పాడి పంటలు

Showing posts with label India. Show all posts
Showing posts with label India. Show all posts

Saturday, August 11, 2012

బడుగుల B-School


బడా వ్యాపారవేత్తలకు పనికొచ్చే బిజినెస్ స్కూళ్లు నగరానికొకటి ఉన్నాయి. కాని, చిరు వ్యాపారుల్ని, నిరుపేదల్ని పైకి తెచ్చే స్కూళ్లు? అలాంటివి కూడా ఉంటాయా అనుకుంటున్నారా! ఎక్కువ లేవు కాని ఒకటైతే ఉంది. మహారాష్ట్రలోని సతారా జిల్లా మహ్‌సవడ్‌లో ఉంది ఓ బడుగుల బి-స్కూల్. మహిళల కోసమే నెలకొల్పిన దాని పేరు 'మాన్ దేశీ బిజినెస్ స్కూల్'. మేదర్లు, వడ్రంగులు, కమ్మర్లు, కుమ్మర్లు, తోపుడుబండ్ల, పూల అంగళ్ల, కూరగాయల వ్యాపారులు.. వీళ్లే అక్కడ విద్యార్థులు.


వనిత, MDBS.

ఎంబీబీఎస్ గురించి తెలుసు, ఎంబీఏ సంగతీ తెలుసు. మరి, ఈ కొత్త కోర్సు గురించి ఎప్పుడూ వినలేదే? ఎక్కడుంది..? అనే ముందు వనిత గురించి నాలుగు ముక్కలు. ఒకప్పుడు ఆమె కోళ్లఫారం యజమాని. ఒక రోజు ఉన్నట్లుండి వైరస్ సోకింది. కోళ్లన్నీ రాత్రికి రాత్రే చనిపోయాయి. అప్పుల్లో చిక్కుకున్న వనితకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. ఆ సమయంలో కూలిపోయిన తన కుటుంబాన్ని తిరిగి నిలబెట్టింది ఎండిబిఎస్ చదువు. కోర్సు పూర్తయ్యాక బ్యాంకులో రుణం తీసుకుని.. డిస్పోజబుల్ (వాడి పారేసే) కప్పులు, ప్లేట్లను ఉత్పత్తిచేసే యూనిట్‌ను ప్రారంభించింది. ఇప్పుడు తన దగ్గర 12 యంత్రాలు, పది మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ మధ్యన ప్రధాని మన్మోహన్‌సింగ్ చేతుల మీదుగా అవార్డును సైతం అందుకుందీ వనిత. ఆమె చదువుకున్నది ఏ ఖరీదైన బిజినెస్ స్కూల్‌లోనో కాదు. కేవలం రూ.25 ఫీజు చెల్లించి 'మాన్ దేశీ బిజినెస్ స్కూల్'లో చదివిందంతే.

మనకు తెలిసిన బి-స్కూల్ అంటే.. సువిశాలమైన క్యాంపస్. హంగూఆర్భాటం. సూటుబూటు. లక్షల్లో ఫీజులు. క్యాంపస్ ఇంటర్వ్యూలు. భారీ వేతన ప్యాకేజీలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ధనికుల్ని మరింత ధనికులుగా తీర్చిదిద్దేది. కంపెనీలను లాభాల బాటపట్టించే ఉద్యోగులను ఉత్పత్తిచేసేది. కాని, "సారె తిప్పినా బండి నడవని కుమ్మరికి, బడిసె పట్టుకున్నా బతకలేని వడ్రంగికి, ఎన్ని బుట్టలల్లినా కాసింత బువ్వ తినలేని మేదరికి.. బతుకు పాఠాలు బోధించే బడులను ఎందుకు స్థాపించలేకపోతున్నాం..'' అనుకుంది ఒక మహిళ. ఆమె పేరు చేత్నా గలా సిన్హా.

కరువుకు పరిష్కారం..

ముంబయికి చెందిన సిన్హా అందరూ నడిచే దారిలో నడవరు. ఆమెది ఎప్పుడూ భిన్నమైన మార్గం. అభివృద్ధి అంటే పైనున్న వాళ్లను మరింత పైకి తీసుకెళ్లడం కాదు. అట్టడుగునున్న గ్రామీణపేదల్ని పైకి తీసుకురావడం. అలాగే కనుమరుగైపోతున్న వృత్తులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురావడం.. అనుకుంది ఆమె. మహారాష్ట్రలోని సతారా, షోలాపూర్, సంగ్లి, రాయ్‌గడ్, రత్నగిరి, కొల్హాపూర్ కరువు ప్రాంతాలు. ప్రతి పల్లెలోనూ సగానికి పైగా బడుగు బలహీన వర్గాల ప్రజలే నివసిస్తుంటారు. అరకొర నీళ్లున్న చోట చెరకు, జొన్న, మొక్కజొన్న పండితే పండినట్లు. లేకపోతే గడ్డి కూడా మిగలదు. రైతుల పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే ఇక కూలీల అగచాట్లు చెప్పనక్కర్లేదు.

విషయం తెలుసుకున్న చేత్నా గలా సిన్హా 'మాన్' తాలూకాకు వెళ్లింది. ప్రజల బాధలు అర్థం చేసుకుంది. కేవలం మహిళల కోసం 'మాన్ దేశీ ఫౌండేషన్'ను నెలకొల్పింది. దీని కిందే 'మాన్ దేశీ బిజినెస్ స్కూల్', 'మాన్ దేశీ మహిళా బ్యాంక్'లను ఏర్పాటు చేశారామె. ఇప్పుడా బ్యాంకులో 1.14 లక్షల సభ్యులు ఉన్నారు. చిరు వ్యాపారులు, నిరుపేదలు ఆ బిజినెస్ స్కూల్లో నైపుణ్యాలను నేర్చుకుంటారు. బ్యాంకులో రుణాలు తీసుకుని.. ఉపాధి పొందుతారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడు.. వారికి సంఘంలో గౌరవం లభిస్తుంది. నాణ్యమైన జీవితంతోపాటు పిల్లలకు చదువులు అబ్బుతాయి. స్థూలంగా మాన్ దేశీ ఫిలాసఫీ ఇదే!

దిశదిశలా స్ఫూర్తి..

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బి- స్కూళ్లకు పాఠ్యాంశాలను రూపొందించడం కంటే.. మాన్ దేశీ బిజినెస్ స్కూల్‌కు పాఠ్యప్రణాళిక తయారు చేయడం చాలా కష్టం. ఇందులో విద్యార్థులంతా దినకూలీలు, గాజులు అమ్ముకునేవారు, వడ్రంగులు, మేదర్లు, దర్జీలు, తాపీమేస్త్రీలు, బడి మానేసిన పిల్లలు. అందులోనూ అందరూ ఒక వయస్కులు కాదు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య వాళ్లు. మూడోవంతు మందికి వేలిముద్రలు వేయడం ఒక్కటే తెలుసు. "బ్యాంకు అకౌంట్లు, లోన్లు, చెక్కులు, డిడిలు వంటి చిన్న చిన్న విషయాలను అర్థమయ్యేలా చెప్పడం ఒక పెద్ద సవాలు. రకరకాల ప్రయోగాలతో బోధించినా ఫలితం లేకపోయేసరికి.. పల్లెల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న జానపద గాథలు, నాటకాల ద్వారా ఆర్థిక పాఠాల్ని చెప్పాం. పరిస్థితి కొంత వరకు మెరుగుపడింది..'' అన్నారు స్కూల్ టీచర్లు.

మాన్ దేశీ స్కూల్ పాతిక కోర్సులను అందిస్తోంది. కోర్సును బట్టి రెండు రోజుల నుంచి మూడు మాసాల కాలవ్యవధి ఉంటుంది. ప్రత్యేక కోర్సులకైతే ఏడాది నుంచి రెండేళ్లు పడుతుంది. రూ.25 నుంచి రూ.1200 మధ్యన ఫీజులు ఉంటాయి. ఫైనాన్షియల్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, వొకేషనల్ ట్రైనింగ్, మేనేజ్‌మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్, డ్రెస్ డిజైనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఇన్‌స్ట్రక్షన్.. వంటి కోర్సుల్లో తర్ఫీదు ఇస్తారు. ఉదాహరణకు - బుట్టలల్లే వ్యాపారి మార్కెట్‌ను ఎలా విస్తరించుకోవచ్చు? ఇనుపసామాన్లు రిపేరు చేసే నిపుణుడికి మరమ్మతు పరికరాలు ఎక్కడ దొరుకుతాయి? ముడిసరుకుల్ని ఎప్పుడు కొనాలి? వినియోగదారులతో ఎలా మాట్లాడాలి? బ్యాంకుల్ని ఎలా సంప్రదించాలి? అప్పులు, రుణాలు, వడ్డీలు, బీమా, పింఛను, సబ్సిడీలు.. ఇలా ఒక్కటేమిటి? ఆర్థికంతో ముడిపడిన ప్రతి అంశాన్నీ పాఠంగా చెబుతారు. ఈ విషయాలన్నీ అవగాహన లేకే.. చిరువ్యాపారులు రాణించలేకపోతున్నారంటుంది మాన్ దేశీ సంస్థ. వ్యాపారంలో నైపుణ్యం లేని వారికి కూడా శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్నారు. కోర్సు పూర్తయిన వెంటనే కచ్చితంగా ఉపాధి దొరికే కోర్సులకే ప్రాధాన్యం ఉంటుంది.

మాన్ దేశీ స్కూల్ గురించి ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఏల్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్, డ్యూక్, చికాగో యూనివర్శిటీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల్ని ఇక్కడికి పంపించి అధ్యయనం చేయిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా మాన్ దేశీ గురించి ఆసక్తి చూపించారు. ఆయన భారత్‌కు వచ్చినప్పుడు తనను కలవమని చేత్నా గలా సిన్హాకు ఆహ్వానం పంపించారు. ముంబయికి వెళ్లిన చేత్నా ఒబాను కలిసి.. మాన్ దేశీ గురించి వివరించారు. "ప్రపంచంలోనే బడుగుల కోసం ఏర్పాటు చేసిన బిజినెస్ స్కూల్ ఇదొక్కటే. ఇలాంటి స్కూళ్ల వల్ల పేదరికానికి పరిష్కారం దొరుకుతుంది.

