పాడి పంటలు

Monday, April 2, 2012

దేశవాళి ఆవులే మేలు


  దేశంలోని గోజాతిని దేశవాళి, విదేశీ, సంకర జాతులుగా విభజించవచ్చు. మిగిలిన రెండు జాతుల కంటే స్వదేశీ ఆవులు ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన అధిక ఉష్ణ పరిస్థితుల్లో కూడా పాల దిగుబడులలో తేడా లేకుండా ఉంటాయి. బాహ్య పరాన్న జీవులను తట్టుకోగలిగిన సామర్థ్యం ఎక్కువగా ఉండడం వలన వీటికి ఆరోగ్య సమస్యలు తక్కువ. ఈ లక్షణాలు సంకర, విదేశీ జాతి ఆవుల్లో దాదాపు కనిపించవంటున్నారు మండపేటలోని రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రానికి చెందిన ఏడీఏలు డాక్టర్ విజయకుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్‌బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఇది. ఇందులో స్వదీశీ జాతుల విశిష్టత, వివిధ రాష్ట్రాల్లో పేరొందిన జాతుల గురించి వివరిస్తున్నారు...


  దేశీయ ఆవులు స్థానికంగా లభించే తక్కువ పోషక విలువలు కలిగిన గడ్డిని సమర్థవంతంగా వినియోగించుకుని విదేశీ, సంకరజాతి ఆవులు అందించే వెన్న శాతం కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాయి (4-5 శాతం). దీనికి విరుద్ధంగా విదేశీ, సంకరజాతి ఆవులు ఎక్కువ దాణా, ఎక్కువ పోషకాలున్న గడ్డిని మేపినపుడు మాత్రమే ఎక్కువ పాల దిగుబడినిస్తాయి. అంతేకాక వీటి పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. 1995, 2007లలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో స్వదేశీ జాతుల్లో దూడల మరణాలు కేవలం ఐదు శాతం కాగా అదే విదేశీ హెచ్‌ఎఫ్ జాతి దూడల్లో 31 శాతం, జెర్సీ దూడల్లో 28.3 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడైంది.


  జాతీయ పశు జన్యు సంపద సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్) వారు ప్రకటించిన భారతీయ గోజాతుల సంఖ్య 30. ఇందులో కొన్ని పాల ఉత్పత్తికి, ఎక్కువ భాగం వ్యవసాయ, రవాణా పనులకు పేరొందాయి. మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరు, కర్నాటకలోని హాలీకార్, ఖిల్లారి, క్రిష్ణవేలీ, మల్నాడ్‌గిడ్డ, కేరళలోని వేచూర్, కాసరగడ్, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరీ, గుజరాత్‌లోని గిర్, రాజస్థాన్‌లోని రెడ్‌సింధీ, థార్‌పార్కర్, కాంక్రెజ్, రాథీ, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, పంజాబ్‌లోని సాహివాల్ జాతి ఆవులు, ఎద్దులు పాడికి, ఆయా పనులకు ప్రముఖంగా పేరొందాయి. వీటిలో ఇప్పటికే ఒంగోలు జాతి విశిష్టతను తెలుసుకున్నాం. మరికొన్ని జాతుల వివరాలు..

వేచూర్


కేరళ రాష్ట్రానికి చెందిన వేచూర్ జాతి ఆవులు, గిత్తలు పొట్టి జాతిగా పేరొందాయి. మన పుంగనూరు, కేరళ వేచూర్ జాతుల్లో ఏది ఎక్కువ పొట్టి అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. వేచూరి జాతి ఆవుల సగటు ఎత్తు 80-90 సెంటీమీటర్లు. గిత్తల ఎత్తు 85-95 సెంటీమీటర్లు కాగా పుంగనూరు జాతి పశువులు 60-100 సెంటీమీటర్ల ఎత్తుంటాయి. వేచూర్ జాతి పశువులు ఎక్కువగా లేత ఎరుపు లేదా నలుపు రంగులో ఉంటాయి.

శరీర నిర్మాణ పరంగా చిన్నవైనప్పటికీ వ్యవసాయ పనులకు ఈ గిత్తలు ప్రసిద్ధి. ఈ జాతి దూడలలో సహజ మరణాలు దాదాపు శూన్యం. ఆవులు శ్వాసకోశ, గాలికుంటు, పొదుగువాపు వ్యాధులను సమర్థవంతంగా తట్టుకోగలవు. రోజుకు సగటున 2.5 లీటర్ల నుంచి 3.5 లీటర్ల పాల దిగుబడినిస్తాయి. వేచూర్ జాతి ఆవు పాలను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు.


