పాడి పంటలు

Showing posts with label Rythu. Show all posts
Showing posts with label Rythu. Show all posts

Sunday, September 9, 2012

Sunday, June 3, 2012

మామిడి రా'రాజులు'

 

ఇన్నాళ్లూ మండుటెండల్లో వేపుకుతిన్న వేసవి.. మరికొన్ని రోజుల్లో వెళ్లిపోతోంది. వేసవి ఎండల్ని భరించిన అందరికీ మధురమైన జ్ఞాపకం ఏదైనా ఉందా అంటే .. అది మామిడి మాధుర్యం అనే చెప్పవచ్చు. పండ్ల రుచుల్ని ఆస్వాదించిన వాళ్లకే కాదు. మామిడిని సాగు చేస్తున్న రాజుల కుటుంబాలకూ ఇదే అనుభవాన్ని మిగిల్చి వెళుతోంది ఈ వేసవి. మామిడి సాగులో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా.. పరువు కోసం పంట పండించే ఈ సామాజిక వర్గం విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో వేలాది ఎకరాల మామిడి తోటల్ని సాగు చేస్తోంది. తరతరాల వారసత్వ సంపదగా భావిస్తోంది. దేశంలోనే అరుదైన మామిడి రకాల్ని పండించి.. ప్రధాన నగరాలతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు ఎగుమతుల్ని చేస్తోంది. 

రాజుల మామిడి సాగుపైనే ఈ ‌స్టోరీ..

పండ్లలో రారాజు?
మధురఫలం, అదేనండీ మామిడి.
మరి, మామిడిని పండించడంలో మారాజులు ఎవరు?
ఇంకెవరు? విజయనగరం రాజులు.
రాజులు రాజ్యాలను కోల్పోయినా.. మామిడితోటల మీద మమకారాన్ని ఇప్పటికీ వదులుకోవడం లేదు.


విజయనగరం, బొబ్బిలి ఒకప్పటి రాజుల సంస్థానాలు. ఇప్పుడవి లేవు కాని, వాళ్ల అడుగుజాడల్లో మొలకెత్తిన విలాసమైన మామిడితోటలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. తోటల సాగులో నష్టమొచ్చినా, కష్టమొచ్చినా.. రాజదర్పం ఊరికే ఉండనిస్తుందా? అప్పులు చేసైనా సరే, ఆస్తులు కరిగిపోయినా సరే.. పచ్చటి తోటలు కళకళలాడాల్సిందేనంటున్నారు రాజులు. తోటల్లోనే రాజప్రాసాదాలు నిర్మించి (గెస్ట్‌హౌస్‌లు) మామిడిని పండించడం వీరి సంప్రదాయం. ఈ సంస్కృతి పాతకాలం రాజుల నుంచే వచ్చినా ఇప్పటికీ కొనసాగుతోంది. తాతతండ్రుల నుంచి వచ్చిన మామిడి తోటలంటే ప్రతి రాజు కుటుంబానికీ మహా ప్రీతి.

విజయనగరంలో అప్పటి రాజవంశీయులైన పీవీజీ రాజు మొదలుకొని ఆయన కుమారులు ఆనంద గజపతిరాజు, అశోక్‌గజపతి రాజుల వరకు మామిడితోటల సాగును వారసత్వ సంపదగా భావిస్తున్నారు. బొబ్బిలి సంస్థాన పాలకులైనవెలమదొర రాజారావు బహుదూర్ రంగారావు కుటుంబం మామిడి తోటలకు పెట్టింది పేరు. ఈ రెండు కుటుంబాల రాజవంశీయులతోనే మామిడితోపుల సాగుకు బాటలు పడ్డాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఇందులో 15 వేల హెక్టార్లను రాజుల సామాజికవర్గమే సాగు చేస్తున్నది.

మామిడిపంటల మీద రాజులకు ఎప్పటి నుంచో మోజుంది. బొబ్బిలి సంస్థానంలో ఒకటైన రాజాం (శ్రీకాకుళం) కోట పరిసరాల్లో 'గుర్రాం' అనే ఒక రకం మామిడి చెట్టు ఉండేదట. ఆ చెట్టు పండ్లు రాలిన వెంటనే బొబ్బిలి రాజావారికి అందజేయడానికి ఇద్దరు మనుషుల్ని ఏర్పాటు చేసేవారట. అలనాడు రాజుల మనసుదోచిన ఆ మామిడి పండ్లకు ఇప్పటికీ మంచి గిరాకీ ఉంది. ఒకప్పటి తీపిగుర్తుగా గుర్రాం రకం మామిడితోటల్ని వెలమదొరలు ఈనాటికీ వందలాది ఎకరాల్లో సాగు చేస్తుండటం విశేషం. బొబ్బిలి వెలమదొర సాలా వెంకట మురళి కృష్ణ వంద ఎకరాల్లో 30 రకాల మామిడి పండ్లను పండిస్తున్నారు. అత్యంత నాణ్యమైన 'కేసరి' రకానికి 2009లో రాష్ట్రస్థాయి ప్ర«థమ బహుమతి దక్కింది. అమ్రపాలి, నీలిమ రకాలకు కూడా ఆ తరువాతి సంవత్సరం మరో అవార్డు లభించింది. విజయనగరం, బొబ్బిలిలోని మామిడితోటల మాధుర్యం.. ఢిల్లీని కూడా తాకింది. సీజన్ వచ్చిందంటే చాలు.. రాజధాని నుంచి మామిడి వ్యాపారులు ఉత్తరాంధ్రకు పరిగెత్తుకొస్తారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు ఎగుమతి చేస్తున్నారు.

తోటలే బంగారం...

రాజుల మామిడికి దేశవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ రావడం వెనుక తరాల శ్రమ దాగుంది. లాభాల కోసం రాజులు వ్యవసాయం చేయరు. నిష్టతో ప్రతిష్ట కోసం పంట పండిస్తారు. చదువు సంధ్యలకంటే మామిడితోటల పెంపకంపైనే ఎక్కువ శ్రధ్ధ కనబరుస్తారు. మొక్కలు నాటిన రోజు నుంచి పెరిగి పెద్దయి, కాపుకొచ్చే వరకు వారి కంటి మీద కును కుండదు. నిజానికి ఈ ప్రాంతంలో మామి డికంటే.. సరు గుడు తోటల సాగే బాగా గిట్టుబాటు అవుతుంది. కాని రాజులు మామిడిని కాదని మరో పంటను సాగు చేసేందుకు ఇష్ట పడరు. "ఎకరా సరుగుడు తోటకు ఎంత లేదన్నా రూ.60 నుంచి రూ.70 వేలు ఆదాయం వస్తుంది.

కాని ఇవి భూగర్భజలాలను హరిస్తాయి. అందుకే మా కుటుంబాలకు మామిడి తోటలంటేనే ప్రాణం. మామిడి పర్యా వరణానికి మేలు చేస్తుంది. పది మందికి తియ్యటి ఫలాల్ని అందించామన్న సంతృప్తిని మిగిలిస్తుంది. అందుకే దిగుబడి ఎంత వచ్చినా వెనుకంజ వసే ప్రసక్తే లేదు'' అంటు న్నారు రాజులు. మధ్య తరగతి కుటుం బాలు ఎంత బంగారం ఉంటే అంత భద్రత ఉన్నట్లు భావిస్తారు. రాజులు కుటుంబాల్లో అలా కాదు. పెళ్లిళ్లతో బంధు త్వాల్ని కలుపు కోవాలన్నా, ఎన్ని ఎకరాల మామిడి తోటలు ఉన్నాయో? చూశాకే ఇంట్లో మేళ తాళాలు మోగుతాయి. ఆడ పిల్లలకు బంగారానికి బదులు మామిడితోటల్ని కట్నంగా రాసిస్తా రంటే.. వాటికున్న విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడ ఎక్కువ సాగు..?

ఆలమండ, భీమాలి, జొన్నవలస, గంట్యాడ, డెంకాడ, కొత్త వలసలలో వేలాది ఎకరాల మామిడి తోటల్ని రాజులే సాగు చేస్తున్నారు. పార్వతీపురం డివిజన్‌లోని బొబ్బిలి పరిధిలో వెలమదొరల తోటలు ఉన్నాయి. మామిడి మొక్కల నర్సరీలను కూడా రాజులే పెంచుతున్నారు. ఎల్.కోటలోని భీమాలి రాజుల నర్సరీలకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా పేరొందిన మేలైన మామిడి రకాల మొక్కలు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. విజయనగరం, బొబ్బిలి రాజులు సాగు చేస్తున్నన్ని మామిడి రకాలు మరెక్కడా సాగు కావడం లేదు. వ్యాపార అవసరాల కోసం వేసిన దేశవాళీ, హైబ్రీడ్, నార్త్ ఇండియా, సౌత్ఇండియాలతో కలిపి 50 మామిడి రకాలను సాగు చేస్తున్నారు. బంగినపల్లి, సువర్ణరేక, పనుకులు, చిన్నరసం, పెద్దరసం, చెరుకురసం, బారామతి (పునాస మామిడి), కోలంగోవ, హిమామ్ పసంద్, దసేరీ, లంగడా, నీలం, మల్లిక, ఆమ్రపాలి, కేసర్, సఫేదా, సుయా, నీలుద్దీన్, నీలిషాన్, జహంగీర్, స్వర్ణ జహంగీర్, పెద్ద సువర్ణరేక, పోలిపిల్లి సువర్ణరేక, పానకాలు, ఆల్ఫాన్సో వంటి రకాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.

'మార్చి'కొస్తే మంచిది...

ఇక్కడి వాతావరణానికి సరిపోయే పనుకు మామిడి, రాజు మామిడి రకాలను మొట్టమొదట విజయనగరంలో సాగుచేసింది రాజులే. అయితే సువర్ణరేక, బంగినపల్లి రకాల మాదిరిగానే ఇవి కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు దిగుబడి రాకపోవడంతో రైతులకు ఇబ్బందులొస్తున్నాయి. అందుకే, మార్చిలోపు పంట చేతికొచ్చే కొత్త రకాల కోసం అన్వేషిస్తున్నారు. మార్చి తరువాత ఏప్రిల్‌లో విపరీతమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటకు నష్టం వాటిల్లుతోందని రాజుల అభిప్రాయం. మార్చిలోపు పంట చేతికొస్తే, వాతావరణ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. అందుకే ఇలాంటి రకాల కోసం పరిశోధించాలని ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు (ఐఏఆర్ఐ) జిల్లా మ్యాంగో గ్రోవర్స్ అసోషియేషన్ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ మధ్య ఐఏఆర్ఐ పరిశోధనల్లో వెలువడిన కొత్త రకాలు.. పూసాప్రతిపా, పూసా ఫాస్ట్, పూసా లాలీమాలు కూడా మార్చి తర్వాతే దిగుబడిని ఇస్తున్నాయి.

మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు విజయనగరం జిల్లా నుంచి కేవలం మామిడి వ్యాపార ఎగుమతుల వల్లే.. ఈస్ట్‌కోస్టు రైల్వేకు రూ.5 కోట్లు రాబడి వస్తుంది. రైల్వే వ్యాగన్‌ల ద్వారా విజయనగరం నుంచి న్యూఢిల్లీకి మామిడి పండ్లు ఎగుమతి అవుతాయి. ఏడాది ముందుగానే ఢిల్లీ వ్యాపారులు ఇక్కడి రైతులకు పెట్టుబడులు ఇచ్చి మరీ మామిడి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నారు. ఒక్క ఢిల్లీయే కాకుండా, కోల్‌కతా, ఒడిశ్సాలకూ విజయనగరం నుంచే మామిడి పండ్లు వెళుతున్నాయి. ఈ ఏడాది ఒక్క ఢిల్లీకి మాత్రమే 40 వ్యాగన్‌ల సరుకు ఎగుమతయ్యింది. ఢిల్లీకి సరుకు చేరాక.. అట్నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు మామిడి వెళుతోంది.

