పాడి పంటలు

Showing posts with label irrigation. Show all posts
Showing posts with label irrigation. Show all posts

Tuesday, March 27, 2012

సేద్యం ఇక సాధ్యమా?

భారతదేశం మళ్ళీ డెబ్భై, ఎనభై దశకాల్లోకి వెళ్లి పోతోందా? ప్రత్యక్ష పన్నులపై ఆధారపడే ప్రగతిశీల పన్ను విధానం నుంచి, ప్రజలందరికీ భారమయ్యే పరోక్ష పన్నుల విధానం వైపు మళ్ళుతోందా? గతంలో సంక్షేమ పథకాల మాటున గారడీ చేసిన యూపీఏ ప్రభుత్వం హఠాత్తుగా ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించేసింది. ప్రణబ్ కొత్త బడ్జెట్టు, రైతుల సాగు ఖర్చును విపరీతంగా పెంచే ఎరువులు మరింత కరువయ్యేలా, బరువయ్యేలా, సబ్సిడీల తగ్గింపును చేపట్టింది. పన్నులు విపరీతంగా బాదేసింది. http://harddrink.files.wordpress.com/2011/07/indian-farmer-ploughing.jpg
వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడి, సరఫరా గొలుసులోని సమస్యలను సరిదిద్దడం, రహదారుల అభివృద్ధి, విమానయానం లాంటి పదాలు వున్నా, సమ్మిళిత అభివృద్ధి లాంటి పదాలు బడ్జెట్టులో మాయం చేసింది. ఆమ్ ఆద్మీ ఊసే లేదు. వృద్ధి ఇంకా కావాలి అని కాకుండా ఉన్న వృద్ధిని కాపాడుకొందాము అని, పైగా దానికి దేశీయ డిమాండు రికవరీ కావాలని సెలవిచ్చారు ఆర్థిక మంత్రి. వృద్ధి ద్వారా సంపద సృష్టి అనే 21వ శతాబ్ద సిద్ధాంతం మానేసి ఎనభైలలోని దేశీయ డిమాండు పెంపొందించటం అనే దృష్టి మళ్ళీ వచ్చేసిందేమో తేలీదు కానీ పన్నులని ఎడా పెడా పెంచేశారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మీద పెను ప్రభావం చూపించే సర్వీస్ పన్నులు పెంచారు. సబ్సిడీ తగ్గిస్తాము అంటూ, ఎరువుల ధరలు పెంచుతామని అన్యాపదేశంగానే చెప్పారు.

ప్రణబ్ బడ్జెట్టులోని లెక్కలు సరికావాలంటే పన్నేతర ఆదాయం 31.96 శాతం పెరగాలి. అంటే మళ్ళీ వేలం పాట (లేక 3 జి, 4 జి) పెట్టుబడుల ఉపసంహరణ లాంటి వాటి మీద ఆధారపడాలి. సబ్సిడీ బిల్లు కనీసం 12 శాతం తగ్గాలి. కానీ ఆహార సబ్సిడీ బిల్లే 30 వేల కోట్లు తినేస్తుంది. ద్రవ్యలోటుని 5.1 శాతానికి తెస్తామని చెప్పారు గానీ అది వీలుకాదని తెలుస్తూనే వుంది. కేల్కర్ కమిటీ ప్రకారం మార్కెట్టు నుంచి అప్పు చేయాలి. ఈ నేపథ్యంలో జీతాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు లాంటి వాటికి కూడా ప్రభుత్వం అప్పు చెయ్యబోతోంది. ఇంత అప్పు, ఇన్ని పన్ను లు ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుందో ప్రణబ్ మహాశయుడే చెప్పాలి.

