పాడి పంటలు

Monday, May 16, 2011

రైతు హైకూ * గ్రంథపు చెక్క

 
నేల ప్రసవించి
మొలకలు పులకలు
ముంగారు పైరు

విరగ గాచిన

గంపలు గంపలు
రైతు కలలు


 





 సంతల నిండా
ఆశపడిన కళ్లు
రైతు శ్రమలు

అమ్ముడు పోదు

యింటికీ చేరదు
రైతు కష్టం



శ్రమ ఫలాలు
చెల్లని చిల్లిగవ్వలు
ఉక్రోషం పాలు

రైతు బతుకు
పంటలో తాలు
దిబ్బలపాలు


- జి. వెంకట కృష్ణ
(‘కొన్ని రంగులు ఒక పద్యం’ నుంచి)

Saturday, May 7, 2011

రైతుకు అరటి మాధుర్యం అందాలంటే...

అరటి పండు ఒక మధుర ఫలం. కానీ ఆ మాధుర్యం రైతుకు అందుతోందా?... లేదనే చెబుతున్నారు చాలా మంది రైతులు. దీనికి కారణాలు అనేకం. గెల దశలో రైతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు సైతం మార్కెటింగ్ సమయంలో పెద్ద నష్టాల్నే కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరటి చెట్లలో గెల వేసినప్పటి నుండి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అరటి పిలకలు నాటిన తర్వాత సుమారు తొమ్మిది నెలలకు గెలలు వేస్తాయి. ఆ తర్వాత రెండు నుండి మూడు నెలలకు కోతకు వస్తాయి. ఈ మూడు నెలల కాలంలో చెట్లను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కో చెట్టుకు 20-30 కిలోల బరువుండే ఒక్కో గెలే వస్తుంది. బరువు కారణంగా గెల ఉన్న వైపుకే చెట్టు వాలి ఉంటుంది. ఇలాంటి చెట్లు చిన్నపాటి గాలులు వీచినా నేలకు ఒరుగుతాయి. నేలకొరిగిన చెట్లకు ఉన్న గెలలు పక్వానికి రావు. వీటిని మార్కెట్‌లో అమ్మడం కష్టం. అంటే నేల మీదకు ఎన్ని చెట్లు ఒరిగిపోతే రైతు అన్ని గెలలు నష్టపోయినట్లే. చెట్టు వాలుతున్నట్లు గమనించగానే వెంటనే పోట్లు (సపోర్టు కర్రలు) పెడితే నష్టాన్ని నివారించొచ్చు. వీటిని గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో పెట్టాలి. ఆ పోట్లు గెలకు తాకకుండా వాలుగా ఉండాలి. లేకుంటే కాయలకు రాపిడి జరిగి మచ్చలు ఏర్పడతాయి. అలాంటి కాయల్ని కొనడానికి ఎవరూ ఇష్టపడరు.

మార్కెట్ అవసరాల మేరకు...

అరటి కాయలు పిందె దశలో ఉన్నప్పుడు పచ్చాలుగా (నాలుగు పక్షాలుగా లేదా పలకలుగా) ఉంటాయి. పిందెలు లావు పెరుగుతున్న కొద్దీ పచ్చాలు తగ్గుతూ వస్తాయి. పూర్తిగా పక్వానికి వచ్చిన అరటి కాయలు గుండ్రంగా తయారై బాగా బలిష్టంగా ఉంటాయి. ఈ దశ దాటితే కాయలు చిట్లిపోతాయి. అందువల్ల మార్కెట్ అవసరాన్ని బట్టి గెలల్ని వివిధ దశల్లో కోయాల్సి ఉంటుంది. ఢిల్లీ లాంటి దూర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికైతే 80 శాతం పక్వానికి రాగానే గెలల్ని కోయాలి.

పూర్తిగా పక్వానికి వచ్చిన గెలల్ని సుదూర ప్రాంతానికి ఎగుమతి చేస్తే అవి మధ్యలోనే పూర్తిగా పండిపోతాయి. స్థానిక మార్కెట్లకు సరఫరా చేసేట్లయితే పూర్తిగా పక్వానికి వచ్చిన గెలల్ని మాత్రమే కోయాలి. ఎందుకంటే ఈ గెలలు 80 శాతం పక్వానికి వచ్చిన గెలల కంటే అయిదారు కిలోలు ఎక్కువ బరువు తూగుతాయి. సాధారణంగా మనం నాటే అరటి రకాన్ని బట్టి గెల వేసిన 75-100 రోజుల్లో కోతకు వస్తుంది. అంతకంటే ముందే గెలల్ని కోసినట్లయితే బరువు తక్కువ తూగి రైతుకు నష్టం జరుగుతుంది. అలాగని ఎక్కువ రోజులు ఉంచితే కాయలు చిట్లిపోవడం, మాగిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, గెలల పక్వ దశల్ని దృష్టిలో ఉంచుకుని కోయాలి.


ఎలా కోయాలి?

అరటి గెలల్ని కోయడానికి రైతులు కొడవళ్లను వాడుతుంటారు. ఇవి చిన్నవిగా ఉండి, ఎక్కువ వంపు తిరిగి ఉండడం వల్ల గెలను కోసేటప్పుడు కాయలకు గాట్లు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల గెలల్ని కోయడానికి పొడవైన, చివరలో కొద్దిగా వంపు తిరిగిన ప్రత్యేకమైన కత్తులు వాడాలి. వీటిని ఉపయోగించడం చాలా సులభం. గెలలు కూడా దెబ్బతినవు. గెలల్ని కోసే కొడవళ్లు తుప్పు పట్టకుండా చూసుకోవాలి. తుప్పు పట్టిన కొడవళ్లతో కోసినట్లయితే గెలలకు శిలీంధ్రాలు ఆశించి త్వరగా పాడైపోతాయి. శిలీంధ్రాలు ఆశించిన గెలల్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించరు.

గెలలు కోసేటప్పుడు ఆరు నుండి తొమ్మిది అంగుళాల మేరకు కాడ ఉంచాలి. గెలలు ఎక్కువ బరువు ఉంటాయి కాబట్టి వాటిని కింద పడకుండా... అంటే ఒక వ్యక్తి పట్టుకుని ఉంటే మరో వ్యక్తి జాగ్రత్తగా కోయాలి. పొరపాటున గెల కింద పడితే కాయలన్నీ పగిలి పోతాయి. కాబట్టి అనుభవజ్ఞులైన వారితో కోయించాలి. సాధారణంగా చెట్టు నుండి గెలల్ని కోయగానే నేల మీద పెడుతుంటారు. అలా చేస్తే కింద ఉన్న మట్టి, పుల్లలు వంటివి అంటుకొని కాయలకు జీరలు పడి నునుపుదనం కోల్పోతాయి. గెలను కోసే ముందే అరటి ఆకు లేదా గోనె సంచి పరిచి దానిపై గెలని పెట్టాలి. కోసిన గెలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండలో ఉంచకూడదు. అలా చేస్తే కాయల లోపల ఉష్ణోగ్రత పెరిగి తొందరగా మెత్తబడతాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందువల్ల గెలల్ని చెట్టు నీడన లేదా కొట్టంలో ఉంచాలి.


కోసిన గెలల్ని ఒక దాని పైన మరో దాన్ని ఉంచకుండా విడివిడిగానే ఉంచాలి. ఒక దాని పైన మరొక గెల ఉంచితే అడుగు భాగంలో నేలకు ఆనుకుని ఉన్న కాయలు పై బరువు కారణంగా దెబ్బ తింటాయి. గెలను కోసిన తర్వాత కాడ నుండి స్రవించే ద్రవం కాయల పైన పడకుండా చూడాలి. ఈ ద్రవం కాయల మీద పడితే ఎండిపోయిన తర్వాత బంక లాగా నల్లటి చారలు ఏర్పడతాయి. అవి చూడడానికి అసహ్యంగా కన్పిస్తాయి. అందుకే ద్రవం పూర్తిగా కారిన తర్వాతే గెలల్ని రవాణా చేయాలి. కోసిన గెలల్ని తోట నుండి బయటికి తరలించేటప్పుడు ఇంకా కోయని చెట్లకు ఉన్న గెలల్ని తాకకుండా చూడాలి. తాకితే వాటి సహజ పాలిషింగ్ పోయే అవకాశముంది.