మింగేస్తోన్న రియల్ఎస్టేట్..?

రింగురోడ్లు, సెజ్‌లు, అణువిద్యుత్ ఫ్యాక్టరీలు.. ఇవన్నీ సేద్యపు భూముల్ని మింగేస్తున్నట్లే.. రియల్ఎస్టేట్ దెబ్బకు మామిడితోపులు కూడా మాయమైపోతున్నాయి. తరాల నుంచి కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడితోటలు రకరకాల సమస్యల వల్ల కనుమరుగైపోవడం ఈ ప్రాంతవాసుల్ని కలచి వేస్తోంది.
కొత్తవలసలోని గులిపల్లి దగ్గరున్న మిస్సమ్మ మామిడి తోటలంటే చుట్టుపట్టు పల్లెల్లో పెద్ద పేరుండేది. సుమారు 200 ఎకరాల్లో విస్తరించిన ఈ తోటలు ఇప్పుడు కనిపించడం లేదు. వన్నెపాలెంలో వందేళ్ల వయసున్న 300 ఎకరాల మామిడి తోటలు ఉండేవి. దిగుబడి తగ్గిపోవడంతో.. మామిడి చెట్లను తొలగించి లే అవుట్లను వేశారు. ఈ తోటలన్నీ ఒకప్పుడు రాజులవే! ఎన్ని సంక్షోభాలు ఎదురయినా.. మామిడితోటల పెంపకంపై వారి ఆసక్తి మాత్రం చావడం లేదు. అందుకే, భూముల్ని అమ్మేసినా.. మరో ప్రాంతంలో భూముల్ని కొనుగోలు చేసి, కొత్త తోటల్ని సాగు చేస్తున్నారు.

ఒక్కొక్క రైతుదీ ఒక్కో కథ..

విజయనగరవాసి మునగపాటి సీతారామరాజు కుటుంబానికి వందేళ్లుగా మామిడితోటలే జీవనాధారం. తాత నారాయణరాజు నుంచి తండ్రి రామ్మూర్తిరాజుకు మామిడితోట వారసత్వంగా వచ్చింది. "నాకు నా చిన్నతనం నుంచే మామిడితోటలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అందుకే, ఆ తోటల్ని విడిచి నేను పెద్ద చదువులు కూడా చదువుకోలేక పోయాను. నాకు ఇద్దరు కొడుకులు. వాళ్లకు మంచి చదువులు అబ్బలేదు. మామిడితోటల మీదే ఆసక్తి ఏర్పడింది..'' అన్నారు సీతారామ రాజు. ప్రస్తుతం జిల్లా మ్యాంగో గ్రోవర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన విజయనగరం లాంటి జిల్లాలో వరి పంట తరువాత రైతుకు ఆదాయాన్నిచ్చే మేలైన పంటలు ఏవీ లేవంటారు. జిల్లాలో జనుము, వేరుశనగ సాగు పూర్తిగా అంతరిం చింది.

అందుకే, పల్లపు భూముల్లోనూ మామిడిని పండిస్తు న్నారు. ఇక్కడ మామిడిసాగు కుటుంబ ప్రతిష్టకు సంబంధించినది కూడా. దాని కోసం ఏమైనా చేస్తాం అంటారు కొత్తవలస రైతు దండు నరశింహరాజు లాంటి వాళ్లు. మొక్కలు పెంచే సమయంలో నీళ్లు లేకపోతే.. రెండ్రోజులకు ఓసారి స్వయంగా నీళ్లు పోసి పోషించుకున్నారాయన. మామిడి ఎగుమతి గురించి మాట్లాడుతూ "పెద్ద మార్కెట్‌లకు ఒకేసారి అన్ని ప్రాంతాల నుంచి మామిడి ఎగుమతి అవుతోంది. దీంతో మార్కెట్‌లో ధరలు పడిపోతున్నాయి. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తే రైతులకు మేలు జరుగుతుంది..'' అన్నారు రాజు. నలభై ఎకరాల్లో మామిడి తోటను సాగుచేస్తున్న నరశింహ రాజు ఏడాదికి పెట్టుబడి కిందే రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇది భారమైనా మారే ఆలోచన చేయడం లేదు. "ఇంత పెట్టు బడిపెట్టి నష్టపోయే బదులు మరో పంట వేసుకోవచ్చు కదా'' అని తోటి రైతులు చెప్పినా రాజుకు మామిడిని వదిలే ఉద్దేశ్యం లేదిప్పుడు. ఎందుకంటే, ఆయనకు మామిడి తోటలతో 60 ఏళ్ల అనుబంధం ఉంది. తోటల సమీపంలోనే రూ.30లక్షలతో అతిథి గృహాన్ని నిర్మించుకుని సంతోషంగా జీవిస్తున్నారు శివరామరాజు కుటుంబీకులు.

మామిడి రైతులు ఇప్పుడు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య దళారీ వ్యవస్థ. దీన్ని తగ్గిస్తే రాజుల మామిడితోటలు ఇంత వేగంగా కరిగిపోవంటున్నారు లక్కవరపుకోట మండలం భీమాలికి చెందిన రైతు ముదునూరు జోగి జగన్నాథరాజు. మామిడిని సాగు చేయడంలో ఈ కుటుంబానికి ఏళ్ల చరిత్ర ఉంది. వందల ఎకరాల్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నది. "దళారీల వల్ల మాలాంటి కౌలు రైతులకు నష్టాలే మిగులుతున్నాయి..'' అని ఆవేదన వ్యక్తం చేశారాయన. రాజుకు చెందిన ఇద్దరు కొడుకులు కూడా మామిడి సాగు మీదే జీవనం సాగిస్తున్నారు.

నర్సరీలను పెంచుతూ..

ఏ పరిశోధనశాలలో కొత్తరకం మామిడి మొక్కను ఉత్పత్తి చేసినా.. విజయనగరం, బొబ్బిలికి రావాల్సిందే. అందుకే, నర్సరీలను సైతం ఇక్కడి రైతులే నిర్వహిస్తున్నారు. బంగినపల్లి, కోలంగోవ, పణు మామిడి రకాల మొక్కలు నర్సరీల్లో దొరుకుతున్నాయి. "మేము నర్సరీలను పెంచుతున్నాం. అయితే, ఇక్కడ వస్తున్న ఇబ్బందల్లా ఎగుమతులకు అవసరమైన మౌళిక సదుపాయాలు లేకపోవడం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మామిడి యార్డులను ఏర్పాటు చేస్తే మంచిది. రైతులే నేరుగా పంటల్ని తెచ్చి అమ్ముకుంటారు. ఇప్పటికే విజయవాడ, రాజమండ్రిలలో ఈ పద్ధతి అమలవుతోంది'' అంటున్నారు భీమాలికి చెందిన కమ్మెళ్ల కృష్ణంరాజు.

మామిడి సాగులో తరిస్తున్న రాజుల కుటుంబాలు.. వ్యాపార అవసరాలకే పంట పండించరు. తోటల్లోకి కొన్ని మధురమైన మామిడి చెట్లను సొంతానికి కూడా పెంచుకుంటారు. బంధువులు, స్నేహితులకు ప్రతి సీజన్‌లోనూ మామిడి పండ్లను అభిమానంతో బహుమానంగా పంపించడం అలవాటు. "సేద్యంలో దిగుబడి అనేది శ్రమకు దక్కే ప్రతిఫలం. ఆ ఫలితాన్ని పదిమందితో పంచుకుంటే గొప్ప సంతృప్తి కలుగుతుంది. అందుకే, మాకు మామిడి వాణిజ్య పంటే కాదు. అనుబంధాల్ని మరింత మధురం చేసే పంట'' అంటూ తరిస్తున్నారు రాజు కుటుంబాల్లోని మామిడి రైతులు.

మాది వందేళ్ల తీపి బంధం

మామిడి తోటలతో మా కుటుంబానికి వందేళ్ల అనుబంధం అల్లుకుంది. ముత్తాతల నుంచి తోటల పెంపకం, వ్యాపారం చేస్తున్నాము. మా నాన్నగారి తరం వరకు మామిడి సాగుతోపాటు వ్యాపారమూ లాభసాటిగానే ఉండేది. ఇప్పుడు భారంగా మారింది. రైతులు, వ్యాపారులు ఇద్దరూ సంతోషంగా లేరు.
ప్రస్తుతం భీమాలిలో నర్సరీని పెంచుతున్నాం. రైతులకు మొక్కల్ని సరఫరా చేసి.. బతుకుతున్నాం. ఇన్నాళ్లూ మామిడి తోటలే మమ్మల్ని బతికించాయి. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి కదాని.. మరో పని చేయడానికి సిద్ధంగా లేము. రాజుల కుటుంబాల్లో ఎంత నిరుపేదలైనా కూలి పని చేయడానికి ఇష్టపడరు. అందుకే, ఈ బాధలు పడుతున్నాం.
- ముదునూరు గోపాలకృష్ణ, బలిగట్టం


30 రకాలను సాగు చేస్తున్నాం

దేశంలో దొరికే మామిడి రకాలన్నీ మా తోటలో పండించాలన్నదే మా ఆశయం. ప్రస్తుతం వందెకరాల భూమిలో 30 రకాల మామిడి చెట్లను పెంచుతున్నాం. మామిడి సాగులో మా కుటుంబానికి వందేళ్ల అనుభవం ఉంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, హైబ్రిడ్, స్థానిక రకాలు మంచి దిగుబడినే ఇస్తున్నాయి. వ్యాపార అవసరాల కోసం సువర్ణరేక, బంగినపల్లి, కోలంగోవ, కలెక్టరు రకాలను పండిస్తాం. ఇంటికి, బంధుమిత్రులకు నార్త్ ఇండియా రకాలైన దశరి, అయినా, లాంగరా, సఫేదా, కేసరి, మాల్టా, మాల్‌గోవా, రత్నా, అల్పాన్జో రకాలను వేశాము. కేసరి రకానికి 2009లో రాష్ట్రస్థాయి మామిడి పోటీలో ప్రథమ బహుమతి దక్కింది. సౌత్ ఇండియా మామిడి రకాలైన నీలిమా, ఆమ్రపాలి, రకాలకు 2010లో రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది. స్థానిక రకాలైన బొబ్బిలి పీచు, మెట్టవలస, ఫిరంగి లడ్డూ, గుర్రాం, కృష్ణపసందు, స్వర్ణ సింధూ, జలాలు కూడా మధురంగా ఉంటాయి. మెట్టవలసపీచు, బొబ్బిలి పీచులనే మామిడి రకాల్లో.. 70 పండ్ల ధర రూ.7000 పలికింది.

కౌలు భూమి తగ్గింది...

ఒకప్పుడు వందల ఎకరాల్ని తీసుకుని కౌలుకు సాగు చేశాం. ఇప్పుడు కౌలుకు వ్యవసాయం చేస్తే ఏమీ మిగలడం లేదు. మామిడితోటలున్న భూములు కూడా తగ్గిపోయాయి. ఉన్నంతలో తక్కువ విస్తీర్ణంలో అయినా.. సొంతంగా సేద్యం చేస్తున్నాం. ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. అది కూలీల సమస్య. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంతో అన్ని గ్రామాల్లోనూ కూలీల కొరత ఏర్పడింది. అక్కడక్కడ దొరికే కూలీలు కూలీ రేట్లు పేంచేశారు. వస్తున్న దిగుబడికి, పెడుతున్న పెట్టుబడికి సరిపోవడం లేదు. అన్ని పంటల్లాగే మామిడికీ ఇవే కష్టాలొచ్చాయి. వీటన్నిటికి తోడు దళారులు మమ్మల్ని తినేస్తున్నారు.
- ఎం.వెంకట సత్యనారాయణరాజు, కొత్తవలస


రైతులు మారాలి..

