపాలు లేకుండా చూస్తే పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధులు, పునరుత్పత్తికి సంబంధించిన జబ్బులు రాకుండా నివారించవచ్చు. చాలా మంది రైతులు వర్షాకాలం, చలికాలంలో పచ్చిమేతలు, వేసవిలో ఎండుమేతలు దాణాగా అందిస్తుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. పచ్చిమేత ఎక్కువగా దొరికే కాలంలో దానిని పాతర (సైలేజ్) వేసి నిల్వ చేసుకోవాలి.

అన్ని కాలాల్లోనూ పచ్చిమేత అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. రోజుకు ఒక్కో పశువుకు ఎనిమిది కిలోల వరిగడ్డి లేదా ఎండు చొప్ప (జొన్న, మొక్కజొన్న), ఎనిమిది కిలోల లెగ్యూమ్ జాతి పచ్చిమేత (పిల్లిపెసర, అలసంద, గోరుచిక్కుడు), 16 కిలోల గింజ జాతి పచ్చి మేతలు (జొన్న, మొక్కజొన్న, ఇంకా ఇతర బహు వార్షిక పశుగ్రాసాలు) ఇచ్చినట్లయితే దానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. పాల దిగుబడిని బట్టి పశువులకు దాణా ఇవ్వాలి. ఈ విధంగా పోషణ చేపడితే సకాలంలో పశువులు ఎదకు వస్తాయి. ఈనిన తర్వాత మూడు నెలల లోపు పశువు ఎదకు వచ్చేటట్లు చూసి 13 నెలల్లో ఒక ఈత ఈనేటట్లు జాగ్రత్త పడాలి. అలా చేస్తే పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. పాడి పరిశ్రమ లాభదాయకంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన పశువులు తమ జీవిత కాలంలో 8-10 సార్లు గర్భం దాల్చే అవకాశం ఉంది.

గొడ్డుమోతు సమస్యలు

పశువుల్లో గొడ్డుమోతు సమస్యకు మూడు కారణాలు ఉన్నాయి. సకాలంలో ఎదకు రాకపోవడం, పశువులకు గర్భకోశ వ్యాధులు ఉండటం, అండంలో లోపాల వల్ల ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీనిని నివారించాలంటే పాడి రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పశువు ఈనిన తర్వాత 60-90 రోజుల్లో ఎదకు వచ్చి చూలు కట్టాలి. ఎదకు రాని పశువుల్ని సకాలంలో పశు వైద్యుని వద్దకు తీసుకెళ్లి పరీక్ష చేయించాలి. ప్రతి రోజూ ఎద లక్షణాల్ని పరిశీలించి కృత్రిమ గర్భధారణ చేయించాలి. సకాలంలో చూడి పరీక్షలు చేయించాలి. కట్టు నిలవని పశువులకు పశు వైద్యాధికారితో ప్రత్యేక చికిత్స చేయించాలి. ఈనే సమయంలో పాకలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి. పుష్టికరమైన పచ్చిమేత వెయ్యాలి. లేకుంటే ‘ఎ’ విటమిన్ ఇంజక్షన్ ఇవ్వాలి. దాణాలో మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ మిశ్రమం తగు పాళ్లలో అందించాలి.

దూడల్ని ఎదగనీయండి

యుక్త వయసు రాని దూడల్ని కృత్రిమంగా పొర్లించి చూడి కట్టించే పనిని ఇటీవల కొందరు రైతులు గొప్పగా భావిస్తున్నారు. అయితే అశాస్ర్తీయమైన ఇటువంటి సంప్రదాయం పశువుల ఉనికికే ప్రమాదకరం. తగిన వయసు, సరిపడినంత బరువు లేని పశువుల్ని చూడి కట్టించడం వల్ల ఆ పశువుతో పాటు దాని సంతతికి కూడా అనేక రకాల బలహీనతలు, వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు రాజమండ్రి పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రామకోటేశ్వరరావు. వివరాలు ఆయన మాటల్లోనే...
దూడలు ఒక వైపు తల్లి పాలు తాగుతుండగానే పశువుల్ని చూడి కట్టించడం ఇటీవల ఒక పోకడగా మారుతోంది. మనుషుల్లో బాల్య వివాహాలు ఎంతటి దురాచారమో పశువులకు ఈ పద్ధతి అంతటి అనాచారమని చెప్పొచ్చు. సాధారణంగా సంకర జాతి ఆవులకు పోషక విలువలు ఉన్న దాణా ఇవ్వడం వల్ల వాటిలో ముందుగానే ఎద లక్షణాలు కన్పిస్తాయి. దీంతో కొందరు రైతులు వాటిని నాలుగో నెలలోనే పొర్లించి ఎద కట్టిస్తున్నారు. ఆవులకు 18 నెలలు, గేదెలకు 24 నెలల వయసు వచ్చిన తర్వాత మాత్రమే పొర్లించాలి. ఆవులైతే 200 కిలోలు, గేదెలైతే 250-300 కిలోల బరువు ఉన్నప్పుడు మాత్రమే చూడి కట్టించాలి. శారీరకంగా పూర్తిగా ఎదగని పశువుల్ని పొర్లించినప్పుడు శరీరం లోపల కలిగే ఒత్తిడిని అవి తట్టుకోలేవు. తక్కువ వయసు, తక్కువ బరువు ఉన్న పశువుల్ని చూడి కట్టిస్తే వాటి శరీరంలోని లవణాలు, విటమిన్లు పాల ద్వారా బయటికి పోతాయి. దీంతో వాటి శరీర నిర్మాణం కుంటుపడుతుంది. చిరుప్రాయంలోనే ఆవును చూడి కట్టిస్తే కటి వలయం సరైన రీతిలో సిద్ధం కాక ఈనిక కష్టతరంగా మారుతుంది. ఈ సందర్భంలో తల్లి లేదా దూడ లేదా రెండూ మరణించే ప్రమాదం ఉంది.

