పాడి పంటలు

Sunday, December 19, 2010

తిండి తిప్పలు * బ్రెడ్డే దొరకట్లేదంటే..కేక్ తినమన్నట్లుంది

ఉపాధి హామీ పథకం వల్ల కూలి రేట్లు పెరిగి ఒక రైతుగా నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఒక సామాజిక కార్యకర్తగా ఆ పథకాన్ని సమర్థిస్తున్నాను. నిజానికి రైతు కూలీలు, కార్మికులు శక్తివంతులై వేతనం పెంచకపోతే పని కూడా వద్దనుకునే స్థాయికి ఎదగడం నాకు సంతోషాన్నిస్తోంది. కాని బాధ కలిగించే విషయం ఏమిటంటే- పథకం అమలులో జరుగుతున్న అవినీతి, చేసే పని పట్ల శ్రద్ధ లేకపోవటం, రైతులు ఆహారేతర పంటలవైపు మొగ్గు చూపడానికి అది కూడా ఒక కారణం కావడం. దీనివల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి మరింత తగ్గిపోతోంది.

వ్యవసాయ పని ఒక్కళ్లుగా చేసుకోలేరు. పని ఉన్నప్పుడు ఎక్కువమంది కూలీలు అవసరమవుతారు. అది కూడా పనితనం ఉన్నవాళ్లు కావాల్సి వస్తుంది. పని తెలిసి, ఇష్టంతోనూ ఉత్సాహంతోనూ చేసేవారు కావాల్సి వస్తుంది. అయితే పట్టణాలకు వలసల వల్ల గ్రామాల్లో పని నైపుణ్యం ఉన్నవాళ్లు తగ్గడమే కాదు, తీవ్ర కొరత కూడా ఏర్పడడంతో రైతులు ఆహార పంటల నుంచి శ్రమ, శ్రద్ధ పెద ్దగా అవసరం లేని ఆహారేతర పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఇంకో కారణం ఏమిటంటే... రైతులు గంటల తరబడి తమ సొంత పొలాల్లో సైతం పని చేయడానికి సిద్ధంగా లేరు. నేటి తరానికి పాలు పిండడం చేతకాదు, నాగలి పట్టడం రాదు, నీరు పెట్టడం తెలీదు. ఎక్కువ కాలం బడిలో గడపడం మూలాన ఎండకి వానకి పని చేయడం తెలీదు. కాయకష్టాన్ని తక్కువ చేసి చూడటం, మురికి పని అనుకోవడం, అది దిగువ వర్గాలకి, కులాలకి చెందినదిగా భావించడం వల్ల చాలామంది యువత పని పట్ల విముఖత చూపుతున్నారు. అదే తప్పనుకుంటే ఆ దిగువ వర్గాలు, కులాలు కూడా పనికి అందుబాటులో లేకపోవడం మరో సమస్య.

జనం ఎక్కడా ఒకచోట నిలకడగా ఉండటం లేదు. మొబైల్, మోటారు బైకు, డబ్బు అనే మూడు విషయాలు జనాన్ని ఒక దగ్గర ఉండనీయటం లేదు. ఈ పరిస్థితుల్లో పని చేయటం కష్టం. వ్యవసాయం ్జ్ఛ్చజూౌఠట ఝజీట్టట్ఛటట లాగా రైతు నిరంతరం తన చుట్టే తిరగాలనుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ఖాళీ సమయం దొరక్కపోదు. వర్షాలు కురుస్తున్నప్పుడో, ఎండాకాలం మధ్యాహ్నాల లాంటి సమయాల్లోనో. కాని ఎప్పుడూ అటో ఇటో తిరుగుతుంటే వ్యవసాయం ముందుకు సాగదు. పని వాళ్లు దొరక్కపోతే యంత్రాలను ఉపయోగించటమో ఆధునికీకరించటమో చేసుకోవచ్చు కదా అని మీరనొచ్చు. ఇదెట్లా ఉంటుందంటే బ్రెడ్డే దొరకట్లేదంటే కేక్ తినమన్నట్లుంటుంది. యంత్రం మనకన్నా తొందరగా పని చేస్తుందేమో కాని అన్ని రకాల సాగు పనులు చేయలేదు. పైగా దానికి కావాల్సిన డీజిల్ డబ్బులు పోసి కొనాలి. ఫలితం పర్యావరణానికి హాని, మన ఖజానాకు గండి. మనిషి మెదడు లాంటి యంత్రమైతే ఇప్పటి దాకా రాలేదు. మనకు యంత్ర సాయం అవసరమే కాని మరీ బ్రెడ్డుకి బదులు కేక్ తినలేము కదా!