పాలిషింగ్ పోయిన భాగాల్లో మాగిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడతాయి. గెలల్ని మార్కెట్‌కు తరలించేటప్పుడు వాటికి ఆకులు చుట్టి రవాణా చేయాలి. దీనివల్ల కాయలపై ఒత్తిడి తగ్గుతుంది. రవాణాలో జరిగే నష్టాన్ని నివారించవచ్చు. గెలల్ని కాకుండా కాయల్ని హస్తాలుగా విడదీసి శుద్ధి చేసి పెట్టెల్లో పెట్టి రవాణా చేయడం మంచిది. పెట్టెల్లో రవాణా చేసిన అరటి కాయల్ని ‘ఏసీ’ల్లో మాగపెట్టడం సులభం. ప్రస్తుతం అరటి కాయల్ని ఏసీలో మగ్గపెట్టడానికి కిలోకు 1.40 రూపాయలు ఖర్చవుతుంది. ఒక్కో హస్తానికి 12-15 కాయలు ఉండే విధంగా గెల నుండి కాయల్ని కోసి వేరు చేయాలి. వేరు చేసిన హస్తాల్ని నీటిలో శుభ్రపరచాలి. దీనివల్ల కాయలకు అంటిన దుమ్మూ ధూళి పోయి శుభ్రంగా, ఆకర్షణీయంగా కన్పిస్తాయి. శుభ్రపరచడానికి వాడే నీటిలో లీటరుకు 0.5 గ్రాముల చొప్పున బావిస్టిన్ కలిపితే కాయల్ని శిలీంధ్రాలు ఆశించవు. ఈ సూచనలన్నీ పాటిస్తే రైతులు అరటి సాగులోని మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. అరటి సాగులో నా అనుభవాలనే ఇక్కడ పొందుపరిచాను.


- ఎం.వి.రమేష్ కుమార్ రెడ్డి

Monday, May 2, 2011

రైతు డ్వాక్రాలే వ్యవ'సాయమ'వుతాయి

నానాటికీ పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, తగ్గుతున్న పంట ధరలు రైతన్నలను అప్పులపాలు చేసి ఆత్మహత్యల వైపు నెట్టడం చాలదన్నట్టు వ్యవసాయ రంగానికి మరో కొత్త సమస్య వచ్చిపడింది. పొలాల్లో పని చేయడానికి కూలీలు దొరకకపోవడమే ఆ సమస్య. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్లే కూలీలు దొరక్కుండా పోతున్నారని, ఆ పథకాన్ని తీసేస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు. కాని నిజానికి ఎప్పుడో రావాల్సిన పథకం అది.

స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్లకు గాని అది అమలుకు నోచుకోలేదు. ఆ పథకంతో వ్యవసాయ కూలీలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే కూలీ రేట్లు పెరిగినా ఆర్థికమాంద్యం, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు ఆ పెరిగిన కూలీ రేట్లను తినేస్తున్నాయి. అందుకే ఈ సమస్యని లోతుగా పరిశీలించి, వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయట పడేసే సరైన పరిష్కార మార్గాల కోసం మనందరం కృషి చేయాలి.


గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడడానికి భారీ సంఖ్యలో కూలీలు పల్లెల్నుంచి పట్టణాలకి, నగరాలకి వలస పోవడం మొదటి కారణం. ఉపాధి హామీ పథకం పుణ్యమా అని కూలి రేట్లు పెరిగి కూలీలు వారానికి ఏడు రోజులూ చాకిరి చేయాల్సిన అవసరం లేకుండా పోవడం రెండో కారణం. ఈ పథకం వచ్చాక చాలామంది కూలీలు వారానికి మూడు, నాలుగు రోజులు పని చేసి మిగతా రోజుల్లో సొంత పనులు చేసుకుంటున్నారు. పైగా వాళ్లిచ్చే కూలి రేట్ల వల్ల రైతు కూలీల సామాజిక స్థాయి గతంతో పోలిస్తే కాస్త మెరుగైంది. ఫలితంగా ఒకప్పుడు కూలీలకి రైతుల పట్ల ఉన్న 'విధేయత' తగ్గింది. కొన్ని రకాల పనులు చేయడానికి కూలీలు అసలు ఇష్టపడడం లేదు, పైగా పని విషయంలో కూలీలదే పై మాట అవుతోంది. ఇదివరకట్లా కూలీలు సమయానికి రావట్లేదు.

(చాలా ప్రాంతాల్లో రైతులే కూలీలను ట్రాక్టర్లు, ఆటోలలో పొలాలకు తరలించి పని పూర్తయ్యాక మళ్లీ వాళ్లని ఇళ్లకి చేర్చాల్సి వస్తోంది). కూలి డబ్బుల కోసం వేచి చూసే ఓపిక పోయింది. పని పూర్తయిన వెంటనే కావాలంటున్నారు. ఇలాంటివే మరెన్నో కారణాలు. ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి జరగడం మూలంగా అది కూలీల పని విధానాన్ని, నీతిగా పని చేసే అలవాటుని దెబ్బతీసింది. ఆ ప్రభావం వాళ్లు రైతుల వద్ద చేసే పని మీద కూడా పడింది. అందుకే ఇప్పుడు కూలీలు ఐదారు గంటలే పని చేసి ఎనిమిది గంటల పనికిచ్చే కూలిని ఆశిస్తున్నారు. వీటన్నిటి వల్ల ఇప్పుడు రైతులు, కూలీల మధ్య సంబంధాలు చెడిపోయాయి.
అసలీ పరిస్థితి ఎలా వచ్చింది? ఆంధ్రప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే- ప్రభుత్వ విధానాలు, పథకాలు, మెరుగైన విద్య, నగరాల్లో ఆర్థికాభివృద్ధి, దళితులలో ప్రశ్నించే నైజం పెరగడం.. వీటన్నిటి వల్లే.

1. ప్రభుత్వ విధానాలు, పథకాలు :


అ: ఎన్‌టిఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం 1980ల నుంచి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. కేంద్రప్రభుత్వ 'ఆహార భద్రత బిల్లు'తో దీనికి ఇంకా బలం చేకూరింది.
ఆ: జీవితంలో ఏనాడూ బ్యాంకు గడప తొక్కుతామని అనుకోని పేద మహిళలు డ్వాక్రా కారణంగా నేడు పైసాపైసా కూడబెట్టుకుని వాటిని బ్యాం కుల్లో దాచుకుంటున్నారు. బ్యాంకులిచ్చే రుణంతో కాస్తో కూస్తో పొలం కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం, పచ్చళ్ల తయారీ, గేదెలు మేపుకోవడం లాంటి చిరు వ్యాపారాలకి కావాల్సిన మూలధనాన్ని సమకూర్చుకుంటున్నారు.
ఇ: ఉపాధి హామీ పథకం వలన మెరుగైన కూలి పొందగలుగుతున్నారు. అన్నిటి కన్నా ముఖ్యంగా ఈ పథకం సాధించిన విజయం ఏమిటంటే.. గ్రామాల్లో అన్ని పనులకూ కూలి రేట్లు పెరిగాయి. గతంలో కూలి రేట్లను రైతులు నిర్ణయించేవారు, అలాంటిది ఇప్పుడు వాళ్ల చేత పని చేయించుకోవాలంటే కూలి రేట్లు పెంచక తప్పదని వాళ్లు గ్రహించారు.

2. మన దేశం సాధించిన ఆర్థిక పురోగతి ఫలితంగా విద్యావకాశాలు పెరిగాయి. విద్యపై అవగాహన, ఆసక్తి రెండూ పెరిగాయి. పట్టణాలు, నగరాలలో మెరుగైన ఆదాయ అవకాశాల కోసం జనం భారీగా తరలిపోతున్నారు. పేదరికం వల్ల నగరాలకు వెళ్తున్న కూలీల వలసలను ఉపాధి హామీ పథకం ఆపగలిగినా మెరుగైన అవకాశాల కోసం గ్రామాల్ని విడిచి వెళ్లడం మాత్రం కొనసాగుతూనే ఉంది. దీని వల్ల గ్రామాల్లో పని చేసే వారి సంఖ్య తగ్గింది. చదువుకున్న యువత విషయంలో ఇది మరీ నిజం. కూలి విషయం అటుంచితే తమ సొంత పొలంలో కూడా పని చేయడానికి ముందుకు రావట్లేదు వాళ్లు. స్కూలుతోనే చదువుకి ఫుల్‌స్టాప్ పెట్టిన కుర్రకారు కూడా పొలం పని బదులు పట్నం వెళ్లి ఏదో ఒక పని చేసుకుందాం అనుకుంటున్నారు. పట్నాల్లో పని దొరుకుతుందా లేదా, దొరికినా తగిన కూలి వస్తుందా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా అందరూ పట్నం వైపే చూస్తున్నారు.