వృత్తుల్ని నాశనం కాకుండా కాపాడుకోవచ్చు..'' అంటూ 'ద బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్' ప్రశంసించింది. ప్రస్తుతం పేరున్న అంతర్జాతీయ బిజినెస్ స్కూళ్లన్నీ మాన్ దేశీ స్కూల్‌కు నిధులను, బోధనా సహాయాన్ని అందిస్తున్నాయి. హెచ్ఎస్‌బిసి, యాక్సెంచర్, ఎస్ఐడిబిఐ, నబార్డ్ వంటి సంస్థలు తోడ్పాటునివ్వడం వారికి కలిసొచ్చింది. ఇప్పటివరకు 30 వేల మంది మాన్ దేశీ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నారు. వీరిలో డెభ్బైశాతం మంది చిరువ్యాపారాలను విజయవంతంగా చేసుకుంటున్నారు. వీరందరికీ ఆర్థిక అక్షరాస్యత పెరగడమే కాకుండా.. జీవితం పట్ల ఆత్మవిశ్వాసం ఏర్పడిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రయోగాల పాఠశాల..

మాన్ దేశీ స్కూలు ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంది. సాధారణ కోర్సులతో సరిపెట్టుకోకుండా.. ప్రత్యేక కోర్సులను డిజైన్ చేస్తోంది. అలాంటి కొత్త కోర్సుల్లో ఒకటి 'బ్రాండెడ్ దేశీ ఎంబీఏ'. ఇందులో బ్రాండింగ్, అడ్వర్‌టైజింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌లలో తర్ఫీదునిస్తారు. అమెరికాకు చెందిన యాక్సియోన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కోర్సుకు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంత చేస్తున్నా.. ఇంకా ఎంతోమంది ఔత్సాహికులకు ఈ బిజినెస్ స్కూల్‌లో చదువుకునే అవకాశం దొరకడం లేదు. అందుకే, చేత్నా గలా సిన్హాకు కొత్త ఆలోచన తట్టింది. అదే 'మొబైల్ బిజినెస్ స్కూల్'. ఈ కార్యక్రమానికి మాన్ దేశీ ఉద్యోగిని అని పేరుపెట్టారు. బస్సులోపల చక్కటి తరగతి గదిని ముచ్చటగా డిజైన్ చేశారు.

ఇది బ్యాటరీతో ఎనిమిది గంటల సేపు పనిచేస్తుంది. కంప్యూటర్లు, బ్లాక్‌బోర్డులు, వీడియోతెరలు అన్నీ ఉన్నాయి ఇందులో. "వాళ్లు మా దగ్గరికి రావడం కష్టమైతే, మేమే వాళ్ల దగ్గరికి వెళ్లాలన్నది మా ఆలోచన. దాని ఫలితమే ఈ మొబైల్ స్కూల్. ఇప్పటి వరకు బస్సులోనే తొమ్మిది వేల మందికి చదువుకునే అవకాశం కల్పించాం...'' అని చెప్పారు మాన్ దేశీ నిర్వాహకులు. తొలిదశలో కర్ణాటకలోని హుబ్లీలో మాత్రమే మొబైల్ స్కూల్‌ను నడుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. "నేను ఇంట్లో కుట్టు పని చేస్తాను. ప్రస్తుతం కంప్యూటర్ ఆపరేటర్‌గా శిక్షణ తీసుకుంటున్నాను. మా ఊర్లో కరెంటు బిల్లులు చెల్లించే షాపును పెట్టాలనుకుంటున్నాను. అందుకు సరిపడా సామర్థ్యం వచ్చిందిప్పుడు నాకు'' అని చెప్పింది పాతికేళ్ల భూమిక సారె.

లోకల్ రేడియో..

మాన్ దేశీ ఫౌండేషన్ పాపులారిటీ కారణంగానే ఈ స్కూలుకు కూడా ఇంత పేరు వచ్చింది. ఎందుకంటే ఈ ఫౌండేషన్ గత పదిహేనేళ్లుగా మహారాష్ట్రలోని కరువు జిల్లాల్లో మహిళాభివృద్ధి కోసం ఎంతగానో పనిచేస్తోంది. విద్య, వైద్యం, ఆర్థిక అక్షరాస్యత, పర్యావరణం, స్వయం సహాయక బృందాల గురించిన చైతన్యం తీసుకొస్తోంది. అది పేదల్ని మేల్కొలిపేందుకు 'మాన్ దేశీ తరంగ్' అనే కమ్యూనిటీ రేడియోను నెలకొల్పింది. చుట్టుపక్కల పల్లెల్లో ఈ రేడియో కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. నాటకాలు, కథల రూపంలో పౌష్టికాహారం, అంటురోగాలు, అక్షరాస్యత పట్ల నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులైన ఎయిడ్స్ గురించి అప్రమత్తం చేస్తున్నారు. ప్రసారాల్లో గ్రామీణులను కూడా భాగస్వాములను చేస్తోంది రేడియో. ఓటరుకార్డు ఎలా తీసుకోవాలి? బియ్యం కార్డు ఎక్కడ పొందవచ్చు? పండ్లు, కూరగాయల్ని ఎలా పండించుకోవచ్చు? వారసత్వ ఆస్తుల్లో మహిళలకు ఎందుకు వాటా దక్కడం లేదు? ఇలాంటి కార్యక్రమాలతోపాటు.. మాన్ దేశీ బిజినెస్ స్కూల్ కోర్సుల వివరాలు, ప్రవేశ సమాచారాన్ని కూడా ప్రసారం చేస్తుంటారు.

పల్లె వెలుగులు..

మాన్ దేశీ ఫౌండేషన్ పదుల సంఖ్యలో సేవా కార్యక్రమాలను అమలు చేస్తోంది. 'మాన్ దేశీ ఛాంపియన్స్' పేరుతో గ్రామీణ క్రీడాకారులకూ ప్రోత్సాహమిస్తోంది. ఫుట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్‌లకు కావాల్సిన పరికరాల్ని, దుస్తుల్ని సమకూరుస్తున్నారు నిర్వాహకులు. "గ్రామాలతో మాకు విస్తృతంగా సంబంధాలు ఉండడం వల్ల.. బడి మానేసిన పిల్లలందరూ మా బిజినెస్ స్కూల్‌లో చేరగలుగుతున్నారు'' అంటున్నారు సంస్థ ప్రధాన కార్య నిర్వహణాధికారిణి వనితాషిండే.

ఒకసారి ఆస్మా తంబోలి అనే అమ్మాయి వాళ్ల ఆఫీసుకు వచ్చింది. తనకు ఏదైనా పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇస్తే చేస్తానంది. "ఇంత చిన్న వయసులోనే నీకెందుకు ఉద్యోగం'' అని ప్రశ్నించారు సంస్థ ప్రతినిధులు. "ఊరి నుంచి బడికి వెళ్లాలంటే చాలా దూరం. సైకిల్ కొనివ్వమని తల్లిదండ్రులను అడిగితే బడి మానేయమన్నారు'' అని సమాధానం ఇచ్చింది. ఉద్యోగంలో చేరితే వచ్చే జీతంతో సైకిల్ కొనుక్కుని బడికి వెళ్లాలన్నది ఆ అమ్మాయి ఆలోచన. ఆ అమ్మాయి అనుభవాన్నే స్ఫూర్తిగా తీసుకుంది మాన్ దేశీ సంస్థ. 'ఫ్రీడం రైడర్' పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిరుపేద పిల్లలకు వడ్డీలేని రుణాలతో సైకిళ్లను పంపిణీ చేసింది. దీనివల్ల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది.

మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. దానికొక మార్గం కనిపెట్టింది మాన్ దేశీ. ఎండకు, వానకు గంటల తరబడి కూర్చోవడం వల్లే.. అనారోగ్యం పాలవుతున్నట్లు వైద్యులు నిర్ధ్దారించారు. చిరువ్యాపారులు పనిదినాలను కోల్పోవడం వల్ల అప్పులు పెరిగిపోతాయి కదా. కొంత ఆలోచించాక మార్కెట్‌లోని ప్రతి చిరువ్యాపారికి పెద్ద గొడుగును అందించే 'అంబ్రెల్లా ప్రోగ్రామ్'ను ప్రవేశపెట్టింది మాన్ దేశీ. వాళ్లు ఆశించిన ఫలితాలే వచ్చాయి.

చిన్నకారు రైతుల్ని గట్టెక్కించేందుకు ఉచిత భూసార పరీక్షలు, పశు వైద్యం, పాడి పోషణ మొదలైన సదుపాయాల్ని కూడా కల్పిస్తున్నారు. మహిళల ఆధ్వర్యంలో పాలడైరీలను కూడా ఏర్పాటు చేశారు.
"మాన్ దేశీ బ్యాంకు, మాన్ దేశీ స్కూలు ఇవి రెండూ మాకు రెండు కళ్లులాంటివి. నాకు బాల్యవివాహం అయింది. భర్త చనిపోయాడు. స్కూల్‌లో చేరాక.. కొత్త జీవితం మొదలైంది. గతంలో నాకైతే నోట్లను లెక్కపెట్టడం కూడా చాతనయ్యేది కాదు. ఇప్పుడు ఎంత మొత్తానికి ఎంత వడ్డీ అవుతుందో నోటికి చెప్పేస్తున్నా...'' అంటోంది లక్ష్మీ షీలర్. మాన్ దేశీలో చదువుకున్న మరో గ్రాడ్యుయేట్ నందిని లోహర్. ఆమె గోండవ్‌లె కర్మరాజ్ గుడి దగ్గర దేవుని పటాలు అమ్ముతుంటుంది. ఒకప్పుడు భవిష్యత్తు ప్రణాళిక ఉండేదే కాదు. "పండుగలు, ఊరేగింపులు, జాతర్లప్పుడు.. గుడికి భక్తుల సందడి చాలా ఎక్కువ. కాని, నా చేతిలో రూపాయి ఉండేది కాదు. డిమాండ్‌కు తగినట్లు పటాలను పెట్టలేకపోయేదాన్ని. స్కూల్‌లో చేరా ముందే ముడిసరుకును ముందే ఎందుకు కొనాలో అర్థమైంది. అందుకే సీజన్ రాక ముందే కలప ఫ్రేములు, గ్లాసు, కటింగ్ పరికరాలు, పోస్టర్లు కొనుక్కొచ్చి దాస్తాను. సీజన్ వచ్చేనాటికి పటాలు తయారుచేసి ఉంచడంతో లాభాలు పెరిగాయ్..'' అంటూ చెప్పుకొచ్చింది నందిని.