మారుతున్న కాలానికి అను గుణంగా మామిడి రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం లేదు. అలా చేస్తే మరింత దిగుబడి పెరుగుతుంది. వందలాది ఎకరాల్లో తోటలు సాగుచేసినప్పుడు ఎకరానికి మరో ఎకరానికి కొంత దూరం ఉండాలి. చెట్లు సంఖ్య పెరగాలనే ఆశతో రైతులు ఇలాంటి పద్ధతుల్ని అమలు చేయడం లేదు. దీనివల్ల మామిడి కోతలప్పుడు.. కాయలు రాలిపోయే అవకాశం ఉంది. దిగుబడి అమ్మకాల్లో కూడా రైతులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పూత దశలో ఉన్నప్పుడే ఢిల్లీ, ముంబయి వ్యాపారులకు పంటను అమ్మేస్తున్నారు. సీజన్‌లో పెరిగే ధరలు మాత్రం రైతులకు దక్కడం లేదు. అందుకే, రైతులే పంట ఉత్పత్తుల్ని నేరుగా అమ్ముకునే పరిస్థితి రావాలి.
- రహీమ్, ఉద్యానవన శాఖాధికారి, విజయనగరం
by
* బిర్లంగి ఉమామహేశ్వరరావు,
విజయనగరం

Sunday, April 15, 2012

బిందుసేద్యంతో చెరకు సాగు


 
 
 
 
 
 
 
 
 
 
 
వేసవి ఉష్ణోగ్రతలు చెరకు పైరు ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతాయి. ఎందుకంటే అత్యధిక-అతి తక్కువ ఉష్ణోగ్రతల్ని, ఎండ తీవ్రతను, వడగాడ్పుల్ని చెరకు పైరు తట్టుకోలేదు. ముఖ్యంగా లేత తోటలు ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వేసిన చెరకు తోటలు ప్రస్తుతం పిలకలు తొడిగి, పెరిగే దశలో ఉన్నాయి. ఈ నెల నుంచి జూన్ వరకూ ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. గాలిలో తేమ బాగా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిందుసేద్య పద్ధతి ద్వారా భూమిలో తేమను కాపాడుకుంటూ, చెరకు పైరును రక్షించుకోవచ్చు.

ప్రయోజనాలెన్నో...

బిందుసేద్యం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మామూలు పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలోని చెరకు తోటకు అందించే నీటితో బిందుసేద్య పద్ధతిలో మూడు నాలుగు ఎకరాల్లో ఈ పైరును సాగు చేయొచ్చు. వేసవిలో రైతులు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న విష యం తెలిసిందే. రోజుకు ఆరేడు గంటలు మాత్ర మే కరెంట్ అందుబాటులో ఉంటోంది. అయితే బిందుసేద్య పద్ధతిని అనుసరించే రైతులు విద్యుత్ కోతల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఆ ఆరేడు గంటల సమయంలోనే కనీసం నాలుగైదు ఎకరాల తోటకు నీరు అందించవచ్చు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అన్న దిగులే అవసరం లేదు. ఎప్పుడు కరెంటు ఉంటే అప్పుడు ఆటోమేటిక్ పరికరం సాయంతో ఏ ఇబ్బందీ లేకుండా తోటకు నీరు అందించవచ్చు. పైగా నీరు పెట్టేందుకు ప్రత్యేకంగా మనిషి అవసరం ఉండదు. మామూలు పద్ధతిలో రాత్రి సమయంలో తోటకు నీరు పెట్టేటప్పుడు పాములు, ఇతర విష పురుగుల వల్ల ప్రాణహాని ఉంటుంది. బిందుసేద్య పద్ధతిలో అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు.


బిందుసేద్య పద్ధతి వల్ల ఒనగూడే మరో ప్రయోజనమేమంటే కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. సారవంతమైన మట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉండదు. తద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చు. భూమికి ఎక్కువ నీరు అందుతోందన్న ఆందోళన అవసరం లేదు. మొక్కలకు క్రమ పద్ధతిలో సరిపడినంత నీరు మాత్రమే అందుతుంది. పైగా తోట అంతటికీ సమానంగా అందుతుంది. భూమి చౌడు బార దు. ధాతు లోపాలు తలెత్తవు. మొక్కలు ఆరోగ్యవంతంగా, ఏపుగా, క్రమ పద్ధతిలో పెరుగుతాయి. చీడపీడల తాకిడి తగ్గుతుంది. దీనివల్ల నాణ్యమైన పంటను పొందవచ్చు. రస నాణ్యత కూడా బాగా ఉంటుంది. కూలీలు, సస్యరక్షణపై పెట్టే ఖర్చు కలిసొస్తుంది. దిగుబడి 40-50 శాతం పెరుగుతుంది. బిందుసేద్య పద్ధతిలో చెరకు తోటలో అంతర పంటలు కూడా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. బిందుసేద్య పద్ధతి ద్వారా ఎరువులు, సూక్ష్మ పోషకాల్ని మొక్కలకు సరైన మోతాదులో సమానంగా అందించవచ్చు. తద్వారా ఎరువులు, సూక్ష్మ పోషకాలపై పెట్టే అనవసరపు ఖర్చును నియంత్రించుకోవచ్చు. ఇసుక నేలలు, గుట్టలు... అంటే ఎగుడు దిగుడుగా ఉండే భూముల్ని చదును చేయాల్సిన అవసరం లేకుండానే తోట వేసుకోవచ్చు. చదును చేయడానికి వీలులేని భూముల్లో కూడా బిందుసేద్యం ద్వారా చెరకు సాగు చేయవచ్చు.


ప్రోత్సాహం-దిగుబడులు

చెరకు సాగులో బిందుసేద్యాన్ని ప్రోత్సహిం చేందుకు పలు చక్కెర కర్మాగారాలు రైతులకు సబ్సిడీలు అందజేస్తున్నాయి. దీనివల్ల బిందుసేద్యంపై చెరకు రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది రైతులు బిందుసేద్య పద్ధతిలో చెరకు సాగు చేసి మంచి ఫలితాలు పొందుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మం డలం పోతవరం గ్రామానికి చెందిన కాశీ విశ్వనాథం మొక్క తోటలో ఎకరానికి సగటున 70 టన్నులు, పిలక తోటలో 69.4 టన్నుల దిగుబడి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన దాసరి వెంకటాచలం ఎకరానికి సగటున 70 టన్నుల దిగుబడి పొందారు. వీరిద్దరూ ఇటీవలే ఉగాది పురస్కారాలు కూడా అందుకున్నారు.

బి.హనుమంతరెడ్డి, ఎమ్మెస్సీ అగ్రికల్చర్

అగ్రానమిస్ట్, రాజమండ్రి

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

జంట సాళ్ల పద్ధతిలో చెరకు ముచ్చెలు నాటినట్లయితే లేటరల్ పైపుల అవసరం తక్కువగా ఉంటుంది. దీనివల్ల డ్రిప్పులపై పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. సాళ్ల మధ్య నాలుగు లేదా ఐదు అడుగుల దూరాన్ని పాటించిన వారు లేదా సాధారణ పద్ధతిలో (సాళ్ల మధ్య మూడు అడుగుల దూరం) ముచ్చెలు నాటిన వారు కూడా బిందుసేద్య పద్ధతిని అనుసరించవచ్చు. బావులు, చెరువులు వంటి నీటి వనరుల ద్వారా చెరకు సాగు చేసే వారు ప్రతి 15 రోజులకు ఒకసారి సిస్టమ్ ఫిల్టర్లను శుభ్రపరచుకోవాలి. ఫర్టిగేషన్ (పైపుల ద్వారా పైరుకు ఎరువులు అందించడం) తర్వాత 10 నిమిషాల పాటు లేటరల్ పైపుల ద్వారా మంచినీటిని పారించాలి. పంటను కోసిన తర్వాత యాసిడ్ (33%) ట్రీట్‌మెంట్‌తో పైపుల్ని శుభ్రపరచాలి. మొక్కల దగ్గర పీడనాన్ని పరీక్షించాలి.

Monday, April 2, 2012

‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ * ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్


ప్రకృతి వ్యవసాయమే మిన్న
 

ప్రకృతి వ్యవసాయంలో కలుపు సమస్యే కాదని ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. రసాయనిక ఎరువులు, టన్నుల కొద్దీ వేస్తున్న పశువుల ఎరువులతోనే కలుపు రైతులకు తీవ్ర సమస్యగా మారుతోందని అన్నారు. ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే అంశంపై రెడ్‌హిల్స్‌లో సోమవారం రైతులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు. 

సక్రమంగా ఆచ్ఛాదన కల్పించి, జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయన్నారు. జీవనద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరమన్నారు. మెట్ట పొలాల్లో ఆచ్ఛాదనకు గడ్డి లేకపోతే.. భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో ఆచ్ఛాదన కల్పించవచ్చన్నారు. 

ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువూ వేయనక్కర లేదని, దేశీ లేదా నాటు ఆవు పేడ, మూత్రంతో తయారైన ‘జీవామృతం’లో కోటానుకోట్ల సూక్ష్మజీవు లుంటాయని పాలేకర్ వివరించారు.

శిబిరంలో వ్యవసాయ శాఖ కమిషనర్
వ్యవసాయ శాఖ కమిషనర్ ఉషారాణి పాలేకర్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. ఆ తర్వాత ఆయనతో చర్చించారు. కర్నాటక, కేరళ ప్రభుత్వాలు తన విధానాన్ని ఆమోదించి శిక్షణాశిబిరాలు నిర్వహిస్తున్నాయని, ఒక్కో రాష్ట్రంలో పది లక్షల మం ది ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారని పాలేకర్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.

మామిడి, సపోట పండిస్తున్నాను...
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ 150 ఎకరాల్లో మామిడి, సపోట వంటి అనేక పంట లు పండిస్తున్నాను. రెండేళ్లుగా మా పొలంలో పురుగుల మందు చల్లలేదు. ఎరువులు వేయలేదు. ‘జీవామృతం’ వాడుతున్నాను. రుచికరమైన దిగుబడి వస్తోంది. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. అంతరపంటల ద్వారా ఆదాయం వస్తోంది.
- తిప్పేస్వామి, రాయదుర్గం, అనంతపురం జిల్లా

ఇథియోపియాలోనూ....
ఏడేళ్ల క్రితం పాలేకర్ పుస్తకం చదివి ప్రకృతి వ్యవసాయం చేపట్టాను. అనేక అవార్డులు పొందాను. ఇథి యోపియా దేశానికి వెళ్లి గులాబీలు, కూరగాయలు, మొక్కజొన్న, చెరకు వంటి పంటలను పండిస్తున్నాను. కబేళాకు వెళుతున్న నాటు ఆవులను కొని సాగు ప్రారంభిం చాను. ఇథి యోపియాలో ‘బురానా’ జాతి ఆవు పేడ, మూత్రంతో కూడిన జీవామృతం అద్భుత ఫలితాలనిస్తోంది. ప్రభుత్వం సబ్సిడీలకు బదులు రైతుకో ఆవు ఇస్తే మేలు జరుగుతుంది.
- జీవీ రాజు, ఎస్‌ఆర్ కండ్రిక, వైఎస్సార్ జిల్లా




దేశవాళి ఆవులే మేలు


  దేశంలోని గోజాతిని దేశవాళి, విదేశీ, సంకర జాతులుగా విభజించవచ్చు. మిగిలిన రెండు జాతుల కంటే స్వదేశీ ఆవులు ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన అధిక ఉష్ణ పరిస్థితుల్లో కూడా పాల దిగుబడులలో తేడా లేకుండా ఉంటాయి. బాహ్య పరాన్న జీవులను తట్టుకోగలిగిన సామర్థ్యం ఎక్కువగా ఉండడం వలన వీటికి ఆరోగ్య సమస్యలు తక్కువ. ఈ లక్షణాలు సంకర, విదేశీ జాతి ఆవుల్లో దాదాపు కనిపించవంటున్నారు మండపేటలోని రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రానికి చెందిన ఏడీఏలు డాక్టర్ విజయకుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్‌బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఇది. ఇందులో స్వదీశీ జాతుల విశిష్టత, వివిధ రాష్ట్రాల్లో పేరొందిన జాతుల గురించి వివరిస్తున్నారు...