3. సామాజిక ఉద్యమాల ప్రభావం వల్ల, రాజకీయ అవగాహన పెరగడం వల్ల, ప్రజాస్వామిక కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం వల్ల అట్టడుగు కులాల్లో ఆత్మగౌరవం పెరిగింది. అగ్రకులాలతో తామూ సమానమే అన్న భావన వారిలో వచ్చేసింది.
వీటన్నిటి మూలంగానే పైన పేర్కొన్న పరిస్థితి ఏర్పడింది. దీన్ని అధిగమించడానికి రైతులందరూ తమకు తోచిన పద్ధతిలో ప్రయత్నిస్తున్నారు. వీటన్నిటిలో ముఖ్యమైన పరిష్కారమార్గం కూలీలు పెద్దగా అవసరం లేని చెట్ల తోటల పెంపకం వైపు మొగ్గు చూపుతూ ఆహార పంటల సాగును వదిలేస్తున్నారు. కూలీలకు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. విత్తనాలను నాటే యంత్రం(డ్రమ్ సీడర్), కలుపు యంత్రం, నూర్పిడి యంత్రం, పాలు పితికే యంత్రం.. ఇలా ఎన్నో యంత్రాలను సమకూర్చుకుంటున్నారు.

వ్యవసాయం చెయ్యాల్సింది మనుషులా యంత్రాలా?

యంత్రాలు అన్ని పొలం పనులూ చెయ్యలేవు. మనకే కాదు పశ్చిమ దేశాల్లో కూడా అటువంటివి లేవు. ఒక వేళ ఉన్నా సరే వ్యవసాయానికి మనుషులు అవసరమే కాని వారు వ్యవసాయానికి భారమైతే కారు. పొలం పనికి మానవ శక్తి, శ్రమ, పరిశీలన తప్పనిసరి.

ఈ మాట ఎందుకు అనాల్సొస్తోందంటే...


వ్యవసాయం అంటేనే మానవులు మాత్రమే చేయగలిగిన పని. మన చుట్టూ ఉన్న అనేక రకాలయిన చెట్లు, మొక్కలు, అడవుల నుంచి మనకు అవసరమైన వాటిని ఎంపిక చేసుకుని వాటిని పెంచే క్రమంలోనే వ్యవసాయం వృద్ధి చెందింది. వాటి వాటి లక్షణాలను బట్టి, మన అవసరాన్ని బట్టి వాటిని పెంచుకుంటూ వచ్చాం. శతాబ్దాల కాలంలో వాటిలో నుంచి కొన్నిటిని ఎంపిక చేసి వాటిని పండిస్తున్నాం. అలా ఇప్పుడు ఎన్నో రకాల పంటలు, మరెన్నో వెరైటీలను సృష్టించగలిగాము.

తగిన వనరులుంటే రైతులు ఇప్పటికీ కొత్త కొత్త పంటలు పండించడానికి, వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపుతారని నా సొంత అనుభవంతోటి చెబుతున్నాను. ప్రతి పైరు, ప్రతి సీజన్, ప్రతి సంవత్సరం రైతుకు ఒక సవాలు, ఒక అనుభవమే. ఈ ఆటలో రైతు ఎంత అప్రమత్తంగా ఉంటే ఫలితాలు అంత బాగా వస్తాయి. అందుకే పెద్ద పెద్ద కమతాల కంటే తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తేనే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలొస్తాయి. మానవ పరిశ్రమ ఉన్నప్పుడే పంటల్లో వైవిధ్యం, నాణ్యత పెరుగుతాయి.

అక్కడ కంపెనీల చేతులోకి...


ప్రకృతితో మనిషి ఆడే ఈ ఆటలో ఈ మధ్య శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, అగ్రిబిజినెస్ వ్యాపారులూ ప్రవేశించారు. చూడబోతే హఠాత్తుగా వాళ్లు వ్యవసాయాన్ని హైజాక్ చేసినట్లనిపిస్తోంది. అమెరికా, యూరప్‌లలో కూడా ఇదే జరిగింది. రైతుని పొలాల నుంచి బయటకి నెట్టేసి పెద్ద పెద్ద యంత్రాలు, రసాయన ఎరువులు, పురుగు మందుల సాయంతో వ్యాపారులు యాభై అరవై ఏళ్ల నుంచి వ్యవసాయ సామ్రాజ్యాల్ని నిర్మించారు. అందుకే ఆ దేశాల్లో ఇప్పుడు 2 నుంచి 3 శాతం జనాభా మాత్రమే రైతులు. అదే మన దేశంలో 60 శాతం దాకా వ్యవసాయంపై ఆధారపడి బతికే వారే. వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరిగి, కార్పొరేట్ సాగు మొదలైతే మన దేశ రైతులు కూడా పొలాల్లో నుంచి గెంటేయబడతారు. వారికి జీవనోపాధే కరువవుతుంది. పశ్చిమ దేశాల్లో అదే జరిగింది. ఆ దేశాలన్నీ తమ తప్పును ఇప్పుడు తెలుసుకుంటున్నాయి. కనుమరుగైన రైతులను మళ్లీ వ్యవసాయంలోకి తీసుకురావాలనుకుంటున్నాయి. ఎందుకో తెలుసా?

పారిశ్రామిక వ్యవసాయం వల్ల సాగులో వైవిధ్యం తగ్గిపోయి ఎన్నో పంటలు అంతరించి పోయాయి. అమెరికానే ఉదాహరణగా తీసుకుంటే ఆ దేశంలో ఒకప్పుడు యాభై రకాల యాపిల్స్ పండించే వారు. కాని ఇప్పుడు కేవలం నాలుగైదు రకాలు మాత్రమే మిగిలాయి. ముందు చెప్పుకున్నట్టు మన దేశంలో రెండు వేల రకాల వంకాయలు పండుతాయి. ఏదయినా ఒక ప్రాంతం నుంచి ఓ వంద కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్పకుండా కొత్త వెరైటీ వంకాయల్ని చూడొచ్చు. అదే పరిశ్రమలు వ్యవసాయం చేస్తే, వందల ఎకరాల్లో ఒకే ఒక వెరైటీని పండిస్తారు. అలా చేయడం వల్ల కొంత కాలానికి మిగతా వెరైటీలన్నీ ఈ భూమి మీద నుంచి అంతరించి పోతాయి. అందుకే వ్యవసాయంలో రైతు ప్రమేయం ఉండాలి. కాని పారిశ్రామిక వ్యవసాయం వస్తే రైతుల చేతి నుంచి పొలాలు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతాయి కాబట్టి ఆ వ్యవసాయంలో రైతు ప్రమేయం అసాధ్యం.

రైతులు, కూలీలు వ్యవసాయంవదిలి పోకుండా ఉండాలంటే ఏం చేయాలన్నదే నేటి సమస్య. వ్యవసాయం చిన్న సన్నకారు రైతుల చేతుల్లోనే ఉండేలా మన వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. వాళ్లు వ్యవసాయంలో కొనసాగడాన్ని అసాధ్యం చేయకుండా చూసుకోవాలి.

పరస్పర సహకారం అవసరం


వ్యవసాయాన్ని రైతులు, కూలీలే చేయాలని, యంత్రాలు, రసాయనాలు కాదు అని గనక మనం అనుకున్నట్లయితే క్షేత్ర స్థాయిలో రైతులు, కూలీల మధ్య పరస్పర సహకారం అవసరం. పొలం పని కొన్ని సీజన్‌లలో ఎక్కువగా ఉంటుంది. నాట్లు, కలుపులు, కోతలు, నూర్పిళ్లు లాంటి సమయాల్లో ఎక్కువమంది కూలీలు అవసరమవుతారు. మామూలుగా కూలీల అవసరం లేకుండా తమ పొలం పని తామే చేసుకునే చిన్నకారు రైతులకు కూడా ఆ సమయాల్లో కూలీల అవసరమవుతారు. కొన్ని పనుల్లో యంత్రాలు, రసాయనాలు కొంతవరకు ఉపకరించినా రైతులకు, కూలీలకు మధ్య పరస్పర సహకారం ఉన్నప్పుడే పనులు సాఫీగా అవుతాయి. ఆ కూలీలు తోటి రైతులు కావచ్చు, లేదా భూమి లేని వ్యవసాయ కూలీలు కావచ్చు. ఇద్దరి మధ్య సహకారం ఉండి పని సక్రమంగా చేసినపుడే మంచి దిగుబడి సాధ్యమవుతుంది.