ఎక్సైజ్ పన్ను రాబడి పెరిగింది; సర్వీస్ పన్నులని విపరీతంగా పెంచారు; కానీ ఇంకా మన స్థూల ఆర్థిక వనరులు అస్తవ్యస్తంగానే వున్నాయి. 2011 సంవత్సరం బడ్జెట్ సమయంలో గొప్పగా తన బడ్జెట్ ఆదాయానికి ఖర్చుకి తేడా -అంటే ద్రవ్యలోటు- కేవలం 4.6 శాతం మాత్రమే అని ప్రకటించారు ప్రణబ్. అందరూ ఆశ్చర్యపోయారు. చాలా మంది తప్పుబట్టారు. ఎందుకంటే ఆహారం, చమురు, ఎరువుల మీద ఖర్చు 2010 సంవత్సరంలోని లక్షా యాభైవేల కోట్ల కంటే తగ్గించి కేవలం లక్షా ముప్పైనాలుగు వేల కోట్లు మాత్రమే చూపించారు. చమురు, ఎరువులు, ఆహార ఖర్చు పెరుగుతాయే కానీ ఎలా తగ్గుతాయో ప్రజలెవ్వరికీ అర్థం కాలేదు. ప్రస్తుతానికి వస్తే బడ్జెట్‌లో ప్రణబ్ అసలు నిజాన్ని ప్రకటించారు.

పై మూడు పద్దుల కింద అయిన ఖర్చు 2,16,297 కోట్లు. దాదాపు 80 వేల కోట్లు క్రితం సారి తగ్గించి చూపించి అసలు ద్రవ్యలోటు అదుపు లోనే వుందన్నట్టు చూపించారు. క్రితంసారి 5.9 శాతం ఉన్న ద్రవ్యలోటుని ఈ సారి 5.1 శాతానికి తగ్గిస్తానని ప్రణబ్ చెప్పారు. కానీ ఇదెంత అసంబద్ధమంటే పన్నులన్నీ సరిగ్గా వసూలై, సబ్సిడీలు 26 వేల కోట్లు తగ్గిస్తే, ఆహార బిల్లు అమల్లోకి రాకపోతే కూడా కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే సాధ్యమవుతుంది.

ఈసారి పన్నుల రూపంలో దాదాపు 44 వేల కోట్లు అదనంగా వడ్డించారని బాధపడుతున్న ప్రజలకి రాబోయే నెలల్లో ఆహారం, ఎరువులు, చమురు మీద పడబోయే అదనపు భారం వివరాలు తలచుకుంటే చెమటలు పట్టక మానవు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆహార, చమురు, ఎరువుల సబ్సిడీ మీద ప్రభుత్వ ఖర్చు లక్షా తొంభై వేల కోట్లకు పడిపోతుందట! అంటే వాటి ధరలు తగ్గు తాయని కాదు.

ప్రభుత్వ సబ్సిడీని దశల వారీగా తగ్గిస్తూ రెండు శాతానికి పరిమితం చేస్తారని ! పెట్రోలు ఉత్పత్తుల మీద ఈ సంవత్సరం 68, 481 కోట్లు ఖర్చు పెడితే, రాబోయే సంవత్సరంలో దీన్ని 43, 580 కోట్లకి పరిమితం చేశారు. పెట్రో ఉత్పత్తుల డీ రెగ్యులేషన్ పేరుతో వాటి మీద దాదాపు యాభై శాతానికి పైగా పన్నును విధిస్తూనే, పెరిగే ధరలతో తనకు సంబంధం లేదని చెప్తోంది యూపీయే ప్రభుత్వం. అంటే ఆయిల్ కంపెనీలకు నష్టాలు అనే సాకుతో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచటం తథ్యం. డీజిల్ ధరలు పెరిగితే సామాన్యులు బస్సు చార్జీలనించి రైతుల సాగు ధరల వరకు అన్నీ పెరగడం అనివార్యం.
http://im.rediff.com/money/2011/feb/02agri1.jpg
వ్యవసాయానికి క్రితం సంవత్సరాని కంటే మూడు వేల కోట్లు ఎక్కువిచ్చామని ప్రణబ్ గొప్పగా చెప్పారు. కానీ ఎరువుల మీద క్రితం సంవత్సరం ఇచ్చిన 67, 198 కోట్ల కంటే ఈసారి పదిశాతానికి పైగా తక్కువ ఖర్చు పెడతామని చెప్పారు. మొన్న ఫిబ్రవరిలో నిర్ధారించిన ఎరువుల సబ్సిడీని పరిగణనలోకి తీసుకొంటే డీఏపీ, యూరియా, ఎంబిసీ మొదలగు వాటిపై 60, 974 కోట్లు మాత్రమే వస్తుంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వ సబ్సిడీ బకాయిలతో కలిపి దాదాపు 93,000 కోట్లకు చేరింది. దాన్ని ఇప్పుడు అరవైవేల కోట్లకు పరిమితం చేయడమంటే అంతర్జాతీయ ధరల పెరుగుదలను రైతుకు బదిలీ చెయ్యబోతున్నారన్న మాట. రైతులకి ఎరువుల ధరలు చుక్కలు చూపించబోతున్నాయి.