  దేశీయ ఆవులు స్థానికంగా లభించే తక్కువ పోషక విలువలు కలిగిన గడ్డిని సమర్థవంతంగా వినియోగించుకుని విదేశీ, సంకరజాతి ఆవులు అందించే వెన్న శాతం కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాయి (4-5 శాతం). దీనికి విరుద్ధంగా విదేశీ, సంకరజాతి ఆవులు ఎక్కువ దాణా, ఎక్కువ పోషకాలున్న గడ్డిని మేపినపుడు మాత్రమే ఎక్కువ పాల దిగుబడినిస్తాయి. అంతేకాక వీటి పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. 1995, 2007లలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో స్వదేశీ జాతుల్లో దూడల మరణాలు కేవలం ఐదు శాతం కాగా అదే విదేశీ హెచ్‌ఎఫ్ జాతి దూడల్లో 31 శాతం, జెర్సీ దూడల్లో 28.3 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడైంది.


  జాతీయ పశు జన్యు సంపద సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్) వారు ప్రకటించిన భారతీయ గోజాతుల సంఖ్య 30. ఇందులో కొన్ని పాల ఉత్పత్తికి, ఎక్కువ భాగం వ్యవసాయ, రవాణా పనులకు పేరొందాయి. మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరు, కర్నాటకలోని హాలీకార్, ఖిల్లారి, క్రిష్ణవేలీ, మల్నాడ్‌గిడ్డ, కేరళలోని వేచూర్, కాసరగడ్, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరీ, గుజరాత్‌లోని గిర్, రాజస్థాన్‌లోని రెడ్‌సింధీ, థార్‌పార్కర్, కాంక్రెజ్, రాథీ, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, పంజాబ్‌లోని సాహివాల్ జాతి ఆవులు, ఎద్దులు పాడికి, ఆయా పనులకు ప్రముఖంగా పేరొందాయి. వీటిలో ఇప్పటికే ఒంగోలు జాతి విశిష్టతను తెలుసుకున్నాం. మరికొన్ని జాతుల వివరాలు..

వేచూర్


కేరళ రాష్ట్రానికి చెందిన వేచూర్ జాతి ఆవులు, గిత్తలు పొట్టి జాతిగా పేరొందాయి. మన పుంగనూరు, కేరళ వేచూర్ జాతుల్లో ఏది ఎక్కువ పొట్టి అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. వేచూరి జాతి ఆవుల సగటు ఎత్తు 80-90 సెంటీమీటర్లు. గిత్తల ఎత్తు 85-95 సెంటీమీటర్లు కాగా పుంగనూరు జాతి పశువులు 60-100 సెంటీమీటర్ల ఎత్తుంటాయి. వేచూర్ జాతి పశువులు ఎక్కువగా లేత ఎరుపు లేదా నలుపు రంగులో ఉంటాయి.

శరీర నిర్మాణ పరంగా చిన్నవైనప్పటికీ వ్యవసాయ పనులకు ఈ గిత్తలు ప్రసిద్ధి. ఈ జాతి దూడలలో సహజ మరణాలు దాదాపు శూన్యం. ఆవులు శ్వాసకోశ, గాలికుంటు, పొదుగువాపు వ్యాధులను సమర్థవంతంగా తట్టుకోగలవు. రోజుకు సగటున 2.5 లీటర్ల నుంచి 3.5 లీటర్ల పాల దిగుబడినిస్తాయి. వేచూర్ జాతి ఆవు పాలను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు.


కాసరగడ్


కేరళకు చెందిన కాసరగడ్ జాతి పశువులు అధిక ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఇవి కూడా వేచూర్ జాతి మాదిరే పొట్టి రకం. వీటిలో ఆహారాన్ని వినియోగించుకునే సామర్థ్యం ఎక్కువ. కాసరగడ్ జాతి దూడలు సంవత్సరం వయసునాటికి అవి పుట్టిన నాటి బరువు కంటే 7-8 రెట్లు అధిక బరువు కలిగిఉంటాయి. వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఈ జాతి పశువులు పాల దిగుబడి కంటే వ్యవసాయ పనులకు బాగా పేరొందాయి.

మాల్వీ

http://www.krankykids.com/cows/daily_cow_images/M/malvi/malvi_1_web.jpg
మధ్యప్రదేశ్‌లోని మాల్వీ ప్రాంతంలో గుర్తించిన ఈ జాతికి ఆ ప్రాంతం పేరిట మాల్వీ అనే పేరు వచ్చింది. ఈ జాతి ఎద్దులు ప్రధానంగా బరువులు లాగే వ్యవసాయ పనులకు ప్రసిద్ధి. ఒండ్రు నేలలు, బంక మట్టి నేలల్లో పెద్ద పెద్ద నాగళ్లను లాగే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆవులు తక్కువ పాలదిగుబడినిస్తాయి.

పుంగనూరు ఆవులు

http://cdn1.wn.com/ph/img/a8/f1/004de760108ff11cc92e50004ca4-grande.jpg
మన రాష్ట్రానికి చెందిన పుంగనూరు జాతి ఆవు ప్రపంచ గోజాతుల్లో అతి చిన్నదిగా పేరొందింది. ఈ జాతి ఆవుల కన్నా మగ పశువులు మెతక స్వభావము కలిగి ఉంటాయి. చక్కని ముఖంతో, బూడిద రంగుతో బాగా వృద్ధి చెందిన మెడ, మూపురంతో ఉంటాయి. కురచకాళ్ళతో, గట్టి గిట్టలు కలిగి ఉంటాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన కొండలు, గుట్టలు, వాలు ప్రాంతాలను సులువుగా ఎక్కి దిగగలవు. ఈ జాతి పశువులు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటికి కరువు పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఉంది.

వీటి ఎత్తు 60 -100 సెంటీమీటర్లు, బరువు 130-200 కిలోలు. ఇవి కొత్త వారిని చూడగానే బెదురుతాయి. పుంగనూరు ఆవులు ఒక ఈతలో 1100 లీటర్ల వరకు (రోజుకు మూడు నుంచి మూడున్న లీటర్లు) పాలు ఇస్తాయి. చిన్నపాటి శరీరాకృతి కారణంగా వీటిని రైతులు వ్యవసాయ పనులకు తక్కువగా వినియోగిస్తున్నారు. అంతరించిపోతున్న ఈ జాతి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


 దేని ప్రత్యేకత దానిదే
గోజాతికి మన దేశం పెట్టింది పేరు. ఏ జాతి ప్రత్యేకత దానిదే. సామర్థ్యాన్ని బట్టి పాల ఉత్పత్తికి ఉపయోగపడేవి కొన్నయితే పాల ఉత్పత్తితో పాటు వ్యవసాయ పనులకు కూడా ఉపకరించేవి మరి కొన్ని.

కేవలం వ్యవసాయ పనులకు మాత్రమే ఉపయోగపడే జాతులు కూడా ఉన్నాయని చెబుతున్నారు తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని రాష్ట్ర పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఏడీఏలు డాక్టర్ విజయ కుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్ బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగుతున్న నేపథ్యంలో వారు అందిస్తున్న కథనాల్లో ఇది అయిదోది...


మన రాష్ట్రంలోని ఒంగోలు, పుంగనూరు, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, కేరళలోని వేచూర్, కాసరగడ్ జాతుల ఆవుల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ వారం కర్ణాటకలోని కృష్ణావ్యాలీ, మల్నాడుగిడ్డ, అమృతమహల్, హల్లికార్, ఖిలారీ, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరి జాతుల విశిష్టతల గురించి తెలుసుకుందాం.


పాల దిగుబడి స్థిరంగా ఉండదు

కృష్ణావ్యాలీ జాతిని ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఒండ్రు, నల్లరేగడి నేలల్లో వ్యవసాయాధారిత పనుల కోసం అభివృద్ధి చే శారు. గిర్, ఒంగోలు, కాంక్రెజ్, హల్లికార్ జాతుల్ని సంకరపరచి వీటిని అభివృద్ధి చేశారు. వీటి శరీరంపై బూడిద తెలుపు, తెలుపు, గోధుమ, నలుపు రంగులు కలగలసిన మచ్చలు ఉంటాయి. గిర్, ఒంగోలు జాతుల్ని సంకరపరచి అభివృద్ధి చేసిన కృష్ణావ్యాలీ ఆవు సగటున రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల పాల దిగుబడి ఇచ్చినప్పటికీ అది స్థిరంగా ఉండదు. గిట్టలు మెత్తగా ఉండడం వల్ల ఈ జాతి గిత్తలు, ఎడ్లు ఒండ్రు నేలలు, బంకమట్టి నేలలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో మంచి పనితనాన్ని ప్రదర్శిస్తాయి.

పనిలో దిట్ట
మల్నాడుగిడ్డ ఆవులు గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనులకు ప్రసిద్ధి చెందినవి. పొట్ట, డొక్కల వైశాల్యం తక్కువగా ఉండడం వల్ల తక్కువ మేత తింటాయి. అయితే పనిలో మాత్రం మంచి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. గాలికుంటు వ్యాధిని, వలసల కారణంగా సంక్రమించే వ్యాధుల్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. రోజుకు 1.5 లీటర్ల నుంచి నాలుగు లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి.

మైసూర్ రాజుల కాలం నుంచి...

మైసూర్ రాజుల కాలంలో అమృతమహల్ జాతి ఆవులు బాగా వృద్ధి చెందాయి. అప్పట్లో సైనిక వాహనాల్ని నడిపేందుకు వీటిని ఉపయోగించే వారు. ఆ తర్వాతి కాలంలో మైసూర్ సంస్థానాధీశుడు టిప్పుసుల్తాన్ ఈ జాతి ప్రత్యేకతను గుర్తించి మరింత అభివృద్ధి చేశాడు. వీటి విశిష్టతకు తగినట్లు అమృతమహల్...అంటే అమృత (పాలు) భాండమనే అర్థం వచ్చేలా పేరు పెట్టాడు. ఈ జాతి ఆవులు కొంత తెలుపు రంగులో ఉంటాయి. రోజుకు సగటున నాలుగు నుంచి ఆరు లీటర్ల పాలు ఇస్తాయి. ఇవి పాల దిగుబడికి, వ్యవసాయ పనులకు కూడా ఉపయోగపడతాయి.

దక్షిణాది ఆవులకు మాతృ జాతి

దక్షిణ భారతదేశంలోని పలు ప్రముఖ గోజాతులకు హల్లికార్‌ను మాతృ జాతిగా చెప్పవచ్చు. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల నిర్వహణలో దీనికి మంచి పేరు ఉంది. దీని శరీరం ప్రధానంగా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. తల పొడవుగా, మూతి భాగం మొనదేలినట్లు ఉంటుంది. నుదుటి నుంచి ముక్కు భాగం వరకూ కాలువ లాంటి గాడి కలిగి ఉంటుంది.

రవాణాకూ ఉపయోగపడతాయి

ఖిలారీ జాతి ఆవులు వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల్ని సమర్ధవంతంగా నిర్వర్తిస్తాయి. ఇవి గోధుమ, తెలుపు రంగులు కలగలిసిన రంగులో ఉంటాయి. తల సన్నగా ఉండి, పొడవైన కొమ్ముల మొదలు వద్ద ఇరు వైపులా ఉబ్బినట్లు ఉంటుంది. కొమ్ముల మొదలు నుంచి ముక్కు వరకూ గాడి ఉంటుంది. గిట్టలు దృఢంగా ఉండి వ్యవసాయ, రవాణా పనులకు బాగా ఉపయోగపడతాయి.