వ్యవసాయంలో ఉత్పత్తి సంబంధాలను పునస్సమీక్షించి, పునర్నిర్వచించడం నేటి తక్షణ అవసరం. ఎందుకంటే ఇదివరకట్లా వ్యవసాయం చేయడం ఈ రోజుల్లో సాధ్యం కాదు. గతంలో సాగు భూమి ఎక్కువగా అగ్రకులాలకు చెందిన కొందరు భూస్వాముల చేతుల్లోనే ఉండేది. వారి దగ్గరి నుంచి పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసే వాళ్లంతా కింది కులాల వాళ్లే ఉండేవారు. దళితుల్లో దాదాపు అందరూ భూమి లేని కూలీలే కాబట్టి వారి చేత భూస్వాములు, కౌలు రైతులు పని చేయించుకుని చాలీ చాలని కూలి మాత్రమే ఇచ్చేవారు.

రైతులు అప్పుల పాలయ్యారు


ఇప్పుడు కాలం మారిపోయింది. రకరకాల చట్టాలొచ్చాయి. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయక పోయినా ఆ చట్టాల వల్ల ఎంతో కొంత ప్రయోజనమైతే చేకూరింది. వాటితో పాటు పైన పేర్కొన్న పథకాలు కూలీల స్థితిగతుల్లో చెప్పుకోతగ్గ మార్పులే తేగలిగాయి. దళితులు కూడా ఎంతో కొంత భూమిని సంపాదించుకోగలిగారిప్పుడు. ఉపాధి హామీ పథకం వల్ల కూలి రేట్లు పెరిగాయి. కాని అదే సమయంలో రైతుల ఆర్థిక స్థితి క్షీణించింది. వ్యవసాయ ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. వీటన్నిటి ప్రభావమే రైతులను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తోంది. రైతులకు ఇదివరకెప్పుడూ ఇంతటి గడ్డుకాలం ఎదురు కాలేదు.

దళిత రైతులతో పాటు చిన్న రైతులందరూ కష్టాల ఊబిలో కూరుకుపోయి వ్యవసాయాన్ని కొనసాగించే పరిస్థితుల్లో లేరు. అయితే ఏమిటి అంటారా? ముందు చెప్పుకున్నట్లుగా రైతులు గనక సాగు చేయలేకపోతే యంత్రాలు, పెద్దపెద్ద కంపెనీలు రంగ ప్రవేశం చేస్తాయి. పశ్చిమ దేశాల్లో జరిగిందే ఇక్కడా జరుగుతుంది. తామే వేసుకున్న ఏ పీటముడుల నుంచయితే పశ్చిమ దేశాలు బయట పడడానికి ప్రయత్నిస్తున్నాయో ఆ ముడుల్నే మనం వేసుకున్న వాళ్లమవుతాం. అంతే కాదు, వ్యవసాయంపై ఆధారపడిన కోట్ల మంది జనాభాకి నగరాలు పని కల్పించ లేవు. వ్యవసాయ ఆధార ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించి అది నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టాలి తప్ప మనకు మరో మార్గం లేదు.

కమీషన్లు కంటితుడుపుకే...


రైతులకు లాభాలను పెంచే దిశగా ఎన్నో సిఫార్సులు ముందుకొచ్చాయి. జాతీయ రైతు సంక్షేమ కమిషన్, ఆంధ్రప్రదేశ్ రైతు సంక్షేమ కమిషన్ వీటిలో ముఖ్యమైనవి. రైతు సంఘాలు, పౌర సంఘాలు మెరుగైన పథకాల కోసం ఉద్యమిస్తూనే ఉన్నాయి. దిగుబడులకు కనీస మద్దతు ధర పెంచాలని, నష్ట పరిహారం చెల్లించాలని, రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని వాళ్లు కోరుతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమకు తోచినపుడు ఏవో కొన్ని డిమాండ్లపైనే స్పందిస్తున్నాయి. ఇదంతా గమనిస్తుంటే వ్యవసాయం రైతుల చేతుల్లో కన్నా కంపెనీల చేతుల్లోకి వెళ్తేనే మంచిదని ప్రభుత్వాలు భావిస్త్తున్నాయేమో అనే సందేహం కలుగుతుంది.

మిగతా రంగాల్లో మాదిరిగానే వ్యవసాయంలోకి కూడా కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. 'దున్నే వాడిదే భూమి' అనే నినాదాన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు 'దున్నే స్తోమత (సాగుకి మూల ధనం) ఉన్న వాడిదే భూమి'గా మార్చేశాయి. రైతులకు లాభం చేకూర్చాలని ప్రభుత్వాలు గనక వ్యవసాయోత్పత్తుల ధరలు పెంచితే వినియోగదారులపై భారం పెరిగి నిరసనలు మొదలవుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో వ్యవసాయాన్ని కొనసాగించడానికి రైతులేం చేయాలి? మామూలుగా అందరూ చేసే సూచనలు ఇవి- విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు ఇతరత్రా వ్యయాన్ని తగ్గించుకోవాలి. ఉత్పత్తి, ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడం ద్వారా లాభాలు గడించాలి. కాని ఇదంతా జరగాలన్నా రైతులకు, కూలీలకు మధ్య ఉత్పత్తి సంబంధాలు సక్రమంగా ఉండాలి. అదే నేటి సమస్య. వ్యవసాయ పనులు సాఫీగా సాగేలా ఈ సంబంధాలను ఎలా పునర్నిర్వచించుకోవాలో చూద్దాం.

ఆ రెండూ పాటించాలి


మొదటిది... కూలీలతో తమ సమస్యల్ని రాజకీయ నాయకులు గాని, ప్రభుత్వోద్యోగులు గాని పరిష్కరించలేరని రైతులు గుర్తించాలి. తామే ప్రయత్నించి వాటిని పరిష్కరించుకోవాలని గుర్తించాలి. చిన్న సన్నకారు రైతులు తమ అగ్రకుల, వర్గ డాంబికాలను వదిలిపెట్టాలి. ఉపాధి హామీ పథకాన్ని నిందించే బదులు కూలీలతో సఖ్యంగా ఉండడానికి ముందుకు రావాలి. రైతులు ఒకప్పుడు కూలీలను తక్కువగా చూసి వారి శ్రమకి తక్కువ విలువ ఇచ్చేవారని గుర్తించాలి. తక్కువ కూలికి ఎక్కువ పని చేయాల్సిన భారం వారిమీద ఉండేదని, సామాజికంగా కూడా వారిని హీనంగా చూసే వారని గుర్తుంచుకోవాలి. వీటనిట్నీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు రైతులు పనివాళ్లకి తగిన కూలి చెల్లించడానికి సిద్ధపడాలి.

కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదు కాని చేసే పని సరిగా చెయ్యాలని కూలీలు కూడా తెలుసుకోవాలి. ఇచ్చే స్తోమత ఉన్నప్పుడే రైతులు పని వాళ్లకు ఎక్కువ కూలి ఇవ్వగలరని గమనించాలి. రాబడి తగ్గి, ఖర్చులు పెరిగిపోవడం వల్ల రైతులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దళిత కూలీలు చిన్న కారు రైతులుగా ఎదుగుతున్నారు కాబట్టి వాళ్లూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. నిజానికి కూలీలకు ఇదంతా తెలియనిది కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత తెలుసు కదా. రైతులు, కూలీలు ఇద్దరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కార్పొరేట్ సంస్థలు వ్యవసాయంలోకి అడుగుపెడితే ఇద్దరికీ బతుకు తెరువు కరువై వలస పోవాల్సి వస్తుంది. అందుకే ఇద్దరూ కలిసి మెరుగైన కూలి రేట్లు, ధరలు, సామాజిక భద్రత... మొత్తం వ్యవసాయానికే మెరుగైన ఆదాయం కోసం పోరాడాలి.

రెండోది.. చిన్న సన్నకారు రైతులు ఏకమై స్వయం సహాయక బృందాలుగా ఏర్పడాలి. కూలిరేట్లు, సాగు నీరు, విద్యుత్తు, పంటల, అమ్మకాలు వగైరా అన్ని విషయాల పైన చర్చించుకునే బృందాలుగా ఉండాలి. ఈ బృం దాలు కూలి సహకార బృందాలు కావచ్చు, సాగునీటి సహకార బృందాలు కావచ్చు, అమ్మకాల సహకార బృందం కావచ్చు, అవన్నీ కలిసిన బృందం కావచ్చు. ఐదుగురు రైతులు, ఐదుగురు కూలీలు, పదిమంది మహిళలతో ఒక బృందం ఏర్పడిందనుకుందాం. రైతులకు అవసరమైనపుడు కూలీలు దొరికే విధంగా, పని వాళ్లకేమో చేసిన పనికి తగిన కూలి లభించే విధంగా, మహిళలకు తాము చేయదగిన పనులలో వారిని మాత్రమే తీసుకునే విధంగా ఒక ఒప్పందానికి వస్తే ఎలా ఉంటుంది? ఆచరణ సాధ్య మే అనిపిస్తుందా? ఈ దిశగా పయనించే అవకాశం ఏమైనా ఉందంటారా?