యుక్త వయసుకు రాకుండా పొర్లించడం వల్ల పశువు తన జీవిత కాలంలో ఇచ్చే దూడల సంఖ్య తగ్గిపోవచ్చు. అలాగే దాని పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. తర్వాత ఈతకు, ఈతకు మధ్య ఒక సంవత్సరం ఉండాల్సిన ఎడం రెండు మూడేళ్లకు పెరుగుతుంది. పశువు తీసుకునే ఆహారాన్ని దాని శారీరక ఎదుగుదలకు, పాల ఉత్పత్తికి పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. ఎద లక్షణాలు పూర్తిగా కన్పించక మూగ ఎదలకు దారి తీసే అవకాశం ఉంది. పశువులు ఎదకు వచ్చినప్పుడు చూడి కట్టిన వెంటనే తిరిగి పొర్లు సమస్య వస్తుంది. పొదుగు కణజాలం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. జన్యుపరమైన లక్షణాలు తగ్గుతాయి. ఈ విధంగా తొందరపాటుతో చూడి కట్టించడం వల్ల పాడి పశువులకి ఎన్నో అనర్థాలు జరుగుతాయి. వాటి సంతతి దూడలకు అనువంశికంగా ఎన్నో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల రైతులు ఇలాంటి పొర్లింపు కార్యక్రమాలకు ఇకనైనా స్వస్తి పలికితే పాడి పశువులు ఆరోగ్యవంతంగా ఉంటాయి.

Saturday, January 1, 2011

కరివేపాకు సాగులో లాభాల గుబాళింపు!

 
కరివేపాకే కదా అని తీసిపారేయకండి. ఆ కరివేపాకే ఇప్పుడు ఎంతో మంది రైతన్నల్ని లక్షాధికారుల్ని చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వాణిజ్య పంటల సాగు నేడు జూదంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో కరివేపాకు సాగు చేసి ఎక్కువ ఆదాయం పొందవచ్చునని నిరూపిస్తున్నారు విజయవాడ పరిసర ప్రాంతాల రైతులు.

వాణిజ్య పంటలు సాగు చేసి చేతులు కాల్చుకునే కంటే ఏళ్ల తరబడి కరివేపాకునే నమ్ముకుని లాభాల గుబాళింపును ఆస్వాదిస్తున్నారు పులగం శివరామయ్య. విజయవాడ నగరం చెంతనే ఉన్న కుంచనపల్లి గ్రామానికి చెందిన శివరామయ్య ఓ సన్నకారు రైతు. ఆయనకు రెండెకరాల పొలం ఉంది. అందులో ఎకరం భూమిని గత పదిహేనేళ్లుగా కరివేపాకు సాగుకే కేటాయిస్తున్నారు.


ఏటా పెట్టుబడి ఖర్చులన్నీ పోను యాభై వేల రూపాయల నికరాదాయం పొందుతున్నారు. శివరామయ్యను చూసి ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది రైతులు ఇప్పుడు కరివేపాకునే తమ ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. ఏడాదికి మూడు కోతలు తీసుకుంటూ వాణిజ్య పంటలకు దీటుగా ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కరివేపాకు సాగు చేయడానికి ముందుకొచ్చే ఔత్సాహిక రైతులకు శివరామయ్య పలు సూచనలు అందిస్తున్నారు. అవి ఆయన మాటల్లోనే...


