పాడి పంటలు

Showing posts with label curry leaf. Show all posts
Showing posts with label curry leaf. Show all posts

Sunday, April 15, 2012

కలిమి తెచ్చే కరివేపాకు

రైతులు కొద్దిపాటి శ్రమ, మేలైన యాజమాన్య పద్ధతులతో కొన్ని రకాల వాణిజ్య పంటల్ని సాగు చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇలాంటి పంటల్లో కరివేపాకు ఒకటి. ఈ పంట నమ్మకమైన దిగుబడుల్ని, ఆదాయాన్ని అందిస్తుంది. కరివేపాకు తోటలో పప్పుధాన్యాలు, ఆకుకూరల్ని అంతరపంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. కరివేపాకును నీటి పారుదల కింద, నీరు లేనప్పుడు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా సాగు చేయవచ్చు. ఇది బహు వార్షిక కూరగాయ పంట. కరివేపాకు మొక్కలకు అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, అతి తక్కువగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వరకూ అనువైన వాతావరణంగా చెప్పొచ్చు.

నేలలు-రకాలు

కరివేపాకు పైరు అధిక నీటిని తట్టుకోలేదు. అందువల్ల పొలంలో మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పనిసరి. ఏ మాత్రం తేమ నిలవని తేలికపాటి గరప నేలలు, నీరు నిలిచే నల్లరేగడి నేలలు ఈ పంటకు పనికిరావు. దీని సాగుకు ఎర్ర గరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. కరివేపాకు సాగుకు డీడబ్ల్యూడీ-1, 2 రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ రెండు రకాలూ మంచి సువాసన కలిగి ఉంటాయి. డీడబ్ల్యూడీ-1లో నూనె శాతం 5.22%, డీడబ్ల్యూడీ-2లో 4.09%ఉంటుంది. డీడబ్ల్యూడీ-1 రకం చలిని తట్టుకోలేదు. శీతాకాలంలో పైరు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఇక డీడబ్ల్యూడీ-2 రకం చలి తీవ్రతను కొంత వరకూ తట్టుకుంటుంది. డీడబ్ల్యూడీ-1 రకం కంటే ఎక్కువ దిగుబడి ఇస్తుంది.

ఎలా సాగు చేయాలి?

కరివేపాకు సాగుకు జూన్ నుంచి ఆగస్ట్ వరకూ అనుకూలంగా ఉంటుంది. కరివేపాకు పంటను ఎక్కువగా విత్తనం ద్వారా సాగు చేస్తారు. కొందరు రైతులు ముందుగా నారు పోసి మొక్కలు పెరిగాక ప్రధాన పొలంలో నాటు తారు. ఈ పద్ధతిలో కరివేపాకును సాగు చేయాలనుకుంటే ముందుగా చిన్న చిన్న పాలిథిన్ సంచుల్లో ఇసుక, మట్టి, బాగా చివికిన పశువుల ఎరువును 1:1:1 నిష్పత్తిలో వేయాలి. వాటిలో విత్తనాలు వేసి మొక్కల్ని పెంచాలి. సంచుల్లోని మట్టిపై రోజుకు రెండుసార్లు నీళ్లు చల్లుతూ ఉండాలి. విత్తనాలు మొలకెత్తడానికి మూడు నాలుగు వారాల సమయం పడుతుంది. మూడు నెలల వయసున్న మొక్కల్ని ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ఇక నేరుగా విత్తనాలు విత్తే వారు ముందుగా పొలాన్ని లోతుగా దున్నాలి. చివరి దుక్కిలో ఎకరానికి 10-12 టన్నుల పశువుల ఎరువుతో పాటు 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ఆ తర్వాత గుంటక తోలి భూమిని చదును చేయాలి. తర్వాత సాళ్లలో విత్తుకోవాలి లేదా విత్తనాలు పొలం అంతటా సమానంగా పడేలా వెదజల్లాలి. విత్తనం కోసం చెట్ల నుంచి సేకరించిన పండ్లను మర్నాడే విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తితే మొలక శాతం తగ్గుతుంది. ఎకరానికి 200 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తనాలు విత్తిన తర్వాత గుంటక తోలి నీరు పెట్టాలి.


పెద్ద మొక్కల చుట్టూ వచ్చే పిలకల్ని తీసి కూడా నాటుకోవచ్చు. ఇందుకోసం తల్లి మొక్క దగ్గర వేరు నుంచి వచ్చే పిలకల్ని వేరుతో సహా తీసి వెంటనే నాటాలి. అయితే ఈ పద్ధతిలో కరివేపాకు సాగు చేయాలనుకుంటే వర్షాకాలంలో మాత్రమే మొక్కలు నాటాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి.