చమురు రేట్లు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతి చేసుకొనే ఎరువుల రేట్లు సహజంగానే పెరిగే అవకాశం ఉంది. యూరియా మూడవ వంతు, మిగతా ఎరువులను భారత్ సింహ భాగం దిగుమతి చేసుకొంటున్న నేపథ్యంలో, ఎరువులు మీద సబ్సిడీలను దశల వారీగా తగ్గిస్తామని చెప్పడం రైతుకు ఆశనిపాతమే. రైతుకి ఎరువుల ధరలు ఇంకా పెరిగితే సాగు ధర ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే సాగుధరకి, మద్దతు ధరకి ఎక్కడా సాపత్యం కుదరక తల్లడిల్లుతున్న రైతుకి ఎరువుల ధరలు ఇంకా పెరగడం రైతుకే కాదు, వినియోగదారులకీ నష్టమే.
http://www.microdinero.com/files/noticias/2298_2170_rural.jpg
ఇక రైతుని దొంగ దెబ్బ తీయబోయే అతి తీవ్రమైన సమస్య ఆహార సబ్సిడీ పథకం. 2012 కి ఆహార సబ్సిడీ కోసం 75 వేల కోట్లు చూపించారు. ఈ సారి ఆహార సబ్సిడీ పథకం అమలుచేస్తే కావాల్సింది సంవత్సరానికి 1, 02,000 కోట్లు. ఇప్పుడిచ్చినది కాకుండా మిగిలినది ఎలా ఇస్తారో ప్రభుత్వం చెప్పలేదు. ఈ ప్రభుత్వమే గొప్పగా నియమించిన స్వామినాథన్ కమిటీ అమలు గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. బహుశా ఆ సిఫార్సులు అమలు చెయ్యలేమని చెప్పిన శరద్ పవార్ స్ఫూర్తి గాబోలు. రైతులకి రుణాలు అయిదు లక్షల పాతిక వేల కోట్లకు పెంచామని అన్నారు. http://www.instablogsimages.com/images/2007/05/29/agriculture-scheme-pm_26.jpg
కానీ రైతులందరినీ సంస్థాగత రుణాల పరిధిలోకి తేవాలంటే కనీసం పది లక్షల కోట్ల రుణాలు పంపిణీ కావాలి. పైపెచ్చు ఇప్పుడు ప్రకటించిన రుణాలు ఇచ్చేది ప్రభుత్వం కాదు, బ్యాంకులు. వాటి మీద అదుపు లేనప్పుడు ఎన్ని కోట్లు ప్రకటించినా ప్రస్తుతం వున్న 30 శాతం లబ్ధిదారుల కంటే పెరిగే అవకాశమే లేదు. వ్యవసాయ ఉత్పత్తి రేటు 2.5 శాతానికి పడిపోయిన ఈ సమయంలో రైతులు ఆర్థిక మంత్రి వైపు ఆశగా చూసారు. కొన్ని వ్యవసాయ మిషన్లు ఏర్పాటుచేయడం తప్పిస్తే, పంట దిగుబడి పెంచే చర్యలు పెద్దగా కనబడవు.

