పాడి పంటలు

Friday, January 28, 2011

పల్లె పచ్చని కూరగాయలు

పెరట్లో సేంద్రియ కూరగాయల పెంపకం...
ఇంటి ల్లిపాదికీ బాగు బాగు
తీగ జాతి కూరగాయల సాగుకు ఇదే అదను
ఆకుకూరలు, టమాటా, వంగ..
ఏ కాలంలోనైనా చక్కగా ఎదుగుతాయి
ప్రత్యేక మడుల్లో అధిక దిగుబడులు సాధ్యం


శీతాకాలం వెళ్లిపోతోంది. ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. సాధారణంగా గ్రామాల్లో ఇళ్ల దగ్గర కాస్తో కూస్తో పెరటి స్థలం ఉంటుంది. పెద్దగా ఖాళీ స్థలం లేకపోయినా ఐదూ పది గజాల స్థలమైనా ప్రతి ఇంటి ముందో, వెనుకో, పక్కనో ఉంటుంది. ఈ కాస్త జాగాలో ఏం పండిస్తాంలే అననుకోకుండా.. కాస్త మనసు పెట్టి సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, అనేక రకాల కూరగాయలు పెద్దగా ప్రయాస లేకుండానే పండించుకోవచ్చు.

రాబోయే రోజుల్లో ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ఇంటిల్లిపాదీ తినడానికి ఈ రోజే పని ప్రారంభించడం ఉత్తమం. ఒకవైపు కూరగాయల్లో విష రసాయనాల అవశేషాలు, మరోవైపు అంతకంతకూ పెరుగుతున్న ధరలు... ఏ విధంగా చూసుకున్నా.. ఉన్నంత స్థలంలో కొన్ని రకాలైనా ఇంటి పట్టున పండించుకోవడం ఉత్తమం కదండీ....!

పశువుల నుంచి రక్షణ అవసరం
గ్రామాల్లో ఇళ్ల దగ్గర ఎంతో కొంత ఖాళీ స్థలం ఉంటుంది. కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పశువులు మొక్కల్ని బతకనివ్వవు. ప్రహరీ లోపలైతే ఫర్వాలేదు. కనీసం ముళ్ల కంచె అయినా గట్టిగా కట్టుకొని మొక్కలు పెంచడానికి శ్రీరారం చుట్టాలి. పల్లెల్లో మొక్కలకు పశువులే కాదు.. కోళ్ల బెడద కూడా ఎక్కువే. ఇతరులవే కాదు మనకూ కోళ్లుంటాయి. వాటిని తిరగకుండా కట్టడి చేసుకుంటే తప్ప మొక్కలు ఎక్కిరావు.
ప్రణాళికతో ఏడాది పొడవునా పెరటి కూరగాయలు
అన్ని కూరగాయలు, ఆకుకూరలూ ఒకే రోజు విత్తుకోకూడదు. ఇప్పుడు గుప్పెడు గింజలు, వారం పది రోజులు గడిచాక మరికొన్ని గింజలు.. అలా విడతల వారీగా చల్లుకోవాలి. ప్రతి వారం ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులో ఉంచుకోవాలంటే ఇలాంటి ఉపాయం అవసరమే. ఈ విధంగా ఏడాది పొడవునా పుష్కలంగా ఆకుకూరలతోపాటు కూరగాయలు కూడా ప్రణాళిక ప్రకారం పెంచుకోవచ్చు.

ఏ ఏ రకాల సాగుకు తగిన సీజన్ ఇది?
ఆకుకూరలకు ప్రత్యేకంగా సీజన్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా చక్కగా పెరుగుతాయి. పాలకూర, చుక్కకూర.. తదితర ఆకుకూరలు మూడు, నాలుగు వారాల్లో కోతకు వస్తాయి. మొక్కలను కత్తిరిస్తే మళ్లీ పిలకలు వేస్తాయి. కత్తిరించిన తర్వాత మట్టిని గుల్ల చేసి చారెడు కంపోస్టు చల్లి నీరుపోస్తే చాలు. పిలకలు పెరిగాక కోసుకొని.. మళ్లీ విత్తనాలు చల్లుకోవాలి. మెంతి మొక్కల్ని మూడుసార్ల వరకూ కత్తిరించుకోవచ్చు. గోంగూర మొక్క నుంచి ఆకుల్ని కోసుకోవాలి. పూత, పిందె వచ్చేంత కోసుకుంటూ ఉండొచ్చు. మొక్క బచ్చలి మాత్రం 45 రోజులకు కోతకు వస్తుంది.

