పాడి పంటలు

Sunday, April 15, 2012

బిందుసేద్యంతో చెరకు సాగు


 
 
 
 
 
 
 
 
 
 
 
వేసవి ఉష్ణోగ్రతలు చెరకు పైరు ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతాయి. ఎందుకంటే అత్యధిక-అతి తక్కువ ఉష్ణోగ్రతల్ని, ఎండ తీవ్రతను, వడగాడ్పుల్ని చెరకు పైరు తట్టుకోలేదు. ముఖ్యంగా లేత తోటలు ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వేసిన చెరకు తోటలు ప్రస్తుతం పిలకలు తొడిగి, పెరిగే దశలో ఉన్నాయి. ఈ నెల నుంచి జూన్ వరకూ ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. గాలిలో తేమ బాగా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిందుసేద్య పద్ధతి ద్వారా భూమిలో తేమను కాపాడుకుంటూ, చెరకు పైరును రక్షించుకోవచ్చు.

ప్రయోజనాలెన్నో...

బిందుసేద్యం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మామూలు పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలోని చెరకు తోటకు అందించే నీటితో బిందుసేద్య పద్ధతిలో మూడు నాలుగు ఎకరాల్లో ఈ పైరును సాగు చేయొచ్చు. వేసవిలో రైతులు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న విష యం తెలిసిందే. రోజుకు ఆరేడు గంటలు మాత్ర మే కరెంట్ అందుబాటులో ఉంటోంది. అయితే బిందుసేద్య పద్ధతిని అనుసరించే రైతులు విద్యుత్ కోతల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఆ ఆరేడు గంటల సమయంలోనే కనీసం నాలుగైదు ఎకరాల తోటకు నీరు అందించవచ్చు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అన్న దిగులే అవసరం లేదు. ఎప్పుడు కరెంటు ఉంటే అప్పుడు ఆటోమేటిక్ పరికరం సాయంతో ఏ ఇబ్బందీ లేకుండా తోటకు నీరు అందించవచ్చు. పైగా నీరు పెట్టేందుకు ప్రత్యేకంగా మనిషి అవసరం ఉండదు. మామూలు పద్ధతిలో రాత్రి సమయంలో తోటకు నీరు పెట్టేటప్పుడు పాములు, ఇతర విష పురుగుల వల్ల ప్రాణహాని ఉంటుంది. బిందుసేద్య పద్ధతిలో అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు.


బిందుసేద్య పద్ధతి వల్ల ఒనగూడే మరో ప్రయోజనమేమంటే కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. సారవంతమైన మట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉండదు. తద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చు. భూమికి ఎక్కువ నీరు అందుతోందన్న ఆందోళన అవసరం లేదు. మొక్కలకు క్రమ పద్ధతిలో సరిపడినంత నీరు మాత్రమే అందుతుంది. పైగా తోట అంతటికీ సమానంగా అందుతుంది. భూమి చౌడు బార దు. ధాతు లోపాలు తలెత్తవు. మొక్కలు ఆరోగ్యవంతంగా, ఏపుగా, క్రమ పద్ధతిలో పెరుగుతాయి. చీడపీడల తాకిడి తగ్గుతుంది. దీనివల్ల నాణ్యమైన పంటను పొందవచ్చు. రస నాణ్యత కూడా బాగా ఉంటుంది. కూలీలు, సస్యరక్షణపై పెట్టే ఖర్చు కలిసొస్తుంది. దిగుబడి 40-50 శాతం పెరుగుతుంది. బిందుసేద్య పద్ధతిలో చెరకు తోటలో అంతర పంటలు కూడా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. బిందుసేద్య పద్ధతి ద్వారా ఎరువులు, సూక్ష్మ పోషకాల్ని మొక్కలకు సరైన మోతాదులో సమానంగా అందించవచ్చు. తద్వారా ఎరువులు, సూక్ష్మ పోషకాలపై పెట్టే అనవసరపు ఖర్చును నియంత్రించుకోవచ్చు. ఇసుక నేలలు, గుట్టలు... అంటే ఎగుడు దిగుడుగా ఉండే భూముల్ని చదును చేయాల్సిన అవసరం లేకుండానే తోట వేసుకోవచ్చు. చదును చేయడానికి వీలులేని భూముల్లో కూడా బిందుసేద్యం ద్వారా చెరకు సాగు చేయవచ్చు.


ప్రోత్సాహం-దిగుబడులు

చెరకు సాగులో బిందుసేద్యాన్ని ప్రోత్సహిం చేందుకు పలు చక్కెర కర్మాగారాలు రైతులకు సబ్సిడీలు అందజేస్తున్నాయి. దీనివల్ల బిందుసేద్యంపై చెరకు రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది రైతులు బిందుసేద్య పద్ధతిలో చెరకు సాగు చేసి మంచి ఫలితాలు పొందుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మం డలం పోతవరం గ్రామానికి చెందిన కాశీ విశ్వనాథం మొక్క తోటలో ఎకరానికి సగటున 70 టన్నులు, పిలక తోటలో 69.4 టన్నుల దిగుబడి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన దాసరి వెంకటాచలం ఎకరానికి సగటున 70 టన్నుల దిగుబడి పొందారు. వీరిద్దరూ ఇటీవలే ఉగాది పురస్కారాలు కూడా అందుకున్నారు.

బి.హనుమంతరెడ్డి, ఎమ్మెస్సీ అగ్రికల్చర్

అగ్రానమిస్ట్, రాజమండ్రి

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

జంట సాళ్ల పద్ధతిలో చెరకు ముచ్చెలు నాటినట్లయితే లేటరల్ పైపుల అవసరం తక్కువగా ఉంటుంది. దీనివల్ల డ్రిప్పులపై పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. సాళ్ల మధ్య నాలుగు లేదా ఐదు అడుగుల దూరాన్ని పాటించిన వారు లేదా సాధారణ పద్ధతిలో (సాళ్ల మధ్య మూడు అడుగుల దూరం) ముచ్చెలు నాటిన వారు కూడా బిందుసేద్య పద్ధతిని అనుసరించవచ్చు. బావులు, చెరువులు వంటి నీటి వనరుల ద్వారా చెరకు సాగు చేసే వారు ప్రతి 15 రోజులకు ఒకసారి సిస్టమ్ ఫిల్టర్లను శుభ్రపరచుకోవాలి. ఫర్టిగేషన్ (పైపుల ద్వారా పైరుకు ఎరువులు అందించడం) తర్వాత 10 నిమిషాల పాటు లేటరల్ పైపుల ద్వారా మంచినీటిని పారించాలి. పంటను కోసిన తర్వాత యాసిడ్ (33%) ట్రీట్‌మెంట్‌తో పైపుల్ని శుభ్రపరచాలి. మొక్కల దగ్గర పీడనాన్ని పరీక్షించాలి.

Monday, April 2, 2012

‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ * ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్


ప్రకృతి వ్యవసాయమే మిన్న
 

ప్రకృతి వ్యవసాయంలో కలుపు సమస్యే కాదని ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. రసాయనిక ఎరువులు, టన్నుల కొద్దీ వేస్తున్న పశువుల ఎరువులతోనే కలుపు రైతులకు తీవ్ర సమస్యగా మారుతోందని అన్నారు. ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే అంశంపై రెడ్‌హిల్స్‌లో సోమవారం రైతులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు. 

సక్రమంగా ఆచ్ఛాదన కల్పించి, జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయన్నారు. జీవనద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరమన్నారు. మెట్ట పొలాల్లో ఆచ్ఛాదనకు గడ్డి లేకపోతే.. భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో ఆచ్ఛాదన కల్పించవచ్చన్నారు. 

ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువూ వేయనక్కర లేదని, దేశీ లేదా నాటు ఆవు పేడ, మూత్రంతో తయారైన ‘జీవామృతం’లో కోటానుకోట్ల సూక్ష్మజీవు లుంటాయని పాలేకర్ వివరించారు.

