పాడి పంటలు

Sunday, February 12, 2012

'' సర్టిఫైడ్ '' సేద్యం

మీరు తరచూ సూపర్‌మార్కెట్‌లకు వెళుతుంటారా..? ఈసారి వెళితే.. ఆర్గానిక్ ఫుడ్‌రాక్‌లను చూడండి. అందులో బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు ఆకర్షణీయమైన ప్యాక్‌లలో ఆకట్టుకునేలా ఉంటాయి. వాటిని కొనాలని చేతుల్లోకి తీసుకోగానే బహుశా మీకు వచ్చే సందేహం 'ఇది ఆర్గానిక్ ఫుడ్' అని ఎలా నమ్మొచ్చు? అన్న అనుమానం కలుగుతుంది. ఫుడ్‌ప్యాక్‌లను తేరిపార చూస్తే 'ఇండియా ఆర్గానిక్' అన్న లోగో కనిపిస్తుంది. అప్పుడే అది నిజమైన ఆర్గానిక్. ఈ లోగోతో దొరికే ఉత్పత్తుల వెనుక పెద్ద కథే ఉంది. రసాయనాలు లేకుండా పండించే రైతు దగ్గర నుంచి.. ఢిల్లీలోని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సంస్థ అందించే సర్టిఫికెట్ల వరకు.. మధ్యలో బోలెడు ప్రక్రియలు నడుస్తాయి..http://www.agricultureinformation.com/mag/wp-content/uploads/2009/01/organic-farming.jpghttp://www.goorganica-z.com/wp-content/uploads/28_18_orig.jpg
ఇవ్వాళ దేశవ్యాప్తంగా యాభై లక్షల హెక్టార్లలో సేంద్రీయ వ్యవసాయం జరుగుతోంది. ఏటా రూ.2,500 కోట్ల విలువైన సేంద్రీయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం మనం. సేంద్రీయ సాగును మరింత పెంచేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్గానిక్ సర్టిఫైడ్ రైతుల సంఖ్య పెంచేందుకు కృషి జరుగుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అనుగుణంగా- సేంద్రీయ సాగుకు ఒప్పుకున్న రైతులు మొదట సంఘాలుగా ఏర్పడతారు. ఒక్కో సంఘం కింద 50 హెక్టార్ల సాగు భూమి ఉంటుంది. వీరికి ప్రభుత్వమే సేంద్రీయ ఎరువుల్ని సరఫరా చేస్తుంది. వరుసగా మూడేళ్లు మట్టి నమూనాలు, సాగు నీరు, పంట దిగుబడిని పరీక్షిస్తారు. ఈ పరీక్షలన్నీ సాధారణ లాబొరేటరీలలో చేయించకూడదు. http://www.indiatalkies.com/images/organic-farming770g.jpg
కేంద్ర శాస్త్ర సాంకేతిక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీ (ఎన్ఎమిఎల్) అనుమతించిన కేంద్రాలలోనే చేయించాలి. ఈ పనులన్నీ రైతులు చేసుకోలేరు కనుక.. ప్రభుత్వానికి-రైతుకు మధ్య పనిచేసేందుకు రెండు సంస్థల్ని నియమించారు. మొదటి ఏడాది పరీక్షల తర్వాత కన్వర్షన్ పీరియడ్ అంటారు. మూడో ఏడాది వరకు రైతులు ఎలాంటి రసాయనాలు వాడలేదని నిర్ధారణ కావాలి. ఇలా సేకరించిన వివరాలను 'నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్' (ఎన్‌పిఒపి)కు పంపించాలి. అప్పుడు సేంద్రీయ రైతుకు 'ఆర్గానిక్ ఫార్మర్'గా సర్టిఫికెట్ వస్తుంది. ఇలా సర్టిఫికెట్లు పొందిన రైతుల వద్దే ఆర్గానిక్ ఫుడ్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్పత్తులను కొంటాయి. ఏది ఆర్గానిక్ ఉత్పత్తో, ఏది సాధారణ ఉత్పత్తో కొనుగోలుదారులు సులువుగా గుర్తుపట్టేందుకు ఎన్‌పిఒపి ఒక లోగోను తయారుచేసింది. ఆర్గానిక్ మార్కెటింగ్ సంస్థలు ఆ లోగోతోనే ఆహార ఉత్పత్తులను విక్రయించాలి.