ప్రతికూల వాతావరణంలోనూ...

పొలం పనులకు, రవాణాకు కంగాయం జాతి పశువులు బాగా పేరు తెచ్చుకున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యం వీటికి ఉంది. మధ్యస్త పరిమాణంలో ఉండే ఈ పశువులు కేవలం పనికి మాత్రమే ఉపయోగపడతాయి. చురుకుగా, చలాకీగా ఉంటూ వేగంగా నడవడం వీటి సహజ స్వభావం. పనికి ఉపయోగపడే జాతిగా దక్షిణ భారతదేశంలో పేరు పొందాయి. శరీరం ముదురు బూడిద రంగులో ఉంటుంది. తల, మెడ, మూపురం, భుజాలు, మణుగుల వద్ద నల్లని మచ్చలు ఉంటాయి. ఈ జాతి ఆవులు ప్రతి 15 నెలలకు ఒకసారి ఈనతాయి. తేలికపాటి పొలాల్లో ఆవులతో సేద్యం చేస్తారు.

పాడికి పనికిరావు

తంజావూరుకు చెందిన స్థానిక గోజాతితో కంగాయం జాతిని సంకరపరచి ఉంబ్లాచెరి జాతిని అభివృద్ధి చేశారు. ఈ జాతి ఆవుల శరీర పరిమాణం మధ్యస్తంగా ఉంటుంది. పొట్ట చిన్నదిగా ఉంటుంది.

ఈ ఆవులు బూడిద రంగు, బూడిద నలుపు రంగుల్లో ఉంటాయి. ఇవి పాడికి పనికిరావు. ఎద్దులు చక్కగా పనికి ఉపయోగపడతాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత, రవాణా పనులకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
 

Tuesday, March 27, 2012

సేద్యం ఇక సాధ్యమా?

భారతదేశం మళ్ళీ డెబ్భై, ఎనభై దశకాల్లోకి వెళ్లి పోతోందా? ప్రత్యక్ష పన్నులపై ఆధారపడే ప్రగతిశీల పన్ను విధానం నుంచి, ప్రజలందరికీ భారమయ్యే పరోక్ష పన్నుల విధానం వైపు మళ్ళుతోందా? గతంలో సంక్షేమ పథకాల మాటున గారడీ చేసిన యూపీఏ ప్రభుత్వం హఠాత్తుగా ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించేసింది. ప్రణబ్ కొత్త బడ్జెట్టు, రైతుల సాగు ఖర్చును విపరీతంగా పెంచే ఎరువులు మరింత కరువయ్యేలా, బరువయ్యేలా, సబ్సిడీల తగ్గింపును చేపట్టింది. పన్నులు విపరీతంగా బాదేసింది. http://harddrink.files.wordpress.com/2011/07/indian-farmer-ploughing.jpg
వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడి, సరఫరా గొలుసులోని సమస్యలను సరిదిద్దడం, రహదారుల అభివృద్ధి, విమానయానం లాంటి పదాలు వున్నా, సమ్మిళిత అభివృద్ధి లాంటి పదాలు బడ్జెట్టులో మాయం చేసింది. ఆమ్ ఆద్మీ ఊసే లేదు. వృద్ధి ఇంకా కావాలి అని కాకుండా ఉన్న వృద్ధిని కాపాడుకొందాము అని, పైగా దానికి దేశీయ డిమాండు రికవరీ కావాలని సెలవిచ్చారు ఆర్థిక మంత్రి. వృద్ధి ద్వారా సంపద సృష్టి అనే 21వ శతాబ్ద సిద్ధాంతం మానేసి ఎనభైలలోని దేశీయ డిమాండు పెంపొందించటం అనే దృష్టి మళ్ళీ వచ్చేసిందేమో తేలీదు కానీ పన్నులని ఎడా పెడా పెంచేశారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మీద పెను ప్రభావం చూపించే సర్వీస్ పన్నులు పెంచారు. సబ్సిడీ తగ్గిస్తాము అంటూ, ఎరువుల ధరలు పెంచుతామని అన్యాపదేశంగానే చెప్పారు.

ప్రణబ్ బడ్జెట్టులోని లెక్కలు సరికావాలంటే పన్నేతర ఆదాయం 31.96 శాతం పెరగాలి. అంటే మళ్ళీ వేలం పాట (లేక 3 జి, 4 జి) పెట్టుబడుల ఉపసంహరణ లాంటి వాటి మీద ఆధారపడాలి. సబ్సిడీ బిల్లు కనీసం 12 శాతం తగ్గాలి. కానీ ఆహార సబ్సిడీ బిల్లే 30 వేల కోట్లు తినేస్తుంది. ద్రవ్యలోటుని 5.1 శాతానికి తెస్తామని చెప్పారు గానీ అది వీలుకాదని తెలుస్తూనే వుంది. కేల్కర్ కమిటీ ప్రకారం మార్కెట్టు నుంచి అప్పు చేయాలి. ఈ నేపథ్యంలో జీతాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు లాంటి వాటికి కూడా ప్రభుత్వం అప్పు చెయ్యబోతోంది. ఇంత అప్పు, ఇన్ని పన్ను లు ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుందో ప్రణబ్ మహాశయుడే చెప్పాలి.

ఎక్సైజ్ పన్ను రాబడి పెరిగింది; సర్వీస్ పన్నులని విపరీతంగా పెంచారు; కానీ ఇంకా మన స్థూల ఆర్థిక వనరులు అస్తవ్యస్తంగానే వున్నాయి. 2011 సంవత్సరం బడ్జెట్ సమయంలో గొప్పగా తన బడ్జెట్ ఆదాయానికి ఖర్చుకి తేడా -అంటే ద్రవ్యలోటు- కేవలం 4.6 శాతం మాత్రమే అని ప్రకటించారు ప్రణబ్. అందరూ ఆశ్చర్యపోయారు. చాలా మంది తప్పుబట్టారు. ఎందుకంటే ఆహారం, చమురు, ఎరువుల మీద ఖర్చు 2010 సంవత్సరంలోని లక్షా యాభైవేల కోట్ల కంటే తగ్గించి కేవలం లక్షా ముప్పైనాలుగు వేల కోట్లు మాత్రమే చూపించారు. చమురు, ఎరువులు, ఆహార ఖర్చు పెరుగుతాయే కానీ ఎలా తగ్గుతాయో ప్రజలెవ్వరికీ అర్థం కాలేదు. ప్రస్తుతానికి వస్తే బడ్జెట్‌లో ప్రణబ్ అసలు నిజాన్ని ప్రకటించారు.

పై మూడు పద్దుల కింద అయిన ఖర్చు 2,16,297 కోట్లు. దాదాపు 80 వేల కోట్లు క్రితం సారి తగ్గించి చూపించి అసలు ద్రవ్యలోటు అదుపు లోనే వుందన్నట్టు చూపించారు. క్రితంసారి 5.9 శాతం ఉన్న ద్రవ్యలోటుని ఈ సారి 5.1 శాతానికి తగ్గిస్తానని ప్రణబ్ చెప్పారు. కానీ ఇదెంత అసంబద్ధమంటే పన్నులన్నీ సరిగ్గా వసూలై, సబ్సిడీలు 26 వేల కోట్లు తగ్గిస్తే, ఆహార బిల్లు అమల్లోకి రాకపోతే కూడా కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే సాధ్యమవుతుంది.

ఈసారి పన్నుల రూపంలో దాదాపు 44 వేల కోట్లు అదనంగా వడ్డించారని బాధపడుతున్న ప్రజలకి రాబోయే నెలల్లో ఆహారం, ఎరువులు, చమురు మీద పడబోయే అదనపు భారం వివరాలు తలచుకుంటే చెమటలు పట్టక మానవు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆహార, చమురు, ఎరువుల సబ్సిడీ మీద ప్రభుత్వ ఖర్చు లక్షా తొంభై వేల కోట్లకు పడిపోతుందట! అంటే వాటి ధరలు తగ్గు తాయని కాదు.

ప్రభుత్వ సబ్సిడీని దశల వారీగా తగ్గిస్తూ రెండు శాతానికి పరిమితం చేస్తారని ! పెట్రోలు ఉత్పత్తుల మీద ఈ సంవత్సరం 68, 481 కోట్లు ఖర్చు పెడితే, రాబోయే సంవత్సరంలో దీన్ని 43, 580 కోట్లకి పరిమితం చేశారు. పెట్రో ఉత్పత్తుల డీ రెగ్యులేషన్ పేరుతో వాటి మీద దాదాపు యాభై శాతానికి పైగా పన్నును విధిస్తూనే, పెరిగే ధరలతో తనకు సంబంధం లేదని చెప్తోంది యూపీయే ప్రభుత్వం. అంటే ఆయిల్ కంపెనీలకు నష్టాలు అనే సాకుతో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచటం తథ్యం. డీజిల్ ధరలు పెరిగితే సామాన్యులు బస్సు చార్జీలనించి రైతుల సాగు ధరల వరకు అన్నీ పెరగడం అనివార్యం.
http://im.rediff.com/money/2011/feb/02agri1.jpg
వ్యవసాయానికి క్రితం సంవత్సరాని కంటే మూడు వేల కోట్లు ఎక్కువిచ్చామని ప్రణబ్ గొప్పగా చెప్పారు. కానీ ఎరువుల మీద క్రితం సంవత్సరం ఇచ్చిన 67, 198 కోట్ల కంటే ఈసారి పదిశాతానికి పైగా తక్కువ ఖర్చు పెడతామని చెప్పారు. మొన్న ఫిబ్రవరిలో నిర్ధారించిన ఎరువుల సబ్సిడీని పరిగణనలోకి తీసుకొంటే డీఏపీ, యూరియా, ఎంబిసీ మొదలగు వాటిపై 60, 974 కోట్లు మాత్రమే వస్తుంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వ సబ్సిడీ బకాయిలతో కలిపి దాదాపు 93,000 కోట్లకు చేరింది. దాన్ని ఇప్పుడు అరవైవేల కోట్లకు పరిమితం చేయడమంటే అంతర్జాతీయ ధరల పెరుగుదలను రైతుకు బదిలీ చెయ్యబోతున్నారన్న మాట. రైతులకి ఎరువుల ధరలు చుక్కలు చూపించబోతున్నాయి.

చమురు రేట్లు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతి చేసుకొనే ఎరువుల రేట్లు సహజంగానే పెరిగే అవకాశం ఉంది. యూరియా మూడవ వంతు, మిగతా ఎరువులను భారత్ సింహ భాగం దిగుమతి చేసుకొంటున్న నేపథ్యంలో, ఎరువులు మీద సబ్సిడీలను దశల వారీగా తగ్గిస్తామని చెప్పడం రైతుకు ఆశనిపాతమే. రైతుకి ఎరువుల ధరలు ఇంకా పెరిగితే సాగు ధర ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే సాగుధరకి, మద్దతు ధరకి ఎక్కడా సాపత్యం కుదరక తల్లడిల్లుతున్న రైతుకి ఎరువుల ధరలు ఇంకా పెరగడం రైతుకే కాదు, వినియోగదారులకీ నష్టమే.
http://www.microdinero.com/files/noticias/2298_2170_rural.jpg
ఇక రైతుని దొంగ దెబ్బ తీయబోయే అతి తీవ్రమైన సమస్య ఆహార సబ్సిడీ పథకం. 2012 కి ఆహార సబ్సిడీ కోసం 75 వేల కోట్లు చూపించారు. ఈ సారి ఆహార సబ్సిడీ పథకం అమలుచేస్తే కావాల్సింది సంవత్సరానికి 1, 02,000 కోట్లు. ఇప్పుడిచ్చినది కాకుండా మిగిలినది ఎలా ఇస్తారో ప్రభుత్వం చెప్పలేదు. ఈ ప్రభుత్వమే గొప్పగా నియమించిన స్వామినాథన్ కమిటీ అమలు గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. బహుశా ఆ సిఫార్సులు అమలు చెయ్యలేమని చెప్పిన శరద్ పవార్ స్ఫూర్తి గాబోలు. రైతులకి రుణాలు అయిదు లక్షల పాతిక వేల కోట్లకు పెంచామని అన్నారు. http://www.instablogsimages.com/images/2007/05/29/agriculture-scheme-pm_26.jpg
కానీ రైతులందరినీ సంస్థాగత రుణాల పరిధిలోకి తేవాలంటే కనీసం పది లక్షల కోట్ల రుణాలు పంపిణీ కావాలి. పైపెచ్చు ఇప్పుడు ప్రకటించిన రుణాలు ఇచ్చేది ప్రభుత్వం కాదు, బ్యాంకులు. వాటి మీద అదుపు లేనప్పుడు ఎన్ని కోట్లు ప్రకటించినా ప్రస్తుతం వున్న 30 శాతం లబ్ధిదారుల కంటే పెరిగే అవకాశమే లేదు. వ్యవసాయ ఉత్పత్తి రేటు 2.5 శాతానికి పడిపోయిన ఈ సమయంలో రైతులు ఆర్థిక మంత్రి వైపు ఆశగా చూసారు. కొన్ని వ్యవసాయ మిషన్లు ఏర్పాటుచేయడం తప్పిస్తే, పంట దిగుబడి పెంచే చర్యలు పెద్దగా కనబడవు.