శిబిరంలో వ్యవసాయ శాఖ కమిషనర్
వ్యవసాయ శాఖ కమిషనర్ ఉషారాణి పాలేకర్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. ఆ తర్వాత ఆయనతో చర్చించారు. కర్నాటక, కేరళ ప్రభుత్వాలు తన విధానాన్ని ఆమోదించి శిక్షణాశిబిరాలు నిర్వహిస్తున్నాయని, ఒక్కో రాష్ట్రంలో పది లక్షల మం ది ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారని పాలేకర్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.

మామిడి, సపోట పండిస్తున్నాను...
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ 150 ఎకరాల్లో మామిడి, సపోట వంటి అనేక పంట లు పండిస్తున్నాను. రెండేళ్లుగా మా పొలంలో పురుగుల మందు చల్లలేదు. ఎరువులు వేయలేదు. ‘జీవామృతం’ వాడుతున్నాను. రుచికరమైన దిగుబడి వస్తోంది. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. అంతరపంటల ద్వారా ఆదాయం వస్తోంది.
- తిప్పేస్వామి, రాయదుర్గం, అనంతపురం జిల్లా

ఇథియోపియాలోనూ....
ఏడేళ్ల క్రితం పాలేకర్ పుస్తకం చదివి ప్రకృతి వ్యవసాయం చేపట్టాను. అనేక అవార్డులు పొందాను. ఇథి యోపియా దేశానికి వెళ్లి గులాబీలు, కూరగాయలు, మొక్కజొన్న, చెరకు వంటి పంటలను పండిస్తున్నాను. కబేళాకు వెళుతున్న నాటు ఆవులను కొని సాగు ప్రారంభిం చాను. ఇథి యోపియాలో ‘బురానా’ జాతి ఆవు పేడ, మూత్రంతో కూడిన జీవామృతం అద్భుత ఫలితాలనిస్తోంది. ప్రభుత్వం సబ్సిడీలకు బదులు రైతుకో ఆవు ఇస్తే మేలు జరుగుతుంది.
- జీవీ రాజు, ఎస్‌ఆర్ కండ్రిక, వైఎస్సార్ జిల్లా




దేశవాళి ఆవులే మేలు


  దేశంలోని గోజాతిని దేశవాళి, విదేశీ, సంకర జాతులుగా విభజించవచ్చు. మిగిలిన రెండు జాతుల కంటే స్వదేశీ ఆవులు ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన అధిక ఉష్ణ పరిస్థితుల్లో కూడా పాల దిగుబడులలో తేడా లేకుండా ఉంటాయి. బాహ్య పరాన్న జీవులను తట్టుకోగలిగిన సామర్థ్యం ఎక్కువగా ఉండడం వలన వీటికి ఆరోగ్య సమస్యలు తక్కువ. ఈ లక్షణాలు సంకర, విదేశీ జాతి ఆవుల్లో దాదాపు కనిపించవంటున్నారు మండపేటలోని రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రానికి చెందిన ఏడీఏలు డాక్టర్ విజయకుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్‌బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఇది. ఇందులో స్వదీశీ జాతుల విశిష్టత, వివిధ రాష్ట్రాల్లో పేరొందిన జాతుల గురించి వివరిస్తున్నారు...


  దేశీయ ఆవులు స్థానికంగా లభించే తక్కువ పోషక విలువలు కలిగిన గడ్డిని సమర్థవంతంగా వినియోగించుకుని విదేశీ, సంకరజాతి ఆవులు అందించే వెన్న శాతం కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాయి (4-5 శాతం). దీనికి విరుద్ధంగా విదేశీ, సంకరజాతి ఆవులు ఎక్కువ దాణా, ఎక్కువ పోషకాలున్న గడ్డిని మేపినపుడు మాత్రమే ఎక్కువ పాల దిగుబడినిస్తాయి. అంతేకాక వీటి పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. 1995, 2007లలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో స్వదేశీ జాతుల్లో దూడల మరణాలు కేవలం ఐదు శాతం కాగా అదే విదేశీ హెచ్‌ఎఫ్ జాతి దూడల్లో 31 శాతం, జెర్సీ దూడల్లో 28.3 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడైంది.


  జాతీయ పశు జన్యు సంపద సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్) వారు ప్రకటించిన భారతీయ గోజాతుల సంఖ్య 30. ఇందులో కొన్ని పాల ఉత్పత్తికి, ఎక్కువ భాగం వ్యవసాయ, రవాణా పనులకు పేరొందాయి. మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరు, కర్నాటకలోని హాలీకార్, ఖిల్లారి, క్రిష్ణవేలీ, మల్నాడ్‌గిడ్డ, కేరళలోని వేచూర్, కాసరగడ్, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరీ, గుజరాత్‌లోని గిర్, రాజస్థాన్‌లోని రెడ్‌సింధీ, థార్‌పార్కర్, కాంక్రెజ్, రాథీ, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, పంజాబ్‌లోని సాహివాల్ జాతి ఆవులు, ఎద్దులు పాడికి, ఆయా పనులకు ప్రముఖంగా పేరొందాయి. వీటిలో ఇప్పటికే ఒంగోలు జాతి విశిష్టతను తెలుసుకున్నాం. మరికొన్ని జాతుల వివరాలు..

వేచూర్


కేరళ రాష్ట్రానికి చెందిన వేచూర్ జాతి ఆవులు, గిత్తలు పొట్టి జాతిగా పేరొందాయి. మన పుంగనూరు, కేరళ వేచూర్ జాతుల్లో ఏది ఎక్కువ పొట్టి అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. వేచూరి జాతి ఆవుల సగటు ఎత్తు 80-90 సెంటీమీటర్లు. గిత్తల ఎత్తు 85-95 సెంటీమీటర్లు కాగా పుంగనూరు జాతి పశువులు 60-100 సెంటీమీటర్ల ఎత్తుంటాయి. వేచూర్ జాతి పశువులు ఎక్కువగా లేత ఎరుపు లేదా నలుపు రంగులో ఉంటాయి.

శరీర నిర్మాణ పరంగా చిన్నవైనప్పటికీ వ్యవసాయ పనులకు ఈ గిత్తలు ప్రసిద్ధి. ఈ జాతి దూడలలో సహజ మరణాలు దాదాపు శూన్యం. ఆవులు శ్వాసకోశ, గాలికుంటు, పొదుగువాపు వ్యాధులను సమర్థవంతంగా తట్టుకోగలవు. రోజుకు సగటున 2.5 లీటర్ల నుంచి 3.5 లీటర్ల పాల దిగుబడినిస్తాయి. వేచూర్ జాతి ఆవు పాలను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు.


కాసరగడ్


కేరళకు చెందిన కాసరగడ్ జాతి పశువులు అధిక ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఇవి కూడా వేచూర్ జాతి మాదిరే పొట్టి రకం. వీటిలో ఆహారాన్ని వినియోగించుకునే సామర్థ్యం ఎక్కువ. కాసరగడ్ జాతి దూడలు సంవత్సరం వయసునాటికి అవి పుట్టిన నాటి బరువు కంటే 7-8 రెట్లు అధిక బరువు కలిగిఉంటాయి. వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఈ జాతి పశువులు పాల దిగుబడి కంటే వ్యవసాయ పనులకు బాగా పేరొందాయి.

మాల్వీ

http://www.krankykids.com/cows/daily_cow_images/M/malvi/malvi_1_web.jpg
మధ్యప్రదేశ్‌లోని మాల్వీ ప్రాంతంలో గుర్తించిన ఈ జాతికి ఆ ప్రాంతం పేరిట మాల్వీ అనే పేరు వచ్చింది. ఈ జాతి ఎద్దులు ప్రధానంగా బరువులు లాగే వ్యవసాయ పనులకు ప్రసిద్ధి. ఒండ్రు నేలలు, బంక మట్టి నేలల్లో పెద్ద పెద్ద నాగళ్లను లాగే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆవులు తక్కువ పాలదిగుబడినిస్తాయి.