మంచి డిమాండ్

ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న కరివేపాకుకు ఇతర ప్రాంతాల్లో, దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కరివేపాకు సాగు చేసే రైతులకు వ్యాపారులు ముందుగానే డబ్బు చెల్లిస్తున్నారు. కృష్ణా తీరంలో సారవంతమైన ఒండ్రు నేలలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ కరివేపాకు సాగు అందరికీ లాభదాయకంగా ఉంటోంది. మరో విశేషమేమంటే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, వాతావరణం అనుకూలించకపోయినా కరివేపాకు దిగుబడిపై పెద్దగా ప్రభావం పడడం లేదు. అదే ఇక్కడి రైతులకు బాగా కలిసొస్తోంది. ఒకసారి కరివేపాకు సాగు ప్రారంభిస్తే అయిదేళ్ల వరకూ దాని నుండి పంట తీసుకోవచ్చు.

సాగు విధానమిలా...

కరివేపాకు పంటకు నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. ముందుగా భూమిని దుక్కి దున్ని చదును చేయాలి. ఆ తర్వాత మడులు తయారు చేసుకొని కరివేపాకు విత్తనాలు చల్లుకోవాలి. నేరుగా సాళ్లు చేసుకొని కూడా విత్తనాలు విత్తుకోవచ్చు. సాళ్లలో విత్తుకునేట్లయితే ఎకరానికి 80-100 కిలోలు, నేరుగా మడుల్లో చల్లుకునేట్లయితే 200 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. దేశవాళీ రకాలతో పాటు భువనేశ్వర్ రకం రైతులకు మంచి దిగుబడులు అందిస్తోంది.

భూమి తయారీ, విత్తనాల కొనుగోలు, విత్తడం వంటి పనులకు ఎకరానికి 15 వేల రూపాయల వరకూ ఖర్చవుతాయి. ఎరువులు, పురుగు మందుల వినియోగానికి మరో 10 వేల రూపాయలు ఖర్చవుతాయి. ఆరు నెలల తర్వాత మొదటి కోత వస్తుంది. అప్పటి నుండి ప్రతి వంద రోజులకు ఒకసారి కోత కోయవచ్చు. ఎగుమతి అవకాశాలు, సీజన్‌ను బట్టి ఒక్కో కోతకు 25 వేల రూపాయల వరకూ ఆదాయం వస్తుంది. ప్రస్తుతం క్వింటాలుకు స్థానిక మార్కెట్‌లోనే నాలుగు వేల రూపాయల ధర పలుకుతోంది. ఒకసారి పంట వేస్తే అయిదేళ్ల వరకూ దానిని కదిలించాల్సిన అవసరం ఉండదు. పైగా కోత తర్వాత వచ్చే పిలకలు త్వరితగతిన ఏపుకు వస్తాయి.


చీడపీడలు తక్కువే

కరివేపాకు సాగులో చీడపీడల ప్రభావం తక్కువగానే ఉంటుంది. అయితే పేనుబంక, పొలుసు పురుగు ఆశించే అవకాశం ఉంది. పేనుబంక నివారణకు రోగార్, కాన్ఫిడార్ వాడితే ఫలితం ఉంటుంది. పొలుసు పురుగు నివారణకు కానుగ నూనె పిచికారీ చేయడం మేలు. ఒకవేళ రసాయన మందులు వాడాల్సి వస్తే మలాథియాన్ పిచికారీ చేయవచ్చు.

ఎగుమతులకు భలే గిరాకీ

కరివేపాకు ఎగుమతులకు మంచి గిరాకీ ఉంది. విజయవాడ మార్కెట్ నుంచి చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్‌కు ఎక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయి. దుబాయ్‌లో కూడా కరివేపాకుకు మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు ముందుగానే రైతుల నుండి తోటలు కొని ఇక్కడి నుండే నేరుగా ఎగుమతి చేస్తున్నారు. కరివేపాకును ఔషధాల్లోనూ, బేకరీ ఫుడ్స్‌లో సువాసన కోసం వాడటం వల్ల మంచి డిమాండ్ ఏర్పడింది. కరివేపాకు నుండి స్వేదన క్రియ ద్వారా ఓలియో రెజిన్ అనే నూనెను తయారు చేస్తున్నారు. దీనిని వంటకాల్లో వినియోగిస్తున్నారు. కొన్ని మందుల కంపెనీలు కరివేపాకు పొడిని వినియోగిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని విజయవాడ ప్రాంతం నుంచి కరివేపాకును ముందుగానే పొడి చేసి నేరుగా ఎగుమతి చేస్తున్నారు.

Sunday, December 19, 2010

తిండి తిప్పలు * బ్రెడ్డే దొరకట్లేదంటే..కేక్ తినమన్నట్లుంది

ఉపాధి హామీ పథకం వల్ల కూలి రేట్లు పెరిగి ఒక రైతుగా నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఒక సామాజిక కార్యకర్తగా ఆ పథకాన్ని సమర్థిస్తున్నాను. నిజానికి రైతు కూలీలు, కార్మికులు శక్తివంతులై వేతనం పెంచకపోతే పని కూడా వద్దనుకునే స్థాయికి ఎదగడం నాకు సంతోషాన్నిస్తోంది. కాని బాధ కలిగించే విషయం ఏమిటంటే- పథకం అమలులో జరుగుతున్న అవినీతి, చేసే పని పట్ల శ్రద్ధ లేకపోవటం, రైతులు ఆహారేతర పంటలవైపు మొగ్గు చూపడానికి అది కూడా ఒక కారణం కావడం. దీనివల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి మరింత తగ్గిపోతోంది.