మందుల సేద్యం..

కృత్రిమ ఎరువులతో, క్రిమిసంహారక మందులతో ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయం గురించి మనందరికీ తెలుసు. ఒక రైతు పొలానికి మూడుసార్లు మందు కొడితే ఎకరాకు ముప్పై బస్తాల ధాన్యం పండిందని.. పక్క పొలం రైతు అదే మందు డోసు పెంచి, నాలుగుసార్లు కొడతాడు. ఈయనకు నలభై బస్తాలు పండొచ్చు. కాని నేలతల్లి ఏం కావాలి? తిండి పెట్టే తల్లికి మనం తిరిగి ఏమిస్తున్నాం..? జీర్ణం కాని ఎరువుల్ని తినిపిస్తున్నాం. శరీరాన్ని గుల్ల చేసే పురుగుమందులను తాగిస్తున్నాం. ప్రకృతి నేర్పిన సహజ సేద్యాన్ని వదులుకుని, పాడి పశువులతో కళకళలాడే పల్లెల్ని మరిచిపోయాం.http://makanaka.files.wordpress.com/2010/07/infochange_agenda_issue19_2010jul_cover.jpg
కారణాలు ఏమైనప్పటికీ, రైతులు ఇప్పుడు భూములను నమ్ముకోవడం లేదు. పురుగుమందుల్ని నమ్ముకుంటున్నారు. దానితో భూమి స్వభావం మారిపోయింది. విషాన్ని దిగమింగుతున్న పొలాలు విషతుల్యమైన ఆహారాన్ని ఇవ్వడం అలవాటు చేసుకున్నాయి. ఫలితంగా నయంకాని జబ్బులొస్తున్నాయి. రోగనిరోధక శక్తి పడిపోతోంది. పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటోంది. జన్యుపరమైన సమస్యలొస్తున్నాయి. వాతావరణం కలుషితమైపోతోంది. విశ్వం ఉనికికే చేటు తెస్తున్న గ్లోబల్ వార్మింగ్ పెద్ద భూతమై కూర్చుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటినీ పట్టిపీడిస్తున్న సమస్య- యుగాంతం కాదు, యుద్ధభయం కాదు. భూకంపాలో, తుపాన్లో కాదు.. స్లో పాయిజన్‌లా మనిషిని సర్వనాశనం చేస్తున్న రసాయనిక వ్యవసాయం..!

పూర్వం తొలకరి పడగానే రైతులు పొలాలకు పరిగెత్తేవారు. పేడ ఎరువును పొలాల్లో వేసేవారు. నాగలితో దుక్కి చేసినప్పుడు ఆ ఎరువు అటూ ఇటూ పొర్లుతుంది. భూమి లోపలి కొత్త మట్టి పైకొచ్చి పంటకు బలాన్నిచ్చేది. ఇప్పుడు తొలకరి పడగానే రైతులు పొలాలకు వెళ్లడం లేదు. రసాయన ఎరువుల కోసం పరిగెత్తుతున్నారు. దొరుకుతాయో దొరకవో అన్న ఆత్రంతో పురుగుమందుల్ని ముందే కొని బంగారంలా దాచుకుంటున్నారు. ట్రాక్టర్లతో అటొక్కసారి ఇటొక్కసారి గీతలుపెట్టి విత్తనాలు చల్లేస్తున్నారు. ఒకసారి కలుపుతీస్తే రెండుసార్లు మందు కొడుతున్నారు. పంట ఇంటికొచ్చేలోపు ఎన్నిసార్లు మందులు కొడుతున్నారో లెక్కేలేదు. రసాయనాలతో సేద్యం చేస్తే భూమి పాడైపోతుందని, ఆ తిండి తినే మనుషులకు జబ్బులు చేస్తాయని రైతులకు తెలియని విషయాలు కావు. ప్రభుత్వానికి తెలియని విషయాలూ కావు. అయినా మందులు వేస్తే తప్ప పంటలు పండించడం సాధ్యం కాదన్న ప్రమాదకర స్థాయికి చేరింది మన వ్యవసాయం.