రైతులకు కూడా చేయూతనిస్తోందీ సంస్థ. ఈ ఏడాది మన రాష్ట్రంలోలాగే మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవడం లేదు. సతారా ప్రాంతంలో కరువు వల్ల పాడి పశువుల్ని అమ్మేసుకోవాల్సి వస్తోందని మాన్ దేశీ స్కూల్‌లో చేరిన నిరుపేదలు సంస్థ దృష్టికి తీసుకొచ్చారు. వాళ్లు వెంటనే స్పందించి ఉచిత పశు సంరక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి పరిసర గ్రామాల ప్రజలు పశువుల్ని, మేకల్ని తోలుకొస్తే వాటికి గడ్డి, దాణాతోపాటు రైతులకు ఉచిత భోజన వసతులు కల్పించారు. దీంతో రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ శిబిరాన్ని సందర్శించారు. వర్షాలు జోరందుకునే వరకు శిబిరాన్ని కొనసాగించనున్నట్లు మాన్ దేశీ ప్రకటించింది.

వారెన్ బఫెట్ ఆసక్తి...

"మాన్ దేశీ బిజినెస్ స్కూల్‌లో బోధించే ఆర్థిక పాఠాలు ఏ పుస్తకాల్లోనూ కనిపించవు. నిరుపేదల జీవితాలను అధ్యయనం చేసి తయారుచేసినవి ఇవి. ఉదాహరణకు మీకొక విషయం చెబుతాను.. భారతదేశంలో మగవాళ్లకు తాగుడు అలవాటు ఎక్కువ. నిరుపేదల్లో ఇది మరీ ఎక్కువ. మగవాళ్ల తాగుడు వల్ల తీవ్రంగా నష్టపోతున్నది ఆడవాళ్లే! రోజూ కూలికి వెళ్లి వందో రెండొందలో ఇంటికి తీసుకొస్తే.. దాని కోసం మగవాళ్లు కూచుక్కూర్చుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు సెంటిమెంటును వాడుకున్నాం. ఇంట్లో దాచుకున్న డబ్బుల్ని లాక్కెళ్లడం చాలా సులువు. అదే, భార్య మెడలో వేసుకున్న బంగారు గొలుసులనో, చేతులకు తొడుక్కున్న గాజులనో తీసుకెళ్లడం కొంత వరకు కష్టం. అలా చేసిన మగవాళ్లను మా సమాజం గౌరవించదు. అందుకే, ఆడవాళ్లందరూ అంతో ఇంతో డబ్బు కూడబెట్టుకున్నాక బంగారాన్ని కొనమని ప్రోత్సహించాం. మంచి ఫలితాలు వచ్చాయి. సమస్య చాలా వరకు తగ్గింది..''

చేత్నా గలా సిన్హా ప్రసంగం పూర్తి కాకముందే.. ఓ పెద్దాయన లేచి నిల్చుని చప్పట్లు కొట్టాడు. ఇదొక మంచి ఆర్థికపాఠం అన్నారు. ఆయన ఎవరో కాదు ప్రపంచంలోనే అపర కుబేరుడైన వారెన్ బఫెట్. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అమెరికాకు ఆహ్వానిస్తే.. చేత్నా అమెరికాకు వెళ్లింది. ఆ సమావేశానికి బిల్‌గేట్స్, వారెన్ బఫెట్‌లాంటి హేమాహేమీలంతా హాజరయ్యారు. ఆమె ప్రసంగానికి ఎంతోమంది దాతలు స్పందించారు. బడుగుల బిజినెస్ స్కూల్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మా వృత్తికి గౌరవం తీసుకొచ్చాను..

బుట్టలు అల్లే మేదరి వృత్తి మాది. మాన్ దేశీ బిజినెస్ స్కూల్‌లో చేరేవరకు వ్యాపార కిటుకులు నాకు పెద్దగా తెలియవు. కోర్సు పూర్తయ్యాక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుంది. ఇదివరకు అప్పటికప్పుడు వెదురు తెచ్చుకుని బుట్టలు అల్లి అమ్ముకునేదాన్ని. మార్కెట్ గిరాకీ కూడా తెలిసేది కాదు. గతంలో మధ్యవర్తుల నుంచి వెదురు కొనడం వల్ల గిట్టుబాటయ్యేది కాదు. ఇప్పుడు రైతుల నుంచే నేరుగా కొంటున్నాను. మా ఊరి నుంచి ముంబయికి 270 కిలోమీటర్లు. బుట్టల్ని ముంబయి తీసికెళ్లి అమ్మేందుకు ప్రణాళిక సిద్ధం చేశాను. దీన్నే వ్యాపార పరిభాషలో బిజినెస్ ప్లానింగ్ అంటారట. ఆ విషయాన్ని స్కూల్‌లో చెప్పార్లెండి.

ముంబయిలోని పండ్లు, కూరగాయల వ్యాపారులతో సంప్రదింపులు జరిపాను. రెగ్యులర్‌గా బుట్టల్ని కొనేందుకు వారు ఒప్పుకోవడంతో నాకు ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు బుట్టలు కొనేవాళ్లే లేరని దిగులుపడేదాన్ని. ఇప్పుడు ఎంత పని చేస్తే అంత మార్కెట్ ఉందని అర్థమైంది. బస్సు ఎక్కాలంటేనే భయపడే నేను ఇప్పుడు సెల్‌ఫోన్‌లో వ్యాపారులతో మాట్లాడుతున్నాను. చెక్కుల మీద సంతకాలు చేస్తున్నాను. నెలకు ఒకసారి నేనొక్కదాన్నే ముంబయికి వెళ్లి వస్తున్నాను. ఒకప్పుడు నన్ను ఊర్లో వాళ్లు పేరు పెట్టి పిలిచేవాళ్లే కాదు. ఇప్పుడు 'మాలన్‌గారు' అంటున్నారు. నాద్వారా మా వృత్తికి కూడా గౌరవం పెరిగినందుకు సంతోషంగా ఉంది.
- మాలన్, మేదరి వృత్తి


* సండే డెస్క్, Andhra Jyothy

Monday, April 2, 2012

దేశవాళి ఆవులే మేలు


  దేశంలోని గోజాతిని దేశవాళి, విదేశీ, సంకర జాతులుగా విభజించవచ్చు. మిగిలిన రెండు జాతుల కంటే స్వదేశీ ఆవులు ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన అధిక ఉష్ణ పరిస్థితుల్లో కూడా పాల దిగుబడులలో తేడా లేకుండా ఉంటాయి. బాహ్య పరాన్న జీవులను తట్టుకోగలిగిన సామర్థ్యం ఎక్కువగా ఉండడం వలన వీటికి ఆరోగ్య సమస్యలు తక్కువ. ఈ లక్షణాలు సంకర, విదేశీ జాతి ఆవుల్లో దాదాపు కనిపించవంటున్నారు మండపేటలోని రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రానికి చెందిన ఏడీఏలు డాక్టర్ విజయకుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్‌బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఇది. ఇందులో స్వదీశీ జాతుల విశిష్టత, వివిధ రాష్ట్రాల్లో పేరొందిన జాతుల గురించి వివరిస్తున్నారు...


  దేశీయ ఆవులు స్థానికంగా లభించే తక్కువ పోషక విలువలు కలిగిన గడ్డిని సమర్థవంతంగా వినియోగించుకుని విదేశీ, సంకరజాతి ఆవులు అందించే వెన్న శాతం కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాయి (4-5 శాతం). దీనికి విరుద్ధంగా విదేశీ, సంకరజాతి ఆవులు ఎక్కువ దాణా, ఎక్కువ పోషకాలున్న గడ్డిని మేపినపుడు మాత్రమే ఎక్కువ పాల దిగుబడినిస్తాయి. అంతేకాక వీటి పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. 1995, 2007లలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో స్వదేశీ జాతుల్లో దూడల మరణాలు కేవలం ఐదు శాతం కాగా అదే విదేశీ హెచ్‌ఎఫ్ జాతి దూడల్లో 31 శాతం, జెర్సీ దూడల్లో 28.3 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడైంది.


  జాతీయ పశు జన్యు సంపద సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్) వారు ప్రకటించిన భారతీయ గోజాతుల సంఖ్య 30. ఇందులో కొన్ని పాల ఉత్పత్తికి, ఎక్కువ భాగం వ్యవసాయ, రవాణా పనులకు పేరొందాయి. మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరు, కర్నాటకలోని హాలీకార్, ఖిల్లారి, క్రిష్ణవేలీ, మల్నాడ్‌గిడ్డ, కేరళలోని వేచూర్, కాసరగడ్, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరీ, గుజరాత్‌లోని గిర్, రాజస్థాన్‌లోని రెడ్‌సింధీ, థార్‌పార్కర్, కాంక్రెజ్, రాథీ, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, పంజాబ్‌లోని సాహివాల్ జాతి ఆవులు, ఎద్దులు పాడికి, ఆయా పనులకు ప్రముఖంగా పేరొందాయి. వీటిలో ఇప్పటికే ఒంగోలు జాతి విశిష్టతను తెలుసుకున్నాం. మరికొన్ని జాతుల వివరాలు..

వేచూర్


కేరళ రాష్ట్రానికి చెందిన వేచూర్ జాతి ఆవులు, గిత్తలు పొట్టి జాతిగా పేరొందాయి. మన పుంగనూరు, కేరళ వేచూర్ జాతుల్లో ఏది ఎక్కువ పొట్టి అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. వేచూరి జాతి ఆవుల సగటు ఎత్తు 80-90 సెంటీమీటర్లు. గిత్తల ఎత్తు 85-95 సెంటీమీటర్లు కాగా పుంగనూరు జాతి పశువులు 60-100 సెంటీమీటర్ల ఎత్తుంటాయి. వేచూర్ జాతి పశువులు ఎక్కువగా లేత ఎరుపు లేదా నలుపు రంగులో ఉంటాయి.