పందిళ్లతో అధిక దిగుబడులు
పెరటి తోటల్లో తీగజాతి మొక్కల పెంపకానికి ఇది చక్కటి సీజన్. బీర, పొట్ల, కాకర, దోస తీగలను చక్కగా పందిళ్లు వేసి పండిస్తే అధిక దిగుబడి వస్తుంది. భారీగా పందిళ్లు అక్కర్లేదు. ఇంట్లో వాళ్లే తీరిక ఉన్నప్పుడు నాలుగు పురికొసలో, ఇనుప తీగలో కట్టి వాటిపైకి మొక్కల్ని పాకిస్తే చాలు. కొంచెం ఆసరా ఇస్తే చాలు. ఇంటి మీదకో, పందిరి మీదకో అల్లుకొని చక్కని దిగుబడినిస్తాయి. తీగ బచ్చలి వేసుకుంటే ఏడాది పొడవునా ఆకుకూర అందుబాటులో ఉంటుంది. దొండ పాదు నాటుకుంటే మూడేళ్ల వరకూ దిగుబడి ఇస్తూనే ఉంటుంది.

బెండకూ ఈ సీజన్ భేష్
బెండ సాగుకూ ఇది మంచి సీజన్. రెండు నెలల్లో కాపుకొస్తుంది. ఒకటిన్నర నెలలు కాస్తుంది. ఇంట్లో ఎందరు ఉంటారనే దాన్ని బట్టి ఎన్ని మొక్కలు వేసుకోవాలో చూసుకోవాలి. గోరుచిక్కుడు, మొక్కజొన్న.. టమాటా, వంగ వంటి పంటల గురించి ఇక చెప్పనక్కర్లేదు. బీర విత్తనం నాటిన నెలన్నర, రెండు నెలల్లో కాయలు కోతకు వస్తాయి.

పొట్ల తీగను పందిరిపైకి పాకిస్తే మంచి దిగుబడి వస్తుంది. కాయలు వంకరైపోకుండా రాయి కట్టాలి. వంగ మూడు నెలల్లో కాపుకొస్తుంది. 6 నెలల వరకూ కాపు ఉంటుంది. తర్వాత చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి.. కొంచెం కంపోస్టు వేస్తే.. మళ్లీ ఏపుగా పెరిగి కాపుకొస్తుంది. ఏడాదికిపైగా వంకాయలకు ఢోకా ఉండదు. వంగకే పురుగుల బెడద ఎక్కువ. ఏ రెమ్మకు తెగులు వచ్చినా అక్కడికి తుంచేసి నాశనం చేయడం అవసరం. టమాటా మొక్క వేసిన 2 నెలల్లో కాపుకొస్తుంది. రెండు నెలల పాటు కాయలు ఇస్తుంది.

సేంద్రియ ఆహారమే ఆరోగ్యం
రసాయనాలు వాడకుండా పెంచుకున్న కూరగాయలు, ఆకుకూరలే ఆరోగ్యం, కమ్మటి రుచి కూడా. ఖాళీ ఉంది కదా అని గొయ్యి తీసి ఆ మట్టి ఎలా ఉన్నా విత్తనం వేస్తే సరిగ్గా పెరగకపోవచ్చు. అందుకే... మట్టి, పశువుల ఎరువు, వర్మి కంపోస్టు లేదా ఇంటి వద్ద తయారుచేసుకున్న ఆకుల ఎరువు(లీఫీ మౌల్డ్) కలిపి ప్రత్యేకంగా సిద్ధంచేసుకున్న మిశ్రమం వాడితే ఫలితం బావుంటుంది. ఈ మట్టి మిశ్రమంతో ప్రత్యేకంగామడులను తయారుచేసుకొని కూరగాయలు, ఆకుకూరలు పెంచుకుంటే మామూలుగా కన్నా 3 నుంచి 5 రెట్లు అధిక దిగుబడి వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ఎరమ్రట్టి వాడితే ఇసుక కలపనక్కర్లేదు
కొన్ని ప్రాంతాల్లో నల్లమట్టి, మరికొన్ని ప్రాంతాల్లో ఎరమ్రట్టి ఉంటుంది. నల్లమట్టికి త్వరగా గట్టిపడి పిడచకట్టుకుపోయే స్వభావం ఉంది. దీనివల్ల మొక్కలు బాగా పెరగవు. అందుకని ఎరమ్రట్టి వాడితే మంచిది. నల్లమట్టే వాడాల్సి వస్తే కంపోస్టు, పశువుల ఎరువు వంటి వాటితోపాటు ఇసుకను కూడా కలపడం మంచిది. ఎరమ్రట్టి రెండుపాళ్లలో మిగతా సేంద్రియ ఎరువులు ఒక్కోపాళ్లలో కలిపి మొక్కలు పెంచొచ్చు. నల్లమట్టి అయితే ఒక పాలు కలిపితే మంచిది.
వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు తగినంత దొరక్కపోతే మట్టి, కంపోస్టు సమపాళ్లలో వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే... 65 శాతం మట్టి, మిగతా భాగం సేంద్రియ ఎరువులు కలిపి వాడొచ్చు. వేప పిండి, కానుగ పిండి, ఆముదం పిండి, మాగిన కొబ్బరి పొట్టు సాధ్యమైనంత కలుపుకుంటే మొక్కలను చీడపీడలు అంతగా ఆశించకుండా ఉంటాయి. ఇవి మొక్కలకు బలం కూడా. కొబ్బరి పొట్టు వల్ల వేళ్లు అధికంగా ఏర్పడడానికి వీలవుతుంది. మట్టిలో తేమ త్వరగా ఆరిపోకుండా కొబ్బరి పొట్టు చూస్తుంది. మట్టిని పక్కన పెట్టి కేవలం ఆకుల ఎరువు లేదా శుద్ధిచేసిన కొబ్బరి పొట్టునే వాడుతూ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. మట్టిలోకన్నా అనేక రెట్లు ఎక్కువ దిగుబడి తీస్తున్నారు కూడా.

