పాడి పంటలు

Showing posts with label సంగతులు. Show all posts
Showing posts with label సంగతులు. Show all posts

Tuesday, December 14, 2010

తిండి తిప్పలు * పండిద్దునా... కొనుక్కుందునా ?

ఆహారం పండిద్దునా .........
లేక కొనుక్కుందునా?
మా ఊరయిన చిత్తూరు జిల్లా వెంకటాపురంలో రైతులు ఈ విధంగా మాట్లాడుకుంటారు... "మా కుటుంబ అవసరాలకు ఏటా ఎన్ని వేరుశనగలు కావాలి... మహా అయితే ఒక గోతాము చట్నీకి, రెండు మూడు గోతాలు వంట నూనెకి. దానికోసం ఇంత కష్టపడి పండించడం ఎందుకు? సొంత డబ్బుతో పెట్టుబడి పెట్టాలి మన వద్ద లేకపోతే వడ్డీకి అప్పు చెయ్యాలి. పొలంలో పని చేయడానికి కూలి వాళ్లు దొరకాలి. అంతా చేసి పంట చేతికి వచ్చేనాటికి ధరలు పడిపోవచ్చు. అదే జరిగితే మిగిలేది అప్పులే. అందుకే దాని బదులు పొలాన్ని మామిడి తోట కిందకు మార్చేసి మనకి కావాల్సిన వేరుశనగల్ని కొనుక్కుంటే నయం కాదా?''

ఇదే రకమైన వాదన మిరప, కూరగాయలు, పాల విషయంలో కూడా వినపడుతుంది. ఎన్ని మిరపకాయలు కావాలి? ఐదు కిలోలో, పది కిలోలో. దాని కోసం పండించే బదులు కొనుక్కుంటే సరిపోతుంది. పాలెన్ని కావాలి? రోజుకి అర లీటరో లీటరో. టీకి, పెరుగుకి లేదా మజ్జిగకి. దాని కోసం ఆవుల్ని పెంచడం, గడ్డి కోసుకొచ్చి వేయడం, వాటికి దాణా కోసం వేరుశనగ చెక్కను కొనడం, అవి జబ్బు పడితే డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లడం... ఎందుకీ గోలంతా? ఇదే విధంగా కూరగాయలు... దుక్కి దున్నాలి, సాళ్లు తోలాలి. క్రమం తప్పకుండా నీరు పెట్టుకోవాలి, కలుపు తీస్తుండాలి, పురుగు మందులు కొట్టాలి, ముదరక ముందే కాయలు కోసి మార్కెట్టుకు పంపాలి. ఇంత కష్టపడితే గిట్టుబాటు ధర రాకపోవచ్చు... ఎందుకొచ్చిన తలనొప్పి.

కొనుక్కుంటే సరిపోతుంది. కూరల ధరలు ఎక్కువుంటే ఆకు కూరలతో సరిపెట్టుకోవచ్చు. అవీ లేకపోతే మునగాకుతో ముగించవచ్చు. లేదా చింతపులుసు, చట్నీ, రసంతో కానిచ్చేయొచ్చు. ఇలా ఆలోచించడం వల్లే రైతులు వర్షాధార పంటలు, ముఖ్యంగా మెట్ట పంటలైన తృణ ధాన్యాలు, పప్పు గింజలు, నూనె గింజలు, కూరగాయలు పండించడానికి ముందుకు రావడం లేదు. పశువుల పెంపకం పట్ల వారికి ఆసక్తి మరీ తగ్గిపోతోంది. పంట భూములన్నిటిని తోటల కిందకు మార్చేసి హాయిగా సేద తీరుతున్నారు. మా ఊళ్లో అయితే ఇంతకు ముందు వేరుశనగలు, పప్పులు, నూనె గింజలు పండిన నేలల్లో ఇప్పుడు మామిడి పండ్లు పండుతున్నాయి. మరి పప్పు, ధాన్యం బదులు రోజూ మామిడి పండ్లనే తినగలమా? పంటభూమి ఉన్న రైతులంతా ఇట్లాగే ఆలోచిస్తే ఆహార పంటలనెవరు పండిస్తారు? ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయంటే అంటవా మరి? కాని రైతులిట్లా ఎందుకు చేస్తున్నారు?