శరీర నిర్మాణ పరంగా చిన్నవైనప్పటికీ వ్యవసాయ పనులకు ఈ గిత్తలు ప్రసిద్ధి. ఈ జాతి దూడలలో సహజ మరణాలు దాదాపు శూన్యం. ఆవులు శ్వాసకోశ, గాలికుంటు, పొదుగువాపు వ్యాధులను సమర్థవంతంగా తట్టుకోగలవు. రోజుకు సగటున 2.5 లీటర్ల నుంచి 3.5 లీటర్ల పాల దిగుబడినిస్తాయి. వేచూర్ జాతి ఆవు పాలను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు.


కాసరగడ్


కేరళకు చెందిన కాసరగడ్ జాతి పశువులు అధిక ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఇవి కూడా వేచూర్ జాతి మాదిరే పొట్టి రకం. వీటిలో ఆహారాన్ని వినియోగించుకునే సామర్థ్యం ఎక్కువ. కాసరగడ్ జాతి దూడలు సంవత్సరం వయసునాటికి అవి పుట్టిన నాటి బరువు కంటే 7-8 రెట్లు అధిక బరువు కలిగిఉంటాయి. వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఈ జాతి పశువులు పాల దిగుబడి కంటే వ్యవసాయ పనులకు బాగా పేరొందాయి.

మాల్వీ

http://www.krankykids.com/cows/daily_cow_images/M/malvi/malvi_1_web.jpg
మధ్యప్రదేశ్‌లోని మాల్వీ ప్రాంతంలో గుర్తించిన ఈ జాతికి ఆ ప్రాంతం పేరిట మాల్వీ అనే పేరు వచ్చింది. ఈ జాతి ఎద్దులు ప్రధానంగా బరువులు లాగే వ్యవసాయ పనులకు ప్రసిద్ధి. ఒండ్రు నేలలు, బంక మట్టి నేలల్లో పెద్ద పెద్ద నాగళ్లను లాగే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆవులు తక్కువ పాలదిగుబడినిస్తాయి.

పుంగనూరు ఆవులు

http://cdn1.wn.com/ph/img/a8/f1/004de760108ff11cc92e50004ca4-grande.jpg
మన రాష్ట్రానికి చెందిన పుంగనూరు జాతి ఆవు ప్రపంచ గోజాతుల్లో అతి చిన్నదిగా పేరొందింది. ఈ జాతి ఆవుల కన్నా మగ పశువులు మెతక స్వభావము కలిగి ఉంటాయి. చక్కని ముఖంతో, బూడిద రంగుతో బాగా వృద్ధి చెందిన మెడ, మూపురంతో ఉంటాయి. కురచకాళ్ళతో, గట్టి గిట్టలు కలిగి ఉంటాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన కొండలు, గుట్టలు, వాలు ప్రాంతాలను సులువుగా ఎక్కి దిగగలవు. ఈ జాతి పశువులు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటికి కరువు పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఉంది.

వీటి ఎత్తు 60 -100 సెంటీమీటర్లు, బరువు 130-200 కిలోలు. ఇవి కొత్త వారిని చూడగానే బెదురుతాయి. పుంగనూరు ఆవులు ఒక ఈతలో 1100 లీటర్ల వరకు (రోజుకు మూడు నుంచి మూడున్న లీటర్లు) పాలు ఇస్తాయి. చిన్నపాటి శరీరాకృతి కారణంగా వీటిని రైతులు వ్యవసాయ పనులకు తక్కువగా వినియోగిస్తున్నారు. అంతరించిపోతున్న ఈ జాతి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


 దేని ప్రత్యేకత దానిదే
గోజాతికి మన దేశం పెట్టింది పేరు. ఏ జాతి ప్రత్యేకత దానిదే. సామర్థ్యాన్ని బట్టి పాల ఉత్పత్తికి ఉపయోగపడేవి కొన్నయితే పాల ఉత్పత్తితో పాటు వ్యవసాయ పనులకు కూడా ఉపకరించేవి మరి కొన్ని.

కేవలం వ్యవసాయ పనులకు మాత్రమే ఉపయోగపడే జాతులు కూడా ఉన్నాయని చెబుతున్నారు తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని రాష్ట్ర పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఏడీఏలు డాక్టర్ విజయ కుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్ బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగుతున్న నేపథ్యంలో వారు అందిస్తున్న కథనాల్లో ఇది అయిదోది...


మన రాష్ట్రంలోని ఒంగోలు, పుంగనూరు, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, కేరళలోని వేచూర్, కాసరగడ్ జాతుల ఆవుల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ వారం కర్ణాటకలోని కృష్ణావ్యాలీ, మల్నాడుగిడ్డ, అమృతమహల్, హల్లికార్, ఖిలారీ, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరి జాతుల విశిష్టతల గురించి తెలుసుకుందాం.


పాల దిగుబడి స్థిరంగా ఉండదు

కృష్ణావ్యాలీ జాతిని ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఒండ్రు, నల్లరేగడి నేలల్లో వ్యవసాయాధారిత పనుల కోసం అభివృద్ధి చే శారు. గిర్, ఒంగోలు, కాంక్రెజ్, హల్లికార్ జాతుల్ని సంకరపరచి వీటిని అభివృద్ధి చేశారు. వీటి శరీరంపై బూడిద తెలుపు, తెలుపు, గోధుమ, నలుపు రంగులు కలగలసిన మచ్చలు ఉంటాయి. గిర్, ఒంగోలు జాతుల్ని సంకరపరచి అభివృద్ధి చేసిన కృష్ణావ్యాలీ ఆవు సగటున రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల పాల దిగుబడి ఇచ్చినప్పటికీ అది స్థిరంగా ఉండదు. గిట్టలు మెత్తగా ఉండడం వల్ల ఈ జాతి గిత్తలు, ఎడ్లు ఒండ్రు నేలలు, బంకమట్టి నేలలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో మంచి పనితనాన్ని ప్రదర్శిస్తాయి.

పనిలో దిట్ట
మల్నాడుగిడ్డ ఆవులు గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనులకు ప్రసిద్ధి చెందినవి. పొట్ట, డొక్కల వైశాల్యం తక్కువగా ఉండడం వల్ల తక్కువ మేత తింటాయి. అయితే పనిలో మాత్రం మంచి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. గాలికుంటు వ్యాధిని, వలసల కారణంగా సంక్రమించే వ్యాధుల్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. రోజుకు 1.5 లీటర్ల నుంచి నాలుగు లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి.

మైసూర్ రాజుల కాలం నుంచి...

మైసూర్ రాజుల కాలంలో అమృతమహల్ జాతి ఆవులు బాగా వృద్ధి చెందాయి. అప్పట్లో సైనిక వాహనాల్ని నడిపేందుకు వీటిని ఉపయోగించే వారు. ఆ తర్వాతి కాలంలో మైసూర్ సంస్థానాధీశుడు టిప్పుసుల్తాన్ ఈ జాతి ప్రత్యేకతను గుర్తించి మరింత అభివృద్ధి చేశాడు. వీటి విశిష్టతకు తగినట్లు అమృతమహల్...అంటే అమృత (పాలు) భాండమనే అర్థం వచ్చేలా పేరు పెట్టాడు. ఈ జాతి ఆవులు కొంత తెలుపు రంగులో ఉంటాయి. రోజుకు సగటున నాలుగు నుంచి ఆరు లీటర్ల పాలు ఇస్తాయి. ఇవి పాల దిగుబడికి, వ్యవసాయ పనులకు కూడా ఉపయోగపడతాయి.

దక్షిణాది ఆవులకు మాతృ జాతి

దక్షిణ భారతదేశంలోని పలు ప్రముఖ గోజాతులకు హల్లికార్‌ను మాతృ జాతిగా చెప్పవచ్చు. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల నిర్వహణలో దీనికి మంచి పేరు ఉంది. దీని శరీరం ప్రధానంగా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. తల పొడవుగా, మూతి భాగం మొనదేలినట్లు ఉంటుంది. నుదుటి నుంచి ముక్కు భాగం వరకూ కాలువ లాంటి గాడి కలిగి ఉంటుంది.

రవాణాకూ ఉపయోగపడతాయి

ఖిలారీ జాతి ఆవులు వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల్ని సమర్ధవంతంగా నిర్వర్తిస్తాయి. ఇవి గోధుమ, తెలుపు రంగులు కలగలిసిన రంగులో ఉంటాయి. తల సన్నగా ఉండి, పొడవైన కొమ్ముల మొదలు వద్ద ఇరు వైపులా ఉబ్బినట్లు ఉంటుంది. కొమ్ముల మొదలు నుంచి ముక్కు వరకూ గాడి ఉంటుంది. గిట్టలు దృఢంగా ఉండి వ్యవసాయ, రవాణా పనులకు బాగా ఉపయోగపడతాయి.

ప్రతికూల వాతావరణంలోనూ...

పొలం పనులకు, రవాణాకు కంగాయం జాతి పశువులు బాగా పేరు తెచ్చుకున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యం వీటికి ఉంది. మధ్యస్త పరిమాణంలో ఉండే ఈ పశువులు కేవలం పనికి మాత్రమే ఉపయోగపడతాయి. చురుకుగా, చలాకీగా ఉంటూ వేగంగా నడవడం వీటి సహజ స్వభావం. పనికి ఉపయోగపడే జాతిగా దక్షిణ భారతదేశంలో పేరు పొందాయి. శరీరం ముదురు బూడిద రంగులో ఉంటుంది. తల, మెడ, మూపురం, భుజాలు, మణుగుల వద్ద నల్లని మచ్చలు ఉంటాయి. ఈ జాతి ఆవులు ప్రతి 15 నెలలకు ఒకసారి ఈనతాయి. తేలికపాటి పొలాల్లో ఆవులతో సేద్యం చేస్తారు.

పాడికి పనికిరావు

తంజావూరుకు చెందిన స్థానిక గోజాతితో కంగాయం జాతిని సంకరపరచి ఉంబ్లాచెరి జాతిని అభివృద్ధి చేశారు. ఈ జాతి ఆవుల శరీర పరిమాణం మధ్యస్తంగా ఉంటుంది. పొట్ట చిన్నదిగా ఉంటుంది.

ఈ ఆవులు బూడిద రంగు, బూడిద నలుపు రంగుల్లో ఉంటాయి. ఇవి పాడికి పనికిరావు. ఎద్దులు చక్కగా పనికి ఉపయోగపడతాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత, రవాణా పనులకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
 

Tuesday, March 27, 2012

సేద్యం ఇక సాధ్యమా?