డ్వాక్రా బాటలో...


డ్వాక్రా బృందాలే ఈ ఆలోచనకు స్ఫూర్తి. పైసా కూడబెట్టలేని వాళ్లు డ్వాక్రా పుణ్యమా అని ఇప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోగలుగుతున్నారు. అదే విధంగా చిన్న రైతులు కూడా పరస్పర సహకారంతో వ్యవసాయాన్ని లాభదాయకం చేయొచ్చు. ఇక్కడ ఎన్‌జీవోల పాత్ర ముఖ్యం. ప్రభుత్వం డ్వాక్రాను ప్రవేశ పెట్టడానికి ముందే ఎన్‌జీవోలు మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేశాయి. అలాంటి సృజనాత్మక, నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వాలు ఇలాంటి ప్రణాళికతో రైతు బృందాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నించాయి. అయితే అది విజయవంతం కాకపోవడానికి ఆ ఆలోచన రైతులలో పుట్టింది కాకపోవడం ఒక కారణమైతే దానిలో లోపాలుండడం రెండో కారణం.

ఇప్పటికైనా రైతులు ఒక్కటై ముందుకొచ్చి తమ ఉత్పత్తి సంబంధాల్ని పునర్నిర్మించుకోకపోతే కార్పొరేట్ వ్యవసాయ సునామీలో అందరూ కొట్టుకుపోవాల్సి వస్తుందని, చిన్న సన్నకారు రైతులు తమ భూమి, ఉపాధి రెండూ పోగొట్టుకోవాల్సి వస్తుందని గుర్తించాలి. ఓ వైపు పశ్చిమ దేశాలు పారిశ్రామిక వ్యవసాయ దుష్ప్రభావాలను ఎలా ఎదుర్కోవాలా అని తలలు పట్టుకుంటుండగా మనం కూడా అదే బాటలో నడవడం హాస్యాస్పదం కదూ!

కూలీలు ఏమనుకుంటున్నారంటే..

ఉపాధే హాయిగా వుంది : అంజమ్మబాయి, బుజ్జిబాయి, ఖాశంభీ


పొద్దునెళ్లి సాయంత్రం దాకా చచ్చేలా పనిచేసినా వంద రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వరు. దీనికి తోడు ఆసాములతో పోట్లాటలు వుండనే వుంటాయి. అదే ఉపాధి పనికెళ్తే రోజుకి 121 రూపాయలొస్తాయి. మిగతా సదుపాయాలతో కలుపుకొని రోజుకు రూ. 140 నుండి 150 దాకా ముడుతుంది. కూలి డబ్బు నేరుగా అకౌంట్‌లో పడిపోతుంది. పనికి ఐదు కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లాల్సొస్తే చార్జీకి మరో పది రూపాయలు అదనంగా ఇస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టిల భూమి అభివృద్ధి పథకాన్ని ఈ ఉపాధి పనుల్లో కలపడం వల్ల మా భూముల్ని మేమే బాగు చేసుకొనటమే కాకుండా చేసిన పనికి కూలి కూడా పొందుతున్నాం. కాబట్టే ఎస్‌సి, ఎస్‌టిలమందరం వ్యవసాయ పనులను కాదని కొన్నాళ్లుగా ఉపాధి పనికే పోతున్నాం. ఉదయం 8 గంటలకు పనికి వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వెళ్లేందుకు అధికారులు అంగీకరిస్తున్నారు. అందుకే మాకు పని పెద్ద కష్టమనిపించడం లేదు. ఇప్పుడు ఉపాధి పనిలో వేసవి భృతి కూడా అదనంగా ఇస్తున్నారు.

సంఘంగా ఏర్పడితేనే న్యాయం జరుగుతుంది : రాముడు, కారంపూడి


నేను చిన్నప్పటి నుండి కూలి పనికి వెళుతూనే వున్నాను. ఇప్పుడంటే ఉపాధి పని రాబట్టి కూలి రేటు కాస్త పెరిగింది కానీ అంతకు మునుపు రోజుకు 30 రూపాయలు ఇవ్వటమే గగనంగా ఉండేది. రైతుకు ఎంతొచ్చినా కూలోడికి ఇచ్చేది మాత్రం అంతే అన్నట్టుగా వుండేది. కూలి రేట్లు పెరగాలంటే ఏళ్లకేళ్లు పడుతుంది. వ్యవసాయ కూలీలను గ్రూపులుగా ఏర్పాటుచేస్తే మంచిదే. కూలి రేటు పెంచే విషయంలో మాలో ఐకమత్యం లేకపోవటం వల్ల ఇబ్బందవుతుంది. సంఘాలుగా ఏర్పడి పనికెళ్లడం మొదలుపెడితే కూలికి తగ్గట్టుగానే పనిచేసే అవకాశం ఉంటుంది. లేకపోతే కూలోడి శ్రమ దోపిడీకి గురవుతూనే వుంటుంది. అందుకే ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకొని కూలీలను గ్రూపులుగా ఏర్పాటు చేయడానికి చొరవ చూపాలి.

* ఉమాశంకరి, విస్సా కిరణ్‌కుమార్ , పిడుగురాళ్ల
రచయితల సెల్ : 99897 98493, 97017 05743

Tuesday, April 19, 2011

హంస! * చిక్కటి పాలవంటి విలువలకు, ఆ పల్లెవాసులకు మధ్య అనుబంధాలే ‘రిలేషన్‌షిప్స్’

పాలూ నీళ్లను వేరుచేస్తుంది హంస.
నీళ్లు కలపని పాలు పోస్తుంది కాళ్లకూరు.
కాకిలా బతకొద్దనీ, కల్మషాలు కూడదనీ...
కష్టపడి పని చేయాలనీ చెబుతోంది.
ఆచరిస్తోంది.
అందుకే అది హంసలాంటి ఊరు అయింది.
ఆ ఊరికి ఇంతటి సంస్కారాన్ని నేర్పింది...
అమ్మమాటను జవదాటని పుత్రధర్మం, కన్నఊరిని మరువలేని ఒక బాంధవ్యం!
చిక్కటి పాలవంటి విలువలకు,ఆ పల్లెవాసులకు మధ్య అనుబంధాలే  - ఈ  ‘రిలేషన్‌షిప్స్’

చుక్క నీరు కలపకుండా చిక్కని పాలు పోసే వాళ్లు దొరికితే ఏం చేస్తాం? బహుశా ‘నీతిరత్న’ అనే బిరుదు ఇచ్చి సన్మానం చేస్తామేమో! అలాగైతే కాళ్లకూరు గ్రామంలోని రైతులు ఆ బిరుదు అందుకోవడానికి క్యూలో నిలబడవలసి వస్తుంది. ఎందుకంటే ఈ గ్రామంలో వందలాది మంది పాల రైతులు నీళ్లు కలపని చిక్కని పాలు మాత్రమే విక్రయిస్తున్నారు. అమెరికాలో వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ వేగేశ్న పృథ్వీరాజు (72)కు ఐదేళ్ల క్రితం వచ్చిన ఆలోచనతో అంకురించిన కాళ్లకూరు పాల ఉత్పత్తిదారుల సంఘం(కె.ఎమ్.పి)... పాలలో నీళ్లు కలపకపోవడంలోనే కాదు, ఆలోచనల్లో నిజాయితీని కలపడంలోనూ ముందుంది. ఈ సంఘస్థాపన ఒక ప్రయోగమని, అందుకే దీనిని ‘కాళ్లకూరు ప్రయోగం’ అని పేర్కొంటున్నామని పృథ్వీరాజు చెప్పారు.
అమ్మ ‘ఊరు’ కోలేదు...
పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్లకూరు గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వేగేశ్న పృథ్వీరాజును ఉన్నత చదువులు, ఉద్యోగాలు విదేశాలకు తీసుకువెళ్లినా... జన్మనిచ్చిన పల్లెటూరు, దాని జ్ఞాపకాల నుంచి దూరం జరపలేకపోయాయి. దాదాపు నలభైఏళ్ల పాటు పుట్టిన ఊరుకు దూరంగా గడిపిన పృథ్వీరాజు, తన తండ్రి మరణించారన్న సమాచారంతో కాళ్లకూరుకు వచ్చారు. తిరిగి వెళ్లబోతుంటే... ‘‘నావి చివరి రోజులు నాయనా... నా తుదిశ్వాస విడిచే వరకూ నన్ను విడిచిపోకు’’ అంటూ తల్లి కోరారు. ఆమె కోరికను మన్నిస్తూ ఒక రోజు రెండ్రోజులు కాదు.. ఆరేళ్ల్ల పాటు తల్లి దగ్గరే ఉండిపోయారు. ఆ సమయంలోనే పృథ్వీరాజుకు ఆ ఊరు తను మునుపటిలా లేదని తెలిసింది. తను తప్పటడుగులు వేసిన చోట... అనేక మంది తప్పుటడుగులు వేస్తున్నారని అర్థమైంది. కష్టాన్ని అసహ్యించుకోవడం, తాగుడు, అబద్ధాలు, నోటుకు ఓటును అమ్ముకోవడం, పరస్పరం మోసాలు చేసుకోవడం... వంటి ఆధునిక ప్రపంచపు అవలక్షణాలన్నీ అమాయక పల్లెను వశం చేసుకుంటున్నాయని అర్థమైంది. దాంతో తన వంతుగా పుట్టిన ఊరిబాగు కోసం ఉపక్రమించారు.