కాసరగడ్


కేరళకు చెందిన కాసరగడ్ జాతి పశువులు అధిక ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఇవి కూడా వేచూర్ జాతి మాదిరే పొట్టి రకం. వీటిలో ఆహారాన్ని వినియోగించుకునే సామర్థ్యం ఎక్కువ. కాసరగడ్ జాతి దూడలు సంవత్సరం వయసునాటికి అవి పుట్టిన నాటి బరువు కంటే 7-8 రెట్లు అధిక బరువు కలిగిఉంటాయి. వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఈ జాతి పశువులు పాల దిగుబడి కంటే వ్యవసాయ పనులకు బాగా పేరొందాయి.

మాల్వీ

http://www.krankykids.com/cows/daily_cow_images/M/malvi/malvi_1_web.jpg
మధ్యప్రదేశ్‌లోని మాల్వీ ప్రాంతంలో గుర్తించిన ఈ జాతికి ఆ ప్రాంతం పేరిట మాల్వీ అనే పేరు వచ్చింది. ఈ జాతి ఎద్దులు ప్రధానంగా బరువులు లాగే వ్యవసాయ పనులకు ప్రసిద్ధి. ఒండ్రు నేలలు, బంక మట్టి నేలల్లో పెద్ద పెద్ద నాగళ్లను లాగే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆవులు తక్కువ పాలదిగుబడినిస్తాయి.

పుంగనూరు ఆవులు

http://cdn1.wn.com/ph/img/a8/f1/004de760108ff11cc92e50004ca4-grande.jpg
మన రాష్ట్రానికి చెందిన పుంగనూరు జాతి ఆవు ప్రపంచ గోజాతుల్లో అతి చిన్నదిగా పేరొందింది. ఈ జాతి ఆవుల కన్నా మగ పశువులు మెతక స్వభావము కలిగి ఉంటాయి. చక్కని ముఖంతో, బూడిద రంగుతో బాగా వృద్ధి చెందిన మెడ, మూపురంతో ఉంటాయి. కురచకాళ్ళతో, గట్టి గిట్టలు కలిగి ఉంటాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన కొండలు, గుట్టలు, వాలు ప్రాంతాలను సులువుగా ఎక్కి దిగగలవు. ఈ జాతి పశువులు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటికి కరువు పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఉంది.

వీటి ఎత్తు 60 -100 సెంటీమీటర్లు, బరువు 130-200 కిలోలు. ఇవి కొత్త వారిని చూడగానే బెదురుతాయి. పుంగనూరు ఆవులు ఒక ఈతలో 1100 లీటర్ల వరకు (రోజుకు మూడు నుంచి మూడున్న లీటర్లు) పాలు ఇస్తాయి. చిన్నపాటి శరీరాకృతి కారణంగా వీటిని రైతులు వ్యవసాయ పనులకు తక్కువగా వినియోగిస్తున్నారు. అంతరించిపోతున్న ఈ జాతి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


 దేని ప్రత్యేకత దానిదే
గోజాతికి మన దేశం పెట్టింది పేరు. ఏ జాతి ప్రత్యేకత దానిదే. సామర్థ్యాన్ని బట్టి పాల ఉత్పత్తికి ఉపయోగపడేవి కొన్నయితే పాల ఉత్పత్తితో పాటు వ్యవసాయ పనులకు కూడా ఉపకరించేవి మరి కొన్ని.

కేవలం వ్యవసాయ పనులకు మాత్రమే ఉపయోగపడే జాతులు కూడా ఉన్నాయని చెబుతున్నారు తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని రాష్ట్ర పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఏడీఏలు డాక్టర్ విజయ కుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్ బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగుతున్న నేపథ్యంలో వారు అందిస్తున్న కథనాల్లో ఇది అయిదోది...


మన రాష్ట్రంలోని ఒంగోలు, పుంగనూరు, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, కేరళలోని వేచూర్, కాసరగడ్ జాతుల ఆవుల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ వారం కర్ణాటకలోని కృష్ణావ్యాలీ, మల్నాడుగిడ్డ, అమృతమహల్, హల్లికార్, ఖిలారీ, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరి జాతుల విశిష్టతల గురించి తెలుసుకుందాం.


పాల దిగుబడి స్థిరంగా ఉండదు

కృష్ణావ్యాలీ జాతిని ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఒండ్రు, నల్లరేగడి నేలల్లో వ్యవసాయాధారిత పనుల కోసం అభివృద్ధి చే శారు. గిర్, ఒంగోలు, కాంక్రెజ్, హల్లికార్ జాతుల్ని సంకరపరచి వీటిని అభివృద్ధి చేశారు. వీటి శరీరంపై బూడిద తెలుపు, తెలుపు, గోధుమ, నలుపు రంగులు కలగలసిన మచ్చలు ఉంటాయి. గిర్, ఒంగోలు జాతుల్ని సంకరపరచి అభివృద్ధి చేసిన కృష్ణావ్యాలీ ఆవు సగటున రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల పాల దిగుబడి ఇచ్చినప్పటికీ అది స్థిరంగా ఉండదు. గిట్టలు మెత్తగా ఉండడం వల్ల ఈ జాతి గిత్తలు, ఎడ్లు ఒండ్రు నేలలు, బంకమట్టి నేలలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో మంచి పనితనాన్ని ప్రదర్శిస్తాయి.

