పాడి పంటలు

Saturday, January 1, 2011

కరివేపాకు సాగులో లాభాల గుబాళింపు!

 
కరివేపాకే కదా అని తీసిపారేయకండి. ఆ కరివేపాకే ఇప్పుడు ఎంతో మంది రైతన్నల్ని లక్షాధికారుల్ని చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వాణిజ్య పంటల సాగు నేడు జూదంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో కరివేపాకు సాగు చేసి ఎక్కువ ఆదాయం పొందవచ్చునని నిరూపిస్తున్నారు విజయవాడ పరిసర ప్రాంతాల రైతులు.

వాణిజ్య పంటలు సాగు చేసి చేతులు కాల్చుకునే కంటే ఏళ్ల తరబడి కరివేపాకునే నమ్ముకుని లాభాల గుబాళింపును ఆస్వాదిస్తున్నారు పులగం శివరామయ్య. విజయవాడ నగరం చెంతనే ఉన్న కుంచనపల్లి గ్రామానికి చెందిన శివరామయ్య ఓ సన్నకారు రైతు. ఆయనకు రెండెకరాల పొలం ఉంది. అందులో ఎకరం భూమిని గత పదిహేనేళ్లుగా కరివేపాకు సాగుకే కేటాయిస్తున్నారు.


ఏటా పెట్టుబడి ఖర్చులన్నీ పోను యాభై వేల రూపాయల నికరాదాయం పొందుతున్నారు. శివరామయ్యను చూసి ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది రైతులు ఇప్పుడు కరివేపాకునే తమ ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. ఏడాదికి మూడు కోతలు తీసుకుంటూ వాణిజ్య పంటలకు దీటుగా ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కరివేపాకు సాగు చేయడానికి ముందుకొచ్చే ఔత్సాహిక రైతులకు శివరామయ్య పలు సూచనలు అందిస్తున్నారు. అవి ఆయన మాటల్లోనే...


మంచి డిమాండ్

ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న కరివేపాకుకు ఇతర ప్రాంతాల్లో, దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కరివేపాకు సాగు చేసే రైతులకు వ్యాపారులు ముందుగానే డబ్బు చెల్లిస్తున్నారు. కృష్ణా తీరంలో సారవంతమైన ఒండ్రు నేలలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ కరివేపాకు సాగు అందరికీ లాభదాయకంగా ఉంటోంది. మరో విశేషమేమంటే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, వాతావరణం అనుకూలించకపోయినా కరివేపాకు దిగుబడిపై పెద్దగా ప్రభావం పడడం లేదు. అదే ఇక్కడి రైతులకు బాగా కలిసొస్తోంది. ఒకసారి కరివేపాకు సాగు ప్రారంభిస్తే అయిదేళ్ల వరకూ దాని నుండి పంట తీసుకోవచ్చు.

సాగు విధానమిలా...

కరివేపాకు పంటకు నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. ముందుగా భూమిని దుక్కి దున్ని చదును చేయాలి. ఆ తర్వాత మడులు తయారు చేసుకొని కరివేపాకు విత్తనాలు చల్లుకోవాలి. నేరుగా సాళ్లు చేసుకొని కూడా విత్తనాలు విత్తుకోవచ్చు. సాళ్లలో విత్తుకునేట్లయితే ఎకరానికి 80-100 కిలోలు, నేరుగా మడుల్లో చల్లుకునేట్లయితే 200 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. దేశవాళీ రకాలతో పాటు భువనేశ్వర్ రకం రైతులకు మంచి దిగుబడులు అందిస్తోంది.

భూమి తయారీ, విత్తనాల కొనుగోలు, విత్తడం వంటి పనులకు ఎకరానికి 15 వేల రూపాయల వరకూ ఖర్చవుతాయి. ఎరువులు, పురుగు మందుల వినియోగానికి మరో 10 వేల రూపాయలు ఖర్చవుతాయి. ఆరు నెలల తర్వాత మొదటి కోత వస్తుంది. అప్పటి నుండి ప్రతి వంద రోజులకు ఒకసారి కోత కోయవచ్చు. ఎగుమతి అవకాశాలు, సీజన్‌ను బట్టి ఒక్కో కోతకు 25 వేల రూపాయల వరకూ ఆదాయం వస్తుంది. ప్రస్తుతం క్వింటాలుకు స్థానిక మార్కెట్‌లోనే నాలుగు వేల రూపాయల ధర పలుకుతోంది. ఒకసారి పంట వేస్తే అయిదేళ్ల వరకూ దానిని కదిలించాల్సిన అవసరం ఉండదు. పైగా కోత తర్వాత వచ్చే పిలకలు త్వరితగతిన ఏపుకు వస్తాయి.


చీడపీడలు తక్కువే

కరివేపాకు సాగులో చీడపీడల ప్రభావం తక్కువగానే ఉంటుంది. అయితే పేనుబంక, పొలుసు పురుగు ఆశించే అవకాశం ఉంది. పేనుబంక నివారణకు రోగార్, కాన్ఫిడార్ వాడితే ఫలితం ఉంటుంది. పొలుసు పురుగు నివారణకు కానుగ నూనె పిచికారీ చేయడం మేలు. ఒకవేళ రసాయన మందులు వాడాల్సి వస్తే మలాథియాన్ పిచికారీ చేయవచ్చు.

ఎగుమతులకు భలే గిరాకీ

కరివేపాకు ఎగుమతులకు మంచి గిరాకీ ఉంది. విజయవాడ మార్కెట్ నుంచి చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్‌కు ఎక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయి. దుబాయ్‌లో కూడా కరివేపాకుకు మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు ముందుగానే రైతుల నుండి తోటలు కొని ఇక్కడి నుండే నేరుగా ఎగుమతి చేస్తున్నారు. కరివేపాకును ఔషధాల్లోనూ, బేకరీ ఫుడ్స్‌లో సువాసన కోసం వాడటం వల్ల మంచి డిమాండ్ ఏర్పడింది. కరివేపాకు నుండి స్వేదన క్రియ ద్వారా ఓలియో రెజిన్ అనే నూనెను తయారు చేస్తున్నారు. దీనిని వంటకాల్లో వినియోగిస్తున్నారు. కొన్ని మందుల కంపెనీలు కరివేపాకు పొడిని వినియోగిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని విజయవాడ ప్రాంతం నుంచి కరివేపాకును ముందుగానే పొడి చేసి నేరుగా ఎగుమతి చేస్తున్నారు.

No comments:

Gouthamaraju as WUA