విదేశాల్లో స్థిరపడిన తొలి రోజుల్లోనే తను స్థానిక పెద్దల సహకారంతో ప్రారంభించిన ‘సత్య సేవాట్రస్ట్’కు తన సంపాదన లోంచి రూ.25లక్షల్ని అప్పట్లో పృథ్వీరాజు కేటాయించారు. అత్యవసర సమయాల్లో గ్రామస్థులను ఆర్థికంగా ఆదుకోవడమే దీని లక్ష్యం. అయితే అది అంత మంచి ఫలితాన్నివటం లేదని ఆయన గ్రహించారు. పేదరికం పోవాలంటే వారికి చేయాల్సింది ఆర్ధికసాయం కాదని, చూపాల్సింది ఆదాయ పొందే మార్గమని అర్థం చేసుకున్నారు.

పల్లె ప్రయో‘జనం’ కోసం
కష్టపడడం, నిజాయితీగా సంపాదించిన దానిలోకొంత తోటివారి మేలుకు ఉపయోగించడం, కలసికట్టుగా ఊరిని అభివృద్ధి పథంలో నిలపడం... ఈ లక్ష్యాలతో చేపట్టిందే కాళ్లకూరు ప్రయోగం. దీనిలో భాగంగా మొదట ఒక పాల సేకరణ కేంద్రాన్ని పృథ్వీరాజు నెలకొల్పారు. నీళ్లు కలపని పాలకు తగిన రేటు కట్టి ఇస్తూ పాల రైతులను సంఘటితం చేశారు. పాలలో నీళ్లు కలపకపోవడం, ఓటును అమ్ముకోకపోవడం.. వంటి విలువలకు కట్టుబడితేనే... ‘సంఘంలో సభ్యత్వం’ అని షరతు విధించి, హామీ పత్రం తీసుకున్నారు. ట్రస్ట్ తరపున గేదెలు కొనే స్థోమత లేని వారికి రుణాలు అందించారు. ‘‘మేం యాచకులం కాము పోషకులం’’ అని మా ఊరివాళ్లు సగర్వంగా చెప్పుకునేలా ఈ ప్రయోగాన్ని చేపట్టాం’’ అని పృథ్వీరాజు అంటారు. పాలను విక్రయించగా వచ్చిన లాభాలను కూడా ప్రతి ఏటా పాల రైతులకే బోనస్‌గా ఇవ్వడం ఈ కేంద్రం మరో ప్రత్యేకత.

‘‘గత ఏడాది ఇలా వచ్చిన రూ.1.60 లక్షల్ని రైతులకి అందించాం’’ అని పృథ్వీరాజు చెప్పారు. అంతే కాకుండా ప్రతి లీటరు అమ్మకం విలువ నుంచీ మూడు పైసల్ని విరాళంగా ఇవ్వాలనేది మరో నిబంధన. ‘‘ఆ మూడు పైసల విరాళం నుంచి గ్రామంలో 50 మందికి పైగా వృద్ధులకు కొద్ది మొత్తంలో పింఛన్లు అందిస్తున్నాం. అలాగే రూ.3.50 లక్షలతో ఏర్పాటు చేసుకున్న వాటర్ ప్లాంట్ కోసం తీసుకున్న రుణాన్ని కూడా అందులోంచే తిరిగి చెల్లిస్తున్నాం’’ అని తెలిపారు ఆయన. ఈ ప్లాంట్ ద్వారా కాళ్లకూరు గ్రామంలోని ఎనిమిది పాఠశాలల్లో చదువుకుంటున్న 450 మంది విద్యార్థ్ధులకు ఉచితంగా మంచినీటిని అందిస్తున్నారు. ‘‘మూడు పైసల పవిత్రతగా దీన్ని మేం పేర్కొంటున్నాం. ఎందుకంటే ఇది కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన డబ్బు. అంతే పవిత్రమైన కార్యక్రమాలకు ఇది ఉపయోగిస్తున్నాం’’ అని సంఘం బాధ్యతలు నిర్వర్తిస్తున్న వి.రామరాజు అన్నారు.

పృథ్వీరాజు ప్రవేశపెట్టిన ప్రయోగం త్వరితంగానే సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. కేవలం పది మందితో ప్రారంభమైన పాల ఉత్పత్తిదారుల సంఘం... రెండొందలకి చేరింది. నాలుగేళ్లుగా స్థానికులు సాధిస్తున్న సమష్టి ప్రగతి సమీప గ్రామాలకూ అనుసరణీయంగా మారుతోంది. ప్రస్తుతం వీరి బాటలోనే దొడ్డనపూడి గ్రామస్థులు కూడా ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ‘‘ఇక్కడి రైతుల చేత విరివిగా కూరగాయలు సాగు చేయించి వాటికి కూడా ఇలాగే మంచి రేటు వచ్చేలా చేయడం, తర్వాత తర్వాత రైసు మిల్లర్లకు లాభాల పంట పండిస్తున్న వీరి కష్టాన్ని వీరే అనుభవించేలా చేయడం... వంటి మరికొన్ని లక్ష్యాలు కూడా మాకు ఉన్నాయి’’ అని పృథ్వీరాజు వివరించారు.

మసకబారిపోతున్న తన స్వచ్ఛతను ఇపుడు ఒక పల్లె తిరిగి సముపార్జించుకుంటోంది. తమ కష్టమే పెట్టుబడి చేసుకుని నీతిగా బతకగలమనే నూతన ధైర్యాన్ని సంతరించుకుంటోంది. అమ్మకు ఇచ్చిన మాట కోసం ఆరేళ్ల పాటు తన పల్లెలో ఉండిపోయిన పృధ్వీరాజు... అమ్మ ఆశ నెరవేర్చారు. అమ్మలాంటి ఊరును మార్చారు. అందుకు అమ్మ తప్పకుండా సంతోషిస్తుంది. ఏ లోకాన ఉన్నా కుమారుడి ఆశయం నెరవేరాలంటూ దీవెనలు అందిస్తుంది.


పాలల్లో నీళ్లు కలిపి అమ్మడం ఎంత తప్పో... నోటుకు ఓటు అమ్ముకోవడం ఎంత ముప్పో... ఇపుడు మా గ్రామస్థులకు అర్ధమవుతోంది. నీతిగా నిజాయితీగా ఉండడం గ్రామానికి మంచి చేస్తోం ది. ఇపుడు ఎన్నో మంచి పనులు చేసుకోగలు గుతున్నాం. - సుబ్బరాజు, కె.ఎం.పి సభ్యుడు, కాళ్లకూరు

సంఘంలో చేరాక మేం తీసుకువచ్చే చిక్కని పాలకు తగిన రేటు వస్తోంది. మా ఊరిలో ఉన్న ముసిలోళ్లకి కొంచెం పింఛను డబ్బులు కూడా వస్తున్నాయి. అందరం ఒక మాట మీద ఉండడం వల్ల ఊళ్లో అందరికీ లాభం కలుగుతోంది. - సీతారాముడు, కె.ఎం.పి సభ్యులు


- ఎస్.సత్యబాబు

Sunday, March 13, 2011

ద్రాక్షరత్న

నాకు ఎక్కువ పేరొచ్చింది విదేశాల్లోనే!

