
వ్యవసాయ పని ఒక్కళ్లుగా చేసుకోలేరు. పని ఉన్నప్పుడు ఎక్కువమంది కూలీలు అవసరమవుతారు. అది కూడా పనితనం ఉన్నవాళ్లు కావాల్సి వస్తుంది. పని తెలిసి, ఇష్టంతోనూ ఉత్సాహంతోనూ చేసేవారు కావాల్సి వస్తుంది. అయితే పట్టణాలకు వలసల వల్ల గ్రామాల్లో పని నైపుణ్యం ఉన్నవాళ్లు తగ్గడమే కాదు, తీవ్ర కొరత కూడా ఏర్పడడంతో రైతులు ఆహార పంటల నుంచి శ్రమ, శ్రద్ధ పెద ్దగా అవసరం లేని ఆహారేతర పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఇంకో కారణం ఏమిటంటే... రైతులు గంటల తరబడి తమ సొంత పొలాల్లో సైతం పని చేయడానికి సిద్ధంగా లేరు. నేటి తరానికి పాలు పిండడం చేతకాదు, నాగలి పట్టడం రాదు, నీరు పెట్టడం తెలీదు. ఎక్కువ కాలం బడిలో గడపడం మూలాన ఎండకి వానకి పని చేయడం తెలీదు. కాయకష్టాన్ని తక్కువ చేసి చూడటం, మురికి పని అనుకోవడం, అది దిగువ వర్గాలకి, కులాలకి చెందినదిగా భావించడం వల్ల చాలామంది యువత పని పట్ల విముఖత చూపుతున్నారు. అదే తప్పనుకుంటే ఆ దిగువ వర్గాలు, కులాలు కూడా పనికి అందుబాటులో లేకపోవడం మరో సమస్య.

యంత్రాల వైపు మళ్లే బదులు మనము భూమాత వైపు మళ్లాలి. సహజ పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో ఆయా భూములకు అనువైన పంటలను పండిస్తూ , సహజ ఎరువులను, క్రిమిసంహారకాలను తయారు చేసుకొని సాగు చేయటం మంచిది. అయితే ఈ రకమైన వ్యవసాయం పెరుగుతున్న జనాభాకు సరిపోను తిండిని పండించగలదా అని అనుమానం రావొచ్చు. బహుశా మొదట్లో సాధ్యం కాకపోవచ్చు. కాని పట్టుదలతో చేస్తే, తప్పని సరిగా కొద్ది సంవత్సరాల్లోనే సాధ్యం చేసుకోవచ్చు. క్యూబా ప్రజలు చేసుకోగా మనమెందుకు చేసుకోలేము? అప్పుడు మనం స్వచ్ఛమైన మందులు, విషాలు లేని ఆహారం తినటమే కాదు, మన భూములు, నీరు, గాలి కూడా స్వచ్ఛంగా కాలుష్య రహితంగా ఉంటాయి. ఆహార కొనుగోలుదారులు (సాధారణ వినియోగదారులు) కూడా సహజ ఆహారాన్ని కోరుకోవాలి. అందుకు తగిన ధర చెల్లించడానికి మనం ముందుకొస్తే రసాయనాలువాడకుండా పంటలు పండించడానికి రైతులు కూడా సిద్ధమవుతారు.
గౌరమ్మను గౌరవించండి
ఎలాగైతే తల్లి తన బిడ్డ విసర్జించే మలాన్ని శుభ్రం చేయడానికి జంకదో మట్టి కూడా అదే విధంగా జంకదు. జంకకపోవటమే కాదు మన కంటికి కనపడని తన సంతానంతో ఆ మలాన్ని మంచి ఎరువుగా కూడా మార్చగలదు. మనుషుల నుంచి జంతువుల దాకా అన్నిటి మలాన్ని మట్టిలోపల పూడ్చి సారవంతంగా మార్చొచ్చు. మా ఊళ్లో సంక్రాంతి ముందు నెల రోజుల పాటు పిల్లలు గౌరమ్మ ఎదుట నిలబడి దణ్ణం పెట్టుకుంటారు. గౌరమ్మ అంటే... ఆవుపేడతో చేసిన గౌరమ్మ! ఇండియాలో పంట పెంటతో ఎంతో దగ్గరగా ముడిపడి ఉంటుంది. అమెరికాలో మాత్రం పెంటను ఇట్లా భూమిలో కలిపేయరు. దాంతో పెద్ద సమస్యను తెచ్చి పెట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్లష్ లెట్రిన్లు నీటిని కలుషితం చేస్తున్నాయనేది అందరూ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. దీని అర్థం నేను మళ్లీ పూర్వకాలంలో లాగ 'బయటి'కెళ్లమనటం లేదు. మన మరుగుదొడ్ల నిర్మాణాన్ని పునః సమీక్షించాలంటున్నాను. నీటి అవసరం లేని డ్రై లెట్రిన్స్ని తయారు చేయాలంటున్నాను.
- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493
No comments:
Post a Comment