భారతదేశం మళ్ళీ డెబ్భై, ఎనభై దశకాల్లోకి వెళ్లి పోతోందా? ప్రత్యక్ష పన్నులపై ఆధారపడే ప్రగతిశీల పన్ను విధానం నుంచి, ప్రజలందరికీ భారమయ్యే పరోక్ష పన్నుల విధానం వైపు మళ్ళుతోందా? గతంలో సంక్షేమ పథకాల మాటున గారడీ చేసిన యూపీఏ ప్రభుత్వం హఠాత్తుగా ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించేసింది. ప్రణబ్ కొత్త బడ్జెట్టు, రైతుల సాగు ఖర్చును విపరీతంగా పెంచే ఎరువులు మరింత కరువయ్యేలా, బరువయ్యేలా, సబ్సిడీల తగ్గింపును చేపట్టింది. పన్నులు విపరీతంగా బాదేసింది. http://harddrink.files.wordpress.com/2011/07/indian-farmer-ploughing.jpg
వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడి, సరఫరా గొలుసులోని సమస్యలను సరిదిద్దడం, రహదారుల అభివృద్ధి, విమానయానం లాంటి పదాలు వున్నా, సమ్మిళిత అభివృద్ధి లాంటి పదాలు బడ్జెట్టులో మాయం చేసింది. ఆమ్ ఆద్మీ ఊసే లేదు. వృద్ధి ఇంకా కావాలి అని కాకుండా ఉన్న వృద్ధిని కాపాడుకొందాము అని, పైగా దానికి దేశీయ డిమాండు రికవరీ కావాలని సెలవిచ్చారు ఆర్థిక మంత్రి. వృద్ధి ద్వారా సంపద సృష్టి అనే 21వ శతాబ్ద సిద్ధాంతం మానేసి ఎనభైలలోని దేశీయ డిమాండు పెంపొందించటం అనే దృష్టి మళ్ళీ వచ్చేసిందేమో తేలీదు కానీ పన్నులని ఎడా పెడా పెంచేశారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మీద పెను ప్రభావం చూపించే సర్వీస్ పన్నులు పెంచారు. సబ్సిడీ తగ్గిస్తాము అంటూ, ఎరువుల ధరలు పెంచుతామని అన్యాపదేశంగానే చెప్పారు.

ప్రణబ్ బడ్జెట్టులోని లెక్కలు సరికావాలంటే పన్నేతర ఆదాయం 31.96 శాతం పెరగాలి. అంటే మళ్ళీ వేలం పాట (లేక 3 జి, 4 జి) పెట్టుబడుల ఉపసంహరణ లాంటి వాటి మీద ఆధారపడాలి. సబ్సిడీ బిల్లు కనీసం 12 శాతం తగ్గాలి. కానీ ఆహార సబ్సిడీ బిల్లే 30 వేల కోట్లు తినేస్తుంది. ద్రవ్యలోటుని 5.1 శాతానికి తెస్తామని చెప్పారు గానీ అది వీలుకాదని తెలుస్తూనే వుంది. కేల్కర్ కమిటీ ప్రకారం మార్కెట్టు నుంచి అప్పు చేయాలి. ఈ నేపథ్యంలో జీతాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు లాంటి వాటికి కూడా ప్రభుత్వం అప్పు చెయ్యబోతోంది. ఇంత అప్పు, ఇన్ని పన్ను లు ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుందో ప్రణబ్ మహాశయుడే చెప్పాలి.

ఎక్సైజ్ పన్ను రాబడి పెరిగింది; సర్వీస్ పన్నులని విపరీతంగా పెంచారు; కానీ ఇంకా మన స్థూల ఆర్థిక వనరులు అస్తవ్యస్తంగానే వున్నాయి. 2011 సంవత్సరం బడ్జెట్ సమయంలో గొప్పగా తన బడ్జెట్ ఆదాయానికి ఖర్చుకి తేడా -అంటే ద్రవ్యలోటు- కేవలం 4.6 శాతం మాత్రమే అని ప్రకటించారు ప్రణబ్. అందరూ ఆశ్చర్యపోయారు. చాలా మంది తప్పుబట్టారు. ఎందుకంటే ఆహారం, చమురు, ఎరువుల మీద ఖర్చు 2010 సంవత్సరంలోని లక్షా యాభైవేల కోట్ల కంటే తగ్గించి కేవలం లక్షా ముప్పైనాలుగు వేల కోట్లు మాత్రమే చూపించారు. చమురు, ఎరువులు, ఆహార ఖర్చు పెరుగుతాయే కానీ ఎలా తగ్గుతాయో ప్రజలెవ్వరికీ అర్థం కాలేదు. ప్రస్తుతానికి వస్తే బడ్జెట్‌లో ప్రణబ్ అసలు నిజాన్ని ప్రకటించారు.

పై మూడు పద్దుల కింద అయిన ఖర్చు 2,16,297 కోట్లు. దాదాపు 80 వేల కోట్లు క్రితం సారి తగ్గించి చూపించి అసలు ద్రవ్యలోటు అదుపు లోనే వుందన్నట్టు చూపించారు. క్రితంసారి 5.9 శాతం ఉన్న ద్రవ్యలోటుని ఈ సారి 5.1 శాతానికి తగ్గిస్తానని ప్రణబ్ చెప్పారు. కానీ ఇదెంత అసంబద్ధమంటే పన్నులన్నీ సరిగ్గా వసూలై, సబ్సిడీలు 26 వేల కోట్లు తగ్గిస్తే, ఆహార బిల్లు అమల్లోకి రాకపోతే కూడా కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే సాధ్యమవుతుంది.

ఈసారి పన్నుల రూపంలో దాదాపు 44 వేల కోట్లు అదనంగా వడ్డించారని బాధపడుతున్న ప్రజలకి రాబోయే నెలల్లో ఆహారం, ఎరువులు, చమురు మీద పడబోయే అదనపు భారం వివరాలు తలచుకుంటే చెమటలు పట్టక మానవు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆహార, చమురు, ఎరువుల సబ్సిడీ మీద ప్రభుత్వ ఖర్చు లక్షా తొంభై వేల కోట్లకు పడిపోతుందట! అంటే వాటి ధరలు తగ్గు తాయని కాదు.

ప్రభుత్వ సబ్సిడీని దశల వారీగా తగ్గిస్తూ రెండు శాతానికి పరిమితం చేస్తారని ! పెట్రోలు ఉత్పత్తుల మీద ఈ సంవత్సరం 68, 481 కోట్లు ఖర్చు పెడితే, రాబోయే సంవత్సరంలో దీన్ని 43, 580 కోట్లకి పరిమితం చేశారు. పెట్రో ఉత్పత్తుల డీ రెగ్యులేషన్ పేరుతో వాటి మీద దాదాపు యాభై శాతానికి పైగా పన్నును విధిస్తూనే, పెరిగే ధరలతో తనకు సంబంధం లేదని చెప్తోంది యూపీయే ప్రభుత్వం. అంటే ఆయిల్ కంపెనీలకు నష్టాలు అనే సాకుతో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచటం తథ్యం. డీజిల్ ధరలు పెరిగితే సామాన్యులు బస్సు చార్జీలనించి రైతుల సాగు ధరల వరకు అన్నీ పెరగడం అనివార్యం.
http://im.rediff.com/money/2011/feb/02agri1.jpg
వ్యవసాయానికి క్రితం సంవత్సరాని కంటే మూడు వేల కోట్లు ఎక్కువిచ్చామని ప్రణబ్ గొప్పగా చెప్పారు. కానీ ఎరువుల మీద క్రితం సంవత్సరం ఇచ్చిన 67, 198 కోట్ల కంటే ఈసారి పదిశాతానికి పైగా తక్కువ ఖర్చు పెడతామని చెప్పారు. మొన్న ఫిబ్రవరిలో నిర్ధారించిన ఎరువుల సబ్సిడీని పరిగణనలోకి తీసుకొంటే డీఏపీ, యూరియా, ఎంబిసీ మొదలగు వాటిపై 60, 974 కోట్లు మాత్రమే వస్తుంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వ సబ్సిడీ బకాయిలతో కలిపి దాదాపు 93,000 కోట్లకు చేరింది. దాన్ని ఇప్పుడు అరవైవేల కోట్లకు పరిమితం చేయడమంటే అంతర్జాతీయ ధరల పెరుగుదలను రైతుకు బదిలీ చెయ్యబోతున్నారన్న మాట. రైతులకి ఎరువుల ధరలు చుక్కలు చూపించబోతున్నాయి.

చమురు రేట్లు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతి చేసుకొనే ఎరువుల రేట్లు సహజంగానే పెరిగే అవకాశం ఉంది. యూరియా మూడవ వంతు, మిగతా ఎరువులను భారత్ సింహ భాగం దిగుమతి చేసుకొంటున్న నేపథ్యంలో, ఎరువులు మీద సబ్సిడీలను దశల వారీగా తగ్గిస్తామని చెప్పడం రైతుకు ఆశనిపాతమే. రైతుకి ఎరువుల ధరలు ఇంకా పెరిగితే సాగు ధర ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే సాగుధరకి, మద్దతు ధరకి ఎక్కడా సాపత్యం కుదరక తల్లడిల్లుతున్న రైతుకి ఎరువుల ధరలు ఇంకా పెరగడం రైతుకే కాదు, వినియోగదారులకీ నష్టమే.
http://www.microdinero.com/files/noticias/2298_2170_rural.jpg
ఇక రైతుని దొంగ దెబ్బ తీయబోయే అతి తీవ్రమైన సమస్య ఆహార సబ్సిడీ పథకం. 2012 కి ఆహార సబ్సిడీ కోసం 75 వేల కోట్లు చూపించారు. ఈ సారి ఆహార సబ్సిడీ పథకం అమలుచేస్తే కావాల్సింది సంవత్సరానికి 1, 02,000 కోట్లు. ఇప్పుడిచ్చినది కాకుండా మిగిలినది ఎలా ఇస్తారో ప్రభుత్వం చెప్పలేదు. ఈ ప్రభుత్వమే గొప్పగా నియమించిన స్వామినాథన్ కమిటీ అమలు గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. బహుశా ఆ సిఫార్సులు అమలు చెయ్యలేమని చెప్పిన శరద్ పవార్ స్ఫూర్తి గాబోలు. రైతులకి రుణాలు అయిదు లక్షల పాతిక వేల కోట్లకు పెంచామని అన్నారు. http://www.instablogsimages.com/images/2007/05/29/agriculture-scheme-pm_26.jpg
కానీ రైతులందరినీ సంస్థాగత రుణాల పరిధిలోకి తేవాలంటే కనీసం పది లక్షల కోట్ల రుణాలు పంపిణీ కావాలి. పైపెచ్చు ఇప్పుడు ప్రకటించిన రుణాలు ఇచ్చేది ప్రభుత్వం కాదు, బ్యాంకులు. వాటి మీద అదుపు లేనప్పుడు ఎన్ని కోట్లు ప్రకటించినా ప్రస్తుతం వున్న 30 శాతం లబ్ధిదారుల కంటే పెరిగే అవకాశమే లేదు. వ్యవసాయ ఉత్పత్తి రేటు 2.5 శాతానికి పడిపోయిన ఈ సమయంలో రైతులు ఆర్థిక మంత్రి వైపు ఆశగా చూసారు. కొన్ని వ్యవసాయ మిషన్లు ఏర్పాటుచేయడం తప్పిస్తే, పంట దిగుబడి పెంచే చర్యలు పెద్దగా కనబడవు.