పుంగనూరు ఆవులు

http://cdn1.wn.com/ph/img/a8/f1/004de760108ff11cc92e50004ca4-grande.jpg
మన రాష్ట్రానికి చెందిన పుంగనూరు జాతి ఆవు ప్రపంచ గోజాతుల్లో అతి చిన్నదిగా పేరొందింది. ఈ జాతి ఆవుల కన్నా మగ పశువులు మెతక స్వభావము కలిగి ఉంటాయి. చక్కని ముఖంతో, బూడిద రంగుతో బాగా వృద్ధి చెందిన మెడ, మూపురంతో ఉంటాయి. కురచకాళ్ళతో, గట్టి గిట్టలు కలిగి ఉంటాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన కొండలు, గుట్టలు, వాలు ప్రాంతాలను సులువుగా ఎక్కి దిగగలవు. ఈ జాతి పశువులు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటికి కరువు పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఉంది.

వీటి ఎత్తు 60 -100 సెంటీమీటర్లు, బరువు 130-200 కిలోలు. ఇవి కొత్త వారిని చూడగానే బెదురుతాయి. పుంగనూరు ఆవులు ఒక ఈతలో 1100 లీటర్ల వరకు (రోజుకు మూడు నుంచి మూడున్న లీటర్లు) పాలు ఇస్తాయి. చిన్నపాటి శరీరాకృతి కారణంగా వీటిని రైతులు వ్యవసాయ పనులకు తక్కువగా వినియోగిస్తున్నారు. అంతరించిపోతున్న ఈ జాతి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


 దేని ప్రత్యేకత దానిదే
గోజాతికి మన దేశం పెట్టింది పేరు. ఏ జాతి ప్రత్యేకత దానిదే. సామర్థ్యాన్ని బట్టి పాల ఉత్పత్తికి ఉపయోగపడేవి కొన్నయితే పాల ఉత్పత్తితో పాటు వ్యవసాయ పనులకు కూడా ఉపకరించేవి మరి కొన్ని.

కేవలం వ్యవసాయ పనులకు మాత్రమే ఉపయోగపడే జాతులు కూడా ఉన్నాయని చెబుతున్నారు తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని రాష్ట్ర పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఏడీఏలు డాక్టర్ విజయ కుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్ బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగుతున్న నేపథ్యంలో వారు అందిస్తున్న కథనాల్లో ఇది అయిదోది...


మన రాష్ట్రంలోని ఒంగోలు, పుంగనూరు, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, కేరళలోని వేచూర్, కాసరగడ్ జాతుల ఆవుల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ వారం కర్ణాటకలోని కృష్ణావ్యాలీ, మల్నాడుగిడ్డ, అమృతమహల్, హల్లికార్, ఖిలారీ, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరి జాతుల విశిష్టతల గురించి తెలుసుకుందాం.


పాల దిగుబడి స్థిరంగా ఉండదు

కృష్ణావ్యాలీ జాతిని ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఒండ్రు, నల్లరేగడి నేలల్లో వ్యవసాయాధారిత పనుల కోసం అభివృద్ధి చే శారు. గిర్, ఒంగోలు, కాంక్రెజ్, హల్లికార్ జాతుల్ని సంకరపరచి వీటిని అభివృద్ధి చేశారు. వీటి శరీరంపై బూడిద తెలుపు, తెలుపు, గోధుమ, నలుపు రంగులు కలగలసిన మచ్చలు ఉంటాయి. గిర్, ఒంగోలు జాతుల్ని సంకరపరచి అభివృద్ధి చేసిన కృష్ణావ్యాలీ ఆవు సగటున రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల పాల దిగుబడి ఇచ్చినప్పటికీ అది స్థిరంగా ఉండదు. గిట్టలు మెత్తగా ఉండడం వల్ల ఈ జాతి గిత్తలు, ఎడ్లు ఒండ్రు నేలలు, బంకమట్టి నేలలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో మంచి పనితనాన్ని ప్రదర్శిస్తాయి.

పనిలో దిట్ట
మల్నాడుగిడ్డ ఆవులు గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనులకు ప్రసిద్ధి చెందినవి. పొట్ట, డొక్కల వైశాల్యం తక్కువగా ఉండడం వల్ల తక్కువ మేత తింటాయి. అయితే పనిలో మాత్రం మంచి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. గాలికుంటు వ్యాధిని, వలసల కారణంగా సంక్రమించే వ్యాధుల్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. రోజుకు 1.5 లీటర్ల నుంచి నాలుగు లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి.

మైసూర్ రాజుల కాలం నుంచి...

మైసూర్ రాజుల కాలంలో అమృతమహల్ జాతి ఆవులు బాగా వృద్ధి చెందాయి. అప్పట్లో సైనిక వాహనాల్ని నడిపేందుకు వీటిని ఉపయోగించే వారు. ఆ తర్వాతి కాలంలో మైసూర్ సంస్థానాధీశుడు టిప్పుసుల్తాన్ ఈ జాతి ప్రత్యేకతను గుర్తించి మరింత అభివృద్ధి చేశాడు. వీటి విశిష్టతకు తగినట్లు అమృతమహల్...అంటే అమృత (పాలు) భాండమనే అర్థం వచ్చేలా పేరు పెట్టాడు. ఈ జాతి ఆవులు కొంత తెలుపు రంగులో ఉంటాయి. రోజుకు సగటున నాలుగు నుంచి ఆరు లీటర్ల పాలు ఇస్తాయి. ఇవి పాల దిగుబడికి, వ్యవసాయ పనులకు కూడా ఉపయోగపడతాయి.

దక్షిణాది ఆవులకు మాతృ జాతి

దక్షిణ భారతదేశంలోని పలు ప్రముఖ గోజాతులకు హల్లికార్‌ను మాతృ జాతిగా చెప్పవచ్చు. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల నిర్వహణలో దీనికి మంచి పేరు ఉంది. దీని శరీరం ప్రధానంగా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. తల పొడవుగా, మూతి భాగం మొనదేలినట్లు ఉంటుంది. నుదుటి నుంచి ముక్కు భాగం వరకూ కాలువ లాంటి గాడి కలిగి ఉంటుంది.

రవాణాకూ ఉపయోగపడతాయి

ఖిలారీ జాతి ఆవులు వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల్ని సమర్ధవంతంగా నిర్వర్తిస్తాయి. ఇవి గోధుమ, తెలుపు రంగులు కలగలిసిన రంగులో ఉంటాయి. తల సన్నగా ఉండి, పొడవైన కొమ్ముల మొదలు వద్ద ఇరు వైపులా ఉబ్బినట్లు ఉంటుంది. కొమ్ముల మొదలు నుంచి ముక్కు వరకూ గాడి ఉంటుంది. గిట్టలు దృఢంగా ఉండి వ్యవసాయ, రవాణా పనులకు బాగా ఉపయోగపడతాయి.

ప్రతికూల వాతావరణంలోనూ...

పొలం పనులకు, రవాణాకు కంగాయం జాతి పశువులు బాగా పేరు తెచ్చుకున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యం వీటికి ఉంది. మధ్యస్త పరిమాణంలో ఉండే ఈ పశువులు కేవలం పనికి మాత్రమే ఉపయోగపడతాయి. చురుకుగా, చలాకీగా ఉంటూ వేగంగా నడవడం వీటి సహజ స్వభావం. పనికి ఉపయోగపడే జాతిగా దక్షిణ భారతదేశంలో పేరు పొందాయి. శరీరం ముదురు బూడిద రంగులో ఉంటుంది. తల, మెడ, మూపురం, భుజాలు, మణుగుల వద్ద నల్లని మచ్చలు ఉంటాయి. ఈ జాతి ఆవులు ప్రతి 15 నెలలకు ఒకసారి ఈనతాయి. తేలికపాటి పొలాల్లో ఆవులతో సేద్యం చేస్తారు.