స్థూలంగా వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడానికి కావాల్సిన ఫ్రేం వర్కు బడ్జెట్టులో లేదు. పైపెచ్చు రైతు నడ్డి విరిచే సబ్సిడీల తగ్గింపు వంటి చర్యలు వున్నాయి. ఈసారి ప్రణబ్, మన్మోహన్ ఇద్దరూ భారత ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పనిసరి అని చెప్తూ వచ్చారు. మన్మోహన్ అయితే మరో అడుగు ముందుకు వేసి సబ్సిడీ బుల్లెట్లు కొరకాల్సిందే అని పోకిరీ టైపులో సెలవిచ్చారు. కానీ ఆయన ఆర్థిక వేత్తగా మరిచిపోయిన దేమిటంటే, తమ ప్రభుత్వం ఆహార సబ్సిడీ అనే ఫక్తు వోటుబ్యాంకు పథకానికి ముప్పై వేల కోట్లకు పైగా సబ్సిడీ ఇవ్వబోతోందని. దానికి లేని ఇబ్బంది రైతులకి ఎరువుల సబ్సిడీ ఇవ్వడంలో ఎందుకు?
http://india.targetgenx.com/files/2008/04/farmer1.jpg
ఈ రైతు వ్యతిరేక చర్యలన్నీ ఒకే ప్రశ్న వేస్తాయి. దేశంలోని 60 శాతం పైగా ఉన్న రైతులకు ఉపయోగపడని డబ్బు, వృద్ధి ఎవరి కోసం? ప్రభుత్వం తన దగ్గర ఉన్న సంపదని నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి చేర్చకుండా, ఉన్న కాస్త సబ్సిడీలను తీసేస్తూ వాళ్ళ మీద ఇంకా పన్నులేస్తూ ఎవరి కోసం పని చేస్తున్నట్టు? http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-02.jpg
ఇంతటి హ్రస్వ దృష్టినీ, చిత్తశుద్ధి లేమినీ, విధాన రాహిత్యాన్నీ నిలదీయాల్సిన పని, పోరాటం చేయాల్సిన పనీ రాజకీయ పార్టీలది. సాగు ఖర్చులు మూడొందల శాతం పైగా పెరిగి రైతు చితికి పోతూ ఉంటే ప్రతి పక్షంలోని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు పాలక పక్షాలపై ముప్పేట దాడిచేసి రైతుకు ఏదో మేరకు సాంత్వన చేకూర్చాలి. మేధావులెందరో అంటున్నారు గానీ, నిజానికి వ్యవసాయం సంక్షోభంలో లేదు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కంపెనీలు ఎవరూ సంక్షోభంలో లేరు.

మిల్లర్లు, దళారులూ కూడా సంక్షోభంలో లేరు. ప్రభుత్వ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని మరీ ఇబ్బడి ముబ్బడిగా పండిస్తున్నారు మన రైతన్నలు. ఈ రకంగా ఆహార సంక్షోభమూ లేదు. సంక్షోభంలో ఉన్నది రైతులు. రైతు కూలీలు, కౌలు రైతులు. వీరిని గట్టెక్కించే దీర్ఘకాలిక విధానాల రూపకల్పనలోనూ దీర్ఘకాలిక పోరాటాలలోనూ కలిసికట్టుగా పనిచేయడం రాజకీయ పక్షాల బాధ్యత.
http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-15.jpg
చిత్రంగా మన రాష్ట్రంలో మాత్రం, రైతు మిత్రులమని చెప్పుకునే చిట్టి పొట్టి పార్టీలు తమ పోరాటం ప్రధాన ప్రతిపక్షం పైన మళ్లిస్తూ ప్రజాగ్రహాన్ని పలుచన చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను చీలుస్తూ తాము (పైపైకి మాత్రమే అయినా సరే) వ్యతిరేకించే ప్రజా వ్యతిరేకులకే మేలు చేస్తూ వస్తున్నారు. పైపై మెరుగుల సింబాలిక్ ఉద్యమాలూ, స్వంత డబ్బాలూ కొంత మానుకుని రైతన్న ఏం ఆశిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం ఇకనైనా మొదలుపెట్టాలి.