"నాకు ఎనిమిదేళ్ల వయసుండగా నాన్న ముత్యం రెడ్డి అల్వాల్‌లో వందెకరాల ఆసామిగా ఉండేవారు. కాయగూరలు, వరి సాగు చేస్తుండేవారు. నేను పన్నెండో తరగతి చదివాక ఏదైనా ఉద్యోగం చేసుకోమన్నారు మా వాళ్లు. కాని నాకు వ్యవసాయరంగం అంటే చాలా ఆసక్తి. అప్పటికే మా పొలం పక్కన గోదావరి జిల్లా వాసులైన మంతెన ఆదినారాయణ రాజుకి ద్రాక్షతోట ఉండేది. వారికి లక్షల్లో ఆదాయాలు వచ్చేవి. ' ఏంటి రెడ్డిగారు..ఎన్నాళ్లు ఈ వరీ,కూరగాయలు...ద్రాక్ష పెట్టకూడదూ' అన్నారాయన.

పక్కనే ఉండటంతో ద్రాక్షసాగు విషయాలన్నీ తెలుసుకున్నాం. నాన్నకు తోడు నేను, అన్నయ్య శంకర్‌రెడ్డి ద్రాక్షసాగులోకి దిగాం. మొదట్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా వాతావరణం అనుకూలించడంతో ముందుకు సాగాము. అల్వాల్, గోధుమకుంట, కీసర, రాంపల్లి....ఇలా చాలా చోట్ల భూములు తీసుకుని ద్రాక్షసాగు చేశాం. మమ్మల్ని చూసి చాలామంది ఈ రంగంలోకి వచ్చారు. మొదట్లో బాగానే ఆదాయం కళ్ల చూసినా..రాను రాను నష్టాల రుచి కూడా చూశారు. దాంతో మెల్లగా కొందరు రైతులు ద్రాక్షకు గుడ్‌బై చెప్పారు. కొందరంటే ఒకరిద్దరు కాదు రియలెస్టేట్ బూమ్‌లో పడి చాలామంది ద్రాక్షకు దూరమయ్యారు.

ద్రాక్ష రత్న అవార్డు...

ఎవరు ఏ కారంణంతో పక్కకు జరిగినా...మేము మాత్రం ద్రాక్ష తోటలోనే నడిచాం. ద్రాక్షసాగులో నేర్చుకున్న మెళకువలు రంగారెడ్డి జిల్లాలో నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పలుకుబడే గ్రేప్ గార్డెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ని చేసింది. పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్ వంటి విషయాల్లో చాలామంది రైతులు నా వద్ద సలహాలు తీసుకోవడం మొదలుపెట్టారు. జిల్లాలో పెద్దఎత్తున ద్రాక్ష పండిస్తున్న రైతుగా నన్ను గుర్తించి 1990లో గవర్నరు ద్రాక్షరత్న బిరుదును ప్రదానం చేశారు.

సేంద్రీయ ద్రాక్ష...

లాభాలకోసం రైతులు రసాయనాల వెంటపడడం మొదలుపెట్టాక లక్షరూపాయలయ్యే పెట్టుబడి రెండు లక్షలకు పెరిగింది. ఎంతో ఆశతో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టిన రైతులు అకాలవర్షాల వల్ల, తుఫాన్ల వల్ల నష్టాలబాట పట్టాల్సి వచ్చింది. దాంతో చాలామంది రైతులు ద్రాక్షకు దణ్ణం పెట్టారు. నేనూ అలా దెబ్బ తిన్నవాణ్ణే. సమస్యను చూసి పారిపోవడం కన్నా..పరిష్కారం కనుగొని పదిమందికి ఆదర్శంగా నిలవాలని అనుకున్నాను. ద్రాక్షసాగుకి కావాల్సింది ఎన్‌పికే( నైట్రోజన్,ఫాస్పరస్, పొటాషియం). ఇవన్నీ కూడా రసాయనాల రూపంలో చెట్టుకు అందిస్తున్నాం. ఈ పోషకాలను సహజసిద్దంగా తయారుచేయగలిగితే చాలనుకున్నాను. ద్రాక్ష చెట్లమధ్య మొలిచే గడ్డిని ఎప్పటికప్పుడు తీసేసి శుభ్రంగా ఉంచుతారు.

నేను అలా చేయకుండా గడ్డిని అలాగే వదిలేసాను. వానాకాలం ఏపుగా పెరిగేది, ఎండకాలం ఎండిపోయేది. అలా ఎండిన గడ్డి వర్షాకాలంలో కుళ్లిపోయేది. కుళ్లిన గడ్డికింద ఉన్న మట్టిలో వానపాములు చేరేవి. చెట్టుకు కావలసిన ఎరువు దొరికిందనుకున్నాను. ఎందుకంటే ఒక వానపాము ఆయుఃప్రమాణం 120 రోజులు. రోజూ వందల సంఖ్యలో పుట్టుకొచ్చే వానపాములు రోజుల వ్యవధిలోనే చనిపోతూ ఉంటాయి. ఇలా చనిపోయిన వానపాముల వల్లే ఎన్‌పికే తయారవుతుంది. నేల పైపొరలో చనిపోయిన వానపాముల్ని తినడానికి రెండు మూడు అడుగుల లోతునుంచి రకరకాల సూక్ష్మజీవులు వస్తాయి.

వీటి వల్ల మట్టి గుల్లబడుతుంది. చెట్టు ఆరోగ్యంగా ఎదగడానికి కావలసిన పక్రియ అది. చెట్టు మొదలు దగ్గర ఒక గంప పేడ వేసి డ్రిప్‌లతో నీళ్లు పెట్టి వదిలేసాను. చెట్టుకు ఇంజెక్షన్లు ఇచ్చి కాపాడుకునే పరిస్థితికి నేను కనిపెట్టిన ఈ విధానం తిరుగులేని ప్రత్యామ్నాయమైంది. రెండేళ్ల పాటు ఈ సహజపద్ధతిని పాటించాను. మునుపెన్నడూ లేని దిగుబడిని చూశాను. దురదృష్టం ఏంటంటే...అందరూ వచ్చి నా సేంద్రీయ ద్రాక్షను చూశారు, తిన్నారు కాని ఏ రైతు కూడా నేను చేసిన ప్రయోగం చేయడం లేదు.

విటమిన్ ఎ బియ్యం...

ద్రాక్షపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాక...నా దృష్టి వరిపైకి మళ్లింది. 2004లోనే వరిసాగులో అధిక దిగుబడితో ఆరోగ్యకరమైన ఆహారం పండించాలని అనుకున్నాను. మనం తినే ఆహారంలో ఆరోగ్యంకన్నా, హాని ఎక్కువున్నదని పరిశోధకులు మొత్తుకుంటున్నారు. కారణం పంటలకు వాడే రసాయనాలు. మనుషులు ఆరోగ్యంగా ఉండాలన్నా...ఒంటికి సరిపడా ఆహారం కావాలన్నా ప్రకృతి ఇచ్చే ఆహారాన్ని తినాలి. వాటి బదులు మనం తయారుచేసుకున్న టాబ్లెట్లు, టానిక్‌లు తింటే ఏమవుతుంది. ఒకటి రెండు రోజులు బాగానే ఉంటుంది. ఆ తరువాత ఒళ్లంతా మందులమయమైపోయి జీవకళ పోతుంది. అలాగే విత్తు మొలిచే చోట రసాయనాలు గుమ్మరిస్తే నేలంతా నిస్సారమవుతుంది.

దిగుబడులు రాకపోగా...రసాయనాలతో పండించే ఆహారాన్ని తినాల్సివస్తుంది. ప్రస్తుతం రైతులందరూ చేస్తున్నది ఇదే. అప్పటివరకూ బీడుగా ఉన్న నేలలో మొదటిసారి వరి నాటితే పంట దిగుబడి అద్భుతంగా వస్తుంది. దానికి ఎలాంటి మందులు వేయక్కర్లేదు. ఎందుకంటే మట్టిలో సారం ఎక్కువగా ఉంటుంది. అదే నాలుగు పంటలయిన తర్వాత సారం పోతుంది కాబట్టి రసాయనాలపైన ఆధారపడాల్సి వస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు తల్లిని బలమైన ఆహారం ఎక్కువగా తీసుకోమని చెబుతారు డాక్టర్లు. ఈ సూత్రాన్ని వరి పంటకు వాడాను. సేంద్రీయ ఎరువులు వేసి వరి నాటాక... వరి పొట్టకు వచ్చే సమయంలో సహజంగా పొలం బీటలు వారుతుంది. ఆ సమయంలో నీళ్లు, రసాయన ఎరువులు బాగావేస్తే గింజ తోడుకుంటుంది. మట్టిలో బలం ఉంటేనే... లేకపోతే తోడుకోవు. నేను దీనికి ప్రత్నామ్నాయం ఆలోచించాను.