పనిలో దిట్ట
మల్నాడుగిడ్డ ఆవులు గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనులకు ప్రసిద్ధి చెందినవి. పొట్ట, డొక్కల వైశాల్యం తక్కువగా ఉండడం వల్ల తక్కువ మేత తింటాయి. అయితే పనిలో మాత్రం మంచి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. గాలికుంటు వ్యాధిని, వలసల కారణంగా సంక్రమించే వ్యాధుల్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. రోజుకు 1.5 లీటర్ల నుంచి నాలుగు లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి.

మైసూర్ రాజుల కాలం నుంచి...

మైసూర్ రాజుల కాలంలో అమృతమహల్ జాతి ఆవులు బాగా వృద్ధి చెందాయి. అప్పట్లో సైనిక వాహనాల్ని నడిపేందుకు వీటిని ఉపయోగించే వారు. ఆ తర్వాతి కాలంలో మైసూర్ సంస్థానాధీశుడు టిప్పుసుల్తాన్ ఈ జాతి ప్రత్యేకతను గుర్తించి మరింత అభివృద్ధి చేశాడు. వీటి విశిష్టతకు తగినట్లు అమృతమహల్...అంటే అమృత (పాలు) భాండమనే అర్థం వచ్చేలా పేరు పెట్టాడు. ఈ జాతి ఆవులు కొంత తెలుపు రంగులో ఉంటాయి. రోజుకు సగటున నాలుగు నుంచి ఆరు లీటర్ల పాలు ఇస్తాయి. ఇవి పాల దిగుబడికి, వ్యవసాయ పనులకు కూడా ఉపయోగపడతాయి.

దక్షిణాది ఆవులకు మాతృ జాతి

దక్షిణ భారతదేశంలోని పలు ప్రముఖ గోజాతులకు హల్లికార్‌ను మాతృ జాతిగా చెప్పవచ్చు. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల నిర్వహణలో దీనికి మంచి పేరు ఉంది. దీని శరీరం ప్రధానంగా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. తల పొడవుగా, మూతి భాగం మొనదేలినట్లు ఉంటుంది. నుదుటి నుంచి ముక్కు భాగం వరకూ కాలువ లాంటి గాడి కలిగి ఉంటుంది.

రవాణాకూ ఉపయోగపడతాయి

ఖిలారీ జాతి ఆవులు వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల్ని సమర్ధవంతంగా నిర్వర్తిస్తాయి. ఇవి గోధుమ, తెలుపు రంగులు కలగలిసిన రంగులో ఉంటాయి. తల సన్నగా ఉండి, పొడవైన కొమ్ముల మొదలు వద్ద ఇరు వైపులా ఉబ్బినట్లు ఉంటుంది. కొమ్ముల మొదలు నుంచి ముక్కు వరకూ గాడి ఉంటుంది. గిట్టలు దృఢంగా ఉండి వ్యవసాయ, రవాణా పనులకు బాగా ఉపయోగపడతాయి.

ప్రతికూల వాతావరణంలోనూ...

పొలం పనులకు, రవాణాకు కంగాయం జాతి పశువులు బాగా పేరు తెచ్చుకున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యం వీటికి ఉంది. మధ్యస్త పరిమాణంలో ఉండే ఈ పశువులు కేవలం పనికి మాత్రమే ఉపయోగపడతాయి. చురుకుగా, చలాకీగా ఉంటూ వేగంగా నడవడం వీటి సహజ స్వభావం. పనికి ఉపయోగపడే జాతిగా దక్షిణ భారతదేశంలో పేరు పొందాయి. శరీరం ముదురు బూడిద రంగులో ఉంటుంది. తల, మెడ, మూపురం, భుజాలు, మణుగుల వద్ద నల్లని మచ్చలు ఉంటాయి. ఈ జాతి ఆవులు ప్రతి 15 నెలలకు ఒకసారి ఈనతాయి. తేలికపాటి పొలాల్లో ఆవులతో సేద్యం చేస్తారు.

పాడికి పనికిరావు

తంజావూరుకు చెందిన స్థానిక గోజాతితో కంగాయం జాతిని సంకరపరచి ఉంబ్లాచెరి జాతిని అభివృద్ధి చేశారు. ఈ జాతి ఆవుల శరీర పరిమాణం మధ్యస్తంగా ఉంటుంది. పొట్ట చిన్నదిగా ఉంటుంది.

ఈ ఆవులు బూడిద రంగు, బూడిద నలుపు రంగుల్లో ఉంటాయి. ఇవి పాడికి పనికిరావు. ఎద్దులు చక్కగా పనికి ఉపయోగపడతాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత, రవాణా పనులకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
 

No comments:

Gouthamaraju as WUA