- శ్రీశైల్ రెడ్డి పంజుగుల
తెలుగుదేశం వ్యవసాయ అధ్యయన కమిటీ సభ్యులు
- నీలయపాలెం విజయకుమార్
రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు

Monday, December 5, 2011

గ్రీన్ వండర్ రెడ్డి

 





















ఎడారిని తలపించే ఇసుక దిబ్బల్లో 76 ఏళ్ల వరదారెడ్డి తీర్చిదిద్దిన పచ్చని అద్భుతాన్ని మీకు చూపించా  లంటే  కెమెరాలు పనికిరావు. గూగుల్ ఎర్త్‌లోనే చూడాలి. నెల్లూరు జిల్లాలో బకింగ్‌హామ్ కాలువకీ సముద్రానికీ మధ్యలో ఉండే సిద్ధవరం కుగ్రామంలో 1934లో పుట్టిన దువ్వూరి వరదారెడ్డి ఒక వనసృష్టికర్త. ఐదు కిలోమీటర్ల దారి పొడవునా పరచుకున్నఆ గ్రీన్‌హెవెన్‌కు ఇప్పుడు కోస్టర్ కారిడార్ సెజ్ సునామీ పొంచి ఉంది.

వరదారెడ్డి పుట్టిన సిద్ధవరం గ్రామమంతా ఇసుక తిన్నెలమయం. మహా అంటే మూడొందల గడపలుంటాయి ఆ ఊళ్లో. ఊరికి మూడు పక్కలా 15 కిలోమీటర్ల వరకు ఇసుక మేటలుండి ఎడారిలా కనిపిస్తుంది. పదకొండోతరగతి వరకూ చదివిన వరదారెడ్డి నలభయ్యో యేట తన తల్లికి జబ్బు చేసినపుడు మద్రాస్‌లోని రాయపేట ఆస్పత్రిలో ఆమెను చేర్పించాడు.ఆ సమయంలో రోజూ సమీపంలోని ఎగ్మూర్ లైబ్రరీకి వెళుతూ యాదృచ్ఛికంగా వృక్షశాస్త్ర పుస్తకాలు చదివాడు.

వాటిని చదువుతున్నంత సేపూ తన ఊరే వరదారెడ్డి కళ్లలో మెదిలేది. మద్రాసు నుంచి ఊరికి తిరిగొచ్చిన తర్వాత చుట్ట పక్కల ఊళ్లలో తెలిసిన వాళ్లను అడిగి జీడిమామిడి, వేప, కానుగ, సుబాబుల్, మర్రి వంటి మొక్కల్ని తెప్పించి వర్షాకాలం మొదలయ్యే ముందు ఇసుక నేలలో గుంటలు తవ్వి ప్రత్యేకంగా తాను తయారు చేసిన పేడ ఎరువుపోసి వాటిని నాటేవాడు. అలా నిర్విరామంగా వేలాది మొక్కలు నాటాడు. ఇప్పటికీ నాటుతూనే ఉంటాడు. మరణించే దాకా నాటుతూనే ఉంటానంటాడు. ప్రతీదాన్ని లెక్కించి చేసే వలసవాద బుర్రతో ఇప్పటిదాకా ఎన్ని మొక్కలు నాటి ఉంటారనే ప్రశ్న వేస్తే నవ్వి ఊరుకుంటాడు.