స్థూలంగా వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడానికి కావాల్సిన ఫ్రేం వర్కు బడ్జెట్టులో లేదు. పైపెచ్చు రైతు నడ్డి విరిచే సబ్సిడీల తగ్గింపు వంటి చర్యలు వున్నాయి. ఈసారి ప్రణబ్, మన్మోహన్ ఇద్దరూ భారత ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పనిసరి అని చెప్తూ వచ్చారు. మన్మోహన్ అయితే మరో అడుగు ముందుకు వేసి సబ్సిడీ బుల్లెట్లు కొరకాల్సిందే అని పోకిరీ టైపులో సెలవిచ్చారు. కానీ ఆయన ఆర్థిక వేత్తగా మరిచిపోయిన దేమిటంటే, తమ ప్రభుత్వం ఆహార సబ్సిడీ అనే ఫక్తు వోటుబ్యాంకు పథకానికి ముప్పై వేల కోట్లకు పైగా సబ్సిడీ ఇవ్వబోతోందని. దానికి లేని ఇబ్బంది రైతులకి ఎరువుల సబ్సిడీ ఇవ్వడంలో ఎందుకు?
http://india.targetgenx.com/files/2008/04/farmer1.jpg
ఈ రైతు వ్యతిరేక చర్యలన్నీ ఒకే ప్రశ్న వేస్తాయి. దేశంలోని 60 శాతం పైగా ఉన్న రైతులకు ఉపయోగపడని డబ్బు, వృద్ధి ఎవరి కోసం? ప్రభుత్వం తన దగ్గర ఉన్న సంపదని నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి చేర్చకుండా, ఉన్న కాస్త సబ్సిడీలను తీసేస్తూ వాళ్ళ మీద ఇంకా పన్నులేస్తూ ఎవరి కోసం పని చేస్తున్నట్టు? http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-02.jpg
ఇంతటి హ్రస్వ దృష్టినీ, చిత్తశుద్ధి లేమినీ, విధాన రాహిత్యాన్నీ నిలదీయాల్సిన పని, పోరాటం చేయాల్సిన పనీ రాజకీయ పార్టీలది. సాగు ఖర్చులు మూడొందల శాతం పైగా పెరిగి రైతు చితికి పోతూ ఉంటే ప్రతి పక్షంలోని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు పాలక పక్షాలపై ముప్పేట దాడిచేసి రైతుకు ఏదో మేరకు సాంత్వన చేకూర్చాలి. మేధావులెందరో అంటున్నారు గానీ, నిజానికి వ్యవసాయం సంక్షోభంలో లేదు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కంపెనీలు ఎవరూ సంక్షోభంలో లేరు.

మిల్లర్లు, దళారులూ కూడా సంక్షోభంలో లేరు. ప్రభుత్వ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని మరీ ఇబ్బడి ముబ్బడిగా పండిస్తున్నారు మన రైతన్నలు. ఈ రకంగా ఆహార సంక్షోభమూ లేదు. సంక్షోభంలో ఉన్నది రైతులు. రైతు కూలీలు, కౌలు రైతులు. వీరిని గట్టెక్కించే దీర్ఘకాలిక విధానాల రూపకల్పనలోనూ దీర్ఘకాలిక పోరాటాలలోనూ కలిసికట్టుగా పనిచేయడం రాజకీయ పక్షాల బాధ్యత.
http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-15.jpg
చిత్రంగా మన రాష్ట్రంలో మాత్రం, రైతు మిత్రులమని చెప్పుకునే చిట్టి పొట్టి పార్టీలు తమ పోరాటం ప్రధాన ప్రతిపక్షం పైన మళ్లిస్తూ ప్రజాగ్రహాన్ని పలుచన చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను చీలుస్తూ తాము (పైపైకి మాత్రమే అయినా సరే) వ్యతిరేకించే ప్రజా వ్యతిరేకులకే మేలు చేస్తూ వస్తున్నారు. పైపై మెరుగుల సింబాలిక్ ఉద్యమాలూ, స్వంత డబ్బాలూ కొంత మానుకుని రైతన్న ఏం ఆశిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం ఇకనైనా మొదలుపెట్టాలి.

- శ్రీశైల్ రెడ్డి పంజుగుల
తెలుగుదేశం వ్యవసాయ అధ్యయన కమిటీ సభ్యులు
- నీలయపాలెం విజయకుమార్
రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు

Sunday, February 19, 2012

టూనా..A MILLION DOLLAR FISH




ప్రపంచంలోనే ఖరీదైన చేప 'టూనా'. మన దగ్గర దాన్ని 'తూర' అని పిలుస్తారు. టూనాలను చూస్తే జపనీయులు లొట్టలేస్తారు. అచ్చం వంజరంలా వుంటుంది. కొందరికి అదేమిటో కూడా తెలియదు కాబట్టి సింపుల్‌గా అద్భుతమైన చేప అని చెప్పాల్సి ఉంటుంది. దాని మాంసం మహాద్భుతం. అయితే విదేశాల్లోనే ఈ చేపకు డిమాండ్ ఎక్కువ. మన టూనాలు జపాన్, అమెరికాలకే ఎగుమతి అవుతాయి. దీనివల్ల భారతదేశానికి ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. ఇంత విలువైన టూనా ఎక్కడంటే అక్కడ దొరకదు. విశాఖపట్నం సముద్రతీరంలోనే ఎక్కువగా దొరుకుతోంది.

ఒక్కొక్కసారి అండమాన్, కేరళ, తమిళనాడుల్లోని కొన్నిచోట్ల మత్స్యకారుల వలలకు చిక్కుతుంది. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే అంటే- నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇది సముద్రంలో స్వేచ్ఛగా విహరిస్తుంది. ఆ సమయంలోనే జాలర్లు వాటిని వేటాడి పట్టుకుని సొమ్ము చేసుకుంటారు. టూనా నీటిలో ఈదే తీరు, వాటి సంచారం, వేటాడే పద్ధతి, మార్కెట్‌కు చేరవేసే ప్రక్రియ, విక్రయించే పద్ధతి అన్నీ ఆసక్తి కలిగిస్తాయి. జపాన్‌లో గత నెల ఐదవ తేదీన సుజుకీ అనే చేపల సంతలో టూనాలను వేలం వేస్తే- బ్లూఫిన్ అనే ఒక చేప 7.36 లక్షల డాలర్లు పలికింది. మన కరెన్సీలో చెప్పాలంటే...రూ.3.58 కోట్లు. ఖరీదులో టూనాతో సరితూగే చేప మరొకటి లేదు.


ఇది కొత్త జీవరాశి ఏమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఇదివరకు ఈ చేపను ప్రత్యేకంగా ఎవరూ వేటాడలేదు. అందుకే వెలుగులోకి రాలేదు. మన సముద్ర జలాల్లో దొరికే టూనాను విదేశీయులే ముందు పసిగట్టారు. వేటాడేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొన్నారు. సముద్రంలో చేపను పట్టి, అటు నుంచి అటే వాళ్ల దేశాలకు తీసుకెళ్లేవారు. దాదాపుగా ఇరవై ఏళ్లపాటు ఇలాగే జరిగిందంటే ఆశ్చర్యం వేస్తుంది. విదేశీ ట్రాలర్లు వచ్చి మన చేపలను పట్టుకెళుతున్నారని కనిపెట్టిన తర్వాత భారత జాలర్లు దాని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అవి 'తూరలు' అని తేలింది. ఆ చేపల్ని విదేశీయులు 'టూనా' అని పిలుస్తారని, వాటికి విదేశాల్లో మంచి గిరాకీ ఉందని మనవాళ్లకు అర్థమైంది. కాని టూనా చేపల్ని ఎలా పట్టుకోవాలో తెలియలేదు. ఎందుకంటే దీన్ని పట్టుకోవడం చాలా కష్టం.

అన్వేషణలో తగిలిన టూనా..

ఇదివరకు పాత పద్ధతులతోనే చేపల్ని పట్టేవారు. కొన్నేళ్ల కిందటి నుంచి సాంకేతిక పద్ధతుల్ని జోడించారు. అందులో 'ట్రాలింగ్' ఒకటి. ట్రాలర్‌కు ముందు రెండు ఆర్టర్ బోట్లు వుంటాయి. అవి సముద్రంలోపలికి వలలను వేసుకుంటూ ముందుకు వెళతాయి. ఆ వలలకు పిల్లలతో సహా రొయ్యలు, చేపలు చిక్కుతాయి. అయితే దీని వల్ల చేపలు బాగానే దొరుకుతున్నా మత్స్య సంపద మొత్తం నాశనమైపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆ విషయాన్నే మత్స్యకారులకు చెప్పారు. మరోవైపు నేలపై రొయ్యలసాగు విస్తరించింది. ఈ రంగం కూడా నష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో.. మత్స్యకార సంఘం నాయకుడు వైజీకే మూర్తి సముద్రపు చేపలపై ప్రత్యేక అధ్యయనం చేశారు. విశాఖ సముద్ర తీరంలో టూనాలు పుష్కలంగా వున్నాయని, వాటికి ఎక్కడలేని డిమాండ్ ఉందని తెలుసుకున్నారు.