పాడికి పనికిరావు

తంజావూరుకు చెందిన స్థానిక గోజాతితో కంగాయం జాతిని సంకరపరచి ఉంబ్లాచెరి జాతిని అభివృద్ధి చేశారు. ఈ జాతి ఆవుల శరీర పరిమాణం మధ్యస్తంగా ఉంటుంది. పొట్ట చిన్నదిగా ఉంటుంది.

ఈ ఆవులు బూడిద రంగు, బూడిద నలుపు రంగుల్లో ఉంటాయి. ఇవి పాడికి పనికిరావు. ఎద్దులు చక్కగా పనికి ఉపయోగపడతాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత, రవాణా పనులకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
 

Tuesday, March 27, 2012

సేద్యం ఇక సాధ్యమా?

భారతదేశం మళ్ళీ డెబ్భై, ఎనభై దశకాల్లోకి వెళ్లి పోతోందా? ప్రత్యక్ష పన్నులపై ఆధారపడే ప్రగతిశీల పన్ను విధానం నుంచి, ప్రజలందరికీ భారమయ్యే పరోక్ష పన్నుల విధానం వైపు మళ్ళుతోందా? గతంలో సంక్షేమ పథకాల మాటున గారడీ చేసిన యూపీఏ ప్రభుత్వం హఠాత్తుగా ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించేసింది. ప్రణబ్ కొత్త బడ్జెట్టు, రైతుల సాగు ఖర్చును విపరీతంగా పెంచే ఎరువులు మరింత కరువయ్యేలా, బరువయ్యేలా, సబ్సిడీల తగ్గింపును చేపట్టింది. పన్నులు విపరీతంగా బాదేసింది. http://harddrink.files.wordpress.com/2011/07/indian-farmer-ploughing.jpg
వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడి, సరఫరా గొలుసులోని సమస్యలను సరిదిద్దడం, రహదారుల అభివృద్ధి, విమానయానం లాంటి పదాలు వున్నా, సమ్మిళిత అభివృద్ధి లాంటి పదాలు బడ్జెట్టులో మాయం చేసింది. ఆమ్ ఆద్మీ ఊసే లేదు. వృద్ధి ఇంకా కావాలి అని కాకుండా ఉన్న వృద్ధిని కాపాడుకొందాము అని, పైగా దానికి దేశీయ డిమాండు రికవరీ కావాలని సెలవిచ్చారు ఆర్థిక మంత్రి. వృద్ధి ద్వారా సంపద సృష్టి అనే 21వ శతాబ్ద సిద్ధాంతం మానేసి ఎనభైలలోని దేశీయ డిమాండు పెంపొందించటం అనే దృష్టి మళ్ళీ వచ్చేసిందేమో తేలీదు కానీ పన్నులని ఎడా పెడా పెంచేశారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మీద పెను ప్రభావం చూపించే సర్వీస్ పన్నులు పెంచారు. సబ్సిడీ తగ్గిస్తాము అంటూ, ఎరువుల ధరలు పెంచుతామని అన్యాపదేశంగానే చెప్పారు.

ప్రణబ్ బడ్జెట్టులోని లెక్కలు సరికావాలంటే పన్నేతర ఆదాయం 31.96 శాతం పెరగాలి. అంటే మళ్ళీ వేలం పాట (లేక 3 జి, 4 జి) పెట్టుబడుల ఉపసంహరణ లాంటి వాటి మీద ఆధారపడాలి. సబ్సిడీ బిల్లు కనీసం 12 శాతం తగ్గాలి. కానీ ఆహార సబ్సిడీ బిల్లే 30 వేల కోట్లు తినేస్తుంది. ద్రవ్యలోటుని 5.1 శాతానికి తెస్తామని చెప్పారు గానీ అది వీలుకాదని తెలుస్తూనే వుంది. కేల్కర్ కమిటీ ప్రకారం మార్కెట్టు నుంచి అప్పు చేయాలి. ఈ నేపథ్యంలో జీతాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు లాంటి వాటికి కూడా ప్రభుత్వం అప్పు చెయ్యబోతోంది. ఇంత అప్పు, ఇన్ని పన్ను లు ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుందో ప్రణబ్ మహాశయుడే చెప్పాలి.

ఎక్సైజ్ పన్ను రాబడి పెరిగింది; సర్వీస్ పన్నులని విపరీతంగా పెంచారు; కానీ ఇంకా మన స్థూల ఆర్థిక వనరులు అస్తవ్యస్తంగానే వున్నాయి. 2011 సంవత్సరం బడ్జెట్ సమయంలో గొప్పగా తన బడ్జెట్ ఆదాయానికి ఖర్చుకి తేడా -అంటే ద్రవ్యలోటు- కేవలం 4.6 శాతం మాత్రమే అని ప్రకటించారు ప్రణబ్. అందరూ ఆశ్చర్యపోయారు. చాలా మంది తప్పుబట్టారు. ఎందుకంటే ఆహారం, చమురు, ఎరువుల మీద ఖర్చు 2010 సంవత్సరంలోని లక్షా యాభైవేల కోట్ల కంటే తగ్గించి కేవలం లక్షా ముప్పైనాలుగు వేల కోట్లు మాత్రమే చూపించారు. చమురు, ఎరువులు, ఆహార ఖర్చు పెరుగుతాయే కానీ ఎలా తగ్గుతాయో ప్రజలెవ్వరికీ అర్థం కాలేదు. ప్రస్తుతానికి వస్తే బడ్జెట్‌లో ప్రణబ్ అసలు నిజాన్ని ప్రకటించారు.

పై మూడు పద్దుల కింద అయిన ఖర్చు 2,16,297 కోట్లు. దాదాపు 80 వేల కోట్లు క్రితం సారి తగ్గించి చూపించి అసలు ద్రవ్యలోటు అదుపు లోనే వుందన్నట్టు చూపించారు. క్రితంసారి 5.9 శాతం ఉన్న ద్రవ్యలోటుని ఈ సారి 5.1 శాతానికి తగ్గిస్తానని ప్రణబ్ చెప్పారు. కానీ ఇదెంత అసంబద్ధమంటే పన్నులన్నీ సరిగ్గా వసూలై, సబ్సిడీలు 26 వేల కోట్లు తగ్గిస్తే, ఆహార బిల్లు అమల్లోకి రాకపోతే కూడా కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే సాధ్యమవుతుంది.

ఈసారి పన్నుల రూపంలో దాదాపు 44 వేల కోట్లు అదనంగా వడ్డించారని బాధపడుతున్న ప్రజలకి రాబోయే నెలల్లో ఆహారం, ఎరువులు, చమురు మీద పడబోయే అదనపు భారం వివరాలు తలచుకుంటే చెమటలు పట్టక మానవు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆహార, చమురు, ఎరువుల సబ్సిడీ మీద ప్రభుత్వ ఖర్చు లక్షా తొంభై వేల కోట్లకు పడిపోతుందట! అంటే వాటి ధరలు తగ్గు తాయని కాదు.