వ్యవసాయ పని ఒక్కళ్లుగా చేసుకోలేరు. పని ఉన్నప్పుడు ఎక్కువమంది కూలీలు అవసరమవుతారు. అది కూడా పనితనం ఉన్నవాళ్లు కావాల్సి వస్తుంది. పని తెలిసి, ఇష్టంతోనూ ఉత్సాహంతోనూ చేసేవారు కావాల్సి వస్తుంది. అయితే పట్టణాలకు వలసల వల్ల గ్రామాల్లో పని నైపుణ్యం ఉన్నవాళ్లు తగ్గడమే కాదు, తీవ్ర కొరత కూడా ఏర్పడడంతో రైతులు ఆహార పంటల నుంచి శ్రమ, శ్రద్ధ పెద ్దగా అవసరం లేని ఆహారేతర పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఇంకో కారణం ఏమిటంటే... రైతులు గంటల తరబడి తమ సొంత పొలాల్లో సైతం పని చేయడానికి సిద్ధంగా లేరు. నేటి తరానికి పాలు పిండడం చేతకాదు, నాగలి పట్టడం రాదు, నీరు పెట్టడం తెలీదు. ఎక్కువ కాలం బడిలో గడపడం మూలాన ఎండకి వానకి పని చేయడం తెలీదు. కాయకష్టాన్ని తక్కువ చేసి చూడటం, మురికి పని అనుకోవడం, అది దిగువ వర్గాలకి, కులాలకి చెందినదిగా భావించడం వల్ల చాలామంది యువత పని పట్ల విముఖత చూపుతున్నారు. అదే తప్పనుకుంటే ఆ దిగువ వర్గాలు, కులాలు కూడా పనికి అందుబాటులో లేకపోవడం మరో సమస్య.

జనం ఎక్కడా ఒకచోట నిలకడగా ఉండటం లేదు. మొబైల్, మోటారు బైకు, డబ్బు అనే మూడు విషయాలు జనాన్ని ఒక దగ్గర ఉండనీయటం లేదు. ఈ పరిస్థితుల్లో పని చేయటం కష్టం. వ్యవసాయం ్జ్ఛ్చజూౌఠట ఝజీట్టట్ఛటట లాగా రైతు నిరంతరం తన చుట్టే తిరగాలనుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ఖాళీ సమయం దొరక్కపోదు. వర్షాలు కురుస్తున్నప్పుడో, ఎండాకాలం మధ్యాహ్నాల లాంటి సమయాల్లోనో. కాని ఎప్పుడూ అటో ఇటో తిరుగుతుంటే వ్యవసాయం ముందుకు సాగదు. పని వాళ్లు దొరక్కపోతే యంత్రాలను ఉపయోగించటమో ఆధునికీకరించటమో చేసుకోవచ్చు కదా అని మీరనొచ్చు. ఇదెట్లా ఉంటుందంటే బ్రెడ్డే దొరకట్లేదంటే కేక్ తినమన్నట్లుంటుంది. యంత్రం మనకన్నా తొందరగా పని చేస్తుందేమో కాని అన్ని రకాల సాగు పనులు చేయలేదు. పైగా దానికి కావాల్సిన డీజిల్ డబ్బులు పోసి కొనాలి. ఫలితం పర్యావరణానికి హాని, మన ఖజానాకు గండి. మనిషి మెదడు లాంటి యంత్రమైతే ఇప్పటి దాకా రాలేదు. మనకు యంత్ర సాయం అవసరమే కాని మరీ బ్రెడ్డుకి బదులు కేక్ తినలేము కదా!

యంత్రాల వైపు మళ్లే బదులు మనము భూమాత వైపు మళ్లాలి. సహజ పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో ఆయా భూములకు అనువైన పంటలను పండిస్తూ , సహజ ఎరువులను, క్రిమిసంహారకాలను తయారు చేసుకొని సాగు చేయటం మంచిది. అయితే ఈ రకమైన వ్యవసాయం పెరుగుతున్న జనాభాకు సరిపోను తిండిని పండించగలదా అని అనుమానం రావొచ్చు. బహుశా మొదట్లో సాధ్యం కాకపోవచ్చు. కాని పట్టుదలతో చేస్తే, తప్పని సరిగా కొద్ది సంవత్సరాల్లోనే సాధ్యం చేసుకోవచ్చు. క్యూబా ప్రజలు చేసుకోగా మనమెందుకు చేసుకోలేము? అప్పుడు మనం స్వచ్ఛమైన మందులు, విషాలు లేని ఆహారం తినటమే కాదు, మన భూములు, నీరు, గాలి కూడా స్వచ్ఛంగా కాలుష్య రహితంగా ఉంటాయి. ఆహార కొనుగోలుదారులు (సాధారణ వినియోగదారులు) కూడా సహజ ఆహారాన్ని కోరుకోవాలి. అందుకు తగిన ధర చెల్లించడానికి మనం ముందుకొస్తే రసాయనాలువాడకుండా పంటలు పండించడానికి రైతులు కూడా సిద్ధమవుతారు.