స్థూలంగా వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడానికి కావాల్సిన ఫ్రేం వర్కు బడ్జెట్టులో లేదు. పైపెచ్చు రైతు నడ్డి విరిచే సబ్సిడీల తగ్గింపు వంటి చర్యలు వున్నాయి. ఈసారి ప్రణబ్, మన్మోహన్ ఇద్దరూ భారత ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పనిసరి అని చెప్తూ వచ్చారు. మన్మోహన్ అయితే మరో అడుగు ముందుకు వేసి సబ్సిడీ బుల్లెట్లు కొరకాల్సిందే అని పోకిరీ టైపులో సెలవిచ్చారు. కానీ ఆయన ఆర్థిక వేత్తగా మరిచిపోయిన దేమిటంటే, తమ ప్రభుత్వం ఆహార సబ్సిడీ అనే ఫక్తు వోటుబ్యాంకు పథకానికి ముప్పై వేల కోట్లకు పైగా సబ్సిడీ ఇవ్వబోతోందని. దానికి లేని ఇబ్బంది రైతులకి ఎరువుల సబ్సిడీ ఇవ్వడంలో ఎందుకు?
http://india.targetgenx.com/files/2008/04/farmer1.jpg
ఈ రైతు వ్యతిరేక చర్యలన్నీ ఒకే ప్రశ్న వేస్తాయి. దేశంలోని 60 శాతం పైగా ఉన్న రైతులకు ఉపయోగపడని డబ్బు, వృద్ధి ఎవరి కోసం? ప్రభుత్వం తన దగ్గర ఉన్న సంపదని నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి చేర్చకుండా, ఉన్న కాస్త సబ్సిడీలను తీసేస్తూ వాళ్ళ మీద ఇంకా పన్నులేస్తూ ఎవరి కోసం పని చేస్తున్నట్టు? http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-02.jpg
ఇంతటి హ్రస్వ దృష్టినీ, చిత్తశుద్ధి లేమినీ, విధాన రాహిత్యాన్నీ నిలదీయాల్సిన పని, పోరాటం చేయాల్సిన పనీ రాజకీయ పార్టీలది. సాగు ఖర్చులు మూడొందల శాతం పైగా పెరిగి రైతు చితికి పోతూ ఉంటే ప్రతి పక్షంలోని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు పాలక పక్షాలపై ముప్పేట దాడిచేసి రైతుకు ఏదో మేరకు సాంత్వన చేకూర్చాలి. మేధావులెందరో అంటున్నారు గానీ, నిజానికి వ్యవసాయం సంక్షోభంలో లేదు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కంపెనీలు ఎవరూ సంక్షోభంలో లేరు.

మిల్లర్లు, దళారులూ కూడా సంక్షోభంలో లేరు. ప్రభుత్వ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని మరీ ఇబ్బడి ముబ్బడిగా పండిస్తున్నారు మన రైతన్నలు. ఈ రకంగా ఆహార సంక్షోభమూ లేదు. సంక్షోభంలో ఉన్నది రైతులు. రైతు కూలీలు, కౌలు రైతులు. వీరిని గట్టెక్కించే దీర్ఘకాలిక విధానాల రూపకల్పనలోనూ దీర్ఘకాలిక పోరాటాలలోనూ కలిసికట్టుగా పనిచేయడం రాజకీయ పక్షాల బాధ్యత.
http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-15.jpg
చిత్రంగా మన రాష్ట్రంలో మాత్రం, రైతు మిత్రులమని చెప్పుకునే చిట్టి పొట్టి పార్టీలు తమ పోరాటం ప్రధాన ప్రతిపక్షం పైన మళ్లిస్తూ ప్రజాగ్రహాన్ని పలుచన చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను చీలుస్తూ తాము (పైపైకి మాత్రమే అయినా సరే) వ్యతిరేకించే ప్రజా వ్యతిరేకులకే మేలు చేస్తూ వస్తున్నారు. పైపై మెరుగుల సింబాలిక్ ఉద్యమాలూ, స్వంత డబ్బాలూ కొంత మానుకుని రైతన్న ఏం ఆశిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం ఇకనైనా మొదలుపెట్టాలి.

- శ్రీశైల్ రెడ్డి పంజుగుల
తెలుగుదేశం వ్యవసాయ అధ్యయన కమిటీ సభ్యులు
- నీలయపాలెం విజయకుమార్
రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు

Saturday, March 3, 2012

వేసవి పంటలతో మంచి ఆదాయం!


వేసవి వచ్చేసింది. ఇప్పటికే కూరగాయ ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వేసవిలో వీచే పొడి గాలులు, పెరిగే ఉష్ణోగ్రతలు, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీని వల్ల దిగుబడులు తగ్గి రాబోయే కాలంలో వీ టి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నీటి వసతి ఉన్న రైతులు ఈ సీజ న్‌లో కూరగాయ పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందవచ్చునని నల్లగొండ ప్రాంతీయ ఉద్యానవన శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి సూచిస్తున్నారు. ఆ వివరాలు...

ఈ పంటలు వేసుకోవచ్చు

వేసవిలో తీగ జాతి కూరగాయలైన కాకర, బీర, బెండ, ఆనప, దోస, దొండ, పొట్ల, దుం ప జాతి కూరగాయలైన చేమ, కంద, ముల్లంగితో పాటు టమాటా, ఆకుకూర పంటల్ని వేసుకోవచ్చు. సాధారణంగా వర్షాకాలంలో పండించే వంగ, గోరుచిక్కుడు, బెండ, మిరప వంటి పంటల్ని కూడా సాగు చేసుకోవచ్చు. వ్యవసాయాధికారులు, ఉద్యాన అధికారుల సూచనల మేరకు ఆయా ప్రాంతాలకు అనువైన రకాల్ని ఎంపిక చేసుకోవాలి.

ఇలా వేసుకోవాలి

వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉం టాయి. ఎండ వేడికి నారు వడలి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొక్కల్ని సాధ్యమైనంత వరకూ సాయంకాలం వేళ నాటుకోవాలి. విత్తనాలు నేరుగా విత్తేటట్లయితే విత్తిన వెంటనే నీరు కట్టి, ఆ తర్వాత విత్తనాలు మొలకెత్తే వరకూ మూడు నాలుగు రోజులకు ఒకసారి తడి అందించాలి. వేసవిలో మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. కనుక విత్తనాల్ని దగ్గర దగ్గరగా వేసుకోవాలి.

టమాటా వేసే వారు వరుసలు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల చొప్పున దూరాన్ని పాటించాలి. ఎకరానికి 250 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. వంగ వేసే వారు వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం (ఎకరానికి 350 గ్రాముల విత్తనాలు) ఉండేలా నాటాలి. బెండ వేయాలనుకుంటే 45-20 సెంటీమీటర్లు (ఎకరానికి ఆరు కిలోల విత్తనాలు), పచ్చి మిరపకు 45-45 సెంటీమీటర్లు (600 గ్రాములు), గోరుచిక్కుడుకు 50-20 సెంటీమీటర్లు (నాలుగు కిలోలు), బీర, దోసకు 100-50 సెంటీమీటర్లు (బీర అయితే రెండు కిలోలు, దోస అయితే 1.5 కిలోలు), కాకరకు 150-50 సెంటీమీటర్ల (రెండు కిలోల విత్తనాలు) దూరాన్ని పాటించాలి. ఆనప వేసే వారు వరుసల మధ్య 300 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 100 సెంటీమీటర్ల దూరం ఉండేలా (ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనాలు) మొక్కలు నాటుకోవాలి.


బిందుసేద్యం-మల్చింగ్ మేలు

వేసవి కూరగాయ పంటలకు బిందుసేద్యం ద్వారా నీరందిస్తే మంచిది. దీనివల్ల ప్రతి రోజూ అవసరమైన మేరకు నీటిని అందించవచ్చు. మామూలు పద్ధతిలో అయితే అయిదు నుండి ఏడు రోజుల వ్యవధి ఇస్తూ నీటి తడులు ఇవ్వాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునేందుకు వీలుగా కూరగాయ పంటల సాళ్లలో ప్లాస్టిక్ షీట్లు కప్పాలి. దీనివల్ల భూమి వేడెక్కదు. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కలుపు మొక్కలు పెరిగే అవకాశం కూడా ఉండదు. డ్రిప్ లాటరల్ పైపుల్ని షీట్ల కింద ఏర్పాటు చేసుకోవాలి. టమాటా పంటను షేడ్‌నెట్ కింద పండించడం మంచిది.

ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు:
ఫర్టిగేషన్ (నీటిని అందించే పైపుల ద్వారా) పద్ధతిలో ఎరువుల్ని అందిస్తే మొక్కలు క్రమ పద్ధతిలో, ఏపుగా పెరుగుతాయి. సాధారణ పద్ధతిలో అయితే మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు వేసినప్పుడు తగినంత నీటిని అందించాల్సి ఉంటుంది. లేకుంటే మొక్కలు మాడిపోతాయి. స్థానిక వ్యవసాయాధికారుల సలహా మేరకు ఎరువులు వేసుకోవాలి.

పూత-పిందె రాలకుండా
...
వేసవి కూరగాయ పంటల్లో పూత, పిందె రాలకుండా ఉండాలంటే వ్యవసాయాధికారుల సూచనల మేరకు హార్మోన్ మందుల్ని పిచికారీ చేసుకోవాలి. లీటరు నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలిపి (ఎకరానికి 200-250 లీటర్ల ద్రావణం) పిచికారీ చేస్తే కాయలు పగలకుండా ఉంటాయి. ఆకులు పల్లాకు రంగులోకి మారితే లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి.

ఉద్యానవన శాఖ సబ్సిడీ

ఉద్యానవన శాఖ వేసవిలో 50 శాతం సబ్సిడీపై రైతు కోరుకున్న బ్రాండెడ్ కంపెనీల విత్తనాల్ని పంపిణీ చేస్తోంది. అలాగే మల్చింగ్‌కు వాడే ప్లాస్టిక్ షీట్ల కొనుగోలుకు కూడా యాభై శాతం సబ్సిడీతో ఎకరానికి నాలుగు వేల రూపాయలు అందిస్తోంది. తీగ జాతి కూరగాయల సాగుకు ఎకరం భూమిలో పందిళ్లు వేసుకొంటే 50 శాతం సబ్సిడీ కింద 60 వేల రూపాయలు అందిస్తోంది.