సేంద్రీయ మార్గదర్శకులు..

దీన్ని మార్చడానికి కొద్దిమందే అయినా గట్టి ప్రయత్నం చేసినవాళ్లు కొందరు ఉన్నారు
. వారిలో ప్రముఖుడు జపాన్‌కు చెందిన మసనోబు పుకువోకా. ప్రపంచమంతా రసాయన వ్యవసాయంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు, ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని మరిచిపోయినప్పుడు, ఎరువులు, పురుగుమందుల ఫ్యాక్టరీల సంఖ్యను రెట్టింపు చేసే పనిలో పడినప్పుడు, వాటిమీద ఆధారపడితేనే సిరులు పండుతాయని రైతులను మభ్యపెడుతున్నప్పుడు.. ఇదెంత ప్రమాదకరమో ఆలోచించినవాడు మసనోబు పుకువోకా. ఆయన ఉద్యోగాన్ని వదిలేసి, పల్లెకు తిరిగొచ్చినప్పుడు "పెద్ద చదువులు చదివినోడివి, రాళ్లురప్పలున్న ఈ పల్లెల్లో ఏం చేస్తావ్?''అన్నారు గ్రామస్థులు. అవేమీ పట్టించుకోకుండా మౌనంగా పొలానికెళ్లిపోయారు. 65 ఏళ్లు కిందా మీదా పడ్డాడు. బోలెడన్ని ప్రయోగాలు చేశాడు. సేంద్రీయ వ్యవసాయంతో అద్భుతాలు పండించాడు.

ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోయారంతా..! అదెలా సాధ్యమో చెప్పేందుకుకే ఆఫ్రికా, ఇండియా, యూరప్, అమెరికా దేశాలన్నీ తిరిగాడు. మందులతో పంటలు పండిస్తే.. రేపటితరాలు అనుభవించాల్సిన బాధలు అన్నీఇన్నీ కావన్నాడాయన. పుకువోకా లేవనెత్తిన సందేహాలు ఆధునిక వ్యవసాయ పద్ధ్దతుల్ని పునరాలోచనలో పడేశాయి. ఆయన రాసిన 'వన్ స్ట్రా రెవల్యూషన్' సంచలనం రేపింది. 'గడ్డిపరకతో విప్లవం' పేరుతో తెలుగులోనూ వచ్చిందది. రసాయన సేద్యం పరుగు పందేన్ని నిలదీసిన తొలి పుస్తకం అది.
http://www.savesanghavi.com/images/save.jpg
గుజరాత్-మహారాష్ట్ర సరిహద్దులో 'దెహ్రి' గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌సావే. ఇప్పుడాయనకు తొంభై ఏళ్లు. తనకున్న 14 ఎకరాలకు 'కల్పవృక్ష' అనే పేరు పెట్టాడు. "నా పొలమే నా విశ్వవిద్యాలయం''అంటాడు ఈ పెద్దమనిషి. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను లాక్కురావాలని పూనుకున్నాడీయన. 
http://www.otherindiabookstore.com/coverpics/The%20great%20agricultural%20challenge.jpg
హరితవిప్లవ సృష్టికర్త ఎం.ఎస్.స్వామినాథన్‌తో కూడా ఆ విషయాలను చర్చించేవాడు. ఆ ఉత్తరాలన్నీ కలిపి 'ద గ్రేట్ అగ్రికల్చర్ ఛాలెంజ్' అనే పేరుతో పుస్తకం తీసుకొచ్చాడు. విదేశీయుడైన భరత్‌మిత్రా ఓసారి ఢిల్లీకి వచ్చాడు. అక్కడున్న స్టార్‌హోటళ్లు, ఫ్లైఓవర్‌లు, హై రైజ్ బిల్డింగులు ఆయన్ని ఆకర్షించలేదు. క్యాన్సర్ ఆస్పత్రులు ఆకర్షించాయి. "అభివృద్ధి చెందిన దేశాల్లో నిషేధించిన పురుగుమందులన్నీ ఇండియాకు వస్తున్నాయి. అందుకే ఇక్కడ ఆస్పత్రుల సంఖ్య పెరుగుతోంది'' అని బాధపడ్డాడు భరత్. భారత్‌లో ఉండిపోయి లక్నోలో 'తులసి'తోటను పెంచాడు. ఇదంతా ఆర్గానిక్ ఫార్మింగే. 
http://www.thehindubusinessline.com/multimedia/dynamic/00330/2010043050130401_330733e.jpg
తులసి ఆకులను ప్రాసెస్ చేసి.. తేనీరు, ఆయుర్వేద ఔషధాలను తయారుచేశాడాయన. దేశవ్యాప్తంగా ఆర్గానిక్ తులసికి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఇలా మొదలైన ఆర్గానిక్ ఉద్యమం ఒక వైపు వ్యాపారం, మరో వైపు చైతన్యం దిశగా విస్తరించింది. ఇంతలో కార్పొరేట్ చూపూ దాని మీద పడింది. 
http://www.imagesfood.com/Images/newsimage/24_letter_mantra.jpg
పదివేల మంది సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్స్‌తో మార్కెట్‌లోకి వచ్చింది '24 లెటర్ మంత్ర'. ఇప్పుడది పదకొండు రాష్ట్రాల్లో సేంద్రీయ ఉత్పత్తుల్ని విక్రయిస్తోంది. 
http://www.sresta.com/inside/images/image002.jpg
మన రాష్ట్రంలో 'శ్రేష్ట' కూడా ఆర్గానిక్ వ్యాపారం చేస్తున్నది.http://www.rarindia.org/images/1farming.jpg
సేద్యానికి 'గుర్తింపు'..
ప్రస్తుతం మన రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఆర్గానిక్ సర్టిఫైడ్ రైతులున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్గొండ, చిత్తూరు, కడప, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతులు సేద్యంలో కొత్త అనుభవం పొందుతున్నారు. "ఒక ఆవు రెండు లీటర్లే పాలిస్తుందనుకోండి. అత్యాశకు పోయి నాలుగు లీటర్లు కావాలనుకుంటే పాలకు బదులు రక్తమొస్తుంది. భూమి కూడా అంతే. ఎంత పంటనివ్వాలో అంతే ఇస్తుంది. బలవంతంగా పిండుకోవాలని చూస్తే ఏదో ఒక రోజు అసలు పండే స్వభావాన్నే కోల్పోతుంది..'' అంటాడు ప.గోదావరి జిల్లా నాచుగుంటకు చెందిన 'సర్టిఫైడ్' రైతు భూపతిరాజు రామకృష్ణరాజు.

అయిదేళ్ల నుంచి సేంద్రీయ సాగు చేస్తున్న రాజు.. 'స్వర్ణ', 'పిఎల్1100', 'సాంబమసూరి' రకం ధాన్యాలను పండిస్తున్నాడు. మామూలు సాగులో ఎకరానికి 30 నుంచి 35 బస్తాలొస్తాయి.సేంద్రీయసాగులో 29 బస్తాలొస్తున్నాయి. ఆ లోటు పూడ్చుకునేందుకు.. మార్కెట్‌రేటు కంటే కాస్త ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు చెప్పారు. "ఒక్కసారి నా బియ్యాన్ని వండుకు తిన్నవారు జీవితంలో మానెయ్యలేరు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. నాకిప్పుడు 40 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. నూర్పిళ్లు అవుతూనే ఫోన్లు చేస్తారు...'' అంటూ గర్వంగా చెబుతారు రాజు.