గౌరమ్మను గౌరవించండి

ఎలాగైతే తల్లి తన బిడ్డ విసర్జించే మలాన్ని శుభ్రం చేయడానికి జంకదో మట్టి కూడా అదే విధంగా జంకదు. జంకకపోవటమే కాదు మన కంటికి కనపడని తన సంతానంతో ఆ మలాన్ని మంచి ఎరువుగా కూడా మార్చగలదు. మనుషుల నుంచి జంతువుల దాకా అన్నిటి మలాన్ని మట్టిలోపల పూడ్చి సారవంతంగా మార్చొచ్చు. మా ఊళ్లో సంక్రాంతి ముందు నెల రోజుల పాటు పిల్లలు గౌరమ్మ ఎదుట నిలబడి దణ్ణం పెట్టుకుంటారు. గౌరమ్మ అంటే... ఆవుపేడతో చేసిన గౌరమ్మ! ఇండియాలో పంట పెంటతో ఎంతో దగ్గరగా ముడిపడి ఉంటుంది. అమెరికాలో మాత్రం పెంటను ఇట్లా భూమిలో కలిపేయరు. దాంతో పెద్ద సమస్యను తెచ్చి పెట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్లష్ లెట్రిన్లు నీటిని కలుషితం చేస్తున్నాయనేది అందరూ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. దీని అర్థం నేను మళ్లీ పూర్వకాలంలో లాగ 'బయటి'కెళ్లమనటం లేదు. మన మరుగుదొడ్ల నిర్మాణాన్ని పునః సమీక్షించాలంటున్నాను. నీటి అవసరం లేని డ్రై లెట్రిన్స్‌ని తయారు చేయాలంటున్నాను.


- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

Tuesday, December 14, 2010

తిండి తిప్పలు * పండిద్దునా... కొనుక్కుందునా ?

ఆహారం పండిద్దునా .........
లేక కొనుక్కుందునా?
మా ఊరయిన చిత్తూరు జిల్లా వెంకటాపురంలో రైతులు ఈ విధంగా మాట్లాడుకుంటారు... "మా కుటుంబ అవసరాలకు ఏటా ఎన్ని వేరుశనగలు కావాలి... మహా అయితే ఒక గోతాము చట్నీకి, రెండు మూడు గోతాలు వంట నూనెకి. దానికోసం ఇంత కష్టపడి పండించడం ఎందుకు? సొంత డబ్బుతో పెట్టుబడి పెట్టాలి మన వద్ద లేకపోతే వడ్డీకి అప్పు చెయ్యాలి. పొలంలో పని చేయడానికి కూలి వాళ్లు దొరకాలి. అంతా చేసి పంట చేతికి వచ్చేనాటికి ధరలు పడిపోవచ్చు. అదే జరిగితే మిగిలేది అప్పులే. అందుకే దాని బదులు పొలాన్ని మామిడి తోట కిందకు మార్చేసి మనకి కావాల్సిన వేరుశనగల్ని కొనుక్కుంటే నయం కాదా?''

ఇదే రకమైన వాదన మిరప, కూరగాయలు, పాల విషయంలో కూడా వినపడుతుంది. ఎన్ని మిరపకాయలు కావాలి? ఐదు కిలోలో, పది కిలోలో. దాని కోసం పండించే బదులు కొనుక్కుంటే సరిపోతుంది. పాలెన్ని కావాలి? రోజుకి అర లీటరో లీటరో. టీకి, పెరుగుకి లేదా మజ్జిగకి. దాని కోసం ఆవుల్ని పెంచడం, గడ్డి కోసుకొచ్చి వేయడం, వాటికి దాణా కోసం వేరుశనగ చెక్కను కొనడం, అవి జబ్బు పడితే డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లడం... ఎందుకీ గోలంతా? ఇదే విధంగా కూరగాయలు... దుక్కి దున్నాలి, సాళ్లు తోలాలి. క్రమం తప్పకుండా నీరు పెట్టుకోవాలి, కలుపు తీస్తుండాలి, పురుగు మందులు కొట్టాలి, ముదరక ముందే కాయలు కోసి మార్కెట్టుకు పంపాలి. ఇంత కష్టపడితే గిట్టుబాటు ధర రాకపోవచ్చు... ఎందుకొచ్చిన తలనొప్పి.