ప్రభుత్వ సబ్సిడీని దశల వారీగా తగ్గిస్తూ రెండు శాతానికి పరిమితం చేస్తారని ! పెట్రోలు ఉత్పత్తుల మీద ఈ సంవత్సరం 68, 481 కోట్లు ఖర్చు పెడితే, రాబోయే సంవత్సరంలో దీన్ని 43, 580 కోట్లకి పరిమితం చేశారు. పెట్రో ఉత్పత్తుల డీ రెగ్యులేషన్ పేరుతో వాటి మీద దాదాపు యాభై శాతానికి పైగా పన్నును విధిస్తూనే, పెరిగే ధరలతో తనకు సంబంధం లేదని చెప్తోంది యూపీయే ప్రభుత్వం. అంటే ఆయిల్ కంపెనీలకు నష్టాలు అనే సాకుతో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచటం తథ్యం. డీజిల్ ధరలు పెరిగితే సామాన్యులు బస్సు చార్జీలనించి రైతుల సాగు ధరల వరకు అన్నీ పెరగడం అనివార్యం.
http://im.rediff.com/money/2011/feb/02agri1.jpg
వ్యవసాయానికి క్రితం సంవత్సరాని కంటే మూడు వేల కోట్లు ఎక్కువిచ్చామని ప్రణబ్ గొప్పగా చెప్పారు. కానీ ఎరువుల మీద క్రితం సంవత్సరం ఇచ్చిన 67, 198 కోట్ల కంటే ఈసారి పదిశాతానికి పైగా తక్కువ ఖర్చు పెడతామని చెప్పారు. మొన్న ఫిబ్రవరిలో నిర్ధారించిన ఎరువుల సబ్సిడీని పరిగణనలోకి తీసుకొంటే డీఏపీ, యూరియా, ఎంబిసీ మొదలగు వాటిపై 60, 974 కోట్లు మాత్రమే వస్తుంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వ సబ్సిడీ బకాయిలతో కలిపి దాదాపు 93,000 కోట్లకు చేరింది. దాన్ని ఇప్పుడు అరవైవేల కోట్లకు పరిమితం చేయడమంటే అంతర్జాతీయ ధరల పెరుగుదలను రైతుకు బదిలీ చెయ్యబోతున్నారన్న మాట. రైతులకి ఎరువుల ధరలు చుక్కలు చూపించబోతున్నాయి.

చమురు రేట్లు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతి చేసుకొనే ఎరువుల రేట్లు సహజంగానే పెరిగే అవకాశం ఉంది. యూరియా మూడవ వంతు, మిగతా ఎరువులను భారత్ సింహ భాగం దిగుమతి చేసుకొంటున్న నేపథ్యంలో, ఎరువులు మీద సబ్సిడీలను దశల వారీగా తగ్గిస్తామని చెప్పడం రైతుకు ఆశనిపాతమే. రైతుకి ఎరువుల ధరలు ఇంకా పెరిగితే సాగు ధర ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే సాగుధరకి, మద్దతు ధరకి ఎక్కడా సాపత్యం కుదరక తల్లడిల్లుతున్న రైతుకి ఎరువుల ధరలు ఇంకా పెరగడం రైతుకే కాదు, వినియోగదారులకీ నష్టమే.
http://www.microdinero.com/files/noticias/2298_2170_rural.jpg
ఇక రైతుని దొంగ దెబ్బ తీయబోయే అతి తీవ్రమైన సమస్య ఆహార సబ్సిడీ పథకం. 2012 కి ఆహార సబ్సిడీ కోసం 75 వేల కోట్లు చూపించారు. ఈ సారి ఆహార సబ్సిడీ పథకం అమలుచేస్తే కావాల్సింది సంవత్సరానికి 1, 02,000 కోట్లు. ఇప్పుడిచ్చినది కాకుండా మిగిలినది ఎలా ఇస్తారో ప్రభుత్వం చెప్పలేదు. ఈ ప్రభుత్వమే గొప్పగా నియమించిన స్వామినాథన్ కమిటీ అమలు గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. బహుశా ఆ సిఫార్సులు అమలు చెయ్యలేమని చెప్పిన శరద్ పవార్ స్ఫూర్తి గాబోలు. రైతులకి రుణాలు అయిదు లక్షల పాతిక వేల కోట్లకు పెంచామని అన్నారు. http://www.instablogsimages.com/images/2007/05/29/agriculture-scheme-pm_26.jpg
కానీ రైతులందరినీ సంస్థాగత రుణాల పరిధిలోకి తేవాలంటే కనీసం పది లక్షల కోట్ల రుణాలు పంపిణీ కావాలి. పైపెచ్చు ఇప్పుడు ప్రకటించిన రుణాలు ఇచ్చేది ప్రభుత్వం కాదు, బ్యాంకులు. వాటి మీద అదుపు లేనప్పుడు ఎన్ని కోట్లు ప్రకటించినా ప్రస్తుతం వున్న 30 శాతం లబ్ధిదారుల కంటే పెరిగే అవకాశమే లేదు. వ్యవసాయ ఉత్పత్తి రేటు 2.5 శాతానికి పడిపోయిన ఈ సమయంలో రైతులు ఆర్థిక మంత్రి వైపు ఆశగా చూసారు. కొన్ని వ్యవసాయ మిషన్లు ఏర్పాటుచేయడం తప్పిస్తే, పంట దిగుబడి పెంచే చర్యలు పెద్దగా కనబడవు.

స్థూలంగా వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడానికి కావాల్సిన ఫ్రేం వర్కు బడ్జెట్టులో లేదు. పైపెచ్చు రైతు నడ్డి విరిచే సబ్సిడీల తగ్గింపు వంటి చర్యలు వున్నాయి. ఈసారి ప్రణబ్, మన్మోహన్ ఇద్దరూ భారత ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పనిసరి అని చెప్తూ వచ్చారు. మన్మోహన్ అయితే మరో అడుగు ముందుకు వేసి సబ్సిడీ బుల్లెట్లు కొరకాల్సిందే అని పోకిరీ టైపులో సెలవిచ్చారు. కానీ ఆయన ఆర్థిక వేత్తగా మరిచిపోయిన దేమిటంటే, తమ ప్రభుత్వం ఆహార సబ్సిడీ అనే ఫక్తు వోటుబ్యాంకు పథకానికి ముప్పై వేల కోట్లకు పైగా సబ్సిడీ ఇవ్వబోతోందని. దానికి లేని ఇబ్బంది రైతులకి ఎరువుల సబ్సిడీ ఇవ్వడంలో ఎందుకు?
http://india.targetgenx.com/files/2008/04/farmer1.jpg
ఈ రైతు వ్యతిరేక చర్యలన్నీ ఒకే ప్రశ్న వేస్తాయి. దేశంలోని 60 శాతం పైగా ఉన్న రైతులకు ఉపయోగపడని డబ్బు, వృద్ధి ఎవరి కోసం? ప్రభుత్వం తన దగ్గర ఉన్న సంపదని నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి చేర్చకుండా, ఉన్న కాస్త సబ్సిడీలను తీసేస్తూ వాళ్ళ మీద ఇంకా పన్నులేస్తూ ఎవరి కోసం పని చేస్తున్నట్టు? http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-02.jpg
ఇంతటి హ్రస్వ దృష్టినీ, చిత్తశుద్ధి లేమినీ, విధాన రాహిత్యాన్నీ నిలదీయాల్సిన పని, పోరాటం చేయాల్సిన పనీ రాజకీయ పార్టీలది. సాగు ఖర్చులు మూడొందల శాతం పైగా పెరిగి రైతు చితికి పోతూ ఉంటే ప్రతి పక్షంలోని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు పాలక పక్షాలపై ముప్పేట దాడిచేసి రైతుకు ఏదో మేరకు సాంత్వన చేకూర్చాలి. మేధావులెందరో అంటున్నారు గానీ, నిజానికి వ్యవసాయం సంక్షోభంలో లేదు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కంపెనీలు ఎవరూ సంక్షోభంలో లేరు.