సాగు ఖర్చులు పెరుగుతున్నాయి, చేతికొచ్చే డబ్బులు తగ్గుతున్నాయి. పంట ఉంటే ధర ఉండదు.. ధర ఉంటే పంట ఉండదు. ఏడాది కేడాదికి పెరుగుతున్న నష్టాలను చూసి రైతులు ఆ పంటలకి దణ్ణం పెడుతున్నారు. కొబ్బరి తోటల విషయంలో నా సొంత అనుభవమే చెపుతాను. గత ఇరవై సంవత్సరాల నుంచీ వాటి ధర ఒక్కో కాయకి రూ. 2 నుండి రూ. 3 పలుకుతోంది. అంతకు మించి ఒక్క పైసా పెరగలేదు. అందుకే చిత్తూరు జిల్లాలో కొబ్బరి రైతులు చెట్లు కొట్టేసే యోచనలో ఉన్నారు. ఆ పంటకేమో ఎక్కువ నీళ్లు కావాలి. నీటి మట్టమేమో తగ్గుతూ పోతోంది. అదే విధంగా ఇరవై ఏళ్లలో పాల ధర లీటరు రూ4 నుండి రూ16కి పెరిగింది. అయితే మేతగా వాడే వేరుశనగ చెక్క ధర అదే కాలంలో కిలోకి రూ4 నుండి రూ26కు పెరిగింది.

వరికి, గోధుమకు తప్పించి మిగతా వేటికీ ఖచ్చితమైన మద్దతు ధర లభించట్లేదు. ప్రతి సంవత్సరం రైతు మొదట్లో రుతుపవనాలతోను చివర్లో మార్కెట్టుతోను జూదమాడినట్లవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఎందుకు చేయాలి? ఈ మధ్యన కొత్త అంశం వచ్చి చేరింది. పోయిన దశకంలో గ్రామాలలో మూడు ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటంటే... డ్వాక్రా, ప్రజాపంపిణీ వ్యవస్థ, జాతీయ రోజ్‌గార్ యోజన. డ్వాక్రా పుణ్యమా అని భూమి లేని మహిళా రైతులకు రుణ సదుపాయం లభిస్తోంది. దాంతో పశువుల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలతో వారికి బతుకుతెరువు దొరుకుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ పుణ్యమా అని దారిద్య్రరేఖకి దిగువనున్న కుటుంబాలకు పదిరోజులకు సరిపడా ధాన్యం రెండురూపాయలకు కేజీ చొప్పున లభిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పుణ్యమా అని పనివాళ్ల జేబుల్లో డబ్బు కదలాడుతున్నది.

దాంతో వ్యవసాయం పట్ల, పని పట్ల వారి ఆలోచనలు అభిప్రాయాలు మారిపోయాయి. వారమంతా పని చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. పనికి వెళ్లని రోజు తమ సొంత పని చేసుకుంటున్నారు. అది వారి స్వీయ ఉపాధి వ్యాపారం కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు. ఉపాధి హామీ పథకం వల్ల గ్రామాల్లో కూలి రేట్లు పెరిగి వ్యవసాయం ఖర్చు పెరిగిపోయింది. దీని వల్ల ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కూలీల వలస కొంతమేర తగ్గిపోయిందేమో కాని, గ్రామాల నుండి పట్టణాలకి వలస మాత్రం తగ్గలేదు. ఎందుకంటే పట్టణాల్లో కూలి ఎక్కువగా లభిస్తుంది కనుక.