కొనుక్కుంటే సరిపోతుంది. కూరల ధరలు ఎక్కువుంటే ఆకు కూరలతో సరిపెట్టుకోవచ్చు. అవీ లేకపోతే మునగాకుతో ముగించవచ్చు. లేదా చింతపులుసు, చట్నీ, రసంతో కానిచ్చేయొచ్చు. ఇలా ఆలోచించడం వల్లే రైతులు వర్షాధార పంటలు, ముఖ్యంగా మెట్ట పంటలైన తృణ ధాన్యాలు, పప్పు గింజలు, నూనె గింజలు, కూరగాయలు పండించడానికి ముందుకు రావడం లేదు. పశువుల పెంపకం పట్ల వారికి ఆసక్తి మరీ తగ్గిపోతోంది. పంట భూములన్నిటిని తోటల కిందకు మార్చేసి హాయిగా సేద తీరుతున్నారు. మా ఊళ్లో అయితే ఇంతకు ముందు వేరుశనగలు, పప్పులు, నూనె గింజలు పండిన నేలల్లో ఇప్పుడు మామిడి పండ్లు పండుతున్నాయి. మరి పప్పు, ధాన్యం బదులు రోజూ మామిడి పండ్లనే తినగలమా? పంటభూమి ఉన్న రైతులంతా ఇట్లాగే ఆలోచిస్తే ఆహార పంటలనెవరు పండిస్తారు? ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయంటే అంటవా మరి? కాని రైతులిట్లా ఎందుకు చేస్తున్నారు?

సాగు ఖర్చులు పెరుగుతున్నాయి, చేతికొచ్చే డబ్బులు తగ్గుతున్నాయి. పంట ఉంటే ధర ఉండదు.. ధర ఉంటే పంట ఉండదు. ఏడాది కేడాదికి పెరుగుతున్న నష్టాలను చూసి రైతులు ఆ పంటలకి దణ్ణం పెడుతున్నారు. కొబ్బరి తోటల విషయంలో నా సొంత అనుభవమే చెపుతాను. గత ఇరవై సంవత్సరాల నుంచీ వాటి ధర ఒక్కో కాయకి రూ. 2 నుండి రూ. 3 పలుకుతోంది. అంతకు మించి ఒక్క పైసా పెరగలేదు. అందుకే చిత్తూరు జిల్లాలో కొబ్బరి రైతులు చెట్లు కొట్టేసే యోచనలో ఉన్నారు. ఆ పంటకేమో ఎక్కువ నీళ్లు కావాలి. నీటి మట్టమేమో తగ్గుతూ పోతోంది. అదే విధంగా ఇరవై ఏళ్లలో పాల ధర లీటరు రూ4 నుండి రూ16కి పెరిగింది. అయితే మేతగా వాడే వేరుశనగ చెక్క ధర అదే కాలంలో కిలోకి రూ4 నుండి రూ26కు పెరిగింది.

వరికి, గోధుమకు తప్పించి మిగతా వేటికీ ఖచ్చితమైన మద్దతు ధర లభించట్లేదు. ప్రతి సంవత్సరం రైతు మొదట్లో రుతుపవనాలతోను చివర్లో మార్కెట్టుతోను జూదమాడినట్లవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఎందుకు చేయాలి? ఈ మధ్యన కొత్త అంశం వచ్చి చేరింది. పోయిన దశకంలో గ్రామాలలో మూడు ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటంటే... డ్వాక్రా, ప్రజాపంపిణీ వ్యవస్థ, జాతీయ రోజ్‌గార్ యోజన. డ్వాక్రా పుణ్యమా అని భూమి లేని మహిళా రైతులకు రుణ సదుపాయం లభిస్తోంది. దాంతో పశువుల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలతో వారికి బతుకుతెరువు దొరుకుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ పుణ్యమా అని దారిద్య్రరేఖకి దిగువనున్న కుటుంబాలకు పదిరోజులకు సరిపడా ధాన్యం రెండురూపాయలకు కేజీ చొప్పున లభిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పుణ్యమా అని పనివాళ్ల జేబుల్లో డబ్బు కదలాడుతున్నది.

దాంతో వ్యవసాయం పట్ల, పని పట్ల వారి ఆలోచనలు అభిప్రాయాలు మారిపోయాయి. వారమంతా పని చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. పనికి వెళ్లని రోజు తమ సొంత పని చేసుకుంటున్నారు. అది వారి స్వీయ ఉపాధి వ్యాపారం కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు. ఉపాధి హామీ పథకం వల్ల గ్రామాల్లో కూలి రేట్లు పెరిగి వ్యవసాయం ఖర్చు పెరిగిపోయింది. దీని వల్ల ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కూలీల వలస కొంతమేర తగ్గిపోయిందేమో కాని, గ్రామాల నుండి పట్టణాలకి వలస మాత్రం తగ్గలేదు. ఎందుకంటే పట్టణాల్లో కూలి ఎక్కువగా లభిస్తుంది కనుక.