****

అలా... బ్రహ్మజెముళ్ల ఎడారిని పచ్చని చెట్ల బృందావనంలా మార్చిన 76 ఏళ్ల వరదారెడ్డిని కదిలిస్తే చిన్నపిల్లాడిలా చెట్ల గురించి కథలు కథలుగా చెబుతాడు. ఇసుక నేలల్లో తక్కువ నీటితో అతి తక్కువ ఎరువుతో చెట్లనెలా సాకాలో విపులంగా చెబుతాడు. ఏ రకం మొక్క పక్కన ఏ రకం మొక్కనాటాలో, నారు పోయడమెలానో రకరకాల మెలకువల్ని నిర్విరామంగా చెబుతూ 'చెట్టూ పసిబిడ్డా వొకటే గదబ్బయ్యా!!' అంటూ వున్నట్టుండి మౌనం వహిస్తాడు.

****

సిద్ధవరం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో 'కనుపూరు' అనే ఊరుంది. ఇసుక దిబ్బల మధ్య ఈ రెండు ఊర్లకు దారి ఉంది. యానాదులు, రైతులు, అందరూ ఈ దారిలో రోజూ నడుస్తుంటారు. ఎండాకాలం అయితే కాళ్లు బొబ్బలెక్కాల్సిందే. ఏటా జరిగే కనుపూరు ముత్యాలమ్మ జాతరకు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలమంది వస్తారు. నాలుగు కిలోమీటర్లకు పైగా ఉండే ఈ దారికి రెండు వైపులా చెట్లు నాటాడు వరదారెడ్డి.

ఆరేళ్ల క్రితం వేకువజామున మూడు గంటలకే నిద్రలేచి ఎనిమిది గంటల వరకూ గుంటలు తవ్వి ఎరువుపోసి రెండు సంవత్సరాల పాటు రెక్కల కష్టం చేసి ఇసుక పర్రల్లో ఆకుపచ్చని వనాన్ని సాధ్యం చేసి చూపాడు. మొదట్లో వరదారెడ్డి చేసే ఈ పని చూసి కొందరు 'రెడ్డి భూమంతా ఆక్రమించేదానికి ప్లానేశాడ్రా' అని ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్లు మిగతా వాళ్లు కూడా ఆ చెట్ల చల్లటి నీడ అంచున అలవోగ్గా నాలుగు కిలో మీటర్లు నడిచివెళ్తున్నారు. వరదారెడ్డి బహు పుణ్యాత్ముడయ్యా అని మెచ్చుకుంటూ...

****

సిద్ధవరం సమీపంలో ఏడువందల నేరేడు చెట్లను కూడా వరదారెడ్డి కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడు. ఈ నేరేడు వనంపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. ఒక దశలో అంతరించిపోతున్నందుకు ఈ పురాతన పూర్వకాల వనాన్ని తన శ్రమతో ఇప్పటికీ అస్తిత్వంలో ఉంచాడు వరదారెడ్డి.

****

వరదారెడ్డిని చూసి జనాలు కూడా చెట్లు నాటడం ప్రారంభించారు. వీరి కోసం జీడిమామిడి, నేరేడు, వేప మొక్కలను నారుపోసి ఆ మొక్కల్ని ఉచితంగా పంచుతున్నాడు. ఇంకా చుట్టుపక్కల నర్సరీల నుంచి మొక్కలు తెప్పించి తను నాటడమే కాకుండా, అడిగిన వారికీ, అడగని వారికీ, ఇంటింటికీ ఉచితంగా పంచుతాడు. తను నాటిన చెట్లను ఎవరైనా పేదలు వంట చెరకు కోసం నరికినా నొచ్చుకోకుండా అక్కడ మరో చెట్టును నాటుతాడు. వ్యక్తి శ్రమ సమిష్టి శ్రమగా సందపదగా మార్చడమెలాగో వరదారెడ్డి చేసి చూపించాడు . గత 36 సంవత్సరాలుగా ఇసుకలో నాటిన చెట్లను సరంక్షించడానికి వరదారెడ్డి కనీసం 70 టన్నుల పేడను వినియోగించి ఉంటాడు. ఎడారిలాలాంటి ఇసుక తిన్నెల మధ్య సహజంగా పెరిగే బ్రహ్మజెముడు, బొలిజ, తంగేడు వంటి చెట్లకు ఇబ్బంది లేకుండా ఈ మొక్కలు నాటుతాడు.