ఈ రకంగా నిరంతరాయంగా పట్టణాలకు వలస వెళ్లటం మూలాన గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడుతున్నది. మా గ్రామాల్లో ఈ సీజనల్ వలసలు శాశ్వత వలసలకు దారి తీశాయి. ఉపాధి హామీ పథకం చాలా వరకు లోపభూయిష్టంగా ఉంటుంది. నిర్వహణలో చాలా అవినీతి చోటు చేసుకుంటుంది. దీనివల్ల నష్టపోయే వాళ్లూ, లాభపడేవాళ్లు కూడా వ్యవసాయ కూలీలే. ఎలాగంటే... ఇందులోని మస్టర్ రోల్స్ (కూలీల వివరాలు) అన్నీ ఉత్తుత్తివే. పని చేసిన వాళ్లకంటే ఎక్కువమందిని చూపించి ఆ డబ్బు తీసుకోవడం సాధారణం. పని కొలతలు కూడా ఉత్తుత్తివే. అసలు జరిగిన దానికంటే ఎక్కువ పని జరిగినట్టుగా చూపించటం మామూలయిపోయింది. కూలీలకు కూడా ఇదంతా అలవాటైపోయింది. దీనివల్ల ఒక రైతు పర్యవేక్షణలో పని చేయటానికి వాళ్లు ఇష్టపడడం లేదు. ప్రభుత్వం ఇచ్చినంత వేతనం రైతు కూడా ఇవ్వాలనుకుంటున్నారు వాళ్లు. ఫలితంగా కూలీ రేట్లు రైతులకు మోయలేని భారమయ్యాయి. దీని ప్రభావం వారిపై ఎలా ఉందో వచ్చేవారం తెలుసుకుందాం.

- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in,
99897 98493

Tuesday, November 23, 2010

తిండి తిప్పలు * అమెరికా పొలానికి గువానో బలం

అమెరికాలో రసాయనాల వాడకం చిత్రంగా మొదలైంది. అదెలాగో తెలుసుకోవాలంటే దక్షిణ అమెరికా ఖండానికి వెళ్లాల్సిందే. 1800ల నాటి సంగతి. అప్పట్లో 80 శాతం అమెరికన్లకి వ్యవసాయమే జీవనాధారం. అంతేకాదు ఆ దేశ ఆదాయంలో 75 శాతం వ్యవసాయం నుండే వచ్చేది. వ్యవసాయం కోసం అడవుల్ని నరికేసి, పశువుల ఎరువు వాడుతూ, పంటమార్పిడి పద్ధతులు పాటిస్తూ, బానిసల శ్రమపై ఆధారపడి... అమెరికాలో వ్యవసాయం సాగేది. పండించిన దాంట్లో ఎక్కువ శాతం యూరప్‌కి ఎగుమతి అయ్యేది. కొంతకాలానికి అక్కడి నేలల్లో సారం అనూహ్యంగా పడిపోయింది. ఇదిలా ఉండగా 1804లో జర్మనీకి చెందిన వృక్షశాస్త్రవేత్త అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ దక్షిణ అమెరికా నుండి గువానో అనే పదార్థాన్ని తీసుకొచ్చాడు. గువానో అంటే ఏమిటి?

ఇప్పటి పెరూ తీరంలో వాన్ హంబోల్ట్ కొన్ని ద్వీపాల్ని గమనించాడు. ఆ ద్వీపాలపై వేలయేళ్ల నుండి సముద్రపక్షులు నివాసముండడంతో వాటి రెట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. వాటినే గువానోలు అంటారు. అక్కడి స్థానికులు ఆ ద్వీపాల్లోని పక్షులకు ఎలాంటి హానీ తలపెట్టకుండా రెట్టని తీసుకుని పంటలకి ఎరువుగా వాడేవారు. అది నత్రజని అధికంగా కలిగిన పదార్థం కాబట్టి దానివల్ల పంటలు బాగా పండేవి. ఆ విషయం హంబోల్ట్ ద్వారా మిగతా ప్రపంచానికి తెలిసింది. అంతే... వెంటనే గువానో కోసం రష్ మొదలైంది. 1851 నాటికల్లా 66 వేల టన్నుల గువానో ఉత్తర అమెరికాకి తరలి వెళ్లింది. పెరూ తీరంలోని 94 ద్వీపాలను అమెరికా తన అధీనంలోకి తెచ్చుకుంటూ 1856లో ఒక చట్టమే చేసింది. దాన్ని అమెరికాకి తరలించడానికి చైనా నుండి బానిసల్ని తీసుకొచ్చారు. అంతేకాదు, స్థానిక పెరువియన్ ఇండియన్లను బం«ధించి వారిచేత రోజుకి 20 గంటల పైనే పని చేయించేవారు. వారికి ఎలాంటి కూలి ఇచ్చేవారు కాదు. అలా పని చేస్తున్న చాలామంది గువానో గుట్ట చెరియలు విరిగిపడి చనిపోయారు కూడా. ఆ బానిస బతుకు బతకలేక కొందరు సముద్రంలో దూకి ప్రాణాలు వదిలారు.