ఆర్గానిక్ బియ్యానికే కాదు. సేంద్రీయ అల్లానికి కూడా చాలా గిరాకీ ఉంది. మెదక్ జిల్లా పీచార్యగుడికి చెందిన శ్యామ్‌సన్‌కు నాలుగెకరాల ఎర్రమాగాణి ఉంది. చేనులోనే ముప్పై గజాల లోతు బావి తవ్వాడు. అరకొర నీళ్లతోనే సేంద్రీయ సేద్యం మొదలుపెట్టాడు. "నేనిప్పుడు కేరళ మారన్ వెరైటీ అల్లం వేశాను. ఎకరాకు 40 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వసాయంతో పొలంలోనే వర్మీ కంపోస్టు షెడ్డు కట్టాను. సేంద్రీయ ఎరువుల్ని మేమే తయారు చేసుకుంటాం. మందులు పోసి పంట పండిస్తే మంచిగ పైసలొస్తయి కాని, తినే వాళ్ల ఆరోగ్యం చెడిపోతుంది కదా''అంటాడు శ్యామ్‌సన్. ఆ చుట్టుపక్కల ఊళ్లలో ఈయనొక్కడే సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్. అనంతపురం జిల్లాలో రైతు ల ఆత్మహత్యలకు కరువొక్కటే కారణం కాదు.

అందరి ఇళ్లలో పురుగుమందుల డబ్బాలుండం కూడా ఒక కారణమే..! నీళ్లు లేకపోయినా ఒట్టి మందులు చల్లి వేరుసెనగను పండిస్తారు ఈ జిల్లా రైతులు. ఎలక్ట్రానిక్స్‌లో డిప్లమో చేసిన ప్రహ్లాదరెడ్డికి ఈ బాధలన్నీ తెలుసు. అయినా సరే, మందు కొట్టకుండా వేరుసెనగ పండించి తీరాలనుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి దగ్గర్లోని బొందలదిన్నె అతని సొంతూరు. ఉద్యోగం వద్దనుకుని సేద్యంలోకి దిగాడు. తన అయిదు ఎకరాల పొలం పక్కనే ఉన్న పెన్నానదిలో బోరు వేశాడు. నాలుగించులు నీళ్లు పడ్డాయి. "మాది ఉమ్మడి కుటుంబం. అందరం కలిసి పనిచేస్తాం. సేంద్రీయ ఎరువుల కోసం పది గేదెలు, ఎద్దుల్ని మేపుతున్నాం. ఆర్గానిక్ అగ్రికల్చర్ కోసం 'సహజకృష్ణ రైతు సంఘం' ఏర్పాటు చేశాం. రసాయనాల జోలికే వెళ్లం. వరి, వేరుసెనగ, కంది పంటలు వేస్తాం. ఈ మధ్యనే మా పంటల్ని కొనేందుకు ఓ ఆర్గానిక్ ఉత్పత్తుల సంస్థ సంప్రదించింది. ఇది సేంద్రీయ సేద్యం వల్లనే సాధ్యమైంది..''అంటున్నాడు ప్రహ్లాదరెడ్డి.