యంత్రాల వైపు మళ్లే బదులు మనము భూమాత వైపు మళ్లాలి. సహజ పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో ఆయా భూములకు అనువైన పంటలను పండిస్తూ , సహజ ఎరువులను, క్రిమిసంహారకాలను తయారు చేసుకొని సాగు చేయటం మంచిది. అయితే ఈ రకమైన వ్యవసాయం పెరుగుతున్న జనాభాకు సరిపోను తిండిని పండించగలదా అని అనుమానం రావొచ్చు. బహుశా మొదట్లో సాధ్యం కాకపోవచ్చు. కాని పట్టుదలతో చేస్తే, తప్పని సరిగా కొద్ది సంవత్సరాల్లోనే సాధ్యం చేసుకోవచ్చు. క్యూబా ప్రజలు చేసుకోగా మనమెందుకు చేసుకోలేము? అప్పుడు మనం స్వచ్ఛమైన మందులు, విషాలు లేని ఆహారం తినటమే కాదు, మన భూములు, నీరు, గాలి కూడా స్వచ్ఛంగా కాలుష్య రహితంగా ఉంటాయి. ఆహార కొనుగోలుదారులు (సాధారణ వినియోగదారులు) కూడా సహజ ఆహారాన్ని కోరుకోవాలి. అందుకు తగిన ధర చెల్లించడానికి మనం ముందుకొస్తే రసాయనాలువాడకుండా పంటలు పండించడానికి రైతులు కూడా సిద్ధమవుతారు.

గౌరమ్మను గౌరవించండి

ఎలాగైతే తల్లి తన బిడ్డ విసర్జించే మలాన్ని శుభ్రం చేయడానికి జంకదో మట్టి కూడా అదే విధంగా జంకదు. జంకకపోవటమే కాదు మన కంటికి కనపడని తన సంతానంతో ఆ మలాన్ని మంచి ఎరువుగా కూడా మార్చగలదు. మనుషుల నుంచి జంతువుల దాకా అన్నిటి మలాన్ని మట్టిలోపల పూడ్చి సారవంతంగా మార్చొచ్చు. మా ఊళ్లో సంక్రాంతి ముందు నెల రోజుల పాటు పిల్లలు గౌరమ్మ ఎదుట నిలబడి దణ్ణం పెట్టుకుంటారు. గౌరమ్మ అంటే... ఆవుపేడతో చేసిన గౌరమ్మ! ఇండియాలో పంట పెంటతో ఎంతో దగ్గరగా ముడిపడి ఉంటుంది. అమెరికాలో మాత్రం పెంటను ఇట్లా భూమిలో కలిపేయరు. దాంతో పెద్ద సమస్యను తెచ్చి పెట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్లష్ లెట్రిన్లు నీటిని కలుషితం చేస్తున్నాయనేది అందరూ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. దీని అర్థం నేను మళ్లీ పూర్వకాలంలో లాగ 'బయటి'కెళ్లమనటం లేదు. మన మరుగుదొడ్ల నిర్మాణాన్ని పునః సమీక్షించాలంటున్నాను. నీటి అవసరం లేని డ్రై లెట్రిన్స్‌ని తయారు చేయాలంటున్నాను.


- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

No comments:

Gouthamaraju as WUA