తోటలో మొక్కలు ఒక మీటరు ఎత్తు పెరిగిన తర్వాత మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. పంట కోసిన తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులు వేస్తూ ఉండాలి.


కోత - ఆ తర్వాత

విత్తనాలు విత్తిన 9-10 నెలలకు పంట కోతకు వస్తుంది. అయితే మొదటి కోతలో కరివేపాకు దిగుబడి, ఆదాయం చాలా తక్కువగా ఉంటాయి. ఎకరానికి 800 నుంచి వెయ్యి కిలోల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రతి మూడు నాలుగు నెలలకు ఒక కోత తీసుకోవచ్చు. రెండో సంవత్సరంలో ఎకరానికి రెండు వేల నుంచి మూడు వేల కిలోల దిగుబడి వస్తుంది. అనంతరం ప్రతి కోతకు దిగుబడి పెరుగుతూ ఉంటుంది. మూడో సంవత్సరంలో ఎకరానికి 8-10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది.

కరివేపాకు కోసిన తర్వాత ప్రతిసారీ పొలంలోని కలుపు మొక్కల్ని తొలగించాలి. పైన తెలిపిన విధంగా నత్రజని, మ్యురేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేసి నీరు పెట్టాలి. డ్రిప్ ద్వారా సాగు చేసినట్లయితే పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో నీరు, ఎరువులు అందించవచ్చు. తద్వారా దిగుబడుల్ని 15-20 శాతం పెంచుకోవచ్చు.

జయంత్ రెడ్డి, బీఎస్సీ అగ్రికల్చర్
హైదరాబాద్

ఈ చీడపీడలతో జాగ్రత్త

కరివేపాకు పంటను గొంగళి పురుగులు, పొలుసు పురుగులు, ఆకుమచ్చ తెగులు ఎక్కువగా నష్టపరుస్తాయి. గొంగళి పురుగులు ఆకుల్ని తింటాయి. వీటి నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున మలాథియాన్ కలిపి పిచికారీ చేయాలి. పొలుసు పురుగులు కాండం పైన చేరి రసాన్ని పీలుస్తాయి. దీంతో మొక్క పెరుగుదల తగ్గుతుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున డైమిథోయేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. మందు పిచికారీ చేసిన 15 రోజుల తర్వాత ఆకులు కోయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి పిచికారీ చేయాలి.

Saturday, January 1, 2011

కరివేపాకు సాగులో లాభాల గుబాళింపు!

 
కరివేపాకే కదా అని తీసిపారేయకండి. ఆ కరివేపాకే ఇప్పుడు ఎంతో మంది రైతన్నల్ని లక్షాధికారుల్ని చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వాణిజ్య పంటల సాగు నేడు జూదంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో కరివేపాకు సాగు చేసి ఎక్కువ ఆదాయం పొందవచ్చునని నిరూపిస్తున్నారు విజయవాడ పరిసర ప్రాంతాల రైతులు.

వాణిజ్య పంటలు సాగు చేసి చేతులు కాల్చుకునే కంటే ఏళ్ల తరబడి కరివేపాకునే నమ్ముకుని లాభాల గుబాళింపును ఆస్వాదిస్తున్నారు పులగం శివరామయ్య. విజయవాడ నగరం చెంతనే ఉన్న కుంచనపల్లి గ్రామానికి చెందిన శివరామయ్య ఓ సన్నకారు రైతు. ఆయనకు రెండెకరాల పొలం ఉంది. అందులో ఎకరం భూమిని గత పదిహేనేళ్లుగా కరివేపాకు సాగుకే కేటాయిస్తున్నారు.


ఏటా పెట్టుబడి ఖర్చులన్నీ పోను యాభై వేల రూపాయల నికరాదాయం పొందుతున్నారు. శివరామయ్యను చూసి ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది రైతులు ఇప్పుడు కరివేపాకునే తమ ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. ఏడాదికి మూడు కోతలు తీసుకుంటూ వాణిజ్య పంటలకు దీటుగా ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కరివేపాకు సాగు చేయడానికి ముందుకొచ్చే ఔత్సాహిక రైతులకు శివరామయ్య పలు సూచనలు అందిస్తున్నారు. అవి ఆయన మాటల్లోనే...