ఈ రకంగా నిరంతరాయంగా పట్టణాలకు వలస వెళ్లటం మూలాన గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడుతున్నది. మా గ్రామాల్లో ఈ సీజనల్ వలసలు శాశ్వత వలసలకు దారి తీశాయి. ఉపాధి హామీ పథకం చాలా వరకు లోపభూయిష్టంగా ఉంటుంది. నిర్వహణలో చాలా అవినీతి చోటు చేసుకుంటుంది. దీనివల్ల నష్టపోయే వాళ్లూ, లాభపడేవాళ్లు కూడా వ్యవసాయ కూలీలే. ఎలాగంటే... ఇందులోని మస్టర్ రోల్స్ (కూలీల వివరాలు) అన్నీ ఉత్తుత్తివే. పని చేసిన వాళ్లకంటే ఎక్కువమందిని చూపించి ఆ డబ్బు తీసుకోవడం సాధారణం. పని కొలతలు కూడా ఉత్తుత్తివే. అసలు జరిగిన దానికంటే ఎక్కువ పని జరిగినట్టుగా చూపించటం మామూలయిపోయింది. కూలీలకు కూడా ఇదంతా అలవాటైపోయింది. దీనివల్ల ఒక రైతు పర్యవేక్షణలో పని చేయటానికి వాళ్లు ఇష్టపడడం లేదు. ప్రభుత్వం ఇచ్చినంత వేతనం రైతు కూడా ఇవ్వాలనుకుంటున్నారు వాళ్లు. ఫలితంగా కూలీ రేట్లు రైతులకు మోయలేని భారమయ్యాయి. దీని ప్రభావం వారిపై ఎలా ఉందో వచ్చేవారం తెలుసుకుందాం.

- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

Sunday, November 28, 2010

అమెరికాలో రైతే లేడు

  తిండి తిప్పలు
అవసరం లేకపోయినా అధికంగా పండించడం అలవాటు చేసుకున్న అమెరికా ఇప్పటికీ ఆ పని చేస్తూనే ఉంది. అలా ఉత్పత్తి చేసిన వాటిని మిగతా దేశాల్లో స్థానికంగా ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుకన్నా తక్కువ ధరకే ఎగుమతి చేస్తుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆహారవస్తువుల ధరలు తగ్గితే దాని వల్ల అమెరికా రైతులు నష్టపోకుండా మళ్లీ వారికి రకరకాల సబ్సిడీలు కల్పిస్తారు. దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో రైతులు మాత్రం నష్టపోతున్నారు.

నిజానికి అమెరికాలో వ్యవసాయం చేస్తున్నవాళ్లని రైతులనలేం. రైతులందరినీ ఎప్పుడో పొలాల నుంచి వెళ్లగొట్టేశారు వాళ్లు. అక్కడ ఇప్పుడు మహా అయితే రెండు శాతం మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారేమో. మిగతా వాళ్లందరూ బహుళ జాతి కంపెనీల వాళ్లు. విత్తనాలు మొదలుకుని రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉత్పత్తి చేయడమే కాక ఆ ఉత్పత్తుల్ని ప్రాసెసింగ్ చేయడం నుంచి అంతర్జాతీయ వ్యాపారం దాకా అన్నీ బహుళజాతి కంపెనీల వాళ్లే చేస్తున్నారు. అమెరికన్ ఎన్నికల్ని, రాజకీయ నాయకుల్ని శాసిస్తూ తమ వ్యాపారాలకి ఎలాంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల సబ్సిడీలు అందేలా చేసుకుంటారు. అంతే కాదు.. ఇతర దేశాల ప్రభుత్వాలు తమ వ్యవసాయదారులకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకుండా చేయమని అమెరికన్ ప్రభుత్వంపై వత్తిడి తెస్తారు. అవసరమైన వరకు ఉత్పత్తి చేసుకునే బదులు ఈ కంపెనీలన్నీ అమెరికాలో ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పెంచాలని సూచిస్తూ ఉంటాయి.

