పాడి పంటలు

Sunday, November 28, 2010

అమెరికాలో రైతే లేడు

  తిండి తిప్పలు
అవసరం లేకపోయినా అధికంగా పండించడం అలవాటు చేసుకున్న అమెరికా ఇప్పటికీ ఆ పని చేస్తూనే ఉంది. అలా ఉత్పత్తి చేసిన వాటిని మిగతా దేశాల్లో స్థానికంగా ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుకన్నా తక్కువ ధరకే ఎగుమతి చేస్తుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆహారవస్తువుల ధరలు తగ్గితే దాని వల్ల అమెరికా రైతులు నష్టపోకుండా మళ్లీ వారికి రకరకాల సబ్సిడీలు కల్పిస్తారు. దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో రైతులు మాత్రం నష్టపోతున్నారు.

నిజానికి అమెరికాలో వ్యవసాయం చేస్తున్నవాళ్లని రైతులనలేం. రైతులందరినీ ఎప్పుడో పొలాల నుంచి వెళ్లగొట్టేశారు వాళ్లు. అక్కడ ఇప్పుడు మహా అయితే రెండు శాతం మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారేమో. మిగతా వాళ్లందరూ బహుళ జాతి కంపెనీల వాళ్లు. విత్తనాలు మొదలుకుని రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉత్పత్తి చేయడమే కాక ఆ ఉత్పత్తుల్ని ప్రాసెసింగ్ చేయడం నుంచి అంతర్జాతీయ వ్యాపారం దాకా అన్నీ బహుళజాతి కంపెనీల వాళ్లే చేస్తున్నారు. అమెరికన్ ఎన్నికల్ని, రాజకీయ నాయకుల్ని శాసిస్తూ తమ వ్యాపారాలకి ఎలాంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల సబ్సిడీలు అందేలా చేసుకుంటారు. అంతే కాదు.. ఇతర దేశాల ప్రభుత్వాలు తమ వ్యవసాయదారులకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకుండా చేయమని అమెరికన్ ప్రభుత్వంపై వత్తిడి తెస్తారు. అవసరమైన వరకు ఉత్పత్తి చేసుకునే బదులు ఈ కంపెనీలన్నీ అమెరికాలో ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పెంచాలని సూచిస్తూ ఉంటాయి.

ఇక ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి విషయానికొస్తే రెండూ ఎక్కువగా అమెరికా, యూరోపియన్ దేశాల నిధులతోటే నడుస్తుంటాయి. అందుకే స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతు తెలిపి తద్వారా అమెరికా, యూరప్‌లలో పండిన పంటలకి ఇతర దేశాల్లో మార్కెట్ కల్పిస్తాయి. మనలాంటి దేశాలకి ఈ స్వేచ్ఛా వాణిజ్యం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే మనం ఉత్పత్తి చేసేది మనకే సరిపోదు. దీనితో పాటు ఇతర దేశాలు తమ రైతులకు ఇచ్చే సబ్సిడీల్లో కోత విధించాలని, వాటికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించాలని సలహా ఇస్తాయి ఆ దేశాలు. మనలాంటి దేశాలు ఆ పని చేస్తే రైతులపై ఉత్పత్తి భారం పెరుగుతుంది తప్ప మార్కెట్లో ధరలు మాత్రం పెరగవు. ఎందుకంటే అంతకన్నా తక్కువ రేటుకి మార్కెట్లో అమెరికా, యూరప్ నుండి ఉత్పత్తులు వచ్చిపడుతున్నాయి కదా. మన దేశంలో రసాయన వ్యవసాయం ఎప్పట్నుంచి మొదలైందో చూద్దాం.

దేశ జనాభాకి సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి 1950ల్లో మనదేశం 'గ్రో మోర్ ఫుడ్' ప్రచారం మొదలుపెట్టింది. అందుకని వ్యవసాయ భూమిని పెంచే పనిలో పడింది. దానితోపాటు అమెరికా నుండి ఆహారాన్ని దిగుమతి చేసుకుంది. ప్రపంచ యుద్ధకాలం నుంచి అమలులో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థను మన దేశంలో 60వ దశకంలో కొంత విస్తరించారు. ధాన్యాన్ని రైతులనుండి కొనుగోలు చేసి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకి అందేలా చేశారు. అలా చేయడం వల్ల రైతులకి ముందుగా నిర్ణయించిన ధర లభించడమే కాక సామాన్యులకు సబ్సిడీ ధరలకు ఆ ధాన్యం తప్పనిసరిగా అందేది.

1960ల్లో మన దేశంలో మొదలైన హరిత విప్లవంలో భాగంగా వరి, గోధుమ పంటల్లో కొత్తకొత్త రకాలను ప్రవేశపెట్టారు. అయితే వాటికి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు తోడయితేనే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి ఎంత పెరిగినా దాంతోపాటు దేశ జనాభా కూడా పెరుగుతూ వస్తోంది. కొంతకాలానికి రసాయన ఎరువుల వాడకం వల్ల నేలలో సారం తగ్గిపోయింది. దాన్ని పూడ్చడానికి మరింత ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు వాడాల్సి వచ్చింది. అంతేకాదు, వాటి వాడకం వల్ల నీరు, నేల, గాలి అన్నీ కలుషితమవడం మొదలైంది. ఆ తర్వాత కాలంలో హైబ్రిడ్ విత్తనాల వాడకంతోపాటు కలుపు నివారణకి కూడా రసాయనమందుల వాడకం ప్రారంభమైంది. ఇప్పుడు బిటి కాటన్ వచ్చేసింది. మరెన్నో బిటి కూరగాయలు రాబోతున్నాయి. ఇదిలా ఉంటే ధర ఎక్కువగా ఉండే కొన్ని పంటలకి మార్కెట్లో డిమాండ్ ఉండడంతో రైతులు ఆ పంటలవైపు మొగ్గుచూప సాగారు. వాటిని పండించడానికి భూగర్భజలంపై ఎక్కువగా ఆధారపడసాగారు. ఆరుతడి పంటలు పండించడం తగ్గిపోయింది. దానివల్ల పప్పుధాన్యాల సాగు, నూనెగింజల ఉత్పత్తీ తగ్గిపోయాయి, వాటి ధరలు పెరిగాయి.

మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరినపుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ఆహార ధాన్యాల ధరలు మన దేశంలో కన్నా ఎక్కువగా ఉన్నాయి. అందుకే అందులో చేరితే మన ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముకోవచ్చని మనపై అంతర్జాతీయంగా వత్తిడి పెరిగింది. అయితే మనం చేరిన కొంతకాలానికే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగొచ్చాయి. అక్కడ ధరలు తగ్గడంతో స్థానికంగా కూడా తగ్గించాల్సి వచ్చింది. దాని ప్రభావం రైతులపై పడింది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. నష్టాల్ని పూడ్చుకునే ఆర్థికసామర్ధ్యం లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో ఎంతోమంది దాన్ని వదిలేస్తున్నారు కాబట్టి ఆహారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలోనే కాదు, ఇంకా చాలా దేశాల్లో రైతులది ఇదే పరిస్థితి. ఉత్పత్తి వ్యయం పెరిగిపోతున్నా దానికి తగ్గట్టుగా ధరలు మాత్రం పెరగడం లేదు. రైతులు కోరుకునేదల్లా ఒక్కటే. తాము పండించే పంటలకి తగిన ధర ఉండాలని, ఆదాయం రావాలని. అది కోరుకోవడం కూడా తప్పేనా?

- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

No comments:

Gouthamaraju as WUA