ప్రత్యేక మడులు...

ఇటుకలు మూడు వరుసలు పేర్చి లేదా చెక్క ముక్కలు చుట్టూ కట్టి మధ్యలో మట్టి మిశ్రమం పోసి ప్రత్యేక మడిని సిద్ధం చేయొచ్చు. అడుగున ఇటుకలు పరిచి.. దాని పైన కొంచెం మట్టి పోసి.. అక్కడక్కడా బెజ్జాలు(ఎక్కువైన నీరు కిందికి పోవడానికి) పెట్టిన పాలిథిన్ షీట్ పరిచి.. ఆపైన ఇటుకలు మూడు వరుసలు పేర్చి మట్టి మిశ్రమం పోస్తే.. పెరటి స్థలంలో ప్రత్యేక మడి సిద్ధమైనట్టే. వర్షం పడినా మడి కింద నేల చెదిరిపోకుండా ఉండడానికి, కలుపు పెద్దగా రాకుండా ఉండడానికి ఇలా చేస్తున్నారు.

ఆకుల రసాలు, కషాయాలతో చీడపీడలకు చెక్
కూరగాయ మొక్కలు, ఆకుకూరలకు చీడపీడలు రాకుండా, ఏవైనా పురుగు సోకినా.. ఆకుల రసాలనో, కషాయాలనో వాడొచ్చు. వేప నూనెను సైతం వాడొచ్చనిహైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అగ్రికల్చర్, హార్టికల్చరల్ సొసైటీ అధ్యక్షుడు, ఉద్యాన శాఖలో అదనపు సంచాలకునిగా రిటైరైన మిద్దెల అనంతరెడ్డి ‘ఇంటి పంట’తో చెప్పారు. ఈ కషాయాలను ఎవరికి వారు ఇంటి దగ్గరే తయారుచేసుకోవచ్చని తెలిపారు. వేప ఆకులు, శీతాఫల ఆకులు, వావిలి ఆకులను మెత్తగా నూరి, రసం తీసి, వడపోసిన తర్వాత.. అంతకు 20 రెట్లు నీటిలో కలిపి పెరటి మొక్కలపై చల్లుకోవచ్చన్నారు. ఈ ఆకులను ఉడకబెట్టి కషాయాన్నయినా చల్లవచ్చన్నారు. ఈ ఆకుల వాసన ఘాటుగా ఉంటుంది. రసం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడితే చాలు. వేపకాయల రసం కూడా వాడొచ్చన్నారు. పచ్చిమిరప కాయలను గాని లేదా వెల్లుల్లిని గాని దంచి... కిరోసిన్‌లో ఒక రాత్రి నానబెట్టి తర్వాత నీటిలో కలిపి మొక్కలపై చల్లవచ్చన్నారు. చీడపీడలు ఆశించక ముందే 15 రోజులకోసారి వీటిని చల్లవచ్చని అంటూ.. పురుగుల గుడ్లు ఉన్నా నశిస్తాయన్నారు. ఈ రసాల వాసనకు చీడపీడలు పెరటి తోటల దరిదాపులకు కూడా రావన్నారు.

సంప్రదించవచ్చు..
ఉద్యాన శాఖలో అదనపు సంచాలకునిగా రిటైరైన మిద్దెల అనంతరెడ్డికి పెరటి తోటలు, పండ్ల తోటల సాగులో మంచి అనుభవం ఉంది. 57 ఏళ్లుగా ఉచిత సేవలందిస్తున్న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని ‘అగ్రికల్చర్, హార్టికల్చరల్ సొసైటీ’తో ఆయనకు ముప్పయ్యేళ్లుగా అనుబంధం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉద్యాన మిషన్‌కు అనుబంధంగా ఉన్న సాంకేతిక సలహా బృందం(టీఎస్‌జీ)లో ఆయన సభ్యులు. పట్నమైనా పల్లెలైనా ఇంటి పట్టున కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వారు సందేహాలేమైనా ఉంటే 92461 08262 నంబరులో ఆయనను సంప్రదించవచ్చు.

1 comment:

Unknown said...

గొప్ప సమాచారం... ధన్యవాదాలు

Gouthamaraju as WUA