ఇక ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి విషయానికొస్తే రెండూ ఎక్కువగా అమెరికా, యూరోపియన్ దేశాల నిధులతోటే నడుస్తుంటాయి. అందుకే స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతు తెలిపి తద్వారా అమెరికా, యూరప్‌లలో పండిన పంటలకి ఇతర దేశాల్లో మార్కెట్ కల్పిస్తాయి. మనలాంటి దేశాలకి ఈ స్వేచ్ఛా వాణిజ్యం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే మనం ఉత్పత్తి చేసేది మనకే సరిపోదు. దీనితో పాటు ఇతర దేశాలు తమ రైతులకు ఇచ్చే సబ్సిడీల్లో కోత విధించాలని, వాటికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించాలని సలహా ఇస్తాయి ఆ దేశాలు. మనలాంటి దేశాలు ఆ పని చేస్తే రైతులపై ఉత్పత్తి భారం పెరుగుతుంది తప్ప మార్కెట్లో ధరలు మాత్రం పెరగవు. ఎందుకంటే అంతకన్నా తక్కువ రేటుకి మార్కెట్లో అమెరికా, యూరప్ నుండి ఉత్పత్తులు వచ్చిపడుతున్నాయి కదా. మన దేశంలో రసాయన వ్యవసాయం ఎప్పట్నుంచి మొదలైందో చూద్దాం.

దేశ జనాభాకి సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి 1950ల్లో మనదేశం 'గ్రో మోర్ ఫుడ్' ప్రచారం మొదలుపెట్టింది. అందుకని వ్యవసాయ భూమిని పెంచే పనిలో పడింది. దానితోపాటు అమెరికా నుండి ఆహారాన్ని దిగుమతి చేసుకుంది. ప్రపంచ యుద్ధకాలం నుంచి అమలులో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థను మన దేశంలో 60వ దశకంలో కొంత విస్తరించారు. ధాన్యాన్ని రైతులనుండి కొనుగోలు చేసి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకి అందేలా చేశారు. అలా చేయడం వల్ల రైతులకి ముందుగా నిర్ణయించిన ధర లభించడమే కాక సామాన్యులకు సబ్సిడీ ధరలకు ఆ ధాన్యం తప్పనిసరిగా అందేది.

1960ల్లో మన దేశంలో మొదలైన హరిత విప్లవంలో భాగంగా వరి, గోధుమ పంటల్లో కొత్తకొత్త రకాలను ప్రవేశపెట్టారు. అయితే వాటికి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు తోడయితేనే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి ఎంత పెరిగినా దాంతోపాటు దేశ జనాభా కూడా పెరుగుతూ వస్తోంది. కొంతకాలానికి రసాయన ఎరువుల వాడకం వల్ల నేలలో సారం తగ్గిపోయింది. దాన్ని పూడ్చడానికి మరింత ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు వాడాల్సి వచ్చింది. అంతేకాదు, వాటి వాడకం వల్ల నీరు, నేల, గాలి అన్నీ కలుషితమవడం మొదలైంది. ఆ తర్వాత కాలంలో హైబ్రిడ్ విత్తనాల వాడకంతోపాటు కలుపు నివారణకి కూడా రసాయనమందుల వాడకం ప్రారంభమైంది. ఇప్పుడు బిటి కాటన్ వచ్చేసింది. మరెన్నో బిటి కూరగాయలు రాబోతున్నాయి. ఇదిలా ఉంటే ధర ఎక్కువగా ఉండే కొన్ని పంటలకి మార్కెట్లో డిమాండ్ ఉండడంతో రైతులు ఆ పంటలవైపు మొగ్గుచూప సాగారు. వాటిని పండించడానికి భూగర్భజలంపై ఎక్కువగా ఆధారపడసాగారు. ఆరుతడి పంటలు పండించడం తగ్గిపోయింది. దానివల్ల పప్పుధాన్యాల సాగు, నూనెగింజల ఉత్పత్తీ తగ్గిపోయాయి, వాటి ధరలు పెరిగాయి.

మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరినపుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ఆహార ధాన్యాల ధరలు మన దేశంలో కన్నా ఎక్కువగా ఉన్నాయి. అందుకే అందులో చేరితే మన ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముకోవచ్చని మనపై అంతర్జాతీయంగా వత్తిడి పెరిగింది. అయితే మనం చేరిన కొంతకాలానికే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగొచ్చాయి. అక్కడ ధరలు తగ్గడంతో స్థానికంగా కూడా తగ్గించాల్సి వచ్చింది. దాని ప్రభావం రైతులపై పడింది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. నష్టాల్ని పూడ్చుకునే ఆర్థికసామర్ధ్యం లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో ఎంతోమంది దాన్ని వదిలేస్తున్నారు కాబట్టి ఆహారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలోనే కాదు, ఇంకా చాలా దేశాల్లో రైతులది ఇదే పరిస్థితి. ఉత్పత్తి వ్యయం పెరిగిపోతున్నా దానికి తగ్గట్టుగా ధరలు మాత్రం పెరగడం లేదు. రైతులు కోరుకునేదల్లా ఒక్కటే. తాము పండించే పంటలకి తగిన ధర ఉండాలని, ఆదాయం రావాలని. అది కోరుకోవడం కూడా తప్పేనా?

- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

Gouthamaraju as WUA