1870 నాటికి గువానో కొండలు పూర్తిగా తరిగిపోయాయి. అయితే సత్వర ఫలితాన్నిచ్చే ఎరువులకి డిమాండ్ పెరగడంతో జాన్ బెన్నెట్ లావెస్ అనే ఆయన సూపర్ ఫాస్ఫేట్‌ను తయారు చేశాడు. 19వ శతాబ్దాంతానికి అలాంటి మరెన్నో ఎరువులు తయారు చేయడం, అమ్మడం ఎక్కువైంది. 1909లో జర్మనీకి చెందిన రసాయనశాస్త్రవేత్తలు హేబర్, బోస్ కృత్రిమంగా నత్రజని ఎరువుని తయారుచేసే విధానాన్ని కనుగొన్నారు. నైట్రోజన్ నుంచి తయారు చేసే నైట్రిక్ ఆక్సైడ్‌ను పేలుడు పదార్థాల్లో కూడా వాడతారు. డ్యూపాంట్ లాంటి అమెరికన్ కంపెనీలు దాన్ని ఓ పక్క పేలుడు పదార్థాల తయారీలో వాడుతూ, మరోపక్క దాంతో రసాయన ఎరువులు తయారు చేశాయి. ఆ విధంగా రసాయన ఎరువుల పరిశ్రమ ఉద్భవించింది. ఆ ఎరువుల్లో వాడే రసాయనాలే హిట్లర్ కాలంనాటి జర్మనీలో విషవాయువులుగా కూడా ఉపయోగ పడ్డాయి. అంతేకాదు ఆ రోజుల్లోనే క్రిమిసంహారక మందులు తయారు చేసే కంపెనీలు ఫార్మాస్యూటికల్ కంపెనీలుగా కూడా ఎదిగాయి.

ఉదాహరణకి మోన్‌శాంటో కంపెనీ 1901లో సాచరిన్ తయారు చేయడం మొదలు పెట్టింది. హార్మోన్‌లను ప్రభావితం చేసే క్యాన్సర్ కారకాలయిన పిసిబి, ఏజెంట్ ఆరెంజ్‌లను ఉత్పత్తి చేసింది. ఏజెంట్ ఆరెంజ్‌ను వియత్నాం యుద్ధ సమయంలో పొలాలు, అడవులను నాశనం చెయ్యడానికి ఉపయోగించారు. ఆ తర్వాత మోన్‌శాంటో 1970ల్లో కలుపుమొక్కల నివారణ మందులను, 1980ల్లో జన్యుమార్పిడి విత్తనాల్ని తయారుచేసింది. 1990ల్లో ఈ కంపెనీ జంతువులు త్వరగా ఎదగడానికి వాడే హార్మోన్‌ను విరివిగా ప్రమోట్ చేసింది. "ఆ కంపెనీ వ్యాపారంలో వేసిన ప్రతి అడుగువల్లా వినాశనమే జరిగింది. అయినా ఆ కంపెనీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది'' అని ఆర్గానిక్ మేనిఫెస్టోలో మారియా రొడేల్ పేర్కొన్నారు.