మిల్లర్లు, దళారులూ కూడా సంక్షోభంలో లేరు. ప్రభుత్వ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని మరీ ఇబ్బడి ముబ్బడిగా పండిస్తున్నారు మన రైతన్నలు. ఈ రకంగా ఆహార సంక్షోభమూ లేదు. సంక్షోభంలో ఉన్నది రైతులు. రైతు కూలీలు, కౌలు రైతులు. వీరిని గట్టెక్కించే దీర్ఘకాలిక విధానాల రూపకల్పనలోనూ దీర్ఘకాలిక పోరాటాలలోనూ కలిసికట్టుగా పనిచేయడం రాజకీయ పక్షాల బాధ్యత.
http://l.yimg.com/t/images/indian-monsoon-photos-140611-15.jpg
చిత్రంగా మన రాష్ట్రంలో మాత్రం, రైతు మిత్రులమని చెప్పుకునే చిట్టి పొట్టి పార్టీలు తమ పోరాటం ప్రధాన ప్రతిపక్షం పైన మళ్లిస్తూ ప్రజాగ్రహాన్ని పలుచన చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను చీలుస్తూ తాము (పైపైకి మాత్రమే అయినా సరే) వ్యతిరేకించే ప్రజా వ్యతిరేకులకే మేలు చేస్తూ వస్తున్నారు. పైపై మెరుగుల సింబాలిక్ ఉద్యమాలూ, స్వంత డబ్బాలూ కొంత మానుకుని రైతన్న ఏం ఆశిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం ఇకనైనా మొదలుపెట్టాలి.

- శ్రీశైల్ రెడ్డి పంజుగుల
తెలుగుదేశం వ్యవసాయ అధ్యయన కమిటీ సభ్యులు
- నీలయపాలెం విజయకుమార్
రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు

Saturday, March 3, 2012

భూసార పరీక్షకు ఇదే సమయం

భూ భౌతిక, రసాయనిక లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎన్ని ఎరువులు వాడినా రైతులు ఆశించిన పంట దిగుబడులు పొందలేకపోతున్నారు. రైతులు భూ స్వభావానికి అనువైన పంటలు పండించాలి. అలాగే పంటకు అనుగుణంగా భూ స్వభావాన్ని, భూసార స్థితిని మార్చుకోవాలి. ఈ రెండు విషయాలపై అవగాహన ఏర్పడాలంటే రైతన్నలు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించాలి. అందుకు ఈ వేసవి కాలమే అనువైన సమయం.

భూసార పరీక్ష అంటే...
రైతు పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలకు భౌతిక, రసాయనిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆ నమూనాలలోని సస్య పోషక పదార్థాల పరిమాణాన్ని లెక్కగడతారు. ఆ తర్వాత వివిధ పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు వేసుకోవాల్సిన ఎరువుల్ని, వాటి మోతాదుల్ని సిఫార్సు చేస్తారు.

మట్టి నమూనా ఎప్పుడు తీయాలి?
పొలంలో పైరు లేకుండా ఉండే వేసవి కాలంలో మట్టి నమూనా తీయడం మంచిది. పంట వేసే ముందు లేదా పైరు కోసిన తర్వా త నమూనాలు తీయవచ్చు. మాగాణి భూముల్లో నీరు పెట్టకముందే నమూనాలు సేకరించాలి. ఎరువులు వేసిన నెల రోజుల తర్వాత మాత్రమే నమూనాలు తీసుకోవాలి. బిందుసేద్య పద్ధతిని అనుసరించే వారు మట్టి పరీక్షలు చేయించి, వాటికి అనుగుణంగా పంటలు సాగు చేస్తే ఆ పరికరాలు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

ఎలా తీయాలి?
పొలానికి ఒక నమూనా సరిపోతుంది. అయితే పొలం మరీ పెద్దదిగా ఉంటే ప్రతి అయిదు ఎకరాలకు ఒక నమూనా చొప్పున తీయాలి. నేల నిర్మాణం, రంగు, మురుగు నీటి పారుదల సౌకర్యం, నేల ఏటవాలు, స్వభావం, పంటల సరళి, యాజమాన్య పద్ధతులు వంటి విషయాల్లో తేడా ఉన్నట్లయితే పొలం చిన్నదైనప్పటికీ వేర్వేరు నమూనాలూ సేకరించాల్సిందే.
నమూనాల సేకరణకు ముందు నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు వంటి వాటిని తీసేయాలి. పలుగు/పార ఉపయోగించి మట్టిని సేకరించవచ్చు. ఇంగ్లీషు ‘వి’ ఆకారంలో 6-8 అంగుళాల లోతులో గొయ్యి తవ్వాలి. అందులో పక్కగా అంగుళం మందాన గొయ్యి అడుగు అంచు వరకూ మట్టిని తీయాలి. దీనిని ఉప నమూనా అంటారు. ఇదే విధంగా 8-10 చోట్ల ఉప నమూనాలు సేకరించాలి. వాటిని ఒక శుభ్రమైన బకెట్‌లో వేసి బాగా కలపాలి. తడిగా ఉన్నట్లయితే మట్టిని నీడలో కాగితం లేదా గుడ్డ పైన ఆరబెట్టాలి. ఆ తర్వాత మట్టిలో గడ్డలు ఉంటే వాటిని పగలగొట్టి బాగా కలపాలి.
అనంతరం మెత్తని మట్టిని ఒక పొరగా చదును చేసి నాలుగు సమాన భాగాలుగా విభజించాలి. మూలలకు ఎదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకొని, మిగిలిన మట్టిని పారేయాలి. ఈ విధంగా రెండు మూడు సార్లు చేసి అర కిలో మట్టి నమూనా వచ్చే వరకూ వేరు చేయాలి. ఆ తర్వాత నమూనాను శుభ్రమైన చిన్న గుడ్డ సంచి/ప్లాస్టిక్ కవరులో నింపాలి. రైతు పేరు, గ్రామం, భూమి సర్వే నెంబరు, గతంలో వేసిన పంట వివరాలు, నీరు-ఎరువుల యాజమాన్యం, రాబోయే సీజన్‌లో వేయదలచుకున్న పంట, నమూనా సేకరించిన తేదీ తదితర వివరాలన్నీ ఒక మందపాటి కాగితం పైన రాసి ఆ కవరు లోపల పెట్టాలి. అనంతరం స్వయంగా లేదా పోస్ట్ ద్వారా లేదా మండల వ్యవసాయాధికారి ద్వారా భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి.

ఎంత లోతు నుంచి తీయాలి?
పొలంలోని మట్టినంతా పరీక్షించడం సాధ్యం కాదు. కాబట్టి కొన్ని మట్టి నమూనాల్ని సేకరించాలి. ఎంత లోతు నుంచి నమూనాను సేకరించాలనేది మనం పండించే పంట, నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పైరు పంటలకు ఆరు అంగుళాలు, పండ్ల తోటలకు అయిదు నుంచి ఆరు అడుగుల లోతు (అడుగుకు ఒక నమూనా చొప్పున) నుంచి మట్టిని సేకరించాలి. కారు చౌడు, ఆమ్ల నేలలైతే మూడు అడుగుల లోతు (అడుగుకు ఒక నమూనా చొప్పున) నుంచి నమూనాలు తీసుకోవాలి.

ఈ భూముల్లో సేకరించొద్దు
మట్టి నమూనాల్ని అప్పుడే ఎరువులు వేసిన పొలం, పెంట కుప్పలు వేసిన స్థలం, నీటిలో వుునిగి ఉన్న ప్రదేశం నుంచి సేకరించకూడదు. గట్లు, చెట్లు, బావులు, రహదారులకు దగ్గరగా నమూనాల్ని తీసుకోకూడదు.

కేంద్రాలు ఎక్కడున్నాయి?
ప్రతి జిల్లా కేంద్రంలోనూ వ్యవసాయశాఖ వారి భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అలాగే ప్రతి రెవెన్యూ డివిజన్‌లోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయాల్లోనూ ఉన్నాయి. ఇక్కడ ఉచితంగా నమూనాల్ని పరీక్షించి, సాయిల్ హెల్త్ కార్డులు అందజేస్తారు.

