పాడి పంటలు

Tuesday, April 19, 2011

హంస! * చిక్కటి పాలవంటి విలువలకు, ఆ పల్లెవాసులకు మధ్య అనుబంధాలే ‘రిలేషన్‌షిప్స్’

పాలూ నీళ్లను వేరుచేస్తుంది హంస.
నీళ్లు కలపని పాలు పోస్తుంది కాళ్లకూరు.
కాకిలా బతకొద్దనీ, కల్మషాలు కూడదనీ...
కష్టపడి పని చేయాలనీ చెబుతోంది.
ఆచరిస్తోంది.
అందుకే అది హంసలాంటి ఊరు అయింది.
ఆ ఊరికి ఇంతటి సంస్కారాన్ని నేర్పింది...
అమ్మమాటను జవదాటని పుత్రధర్మం, కన్నఊరిని మరువలేని ఒక బాంధవ్యం!
చిక్కటి పాలవంటి విలువలకు,ఆ పల్లెవాసులకు మధ్య అనుబంధాలే  - ఈ  ‘రిలేషన్‌షిప్స్’

చుక్క నీరు కలపకుండా చిక్కని పాలు పోసే వాళ్లు దొరికితే ఏం చేస్తాం? బహుశా ‘నీతిరత్న’ అనే బిరుదు ఇచ్చి సన్మానం చేస్తామేమో! అలాగైతే కాళ్లకూరు గ్రామంలోని రైతులు ఆ బిరుదు అందుకోవడానికి క్యూలో నిలబడవలసి వస్తుంది. ఎందుకంటే ఈ గ్రామంలో వందలాది మంది పాల రైతులు నీళ్లు కలపని చిక్కని పాలు మాత్రమే విక్రయిస్తున్నారు. అమెరికాలో వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ వేగేశ్న పృథ్వీరాజు (72)కు ఐదేళ్ల క్రితం వచ్చిన ఆలోచనతో అంకురించిన కాళ్లకూరు పాల ఉత్పత్తిదారుల సంఘం(కె.ఎమ్.పి)... పాలలో నీళ్లు కలపకపోవడంలోనే కాదు, ఆలోచనల్లో నిజాయితీని కలపడంలోనూ ముందుంది. ఈ సంఘస్థాపన ఒక ప్రయోగమని, అందుకే దీనిని ‘కాళ్లకూరు ప్రయోగం’ అని పేర్కొంటున్నామని పృథ్వీరాజు చెప్పారు.
అమ్మ ‘ఊరు’ కోలేదు...
పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్లకూరు గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వేగేశ్న పృథ్వీరాజును ఉన్నత చదువులు, ఉద్యోగాలు విదేశాలకు తీసుకువెళ్లినా... జన్మనిచ్చిన పల్లెటూరు, దాని జ్ఞాపకాల నుంచి దూరం జరపలేకపోయాయి. దాదాపు నలభైఏళ్ల పాటు పుట్టిన ఊరుకు దూరంగా గడిపిన పృథ్వీరాజు, తన తండ్రి మరణించారన్న సమాచారంతో కాళ్లకూరుకు వచ్చారు. తిరిగి వెళ్లబోతుంటే... ‘‘నావి చివరి రోజులు నాయనా... నా తుదిశ్వాస విడిచే వరకూ నన్ను విడిచిపోకు’’ అంటూ తల్లి కోరారు. ఆమె కోరికను మన్నిస్తూ ఒక రోజు రెండ్రోజులు కాదు.. ఆరేళ్ల్ల పాటు తల్లి దగ్గరే ఉండిపోయారు. ఆ సమయంలోనే పృథ్వీరాజుకు ఆ ఊరు తను మునుపటిలా లేదని తెలిసింది. తను తప్పటడుగులు వేసిన చోట... అనేక మంది తప్పుటడుగులు వేస్తున్నారని అర్థమైంది. కష్టాన్ని అసహ్యించుకోవడం, తాగుడు, అబద్ధాలు, నోటుకు ఓటును అమ్ముకోవడం, పరస్పరం మోసాలు చేసుకోవడం... వంటి ఆధునిక ప్రపంచపు అవలక్షణాలన్నీ అమాయక పల్లెను వశం చేసుకుంటున్నాయని అర్థమైంది. దాంతో తన వంతుగా పుట్టిన ఊరిబాగు కోసం ఉపక్రమించారు.

విదేశాల్లో స్థిరపడిన తొలి రోజుల్లోనే తను స్థానిక పెద్దల సహకారంతో ప్రారంభించిన ‘సత్య సేవాట్రస్ట్’కు తన సంపాదన లోంచి రూ.25లక్షల్ని అప్పట్లో పృథ్వీరాజు కేటాయించారు. అత్యవసర సమయాల్లో గ్రామస్థులను ఆర్థికంగా ఆదుకోవడమే దీని లక్ష్యం. అయితే అది అంత మంచి ఫలితాన్నివటం లేదని ఆయన గ్రహించారు. పేదరికం పోవాలంటే వారికి చేయాల్సింది ఆర్ధికసాయం కాదని, చూపాల్సింది ఆదాయ పొందే మార్గమని అర్థం చేసుకున్నారు.