కృత్రిమ ఎరువులు నిస్సారమైన భూముల దిగుబడిని పెంచినా వాటి వాడకం మరిన్ని రసాయనాల వాడకానికి దారి తీసింది. క్రిమిసంహారక మందుల వాడకం పెరిగిపోయింది. వ్యవసాయ ఖర్చు పెరిగిపోవడంతో చిన్న రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ఇదే అదునుగా పెద్దపెద్ద కంపెనీలు రంగప్రవేశం చేసి వారి నుండి పొలాల్ని కొనుగోలు చేశాయి. ఫలితంగా అమెరికాలో స్వతంత్ర వ్యవసాయదారులు అంతరించిపోయారు. కార్పొరేట్ వ్యవసాయ సంస్థలు మాత్రమే మిగిలాయి. ఇప్పటికీ అమెరికాలో వ్యవసాయదారులంటే ఆ సంస్థలే.

సువిశాలమైన కమతాలు, భారీ యంత్రాలు ఎలా వచ్చాయి? అడవులను నరకడం ద్వారా అమెరికాలో విశాలమైన కమతాలు ఏర్పడ్డాయి. అక్కడ పొలాలెక్కువై వాటిలో పని చేయడానికి జనం కొరత భారీగా ఏర్పడింది. అందుకే ఆఫ్రికా నుండి నల్లజాతీయుల్ని బానిసలుగా తీసుకొచ్చారు. తర్వాత బ్రిటన్, అమెరికాలలో వచ్చిన పారిశ్రామిక, రసాయన విప్లవాల ఫలితంగా కొత్తకొత్త యంత్రాలు పుట్టుకొచ్చాయి. వాటి వినియోగం పెరిగి పనివాళ్ల అవసరం కొంతవరకు తగ్గింది. 1960ల్లో చమురు నిలవల్ని గుర్తించడం, వాటిని వెలికితీయడం ఎక్కువైంది. చమురు చౌకగా దొరకడంతో అమెరికా, యూరప్‌లలో వ్యవసాయానికి భారీ యంత్రాల వాడకం ఒక్కసారిగా పెరిగిపోయింది. అమెరికన్ పొలం సగటు వైశాల్యం నాలుగొందల ఎకరాల పైమాటే. అదే ఇండియాలో అయితే 3.3 ఎకరాలు.

అమెరికా ఎప్పుడూ తక్కువ జనాభా కలిగిన విశాల దేశమే. ఆ విశాలమైన పొలాల్లో పండే పంట అక్కడి ప్రజలకి అవసరమైన దానికన్నా చాలా ఎక్కువ. అందుకే వాళ్లు పండించిన దాన్ని మొదట్నుండీ భారీ మొత్తంలో ఎగుమతి చేసేవారు. అయితే 1930ల నాటి ఆర్థికమాంద్యం దెబ్బకి ప్రజల కొనుగోలు స్థాయి బాగా తగ్గిపోయింది. అయినా అమెరికాలో ఉత్పత్తి మాత్రం తగ్గలేదు. అమెరికా ప్రభుత్వం దీనికో పరిష్కారాన్ని సూచించింది. డిమాండ్‌కు తగ్గట్టే తక్కువ పండించమని రైతులకు చెప్పి అలా తక్కువ పండించడం వల్ల వల్ల వారు నష్టపోకుండా వారికి డబ్బు చెల్లించింది. ఎందుకంటే... ఎక్కువ పండిస్తే సరుకు ఎక్కువై ధర తగ్గించాలి. కానీ వాళ్లు తక్కువ పండించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా ఉత్పత్తుల ధరలు తగ్గకుండా నియంత్రించవచ్చు. ఈ పాలసీలో భాగంగా ఒక్క 1933లోనే మాంసం కోసం పెంచుతున్న 60లక్షల పందిపిల్లల్ని చంపేశారు.

- ఉమాశంకరి
umanarendranath@yahoo.co.in, 99897 98493

Gouthamaraju as WUA