ప్రయోజనాలివే
భూసార పరీక్షల ద్వారా భూమిలోని పోషక పదార్థాల స్థాయిని తెలుసుకోవచ్చు. మీ పొలంలో ఏ పంట వేయవచ్చో, దాని నుంచి ఎంత దిగుబడి సాధించవచ్చో తెలుసుకోవచ్చు. సాగుకు అనువుగా లేని కారు చౌడు, ఆమ్ల భూముల స్థాయిని, ఆ భూముల్ని సాగు యోగ్యంగా వూర్చడానికి అనుసరించాల్సిన పద్ధతుల్ని తెలుసుకోవచ్చు. మట్టి పరీక్షలో వెల్లడైన అంశాలను బట్టి భూమికి ఏయే ఎరువులు ఎంత మోతాదులో, ఏ రూపంలో వేయాలో తెలుసుకోవచ్చు. ఎరువుల్ని అవసరమైన మోతాదులోనే వాడతాము కనుక వృథా ఖర్చు తగ్గుతుంది. ఈ పరీక్షల వల్ల నేల రంగు, స్వభావం, ఆమ్ల -క్షారాలు, సేంద్రియ కర్బన పరిమాణాల గురించి తెలుసుకోవచ్చు. రైతు కోరితే సూక్ష్మపోషకాల లభ్యత గురించి కూడా తెలియజేస్తారు.

-బెరైడ్డి సింగారెడ్డి, ఎమ్మెస్సీ అగ్రికల్చర్,
అగ్రానమిస్ట్, ఖమ్మం, ఫోన్: 9440797854 

చెరకు చెత్తే కదా అని కాల్చేయొద్దు


  చెరకు తోటలు నరికిన తర్వాత చాలా మంది రైతులు చెత్తను కాల్చేస్తుంటారు. అయితే దీనివల్ల వారికి ఎంతో నష్టం జరుగుతోంది. ఎందుకంటే ఈ చెత్త చెరకు పైరు సాగులో పలు రకాలుగా ఉపయోగపడుతుంది. చెరకు చెత్తను కాల్చేయడం వల్ల నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలనే కాకుండా భూసారాన్ని, భూ భౌతిక స్వభావాన్ని పెంచే సేంద్రియ పదార్థాన్ని కూడా నష్టపోతున్నాము.కాబట్టి చెరకు చెత్తను పైరులో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీనివల్ల ఒనగూడే ప్రయోజనాలేమిటి అనే విషయాలపై రైతులు అవగాహన కలిగి ఉండడం అవసరం.చెరకు చెత్తలో నార పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కుళ్లబెడితే చివికిన సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇది పైరుకు పోషక పదార్థాల్ని అందిస్తుంది. చెరకు చెత్తను మొక్క, పిలక తోటల్లో వేసుకోవచ్చు.
ఎలా కుళ్లబెట్టాలి?

చెరకు చెత్తను కుళ్లబెట్టే శిలీంద్రాలు ఉంటాయి. రెండున్నర ఎకరాల తోటకు మూడు కిలోల శిలీంద్రాలు అవసరమవుతాయి. బాగా చివికిన పశువుల ఎరువు లేదా ఫిల్టరు మడ్డికి ఈ శిలీంద్ర సముదాయాన్ని కలపాలి. దానిపై పలచగా నీరు చల్లి నీడలో ఉంచాలి. దానిపై గోనె సంచి లేదా వరి గడ్డి కప్పాలి. ఆ తర్వాత శిలీంద్రం వృద్ధి చెందడానికి వారం రోజుల సమయం పడుతుంది. అనంతరం దానిని సాళ్ల మధ్య పరచిన చెరకు చెత్త పైన పలచగా చల్లుకోవాలి. ఆ సమయంలో కొద్దిపాటి తేమ ఉండాలి.

ఎలా వాడాలి?

పైన తెలిపిన విధంగా అభివృద్ధి చేసిన శిలీంద్ర సముదాయాన్ని మొక్క తోటల్లోనూ, కార్శి తోటల్లోనూ వాడుకోవచ్చు. మొక్క తోటల్లో అయితే ముచ్చెలు నాటిన మూడో రోజున చెరకు చెత్తను పొలంలో పలచగా పరవాలి. ఇందుకోసం ఎకరానికి సువూరు 1.25 టన్నుల చెత్త అవసరమవుతుంది. వర్షాకాలంలో కాలువలు ఎగదోసే సమయంలో 1.25 కిలోల శిలీంద్రం, ఎనిమిది కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్‌ను కలిపి ఆ మిశ్రవూన్ని ఎకరం విస్తీర్ణంలో పరచిన చెరకు చెత్తపై చల్లి మట్టితో కప్పాలి. అప్పుడు ఆ చెత్త మంచి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది.

ఇక కార్శి (పిలక) పంట తీసుకునే వారు మొక్క తోటలు నరికిన తర్వాత చెరకు చెత్తను (ఎకరానికి 1.25 టన్నులు) సాళ్లలో వేసి, దానిపై ఎకరానికి 10 కిలోల చొప్పున సూపర్ ఫాస్ఫేట్, ఎనిమిది కిలోల యూరియా, 1.25 కిలోల శిలీంద్రం కలిపి చేనంతా కలిసేలా చల్లాలి.కార్శి మోళ్లకు ఆనుకొని లోతుగా నాగలితో దున్నినట్లయితే మొదళ్ల వద్ద ఉన్న పాత వేర్లు తెగి కొత్త వేర్లు పుట్టుకొస్తాయి. అప్పుడు కొత్తగా వచ్చే పిలకలు బాగా మొలుస్తాయి. నేలలో వేసిన చెరకు చెత్త కుళ్లి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. మిగిలిపోయిన చెరకు చెత్తను సాళ్ల మధ్య పలచగా పరచుకోవచ్చు.


ఉపయోగాలివే

చెరకు చెత్తను సాళ్లలో పరిచి, కుళ్లబెట్టి సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకుంటే పలు ప్రయోజనాలు చేకూరుతాయి. సాళ్ల మధ్యలో చెరకు చెత్తను కప్పితే తేమ చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. వర్షాధారపు చెరకు సాగుకు ఇది ఎంతో ఉపయోగకరం.

సాళ్లలో చెత్తను పరిస్తే నాటిన/కార్శి చేసిన తొలి దశలో కలుపు మొక్కలు మొలవకుండా నివారించవచ్చు. అంతేకాదు... పీక పురుగు ఉధృతి కూడా తగ్గుతుంది. ఎందుకంటే భూమిలో తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు పీక పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.చెరకు చెత్తను కప్పడం వల్ల భూమిలో తేమ చాలా కాలం పాటు అలాగే ఉంటుంది. వేసవిలో తోటకు సరిగా నీరు పెట్టలేకపోయినప్పటికీ భూమిలో నిల్వ ఉన్న తేమ వల్ల పైరు వడలిపోదు. నీటి తడులు తక్కువగా ఇచ్చినా సరిపోతుంది. చెరకు చెత్తను కాలిస్తే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీనిని సాళ్ల మధ్య పరవడం ద్వారా ఆ కాలుష్యాన్ని నివారించవచ్చు. పాల చౌడు, చౌడు భూముల్లో చెరకు చెత్తను సాళ్లలో పరిచి తేమను కాపాడి, భూమిలోని లవణాల్ని వేర్ల దగ్గరికి రాకుండా చేయడం వల్ల పైరు బలంగా పెరిగి మంచి దిగుబడులు ఇస్తుంది.


చెత్తను నేరుగా...
చెరకు చెత్తను నేరుగా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. టన్ను చెరకు చెత్తను కంపోస్ట్‌గా మార్చాలంటే మీటరు లోతు, రెండు మీటర్ల వెడల్పు, ఆరు మీటర్ల పొడవుతో గొయ్యి తీయాలి. అందులో 15 సెంటీమీటర్ల మందాన చెరకు చెత్త పరిచి, తేమగా ఉండేందుకు నీరు చిలకరించాలి.