అప్పటికే తైవాన్ జాలర్లు టూనాలను పట్టి సొమ్ము చేసుకుంటున్నారు. టూనాల జాడ కనిపెట్టడం, పట్టుకోవడం, అమ్ముకోవడంలో మెళకువలను అధ్యయనం చేసేందుకు పన్నెండు దేశాలను చుట్టొచ్చారు మూర్తి. సాధారణ ట్రాలర్లతో వేటాడితే భారీ సంఖ్యలో టూనాలను పట్టుకోవడం కష్టమని తెలుసుకున్నారు. టూనాల వేటకు ప్రత్యేక 'లాంగ్‌లైనర్లు' తప్పనిసరని గుర్తించారు. విశాఖపట్నం జాలర్లతో ఆ విషయాన్నే చెప్పారు. జాలర్లకు శిక్షణ ఇప్పించేందుకు శ్రీలంక నుంచి 40 మంది నిపుణులను తీసుకొచ్చారు. అప్పట్లో కేంద్ర వాణిజ్య శాఖా మంత్రిగా వున్న జైరామ్ రమేష్ విషయం అర్థం చేసుకొని సాయం అందించేందుకు ముందుకొచ్చారు. అలా మొదలైంది విశాఖలో టూనాల వేట.

ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది?

టూనా చేపలది చాలా చిత్రమైన జీవనశైలి. సాధారణ చేపల్లో వుండే 'ఫ్లోటింగ్ బ్లాడర్' దీనికి వుండదు. బ్లాడర్ లేకపోవడం వల్ల నీటిలో తేలేందుకు నిత్యం ఈదుతూ ఉండాల్సొస్తుంది. పొరపాటున ఈత ఆపిందనుకో ఆక్సిజన్ అందక చనిపోతుంది. అందుకే ఈ చేపకు విశ్రాంతి అనేదే ఉండదు. టూనా గంటకు 70కి.మీ. వేగంతో కదులుతుంది. ఒక మాటలో చెప్పాలంటే టూనా వలస జీవి. నిత్యం ఈదడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా వుంటుంది. వేడిని తగ్గించుకోవడానికి చల్లని ప్రాంతాల్లో సంచరిస్తుంది. సుమారు 26 డిగ్రీలు, అంత కంటే తక్కువ ఉష్ణోగ్రత వున్న నీటిలోనే ఎక్కువగా సంచరిస్తుంది. సముద్రంలో గ్రీన్ ఆల్గేలు అధికంగా వుంటాయి. వాటిలో ఉన్న క్లోరోఫిల్ తినడానికి చిన్నిచిన్న చేపలు వాటి చుట్టూ చేరుతాయి. ఆ చిన్ని చేపలను భోంచేయడానికి టూనా ఆ ప్రదేశానికి వెళుతుంది. అంటే- గ్రీన్ ఆల్గేలు, చిన్నచేపలు, చల్లటి ప్రాంతం.. ఇవన్నీ ఎక్కడుంటే టూనా అక్కడ ఉంటుందని జాలర్లు తెలుసుకున్నారు. డాల్ఫిన్ చేపల్లా టూనా కూడా తెలివైన చేప. అది డాల్ఫిన్లతో సన్నిహితంగా మెలుగుతుంది. అందుకే టూనాలను పట్టుకునేందుకు డాల్ఫిన్లు కూడా ఒక ఆధారమయ్యాయి.

వేట కూడా సపరేటు...

ఏ చేపల్ని వేటాడాలన్నా.. వలలు తప్పనిసరి. అయితే టూనాలకు మామూలు వలలు పనికిరావు. రెండు నుంచి 80కిలోల దాకా బరువుండి, గంటకు 70కి.మీ. వేగంతో కదిలే టూనాల ధాటికి మామూలు వలలు తట్టుకోలేవు. ఒకవేళ వలకు చిక్కినా దాన్ని చించుకుని వెళ్లిపోతాయవి. అందుకని టూనాలను 'హుక్'లతో గేలం వేసి పట్టుకుంటారు. తైవాన్‌లో అయితే టూనాల వేటకు మరింత ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'లాంగ్ లైనర్' అనే ట్రాలర్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో ట్రాలర్ ఖరీదు కోటి రూపాయలు.

టూనాలపై అధ్యయనం చేసిన వైజీకే మూర్తి ఈ లాంగ్‌లైనర్ల గురించి తెలుసుకున్నాక, వాటిని కొనేందుకు ప్రభుత్వ సాయం కోరారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపెడా) దానికి స్పందించి ముందుకొచ్చింది. అయితే కొత్తవి కొనడం కష్టం కాబట్టి అప్పటికే చేపలవేటకు వినియోగిస్తున్న ట్రాలర్లను లాంగ్‌లైనర్లుగా మార్చుకుంటే సాయం చేస్తామంది ఆ సంస్థ. ఆ మేరకు 20 మీటర్ల కంటే తక్కువ పొడవున్న ట్రాలర్ల కన్వర్షన్‌కు రూ.7.5 లక్షలు, అంతకంటే ఎక్కువ పొడవున్న ట్రాలర్లకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చింది. ఇలా మొత్తం 20 ట్రాలర్లు జాలర్లకు అందాయి. వాటిని ఎంపెడా అధ్యక్షుడు మోహన్‌కుమార్ నేతృత్వంలో విశాఖపట్నంలో ప్రారంభించారు. దీంతో టూనాల వేట సులువైంది.

లాంగ్‌లైనర్ అంటే..?

టూనాల వేటకు ఉపయోగించే.. లాంగ్‌లైనర్‌కు అర్థం ఆ పేరులోనే వుంది. పొడవుగా, లైనుగా ఒక తాడును సముద్రంలోకి వేసి, వేలాడదీసిన ప్రత్యేకమైన హుక్కులను వాటికి అమరుస్తారు. పొడవాటి నైలాన్ తాడుకు పది మీటర్లకు ఒకటి చొప్పున ఈ హుక్కులుంటాయి. సముద్రంలో ఈ తాడును 200కి.మీ. పొడవు వరకు విడిచిపెడతారు. హుక్‌లు వంకీలు తిరిగి వుండడం వల్ల అది కూడా ఒక రకమైన సముద్రజీవి అనుకొని.. వాటిని నోటితో పట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి టూనాలు. అలా నోటితో కొరకగానే హుక్కుకు చిక్కుకుపోతాయి. దాన్నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటిస్తాయి. కానీ తప్పించుకోలేవు. ఈ నైలాన్‌తాడును కొందరు జాలర్లు చేతితో ఉపయోగిస్తే, మరికొందరు హైడ్రాలిక్ సిస్టమ్‌తో వాడతారు. ఒక లాంగ్‌లైనర్‌కు పది అంతకంటే ఎక్కువ టూనాలు దొరికినప్పుడు ఆ నైలాన్ తాడును పట్టుకొని లాగడం చాలా కష్టం. ఒక్కో టూనా 20 కిలోలు తూగినా.. ఇరవై టూనాలు కలిస్తే 400కిలోల బరువుంటుంది. అంత బరువును లాగడం ఒకరిద్దరి వల్ల అయ్యే పనికాదు. అందుకని హైడ్రాలిక్ సిస్టమ్ ఉపయోగిస్తారు.

రవాణా ప్రత్యేకం...

టూనాను పట్టుకోవడం ఎంత కష్టమో.. మార్కెట్‌కు చేరవేయడం అంతే కష్టం. చేప చర్మం గీసుకుపోకుండా, తాజాదనం తగ్గకుండా వుండే టూనాలకే అధిక ధర పలుకుతుంది. మొదటి రకం టూనాలను 'సష్మీ' గ్రేడ్ అంటారు. ఆ తరువాత రకాన్ని బి-గ్రేడ్‌గా వ్యహరిస్తారు. విదేశీ జాలర్లు టూనాలను పట్టుకున్న వెంటనే ఆ సమాచారాన్ని తమ కొనుగోలుదార్లకు తెలియజేసి, సముద్రం పైకే హెలికాప్టర్లను రప్పించుకుంటారు. నడిసముద్రంలోనే వాటిని జాగ్రత్తగా హెలికాప్టర్‌లోకి ఎక్కించి మార్కెట్‌కు తరలిస్తారు. మన దగ్గర ఆ స్థాయిలో సౌకర్యాలు లేవు కాబట్టి మనకు దొరికిన వాటిని మిగిలిన చేపలతో పాటు కలిపేసి హార్బర్‌కు తరలించి.. బి- గ్రేడు సరకుగా అమ్ముతారు. ఇలా అమ్మితే జాలర్లకు పెద్దగా గిట్టుబాటు అవ్వదు. తాజా చేపకున్న రేటు ఆలస్యమయ్యేకొద్దీ తగ్గుతుంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకునే టూనాలను జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారు మన జాలర్లు.

ఎలాగంటే...?

సముద్రంలో టూనాను పట్టుకుంటూనే- 'స్టన్నర్' అనే పరికరంతో ఎల్రక్టిక్ షాక్ ఇస్తారు. దాంతో అది అచేతనంగా మారిపోతుంది. అప్పుడు బోటులోకి చేర్చి వెంట వెంటనే భద్రపరిచే చర్యలు చేపడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కిట్‌తో ఆపరేషన్‌లానే ఐసింగ్ చేస్తారు. ముందుగా తలపైన వుండే సాఫ్ట్‌స్పాట్‌లో రబ్బరు సుత్తితో ఒక దెబ్బ వేస్తారు. అక్కడ రంధ్రం వేసి లోపల వున్న మెదడు మొత్తం తీసేస్తారు. ఆ తరువాత మోనోఫిలమెంట్ లైన్ గాని, స్టీల్‌వైరు గాని స్పైన్‌లోకి పంపిస్తారు. అప్పుడు ఆ చేప న్యూరల్ డెత్‌కు గురవుతుంది. మొప్పల దగ్గరుండే యానస్ నుంచి పేగులు తీసేస్తారు. రక్తాన్ని కూడా లాగేస్తారు. ఎక్కడా చిన్న రక్తపుమరక లేకుండా చేపను శుభ్రపరుస్తారు.