చీడపీడల నివారణ కోసం...

వేసవిలో కూరగాయ పంటల్ని వివిధ రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. పంట కోత దశలో ఉన్నప్పుడు పురుగు మందుల్ని విచక్షణారహితంగా వాడకూడ దు. సిఫార్సు చేసిన మోతాదులోనే పిచికారీ చేయాలి. బెండలో ఎర్రనల్లి నివారణకు లీట రు నీటికి అయిదు మిల్లీలీటర్ల చొప్పున డైకోఫాల్ కలిపి పిచికారీ చేయాలి. వంగ, బెండ పంటల్లో పచ్చదోమ, తెల్లదోమ నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున మెటాసిస్టాక్/డైమిథోయేట్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. సొర, బీర, దొండ, దోస జాతి కూరగాయల్లో కాయ తొలుచు పురుగుల నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బరిల్ + రెండు మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

Sunday, February 12, 2012

'' సర్టిఫైడ్ '' సేద్యం

మీరు తరచూ సూపర్‌మార్కెట్‌లకు వెళుతుంటారా..? ఈసారి వెళితే.. ఆర్గానిక్ ఫుడ్‌రాక్‌లను చూడండి. అందులో బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు ఆకర్షణీయమైన ప్యాక్‌లలో ఆకట్టుకునేలా ఉంటాయి. వాటిని కొనాలని చేతుల్లోకి తీసుకోగానే బహుశా మీకు వచ్చే సందేహం 'ఇది ఆర్గానిక్ ఫుడ్' అని ఎలా నమ్మొచ్చు? అన్న అనుమానం కలుగుతుంది. ఫుడ్‌ప్యాక్‌లను తేరిపార చూస్తే 'ఇండియా ఆర్గానిక్' అన్న లోగో కనిపిస్తుంది. అప్పుడే అది నిజమైన ఆర్గానిక్. ఈ లోగోతో దొరికే ఉత్పత్తుల వెనుక పెద్ద కథే ఉంది. రసాయనాలు లేకుండా పండించే రైతు దగ్గర నుంచి.. ఢిల్లీలోని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సంస్థ అందించే సర్టిఫికెట్ల వరకు.. మధ్యలో బోలెడు ప్రక్రియలు నడుస్తాయి..http://www.agricultureinformation.com/mag/wp-content/uploads/2009/01/organic-farming.jpghttp://www.goorganica-z.com/wp-content/uploads/28_18_orig.jpg
ఇవ్వాళ దేశవ్యాప్తంగా యాభై లక్షల హెక్టార్లలో సేంద్రీయ వ్యవసాయం జరుగుతోంది. ఏటా రూ.2,500 కోట్ల విలువైన సేంద్రీయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం మనం. సేంద్రీయ సాగును మరింత పెంచేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్గానిక్ సర్టిఫైడ్ రైతుల సంఖ్య పెంచేందుకు కృషి జరుగుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అనుగుణంగా- సేంద్రీయ సాగుకు ఒప్పుకున్న రైతులు మొదట సంఘాలుగా ఏర్పడతారు. ఒక్కో సంఘం కింద 50 హెక్టార్ల సాగు భూమి ఉంటుంది. వీరికి ప్రభుత్వమే సేంద్రీయ ఎరువుల్ని సరఫరా చేస్తుంది. వరుసగా మూడేళ్లు మట్టి నమూనాలు, సాగు నీరు, పంట దిగుబడిని పరీక్షిస్తారు. ఈ పరీక్షలన్నీ సాధారణ లాబొరేటరీలలో చేయించకూడదు. http://www.indiatalkies.com/images/organic-farming770g.jpg
కేంద్ర శాస్త్ర సాంకేతిక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీ (ఎన్ఎమిఎల్) అనుమతించిన కేంద్రాలలోనే చేయించాలి. ఈ పనులన్నీ రైతులు చేసుకోలేరు కనుక.. ప్రభుత్వానికి-రైతుకు మధ్య పనిచేసేందుకు రెండు సంస్థల్ని నియమించారు. మొదటి ఏడాది పరీక్షల తర్వాత కన్వర్షన్ పీరియడ్ అంటారు. మూడో ఏడాది వరకు రైతులు ఎలాంటి రసాయనాలు వాడలేదని నిర్ధారణ కావాలి. ఇలా సేకరించిన వివరాలను 'నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్' (ఎన్‌పిఒపి)కు పంపించాలి. అప్పుడు సేంద్రీయ రైతుకు 'ఆర్గానిక్ ఫార్మర్'గా సర్టిఫికెట్ వస్తుంది. ఇలా సర్టిఫికెట్లు పొందిన రైతుల వద్దే ఆర్గానిక్ ఫుడ్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్పత్తులను కొంటాయి. ఏది ఆర్గానిక్ ఉత్పత్తో, ఏది సాధారణ ఉత్పత్తో కొనుగోలుదారులు సులువుగా గుర్తుపట్టేందుకు ఎన్‌పిఒపి ఒక లోగోను తయారుచేసింది. ఆర్గానిక్ మార్కెటింగ్ సంస్థలు ఆ లోగోతోనే ఆహార ఉత్పత్తులను విక్రయించాలి.

మందుల సేద్యం..

కృత్రిమ ఎరువులతో, క్రిమిసంహారక మందులతో ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయం గురించి మనందరికీ తెలుసు. ఒక రైతు పొలానికి మూడుసార్లు మందు కొడితే ఎకరాకు ముప్పై బస్తాల ధాన్యం పండిందని.. పక్క పొలం రైతు అదే మందు డోసు పెంచి, నాలుగుసార్లు కొడతాడు. ఈయనకు నలభై బస్తాలు పండొచ్చు. కాని నేలతల్లి ఏం కావాలి? తిండి పెట్టే తల్లికి మనం తిరిగి ఏమిస్తున్నాం..? జీర్ణం కాని ఎరువుల్ని తినిపిస్తున్నాం. శరీరాన్ని గుల్ల చేసే పురుగుమందులను తాగిస్తున్నాం. ప్రకృతి నేర్పిన సహజ సేద్యాన్ని వదులుకుని, పాడి పశువులతో కళకళలాడే పల్లెల్ని మరిచిపోయాం.http://makanaka.files.wordpress.com/2010/07/infochange_agenda_issue19_2010jul_cover.jpg
కారణాలు ఏమైనప్పటికీ, రైతులు ఇప్పుడు భూములను నమ్ముకోవడం లేదు. పురుగుమందుల్ని నమ్ముకుంటున్నారు. దానితో భూమి స్వభావం మారిపోయింది. విషాన్ని దిగమింగుతున్న పొలాలు విషతుల్యమైన ఆహారాన్ని ఇవ్వడం అలవాటు చేసుకున్నాయి. ఫలితంగా నయంకాని జబ్బులొస్తున్నాయి. రోగనిరోధక శక్తి పడిపోతోంది. పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటోంది. జన్యుపరమైన సమస్యలొస్తున్నాయి. వాతావరణం కలుషితమైపోతోంది. విశ్వం ఉనికికే చేటు తెస్తున్న గ్లోబల్ వార్మింగ్ పెద్ద భూతమై కూర్చుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటినీ పట్టిపీడిస్తున్న సమస్య- యుగాంతం కాదు, యుద్ధభయం కాదు. భూకంపాలో, తుపాన్లో కాదు.. స్లో పాయిజన్‌లా మనిషిని సర్వనాశనం చేస్తున్న రసాయనిక వ్యవసాయం..!

పూర్వం తొలకరి పడగానే రైతులు పొలాలకు పరిగెత్తేవారు. పేడ ఎరువును పొలాల్లో వేసేవారు. నాగలితో దుక్కి చేసినప్పుడు ఆ ఎరువు అటూ ఇటూ పొర్లుతుంది. భూమి లోపలి కొత్త మట్టి పైకొచ్చి పంటకు బలాన్నిచ్చేది. ఇప్పుడు తొలకరి పడగానే రైతులు పొలాలకు వెళ్లడం లేదు. రసాయన ఎరువుల కోసం పరిగెత్తుతున్నారు. దొరుకుతాయో దొరకవో అన్న ఆత్రంతో పురుగుమందుల్ని ముందే కొని బంగారంలా దాచుకుంటున్నారు. ట్రాక్టర్లతో అటొక్కసారి ఇటొక్కసారి గీతలుపెట్టి విత్తనాలు చల్లేస్తున్నారు. ఒకసారి కలుపుతీస్తే రెండుసార్లు మందు కొడుతున్నారు. పంట ఇంటికొచ్చేలోపు ఎన్నిసార్లు మందులు కొడుతున్నారో లెక్కేలేదు. రసాయనాలతో సేద్యం చేస్తే భూమి పాడైపోతుందని, ఆ తిండి తినే మనుషులకు జబ్బులు చేస్తాయని రైతులకు తెలియని విషయాలు కావు. ప్రభుత్వానికి తెలియని విషయాలూ కావు. అయినా మందులు వేస్తే తప్ప పంటలు పండించడం సాధ్యం కాదన్న ప్రమాదకర స్థాయికి చేరింది మన వ్యవసాయం.

సేంద్రీయ మార్గదర్శకులు..

దీన్ని మార్చడానికి కొద్దిమందే అయినా గట్టి ప్రయత్నం చేసినవాళ్లు కొందరు ఉన్నారు
. వారిలో ప్రముఖుడు జపాన్‌కు చెందిన మసనోబు పుకువోకా. ప్రపంచమంతా రసాయన వ్యవసాయంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు, ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని మరిచిపోయినప్పుడు, ఎరువులు, పురుగుమందుల ఫ్యాక్టరీల సంఖ్యను రెట్టింపు చేసే పనిలో పడినప్పుడు, వాటిమీద ఆధారపడితేనే సిరులు పండుతాయని రైతులను మభ్యపెడుతున్నప్పుడు.. ఇదెంత ప్రమాదకరమో ఆలోచించినవాడు మసనోబు పుకువోకా. ఆయన ఉద్యోగాన్ని వదిలేసి, పల్లెకు తిరిగొచ్చినప్పుడు "పెద్ద చదువులు చదివినోడివి, రాళ్లురప్పలున్న ఈ పల్లెల్లో ఏం చేస్తావ్?''అన్నారు గ్రామస్థులు. అవేమీ పట్టించుకోకుండా మౌనంగా పొలానికెళ్లిపోయారు. 65 ఏళ్లు కిందా మీదా పడ్డాడు. బోలెడన్ని ప్రయోగాలు చేశాడు. సేంద్రీయ వ్యవసాయంతో అద్భుతాలు పండించాడు.

ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోయారంతా..! అదెలా సాధ్యమో చెప్పేందుకుకే ఆఫ్రికా, ఇండియా, యూరప్, అమెరికా దేశాలన్నీ తిరిగాడు. మందులతో పంటలు పండిస్తే.. రేపటితరాలు అనుభవించాల్సిన బాధలు అన్నీఇన్నీ కావన్నాడాయన. పుకువోకా లేవనెత్తిన సందేహాలు ఆధునిక వ్యవసాయ పద్ధ్దతుల్ని పునరాలోచనలో పడేశాయి. ఆయన రాసిన 'వన్ స్ట్రా రెవల్యూషన్' సంచలనం రేపింది. 'గడ్డిపరకతో విప్లవం' పేరుతో తెలుగులోనూ వచ్చిందది. రసాయన సేద్యం పరుగు పందేన్ని నిలదీసిన తొలి పుస్తకం అది.
http://www.savesanghavi.com/images/save.jpg
గుజరాత్-మహారాష్ట్ర సరిహద్దులో 'దెహ్రి' గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌సావే. ఇప్పుడాయనకు తొంభై ఏళ్లు. తనకున్న 14 ఎకరాలకు 'కల్పవృక్ష' అనే పేరు పెట్టాడు. "నా పొలమే నా విశ్వవిద్యాలయం''అంటాడు ఈ పెద్దమనిషి. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను లాక్కురావాలని పూనుకున్నాడీయన. 
http://www.otherindiabookstore.com/coverpics/The%20great%20agricultural%20challenge.jpg
హరితవిప్లవ సృష్టికర్త ఎం.ఎస్.స్వామినాథన్‌తో కూడా ఆ విషయాలను చర్చించేవాడు. ఆ ఉత్తరాలన్నీ కలిపి 'ద గ్రేట్ అగ్రికల్చర్ ఛాలెంజ్' అనే పేరుతో పుస్తకం తీసుకొచ్చాడు. విదేశీయుడైన భరత్‌మిత్రా ఓసారి ఢిల్లీకి వచ్చాడు. అక్కడున్న స్టార్‌హోటళ్లు, ఫ్లైఓవర్‌లు, హై రైజ్ బిల్డింగులు ఆయన్ని ఆకర్షించలేదు. క్యాన్సర్ ఆస్పత్రులు ఆకర్షించాయి. "అభివృద్ధి చెందిన దేశాల్లో నిషేధించిన పురుగుమందులన్నీ ఇండియాకు వస్తున్నాయి. అందుకే ఇక్కడ ఆస్పత్రుల సంఖ్య పెరుగుతోంది'' అని బాధపడ్డాడు భరత్. భారత్‌లో ఉండిపోయి లక్నోలో 'తులసి'తోటను పెంచాడు. ఇదంతా ఆర్గానిక్ ఫార్మింగే. 
http://www.thehindubusinessline.com/multimedia/dynamic/00330/2010043050130401_330733e.jpg
తులసి ఆకులను ప్రాసెస్ చేసి.. తేనీరు, ఆయుర్వేద ఔషధాలను తయారుచేశాడాయన. దేశవ్యాప్తంగా ఆర్గానిక్ తులసికి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఇలా మొదలైన ఆర్గానిక్ ఉద్యమం ఒక వైపు వ్యాపారం, మరో వైపు చైతన్యం దిశగా విస్తరించింది. ఇంతలో కార్పొరేట్ చూపూ దాని మీద పడింది. 
http://www.imagesfood.com/Images/newsimage/24_letter_mantra.jpg
పదివేల మంది సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్స్‌తో మార్కెట్‌లోకి వచ్చింది '24 లెటర్ మంత్ర'. ఇప్పుడది పదకొండు రాష్ట్రాల్లో సేంద్రీయ ఉత్పత్తుల్ని విక్రయిస్తోంది. 
http://www.sresta.com/inside/images/image002.jpg
మన రాష్ట్రంలో 'శ్రేష్ట' కూడా ఆర్గానిక్ వ్యాపారం చేస్తున్నది.http://www.rarindia.org/images/1farming.jpg
సేద్యానికి 'గుర్తింపు'..
ప్రస్తుతం మన రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఆర్గానిక్ సర్టిఫైడ్ రైతులున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్గొండ, చిత్తూరు, కడప, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతులు సేద్యంలో కొత్త అనుభవం పొందుతున్నారు. "ఒక ఆవు రెండు లీటర్లే పాలిస్తుందనుకోండి. అత్యాశకు పోయి నాలుగు లీటర్లు కావాలనుకుంటే పాలకు బదులు రక్తమొస్తుంది. భూమి కూడా అంతే. ఎంత పంటనివ్వాలో అంతే ఇస్తుంది. బలవంతంగా పిండుకోవాలని చూస్తే ఏదో ఒక రోజు అసలు పండే స్వభావాన్నే కోల్పోతుంది..'' అంటాడు ప.గోదావరి జిల్లా నాచుగుంటకు చెందిన 'సర్టిఫైడ్' రైతు భూపతిరాజు రామకృష్ణరాజు.

అయిదేళ్ల నుంచి సేంద్రీయ సాగు చేస్తున్న రాజు.. 'స్వర్ణ', 'పిఎల్1100', 'సాంబమసూరి' రకం ధాన్యాలను పండిస్తున్నాడు. మామూలు సాగులో ఎకరానికి 30 నుంచి 35 బస్తాలొస్తాయి.సేంద్రీయసాగులో 29 బస్తాలొస్తున్నాయి. ఆ లోటు పూడ్చుకునేందుకు.. మార్కెట్‌రేటు కంటే కాస్త ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు చెప్పారు. "ఒక్కసారి నా బియ్యాన్ని వండుకు తిన్నవారు జీవితంలో మానెయ్యలేరు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. నాకిప్పుడు 40 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. నూర్పిళ్లు అవుతూనే ఫోన్లు చేస్తారు...'' అంటూ గర్వంగా చెబుతారు రాజు.

ఆర్గానిక్ బియ్యానికే కాదు. సేంద్రీయ అల్లానికి కూడా చాలా గిరాకీ ఉంది. మెదక్ జిల్లా పీచార్యగుడికి చెందిన శ్యామ్‌సన్‌కు నాలుగెకరాల ఎర్రమాగాణి ఉంది. చేనులోనే ముప్పై గజాల లోతు బావి తవ్వాడు. అరకొర నీళ్లతోనే సేంద్రీయ సేద్యం మొదలుపెట్టాడు. "నేనిప్పుడు కేరళ మారన్ వెరైటీ అల్లం వేశాను. ఎకరాకు 40 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వసాయంతో పొలంలోనే వర్మీ కంపోస్టు షెడ్డు కట్టాను. సేంద్రీయ ఎరువుల్ని మేమే తయారు చేసుకుంటాం. మందులు పోసి పంట పండిస్తే మంచిగ పైసలొస్తయి కాని, తినే వాళ్ల ఆరోగ్యం చెడిపోతుంది కదా''అంటాడు శ్యామ్‌సన్. ఆ చుట్టుపక్కల ఊళ్లలో ఈయనొక్కడే సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్. అనంతపురం జిల్లాలో రైతు ల ఆత్మహత్యలకు కరువొక్కటే కారణం కాదు.

అందరి ఇళ్లలో పురుగుమందుల డబ్బాలుండం కూడా ఒక కారణమే..! నీళ్లు లేకపోయినా ఒట్టి మందులు చల్లి వేరుసెనగను పండిస్తారు ఈ జిల్లా రైతులు. ఎలక్ట్రానిక్స్‌లో డిప్లమో చేసిన ప్రహ్లాదరెడ్డికి ఈ బాధలన్నీ తెలుసు. అయినా సరే, మందు కొట్టకుండా వేరుసెనగ పండించి తీరాలనుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి దగ్గర్లోని బొందలదిన్నె అతని సొంతూరు. ఉద్యోగం వద్దనుకుని సేద్యంలోకి దిగాడు. తన అయిదు ఎకరాల పొలం పక్కనే ఉన్న పెన్నానదిలో బోరు వేశాడు. నాలుగించులు నీళ్లు పడ్డాయి. "మాది ఉమ్మడి కుటుంబం. అందరం కలిసి పనిచేస్తాం. సేంద్రీయ ఎరువుల కోసం పది గేదెలు, ఎద్దుల్ని మేపుతున్నాం. ఆర్గానిక్ అగ్రికల్చర్ కోసం 'సహజకృష్ణ రైతు సంఘం' ఏర్పాటు చేశాం. రసాయనాల జోలికే వెళ్లం. వరి, వేరుసెనగ, కంది పంటలు వేస్తాం. ఈ మధ్యనే మా పంటల్ని కొనేందుకు ఓ ఆర్గానిక్ ఉత్పత్తుల సంస్థ సంప్రదించింది. ఇది సేంద్రీయ సేద్యం వల్లనే సాధ్యమైంది..''అంటున్నాడు ప్రహ్లాదరెడ్డి.

వేపాకు ఉడకబెట్టి రసం తీసి.. పంటకు చల్లే తిమ్మయ్యను చూస్తే తోటి రైతులకు నవ్వొస్తుంది. "ఇంత పవరున్న మందులు చల్లుతుంటేనే పురుగు చావటం లేదు. నీ వేపాకు రసానికి చచ్చిపోతుందా?'' అని వెక్కిరిస్తారు. చిత్తూరు జిల్లా పచ్చారోళ్లపల్లికి చెందిన తిమ్మయ్య ఇప్పుడు సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతు. మూడేళ్లు కష్టపడితే కాని ఈ సర్టిఫికెట్టు రాలేదు. మూడెకరాల్లో వేరుసెనగ, ఎకరంలో చెరకు వేశాడు. సేంద్రీయంతోనే రుచికరమైన కందిపప్పు పండించి.. కిలో రూ.75కు అమ్ముతున్నాడు. ఇదే కందిపప్పు బయట మార్కెట్‌లో రూ.200 పెడితే కాని దొరకదు. కొండప్రాంతాల్లో వ్యవసాయం చేయడమంటే చాలా కష్టం. వచ్చే దిగుబడీ తక్కువ. అయినా సరే అత్యాశకు పోలేదు సుక్రు గైరమ్మ. విజయనగరం జిల్లా అడ్డతీగ గిరిజన గూడేనికి చెందిన ఈ మహిళా రైతు సేంద్రీయ సేద్యాన్ని ఇష్టపడింది. వరి, రాగులు, జొన్న, సామలు, కొర్రలు పండిస్తోంది.

పంట ఉత్పత్తులను విజయనగరం తీసుకురావాలంటే పడవలో గోస్తనీ నదిని దాటాలి. "సేంద్రీయ సేద్యంలో రైతు కు ఖర్చు తక్కువ. సమాజానికి లాభం ఎక్కువ. నేను చేస్తున్నది మంచి పనేగా'' అంటుందామె. చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ క్షేత్రంలోనూ సేంద్రీయ పంటల్ని పండిస్తున్నారు. పాతిక ఎకరాల్లో ఆర్గానిక్ కూరగాయాల్ని పండిస్తున్నారు. సేంద్రీయ రైతుల్ని ప్రభుత్వమే కాదు, స్వచ్ఛందసంస్థలూ ప్రోత్సాహిస్తున్నాయి. సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, డక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ, టింబక్టూ ఆర్గానిక్, ఆర్‌డీటీ, వికాస, చేతన, ఉర్వి.. ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం పనిచేస్తున్న సంస్థలు. సాధారణ సేద్యంతో పోల్చితే, సేంద్రీయ సేద్యం పరిధి చాలా తక్కువే కాని భవిష్యత్తు మీద ఆశ కలిగించే సేద్యం ఇదే.

మధ్యవర్తిగా ప్రభుత్వం

రాష్ట్రంలో ఆర్గానిక్ సేద్యం కింద వరి, రాజ్మా, కంది, తృణధాన్యాలు, కూరగాయలు సాగవుతున్నాయి. వీటిని తక్కువ ధరకే వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఈ మధ్యనే బయ్యర్స్-సెల్లర్స్ మీట్ పెట్టాం. ఇక్కడికి 20 కంపెనీలొచ్చాయి. సేంద్రీయ రైతుల వివరాలను తీసుకున్నాయవి. మొన్న హైదరాబాద్‌లో జరిగిన హార్టీకల్చర్ ఎక్స్‌పోలో కూడా స్టాల్స్ పెట్టుకునేందుకు రైతులకు అవకాశం ఇచ్చాం. వాళ్లు ఇక్కడికి రావడానికి రవాణా, ఫుడ్‌ప్యాకింగ్ సదుపాయాలను కల్పించాం. సాధారణంగా ఆర్గానిక్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేయాలంటే ఒక్కో రైతుకు రూ.15 వేలు ఖర్చు అవుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటికి అయిదు లక్షలు చెల్లించాం.
http://www.aggarwaloverseas.com/BookImages/DetailPageImages/66484.jpg

- మద్దిలేటి, అసిస్టెంట్ డైరెక్టర్,
సేంద్రీయ విభాగం, వ్యవసాయశాఖ

Gouthamaraju as WUA