పల్లె ప్రయో‘జనం’ కోసం
కష్టపడడం, నిజాయితీగా సంపాదించిన దానిలోకొంత తోటివారి మేలుకు ఉపయోగించడం, కలసికట్టుగా ఊరిని అభివృద్ధి పథంలో నిలపడం... ఈ లక్ష్యాలతో చేపట్టిందే కాళ్లకూరు ప్రయోగం. దీనిలో భాగంగా మొదట ఒక పాల సేకరణ కేంద్రాన్ని పృథ్వీరాజు నెలకొల్పారు. నీళ్లు కలపని పాలకు తగిన రేటు కట్టి ఇస్తూ పాల రైతులను సంఘటితం చేశారు. పాలలో నీళ్లు కలపకపోవడం, ఓటును అమ్ముకోకపోవడం.. వంటి విలువలకు కట్టుబడితేనే... ‘సంఘంలో సభ్యత్వం’ అని షరతు విధించి, హామీ పత్రం తీసుకున్నారు. ట్రస్ట్ తరపున గేదెలు కొనే స్థోమత లేని వారికి రుణాలు అందించారు. ‘‘మేం యాచకులం కాము పోషకులం’’ అని మా ఊరివాళ్లు సగర్వంగా చెప్పుకునేలా ఈ ప్రయోగాన్ని చేపట్టాం’’ అని పృథ్వీరాజు అంటారు. పాలను విక్రయించగా వచ్చిన లాభాలను కూడా ప్రతి ఏటా పాల రైతులకే బోనస్‌గా ఇవ్వడం ఈ కేంద్రం మరో ప్రత్యేకత.

‘‘గత ఏడాది ఇలా వచ్చిన రూ.1.60 లక్షల్ని రైతులకి అందించాం’’ అని పృథ్వీరాజు చెప్పారు. అంతే కాకుండా ప్రతి లీటరు అమ్మకం విలువ నుంచీ మూడు పైసల్ని విరాళంగా ఇవ్వాలనేది మరో నిబంధన. ‘‘ఆ మూడు పైసల విరాళం నుంచి గ్రామంలో 50 మందికి పైగా వృద్ధులకు కొద్ది మొత్తంలో పింఛన్లు అందిస్తున్నాం. అలాగే రూ.3.50 లక్షలతో ఏర్పాటు చేసుకున్న వాటర్ ప్లాంట్ కోసం తీసుకున్న రుణాన్ని కూడా అందులోంచే తిరిగి చెల్లిస్తున్నాం’’ అని తెలిపారు ఆయన. ఈ ప్లాంట్ ద్వారా కాళ్లకూరు గ్రామంలోని ఎనిమిది పాఠశాలల్లో చదువుకుంటున్న 450 మంది విద్యార్థ్ధులకు ఉచితంగా మంచినీటిని అందిస్తున్నారు. ‘‘మూడు పైసల పవిత్రతగా దీన్ని మేం పేర్కొంటున్నాం. ఎందుకంటే ఇది కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన డబ్బు. అంతే పవిత్రమైన కార్యక్రమాలకు ఇది ఉపయోగిస్తున్నాం’’ అని సంఘం బాధ్యతలు నిర్వర్తిస్తున్న వి.రామరాజు అన్నారు.

పృథ్వీరాజు ప్రవేశపెట్టిన ప్రయోగం త్వరితంగానే సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. కేవలం పది మందితో ప్రారంభమైన పాల ఉత్పత్తిదారుల సంఘం... రెండొందలకి చేరింది. నాలుగేళ్లుగా స్థానికులు సాధిస్తున్న సమష్టి ప్రగతి సమీప గ్రామాలకూ అనుసరణీయంగా మారుతోంది. ప్రస్తుతం వీరి బాటలోనే దొడ్డనపూడి గ్రామస్థులు కూడా ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ‘‘ఇక్కడి రైతుల చేత విరివిగా కూరగాయలు సాగు చేయించి వాటికి కూడా ఇలాగే మంచి రేటు వచ్చేలా చేయడం, తర్వాత తర్వాత రైసు మిల్లర్లకు లాభాల పంట పండిస్తున్న వీరి కష్టాన్ని వీరే అనుభవించేలా చేయడం... వంటి మరికొన్ని లక్ష్యాలు కూడా మాకు ఉన్నాయి’’ అని పృథ్వీరాజు వివరించారు.

మసకబారిపోతున్న తన స్వచ్ఛతను ఇపుడు ఒక పల్లె తిరిగి సముపార్జించుకుంటోంది. తమ కష్టమే పెట్టుబడి చేసుకుని నీతిగా బతకగలమనే నూతన ధైర్యాన్ని సంతరించుకుంటోంది. అమ్మకు ఇచ్చిన మాట కోసం ఆరేళ్ల పాటు తన పల్లెలో ఉండిపోయిన పృధ్వీరాజు... అమ్మ ఆశ నెరవేర్చారు. అమ్మలాంటి ఊరును మార్చారు. అందుకు అమ్మ తప్పకుండా సంతోషిస్తుంది. ఏ లోకాన ఉన్నా కుమారుడి ఆశయం నెరవేరాలంటూ దీవెనలు అందిస్తుంది.


పాలల్లో నీళ్లు కలిపి అమ్మడం ఎంత తప్పో... నోటుకు ఓటు అమ్ముకోవడం ఎంత ముప్పో... ఇపుడు మా గ్రామస్థులకు అర్ధమవుతోంది. నీతిగా నిజాయితీగా ఉండడం గ్రామానికి మంచి చేస్తోం ది. ఇపుడు ఎన్నో మంచి పనులు చేసుకోగలు గుతున్నాం. - సుబ్బరాజు, కె.ఎం.పి సభ్యుడు, కాళ్లకూరు

సంఘంలో చేరాక మేం తీసుకువచ్చే చిక్కని పాలకు తగిన రేటు వస్తోంది. మా ఊరిలో ఉన్న ముసిలోళ్లకి కొంచెం పింఛను డబ్బులు కూడా వస్తున్నాయి. అందరం ఒక మాట మీద ఉండడం వల్ల ఊళ్లో అందరికీ లాభం కలుగుతోంది. - సీతారాముడు, కె.ఎం.పి సభ్యులు


- ఎస్.సత్యబాబు

Gouthamaraju as WUA