ఇలా చేయడాన్ని గ్రిల్లింగ్ అండ్ గట్టింగ్ అంటారు. చేప శరీరంలో ఎక్కడెక్కడైతే ఖాళీలు వున్నాయో వాటన్నిట్నీ ఐస్‌పౌడర్‌తో నింపేస్తారు. ప్రత్యేకంగా తయారుచేసిన 'స్లర్' అనే పెద్దతొట్టెలో ఐదు నుంచి ఏడు గంటలపాటు వుంచుతారు. కొద్దిసేపయ్యాక వేరే బాక్సుల్లో ఐసు లేయర్ల మధ్య భద్రపరుస్తారు. ఆ బాక్సుల్ని తీరానికి చేర్చి కొనుగోలుదార్లకు విక్రయిస్తారు. టూనా ఎంత భద్రంగా, తాజాగా వుంటే అంత మంచి ధర లభిస్తుంది. ఏమాత్రం డామేజీ వున్నా రేటు తగ్గిపోతుంది. ఈ పనులన్నీ లాంగ్ లైనర్లతో మాత్రమే చేయడానికి వీలవుతుంది. సాధారణ ట్రాలర్లు, బోట్లలో వెళ్లి టూనాలను వేటాడే జాలర్లకు ఇవన్నీ సాధ్యం కావు.

ఇద్దరే వ్యాపారులు..

విశాఖపట్నం కేంద్రంగా ఇద్దరంటే ఇద్దరే వ్యాపారులు వున్నారు. వారు చెప్పిందే వేదం. టూనాలు హార్బర్‌కు చేరగానే వారి వద్దకు చేరుస్తారు జాలర్లు. వ్యాపారుల దగ్గర ప్రత్యేక నైపుణ్యం కలిగిన గ్రేడర్లు వచ్చి టూనాలను వేరు చేస్తారు. ఇరవై కిలోల కంటే తక్కువ బరువున్నవన్నీ ఒక దగ్గర, అంతకంటే ఎక్కువ బరువున్నవి మరొక చోట చేరుస్తారు. ఆ తరువాత ఒక్కో చేపను పరిశీలిస్తారు. బియ్యం నాణ్యతను పరిశీలించడానికి చిన్నపాటి పరికరాన్ని బస్తాలోకి గుచ్చి ఎలా శాంపిల్ తీస్తారో... ఇక్కడ గ్రేడర్లు కూడా అలాగే చిన్న పరికరాన్ని టూనా శరీరంలోకి గుచ్చి చిన్న మాంసపుముక్కను బయటకు తీస్తారు. దాని రుచి, రంగు, నూనె పరిమాణం, చేప తాజాదనం నిర్ధారించి.. ధరను ఫిక్స్ చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చేపకు ఎందుకింత డిమాండ్ ఉందంటే వేటిలోనూ లేనంత స్థాయిలో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉన్నాయి కనుక.

ధరలో దగా

ప్రస్తుతం విశాఖలో కిలో టూనా ధర రూ.130. అదే చేపను అమెరికా లేదా జపాన్ మార్కెట్లకు తీసుకెళితే రూ.400 వరకు వస్తుంది. కానీ జాలర్లకు సౌకర్యాలు అందుబాటులో లేవు. ఎంత వేగంగా అమ్ముకుంటే అంత ధర వస్తుందని తెలుసు కాబట్టి, త్వరగా విక్రయించాలనే చూస్తారు. మంచిరేటు వచ్చేవరకు ఎదురు చూడడానికి కుదరదు. కాలం గడిచే కొద్దీ నాణ్యత తగ్గిపోతుంది. ఇక్కడే దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కువ వేట వచ్చిందని, రేటు పడిపోయిందని అబద్దాలు చెప్పి స్థానిక మత్స్యకారుల నుంచి తక్కువ ధరకు కొని లాభపడుతున్నారు. ఈ పరిస్థితులు పోవాలంటే.. టూనాలను ఎగుమతి చేసేవరకు నిల్వ చేసుకోవడానికి చిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి.

దీని కోసం భారతీయ మత్స్యపరిశ్రమల సమాఖ్య తరఫున ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు వెళ్లాయి. విశాఖపట్నంలో వున్న హార్బర్‌లోనే కొంత స్థలం కేటాయిస్తే.. అక్కడ చిల్లింగ్ సెంటర్ పెట్టుకుంటామని జాలర్లు కోరుతున్నారు. అయితే ఏకంగా హార్బర్‌నే ఇంకో చోటుకు(భీమిలి సమీపాన మూలకుద్దు) తరలించే యోచన వుండడంతో విశాఖపట్నం పోర్టు వీరి అభ్యర్థనను పట్టించుకోవడం లేదు. స్థలం సమకూర్చుకుంటే... చిల్లింగ్ సెంటర్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ఎంపెడా వంటి సంస్థలు అంగీకరించాయి. కానీ స్థలమే దొరకడం లేదు. చిల్లింగ్ సెంటర్ వుంటే.. టూనాలను వచ్చినవి వచ్చినట్టు నిల్వ చేసి, మంచి ధర వున్నప్పుడు మార్కెట్‌కు ఎగుమతి చేసుకునే సౌలభ్యం దొరుకుతుంది. ఇలా చేస్తే.. టూనా జాలర్లకే కాదు, దేశానికే సంపదవుతుంది.

అక్కరకు రాని 'ట్యాగింగ్'

టూనాలను పట్టుకునేందుకు విదేశాల్లో చురుకైన పరిశోధనలు సాగుతున్నాయి. టూనాల సంచారం, గమ్యం, ఏయే మార్గాల్లో వెళుతున్నాయో తెలుసుకోవడానికి 'ట్యాగింగ్ ప్రోగ్రాం' అమలు చేస్తున్నాయి. సముద్రంలో దొరికే పిల్ల టూనాలకు ఒక చిప్‌ను ట్యాగ్ సాయంతో కట్టి, దాని కదలికలను పసిగడతారు. ఎలాంటి వాతావరణంలోకి వెళుతున్నది, ఎంత లోతున సంచరిస్తున్నది తదితర వివరాలు సేకరిస్తారు. ఇటీవల జపాన్‌లో ఒక టూనాకు ట్యాగ్ కడితే... అది మూడు నెలల్లో పదకొండువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నార్త్‌మెక్సికోలో జాలర్ల వలకు చిక్కింది. మనకూ అలాంటి ప్రోగ్రాం చేయాలని మత్స్యకార సంఘాల నాయకులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.

టూనాలను ఎగరేసుకుపోతున్నారు

* కేంద్రంలో మత్స్యపరిశ్రమకు ప్రత్యేక శాఖ లేదు. దేశంలో అరవై లక్షలకు పైగా జాలర్లు వున్నా.. విదేశీ మారకద్రవ్యం భారీగా ఆర్జించే వీరి సంక్షేమానికి విధానాల రూపకల్పన అంతా వ్యవసాయ శాఖ కిందే జరుగుతోంది. దీన్ని మత్స్యకార సంఘాల నాయకులు నిరసిస్తున్నారు.
* కొందరు స్వార్థపరుల కారణంగా భారత సముద్రజలాల్లో చేపలను వేటాడేందుకు విదేశీ నౌకలకు అనుమతులు (లెటర్ ఆఫ్ పర్మిషన్- ఎల్ఓపీ) ఇస్తున్నారనేది జాలర్ల ప్రధాన వాదన. వారి అధునాతన ట్రాలర్లు సంపద మొత్తాన్ని కొల్లగొట్టుకుపోతున్నాయని, వారి ముందు తాము నిలువలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. అప్పట్లో మురారీ కమిటీ సిఫార్సు మేరకు 1996-2001 మధ్యన విదేశీ ట్రాలర్లను నిషేధించారు. అయినా వారు దొంగతనంగా వచ్చి టూనాలను వేటాడి తీసుకుపోయేవారు. ఇప్పుడు మళ్లీ వంద విదేశీ ట్రాలర్లకు అనుమతి ఇచ్చారు. దాన్ని అడ్డుపెట్టుకుని ఐదువందలకు పైగా ట్రాలర్లను తెచ్చి.. విలువైన టూనాలను ఎగరేసుకుపోతున్నారు.
* టూనాలు ఎలాంటి వాతావరణంలో వుంటాయనేది తెలిసినా, కరెక్టుగా ఎక్కడ సంచరిస్తున్నాయో తెలిస్తే.. వాటిని వేటాడడం చాలా సులువు. అమెరికాకు చెందిన ఒక కంపెనీ ఉపగ్రహ సాయంతో సేకరించిన సమాచారాన్ని విదేశీ నౌకలకు అమ్ముకుంటోంది. దాంతో వారు టూనాలను సులువుగా పట్టుకుంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్ (ఇండియా నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్) చేపలవేటకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తోంది. టూనాలకు సంబంధించిన సమాచారం ప్రత్యేకంగా ఇవ్వాల్సి ఉంది.

ప్రత్యేక రాయితీ ఇవ్వాలి
-  వైజేకే మూర్తి, అధ్యక్షుడు, మత్స్యపరిశ్రమల సమాఖ్య
త్వరలో విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ విమానాలు నడపడానికి ముందుకు వస్తున్నందున, వాటి ద్వారా టూనాలను ఎగుమతి చేసుకోవడానికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. అలాగే సముద్రంలో దొరికిన టూనాలను వెంటనే చిల్లింగ్ సెంటర్‌కు లేదంటే తీరానికి చేర్చడానికి మదర్‌బోట్లు రెండు మూడు మంజూరు చేయాలి. ఇవి సముద్రంలో తిరుగుతూ, ట్రాలర్లకు చిక్కిన టూనాలను వెంటవెంటనే ఒడ్డుకు చేర్చి మార్కెట్‌లో విక్రయించి, ఎక్కువ ధరను రాబట్టగలుగుతాయి.

మన సముద్రజలాల్లో ఎల్లోఫిన్ (మొప్పలు పసుపురంగులో వుంటాయి), బిగ్ ఐ (కళ్లు పెద్దవి వుంటాయి), స్కిప్‌జాక్ (చారలు వుంటాయి) అనే మూడు రకాలు దొరుకుతాయి. బ్లూఫిన్ అనే రకం అత్యంత విలువైనది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అంతరించే పోయే దశలో వుంది. అందుకని వీటిని జపాన్, అమెరికా దేశాల్లో పెంచుతున్నారు. ఈ టూనా చేపలు మూడు మీటర్ల పొడవుండి 700కిలోల బరువుదాకా పెరుగుతాయి.
- ర్రా శ్రీనివాసరావు, విశాఖపట్నం 

Gouthamaraju as WUA