దాని పైన పేడ నీటిని చల్లాలి. మళ్లీ దాని పైన కిలో శిలీంద్ర సముదాయం, ఎనిమిది కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చల్లాలి. ఆ తర్వాత ఒకటి రెండు సెంటీమీటర్ల మందాన మట్టి కప్పాలి. నాలుగు నెలల్లో చెరకు చెత్త కుళ్లి కంపోస్ట్‌గా మారుతుంది. దానిని నేరుగా పొలంలో వేసుకోవచ్చు. ఇలా పొరలు పొరలుగా చెరకు చెత్తను గోతిలో వేస్తూ కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవచ్చు.


ఈ పోషకాలు లభిస్తాయి

చెరకు చెత్తలో 0.41 శాతం నత్రజని, 0.16 శాతం భాస్వరం, 0.72 శాతం పొటాష్‌తో పాటు కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఇనుము, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు 0.2 నుండి 0.9 శాతం వరకూ ఉంటాయి.
- వలేటి గోపీచంద్
ఎమ్మెస్సీ అగ్రికల్చర్
ఆకాశవాణి, హైదరాబాద్

వేసవి పంటలతో మంచి ఆదాయం!


వేసవి వచ్చేసింది. ఇప్పటికే కూరగాయ ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వేసవిలో వీచే పొడి గాలులు, పెరిగే ఉష్ణోగ్రతలు, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీని వల్ల దిగుబడులు తగ్గి రాబోయే కాలంలో వీ టి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నీటి వసతి ఉన్న రైతులు ఈ సీజ న్‌లో కూరగాయ పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందవచ్చునని నల్లగొండ ప్రాంతీయ ఉద్యానవన శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి సూచిస్తున్నారు. ఆ వివరాలు...

ఈ పంటలు వేసుకోవచ్చు

వేసవిలో తీగ జాతి కూరగాయలైన కాకర, బీర, బెండ, ఆనప, దోస, దొండ, పొట్ల, దుం ప జాతి కూరగాయలైన చేమ, కంద, ముల్లంగితో పాటు టమాటా, ఆకుకూర పంటల్ని వేసుకోవచ్చు. సాధారణంగా వర్షాకాలంలో పండించే వంగ, గోరుచిక్కుడు, బెండ, మిరప వంటి పంటల్ని కూడా సాగు చేసుకోవచ్చు. వ్యవసాయాధికారులు, ఉద్యాన అధికారుల సూచనల మేరకు ఆయా ప్రాంతాలకు అనువైన రకాల్ని ఎంపిక చేసుకోవాలి.

ఇలా వేసుకోవాలి

వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉం టాయి. ఎండ వేడికి నారు వడలి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొక్కల్ని సాధ్యమైనంత వరకూ సాయంకాలం వేళ నాటుకోవాలి. విత్తనాలు నేరుగా విత్తేటట్లయితే విత్తిన వెంటనే నీరు కట్టి, ఆ తర్వాత విత్తనాలు మొలకెత్తే వరకూ మూడు నాలుగు రోజులకు ఒకసారి తడి అందించాలి. వేసవిలో మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. కనుక విత్తనాల్ని దగ్గర దగ్గరగా వేసుకోవాలి.

టమాటా వేసే వారు వరుసలు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల చొప్పున దూరాన్ని పాటించాలి. ఎకరానికి 250 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. వంగ వేసే వారు వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం (ఎకరానికి 350 గ్రాముల విత్తనాలు) ఉండేలా నాటాలి. బెండ వేయాలనుకుంటే 45-20 సెంటీమీటర్లు (ఎకరానికి ఆరు కిలోల విత్తనాలు), పచ్చి మిరపకు 45-45 సెంటీమీటర్లు (600 గ్రాములు), గోరుచిక్కుడుకు 50-20 సెంటీమీటర్లు (నాలుగు కిలోలు), బీర, దోసకు 100-50 సెంటీమీటర్లు (బీర అయితే రెండు కిలోలు, దోస అయితే 1.5 కిలోలు), కాకరకు 150-50 సెంటీమీటర్ల (రెండు కిలోల విత్తనాలు) దూరాన్ని పాటించాలి. ఆనప వేసే వారు వరుసల మధ్య 300 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 100 సెంటీమీటర్ల దూరం ఉండేలా (ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనాలు) మొక్కలు నాటుకోవాలి.


బిందుసేద్యం-మల్చింగ్ మేలు

వేసవి కూరగాయ పంటలకు బిందుసేద్యం ద్వారా నీరందిస్తే మంచిది. దీనివల్ల ప్రతి రోజూ అవసరమైన మేరకు నీటిని అందించవచ్చు. మామూలు పద్ధతిలో అయితే అయిదు నుండి ఏడు రోజుల వ్యవధి ఇస్తూ నీటి తడులు ఇవ్వాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునేందుకు వీలుగా కూరగాయ పంటల సాళ్లలో ప్లాస్టిక్ షీట్లు కప్పాలి. దీనివల్ల భూమి వేడెక్కదు. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కలుపు మొక్కలు పెరిగే అవకాశం కూడా ఉండదు. డ్రిప్ లాటరల్ పైపుల్ని షీట్ల కింద ఏర్పాటు చేసుకోవాలి. టమాటా పంటను షేడ్‌నెట్ కింద పండించడం మంచిది.

ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు:
ఫర్టిగేషన్ (నీటిని అందించే పైపుల ద్వారా) పద్ధతిలో ఎరువుల్ని అందిస్తే మొక్కలు క్రమ పద్ధతిలో, ఏపుగా పెరుగుతాయి. సాధారణ పద్ధతిలో అయితే మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు వేసినప్పుడు తగినంత నీటిని అందించాల్సి ఉంటుంది. లేకుంటే మొక్కలు మాడిపోతాయి. స్థానిక వ్యవసాయాధికారుల సలహా మేరకు ఎరువులు వేసుకోవాలి.

పూత-పిందె రాలకుండా
...
వేసవి కూరగాయ పంటల్లో పూత, పిందె రాలకుండా ఉండాలంటే వ్యవసాయాధికారుల సూచనల మేరకు హార్మోన్ మందుల్ని పిచికారీ చేసుకోవాలి. లీటరు నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలిపి (ఎకరానికి 200-250 లీటర్ల ద్రావణం) పిచికారీ చేస్తే కాయలు పగలకుండా ఉంటాయి. ఆకులు పల్లాకు రంగులోకి మారితే లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి.

ఉద్యానవన శాఖ సబ్సిడీ

ఉద్యానవన శాఖ వేసవిలో 50 శాతం సబ్సిడీపై రైతు కోరుకున్న బ్రాండెడ్ కంపెనీల విత్తనాల్ని పంపిణీ చేస్తోంది. అలాగే మల్చింగ్‌కు వాడే ప్లాస్టిక్ షీట్ల కొనుగోలుకు కూడా యాభై శాతం సబ్సిడీతో ఎకరానికి నాలుగు వేల రూపాయలు అందిస్తోంది. తీగ జాతి కూరగాయల సాగుకు ఎకరం భూమిలో పందిళ్లు వేసుకొంటే 50 శాతం సబ్సిడీ కింద 60 వేల రూపాయలు అందిస్తోంది.

చీడపీడల నివారణ కోసం...

వేసవిలో కూరగాయ పంటల్ని వివిధ రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. పంట కోత దశలో ఉన్నప్పుడు పురుగు మందుల్ని విచక్షణారహితంగా వాడకూడ దు. సిఫార్సు చేసిన మోతాదులోనే పిచికారీ చేయాలి. బెండలో ఎర్రనల్లి నివారణకు లీట రు నీటికి అయిదు మిల్లీలీటర్ల చొప్పున డైకోఫాల్ కలిపి పిచికారీ చేయాలి. వంగ, బెండ పంటల్లో పచ్చదోమ, తెల్లదోమ నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున మెటాసిస్టాక్/డైమిథోయేట్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. సొర, బీర, దొండ, దోస జాతి కూరగాయల్లో కాయ తొలుచు పురుగుల నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బరిల్ + రెండు మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

Gouthamaraju as WUA