****

ఇప్పటివరకు ఇంగ్లీషు మందులు వాడలేదనే వరదారెడ్డి తన చిన్న ఫిలిప్స్ రేడియో ద్వారా బయటి ప్రపంచ విశేషాలు తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు పిల్లనగ్రోవి ఊదుతాడు. అది తనకెంతో తృప్తినిస్తుందంటాడు. మొలకో తువ్వాలు చుట్టుకొని ఆరుబయట నిలబడితే వొంటికి తగిలే దక్షిణపు గాలి మార్మిక స్పర్శే తన జీవన చోదక శక్తి అంటాడు.


****

గ్రామదేవత అంకమ్మతల్లి వీరభక్తుడైన ఇంతటి నిర్భయుడు కూడా ఈ మధ్య కొంచెం జంకాడు -తను నాలుగు కిలోమీటర్ల మేర నాటిన చెట్లబాటను కోస్టల్ కారిడార్‌లో భాగంగా ప్రభుత్వం సెజ్‌లకిచ్చేస్తుందని తెలిసి. దాన్ని సెజ్ నుంచి మినహాయించమని జిల్లాకలెక్టర్‌కు ఒక అర్జీకూడా రాశాడు.


****

యింత పని నేనొక్కడినే ఎలా చేస్తాను? ఇదంతా నా భార్య అనసూయమ్మ,అన్నదమ్ముల బిడ్డలూ, రైతులూ, స్నేహితులూ, సేవాజనులు అందరి ద్వారా ఆ సర్వేశ్వరుడే జరిపిస్తున్నాడని సర్వకర్మలనూ ఆయనకర్పిస్తాడు వరదారెడ్డి.


*****

తన యవ్వన ప్రాయంలో అందరిలాగే వరదారెడ్డి కూడా ఉద్యోగానికో, వ్యాపారానికో, విదేశాలకో వెళ్లిపోయి ఉంటే సిద్ధవరం గతి ఏమయ్యి ఉండేదో


* శ్రమయేవ జయతే


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరు వారి దివ్యసముఖమునకు,
అయ్యా! 
మాగ్రామ నడిబొడ్డున వెలసియున్న దివ్యమంగళమూర్తిగా ప్రసిద్ధిగొన్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయము నుంచి కళల కల్పవల్లి అంకాళమ్మ దేవాలయము మీదుగా జనజాగరణ తల్లి చిల్లకూరు మండలం, తూర్పు కనుపూరు గ్రామము నందు వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ దేవాలయము వరకు ఉన్న బాటలకు ఇరువైపులా ఐదు కిలోమీటర్లు మా కుటుంబము చెట్లను పెంచినాము. కాగా ఇప్పుడు ప్రభుత్వం వారు సెజ్‌కు కేటాయించు క్రమంలో ఆ బాటను మినహాయించి సదరు గ్రామములకు సౌకర్యము గావించగలరని కోరుచున్నాము. గమనిక: ఈ మార్గము పర్యాటక, పరిక్రమ, పర్యావరణ వరముగా ప్రసిద్ధి పొంది ఉన్నది.
ఇట్లు,
దువ్వూరు వరదారెడ్డి.
సిద్ధవరం గ్రామం, 
కోటమండల,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

Gouthamaraju as WUA