మంచి డిమాండ్

ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న కరివేపాకుకు ఇతర ప్రాంతాల్లో, దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కరివేపాకు సాగు చేసే రైతులకు వ్యాపారులు ముందుగానే డబ్బు చెల్లిస్తున్నారు. కృష్ణా తీరంలో సారవంతమైన ఒండ్రు నేలలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ కరివేపాకు సాగు అందరికీ లాభదాయకంగా ఉంటోంది. మరో విశేషమేమంటే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, వాతావరణం అనుకూలించకపోయినా కరివేపాకు దిగుబడిపై పెద్దగా ప్రభావం పడడం లేదు. అదే ఇక్కడి రైతులకు బాగా కలిసొస్తోంది. ఒకసారి కరివేపాకు సాగు ప్రారంభిస్తే అయిదేళ్ల వరకూ దాని నుండి పంట తీసుకోవచ్చు.

సాగు విధానమిలా...

కరివేపాకు పంటకు నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. ముందుగా భూమిని దుక్కి దున్ని చదును చేయాలి. ఆ తర్వాత మడులు తయారు చేసుకొని కరివేపాకు విత్తనాలు చల్లుకోవాలి. నేరుగా సాళ్లు చేసుకొని కూడా విత్తనాలు విత్తుకోవచ్చు. సాళ్లలో విత్తుకునేట్లయితే ఎకరానికి 80-100 కిలోలు, నేరుగా మడుల్లో చల్లుకునేట్లయితే 200 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. దేశవాళీ రకాలతో పాటు భువనేశ్వర్ రకం రైతులకు మంచి దిగుబడులు అందిస్తోంది.

భూమి తయారీ, విత్తనాల కొనుగోలు, విత్తడం వంటి పనులకు ఎకరానికి 15 వేల రూపాయల వరకూ ఖర్చవుతాయి. ఎరువులు, పురుగు మందుల వినియోగానికి మరో 10 వేల రూపాయలు ఖర్చవుతాయి. ఆరు నెలల తర్వాత మొదటి కోత వస్తుంది. అప్పటి నుండి ప్రతి వంద రోజులకు ఒకసారి కోత కోయవచ్చు. ఎగుమతి అవకాశాలు, సీజన్‌ను బట్టి ఒక్కో కోతకు 25 వేల రూపాయల వరకూ ఆదాయం వస్తుంది. ప్రస్తుతం క్వింటాలుకు స్థానిక మార్కెట్‌లోనే నాలుగు వేల రూపాయల ధర పలుకుతోంది. ఒకసారి పంట వేస్తే అయిదేళ్ల వరకూ దానిని కదిలించాల్సిన అవసరం ఉండదు. పైగా కోత తర్వాత వచ్చే పిలకలు త్వరితగతిన ఏపుకు వస్తాయి.


చీడపీడలు తక్కువే

కరివేపాకు సాగులో చీడపీడల ప్రభావం తక్కువగానే ఉంటుంది. అయితే పేనుబంక, పొలుసు పురుగు ఆశించే అవకాశం ఉంది. పేనుబంక నివారణకు రోగార్, కాన్ఫిడార్ వాడితే ఫలితం ఉంటుంది. పొలుసు పురుగు నివారణకు కానుగ నూనె పిచికారీ చేయడం మేలు. ఒకవేళ రసాయన మందులు వాడాల్సి వస్తే మలాథియాన్ పిచికారీ చేయవచ్చు.

ఎగుమతులకు భలే గిరాకీ

కరివేపాకు ఎగుమతులకు మంచి గిరాకీ ఉంది. విజయవాడ మార్కెట్ నుంచి చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్‌కు ఎక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయి. దుబాయ్‌లో కూడా కరివేపాకుకు మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు ముందుగానే రైతుల నుండి తోటలు కొని ఇక్కడి నుండే నేరుగా ఎగుమతి చేస్తున్నారు. కరివేపాకును ఔషధాల్లోనూ, బేకరీ ఫుడ్స్‌లో సువాసన కోసం వాడటం వల్ల మంచి డిమాండ్ ఏర్పడింది. కరివేపాకు నుండి స్వేదన క్రియ ద్వారా ఓలియో రెజిన్ అనే నూనెను తయారు చేస్తున్నారు. దీనిని వంటకాల్లో వినియోగిస్తున్నారు. కొన్ని మందుల కంపెనీలు కరివేపాకు పొడిని వినియోగిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని విజయవాడ ప్రాంతం నుంచి కరివేపాకును ముందుగానే పొడి చేసి నేరుగా ఎగుమతి చేస్తున్నారు.

Gouthamaraju as WUA