వేపాకు ఉడకబెట్టి రసం తీసి.. పంటకు చల్లే తిమ్మయ్యను చూస్తే తోటి రైతులకు నవ్వొస్తుంది. "ఇంత పవరున్న మందులు చల్లుతుంటేనే పురుగు చావటం లేదు. నీ వేపాకు రసానికి చచ్చిపోతుందా?'' అని వెక్కిరిస్తారు. చిత్తూరు జిల్లా పచ్చారోళ్లపల్లికి చెందిన తిమ్మయ్య ఇప్పుడు సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతు. మూడేళ్లు కష్టపడితే కాని ఈ సర్టిఫికెట్టు రాలేదు. మూడెకరాల్లో వేరుసెనగ, ఎకరంలో చెరకు వేశాడు. సేంద్రీయంతోనే రుచికరమైన కందిపప్పు పండించి.. కిలో రూ.75కు అమ్ముతున్నాడు. ఇదే కందిపప్పు బయట మార్కెట్‌లో రూ.200 పెడితే కాని దొరకదు. కొండప్రాంతాల్లో వ్యవసాయం చేయడమంటే చాలా కష్టం. వచ్చే దిగుబడీ తక్కువ. అయినా సరే అత్యాశకు పోలేదు సుక్రు గైరమ్మ. విజయనగరం జిల్లా అడ్డతీగ గిరిజన గూడేనికి చెందిన ఈ మహిళా రైతు సేంద్రీయ సేద్యాన్ని ఇష్టపడింది. వరి, రాగులు, జొన్న, సామలు, కొర్రలు పండిస్తోంది.

పంట ఉత్పత్తులను విజయనగరం తీసుకురావాలంటే పడవలో గోస్తనీ నదిని దాటాలి. "సేంద్రీయ సేద్యంలో రైతు కు ఖర్చు తక్కువ. సమాజానికి లాభం ఎక్కువ. నేను చేస్తున్నది మంచి పనేగా'' అంటుందామె. చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ క్షేత్రంలోనూ సేంద్రీయ పంటల్ని పండిస్తున్నారు. పాతిక ఎకరాల్లో ఆర్గానిక్ కూరగాయాల్ని పండిస్తున్నారు. సేంద్రీయ రైతుల్ని ప్రభుత్వమే కాదు, స్వచ్ఛందసంస్థలూ ప్రోత్సాహిస్తున్నాయి. సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, డక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ, టింబక్టూ ఆర్గానిక్, ఆర్‌డీటీ, వికాస, చేతన, ఉర్వి.. ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం పనిచేస్తున్న సంస్థలు. సాధారణ సేద్యంతో పోల్చితే, సేంద్రీయ సేద్యం పరిధి చాలా తక్కువే కాని భవిష్యత్తు మీద ఆశ కలిగించే సేద్యం ఇదే.

మధ్యవర్తిగా ప్రభుత్వం

రాష్ట్రంలో ఆర్గానిక్ సేద్యం కింద వరి, రాజ్మా, కంది, తృణధాన్యాలు, కూరగాయలు సాగవుతున్నాయి. వీటిని తక్కువ ధరకే వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఈ మధ్యనే బయ్యర్స్-సెల్లర్స్ మీట్ పెట్టాం. ఇక్కడికి 20 కంపెనీలొచ్చాయి. సేంద్రీయ రైతుల వివరాలను తీసుకున్నాయవి. మొన్న హైదరాబాద్‌లో జరిగిన హార్టీకల్చర్ ఎక్స్‌పోలో కూడా స్టాల్స్ పెట్టుకునేందుకు రైతులకు అవకాశం ఇచ్చాం. వాళ్లు ఇక్కడికి రావడానికి రవాణా, ఫుడ్‌ప్యాకింగ్ సదుపాయాలను కల్పించాం. సాధారణంగా ఆర్గానిక్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేయాలంటే ఒక్కో రైతుకు రూ.15 వేలు ఖర్చు అవుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటికి అయిదు లక్షలు చెల్లించాం.
http://www.aggarwaloverseas.com/BookImages/DetailPageImages/66484.jpg

- మద్దిలేటి, అసిస్టెంట్ డైరెక్టర్,
సేంద్రీయ విభాగం, వ్యవసాయశాఖ

No comments:

Gouthamaraju as WUA