నీటిలో మట్టి కలిపి...
వరి నాటే ముందు ఒక్కొక్క మడిలో ఒక్కో చోట పది అడుగుల లోతు గొయ్యి తవ్వి ఎకరానికి టన్ను చొప్పున మట్టి తవ్వి పక్కన పెట్టుకోవాలి. ఆ గోతిలో మడిలో ఉన్న పైపైన మట్టిని వేసి పూడ్చేయాలి. వరి పొట్టకు వచ్చే సమయంలో మడుల్లోకి పారే నీళ్లలో ముందుగా తీసి పెట్టుకున్న మట్టిని కలపాలి. దీనికి మోటారు దగ్గర ఒక నీళ్లట్యాంకుని కట్టుకుని అందులో మట్టి కలుపుకోవాలి. పంట కోతకు వచ్చే లోపు ఈ పద్ధతిలో నాలుగైదు తడులు పెట్టాలి. మనం వేసిన కొత్త మట్టిలో ఉన్న సారమంతా నీళ్ల ద్వారా పొలంలోకి వెళుతుంది. దీని వల్ల చేను ఎండినా బీటలు రాకుండా ఉంటాయి. మట్టిలో ఉన్న బలమైన పోషకాలు గింజని గట్టిపడేలా చేస్తాయి. ఇలా పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న పరిశోధకులు కొన్ని రోజులపాటు చేసిన పరిశోధనలో తేల్చారు.

అరవై దేశాల్లో అంగీకరించాయి...

నేను పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని మన పరిశోధకులు నిర్ధారించాక, ఈ అంశంపై 32 పేజీల రికార్డు రాసి జెనీవాలోని అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థకు పంపాను. అక్కడ మొదట 35 దేశాల కూటమి నేను పంపిన అంశంపై ప్రత్యేక అధ్యయనం చేసింది. ఎనిమిది నెలల తర్వాత నా బియ్యంలో విటమిన్ ఎ ఉందని అంగీకరించి ఆయా దేశాల్లో నాకు పేటెంట్ హక్కులు కల్పించారు. యూరప్ వెబ్‌సైట్‌లో నా పరిశోధన గురించి వివరంగా పెట్టారు. నేను మొత్తం 75 దేశాలకు నా పరిశోధన వివరాలు పంపిస్తే దాదాపు 60 దేశాలు నా ప్రయోగాన్ని అంగీకరించి వారి దేశాల్లో పేటెంట్ హక్కుల్ని కల్పించాయి. 2006లో మన రాష్ట్రం వచ్చిన జార్జ్‌బుష్ నాతో ప్రత్యేకంగా ఈ విషయం గురించి మాట్లాడారు.

నా ఆరోగ్యమే నిదర్శనం...

2003 నుంచి నేను ఈ సేంద్రీయ వరి పంటనే పండిస్తున్నాను. అప్పటి నుంచి మా ఇంట్లో ఇవే బియ్యాన్ని తింటున్నాం. నాకు కంటిచూపు తగ్గడంతో అద్దాలు వాడేవాడిని. అలాంటిది నాలుగేళ్ల నుంచి అద్దాలు లేకుండానే పేపరు చదువుతున్నాను. అప్పటివరకూ ఉన్న మోకాళ్ల నొప్పులు, అజీర్తి, ఆయాసం వంటి జబ్బులన్నీ ఎగిరిపోయాయి. నాలో నాకు తెలియని కొత్త శక్తి వచ్చింది. రసాయనాలతో పండించిన ఆహారానికి, సహజ పోషకాలతో పండిన ఆహారానికి ఉన్న తేడాని నేను స్వయంగా చూశాను. ఈ బియ్యాన్ని ఎవరు తిన్నా...తినకపోయినా ముందుగా మన దేశంలో ఉన్న రైతులందరూ తినాలి. వాళ్లు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకే ఈ పంటపై పేటెంటు హక్కుని పొందినప్పటికీ రైతులు పండించుకుని తినడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు.

విత్తే మిషన్ వచ్చింది...

వరి పంటపై చేసిన ప్రయోగం ముగియగానే వరినాటుని సులభతరం చేసుకోవాలని అనుకున్నాను. రోజురోజుకూ పెరుగుతున్న కూలీల కొరత, మొలకల ఎదుగుదలలో మిషన్ చేసే సాయం వంటి విషయాలపై ఆలోచించాను. ఒకచోట వేసిన నారుని తీసి మరో చోట నాటడం వల్ల వేళ్లు తెగి, అవి మళ్లీ భూమిలోకి వెళ్లి అప్పుడు పిలకలు వేయడం దీని వల్ల చాలా సమయం వృధా అవుతుంది. అలాగే వరి కర్రలు కూడా చాలా తక్కువగా వస్తాయి. అందుకే ఒకటే విత్తుని విత్తితే అది మొక్క మొలిచి తనకున్న స్థలంలో చక్కగా వేళ్లూనుకుని పదుల సంఖ్యలో పిలకలు వచ్చే అవకాశం ఉంది.

అయితే ఒక్కొక్క గింజ నాటడం చాలా కష్టం. దీని కోసం ఒక మెషిన్ తయారుచేశాను. దీని వల్ల నేరుగా గింజభూమిలోకి వెళుతుంది. అదే సమయంలో గింజకు రెండువైపులా నేలను చదును కూడా చేస్తుంది. ఈ మిషన్‌తో ఒక్క వరి విత్తనాలే కాదు గోధుమ, సజ్జ, మొక్కజొన్న, పెసలు, మినుములు...అన్ని రకాల విత్తనాలు సులువుగా నాటుకోవచ్చు. ఈ మిషన్‌కి పేటెంట్ కోసం చెన్నైలోని పరిశోధనా సంస్థకు పంపించాను. వారు నా మిషన్ గురించి వారి వెబ్‌సైట్‌లో పెట్టారు. అది చూసిన అమెరికావాళ్లు అక్కడ తమ దినపత్రికలలో రాశారు.

జూ భువనేశ్వరి
ఫొటోలు: సాయి

Friday, February 4, 2011

‘ ప్రగతి ’లో సహజ సేద్యం!


ప్రత్యేక మడుల్లో ఆదర్శప్రాయంగా
సేంద్రియ కూరగాయలు, ఆకుకూరల సాగు
ఆకు ఎరువు (లీఫీ మౌల్డ్), పంచగవ్య,
వేపనూనెతో పచ్చని కూరల పెంపకం
ఇటుకలు, చెక్క ముక్కలు, పెంకులతో
విభిన్నంగా మడుల తయారీ
కూరగాయల సహజ సేద్యం గురించి ఒక్క రోజులో తెలుసుకోవచ్చు!


ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మడుల్లో సహజమైన పద్ధతుల్లో ఆకుకూరలతోపాటు ఏ రకం కూరగాయలైనా ఆరోగ్యదాయకంగా పెంచుకోవచ్చని ప్రగతి రిసార్ట్స్ నిరూపిస్తోంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ వేలాది జాతుల ఔషధ మొక్కలు, చెట్లతో కూడి జీవవైవిధ్యంతో పచ్చగా అలరారుతోంది.


ప్రగతి సీఎండీ డాక్టర్ జీబీకే రావు, సీనియర్ వృక్ష శాస్తవ్రేత్త డాక్టర్ ఎస్వీ రామారావు పర్యవేక్షణలో దాదాపు 15 రకాల ఆకుకూరలు, కూరగాయలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మడుల్లో ముచ్చటగా పెంచుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్వగృహం పైన నాలుగేళ్లుగా కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతిలో పెంచుతున్న జీబీకే రావు ఇటీవల తన రిసార్ట్స్‌లోనూ ప్రారంభించారు. హార్టికల్చర్ ఎక్స్‌పోలో ‘ప్రగతి’ ఇటీవల రెండు అవార్డులు దక్కించుకుంది.

ప్రత్యేకతలెన్నో...

ప్రగతి కిచెన్ గార్డెన్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. మట్టి ఇటుకలు, సిమెంట్ ఇటుకలు, చెక్క ముక్కలు, పగిలిన పెంకులు, విరిగిన నాపరాళ్లు, విరిగిన టైల్స్ వంటి అందుబాటులో ఉన్న సామగ్రిని వినియోగించి తక్కువ ఖర్చుతో మడులను ఏర్పాటు చేయడం భలే బాగుంది.

ప్రత్యేకంగా తయారుచేసుకున్న ఆకు ఎరువు (లీఫీ మౌల్డ్), వర్మీ కంపోస్ట్, ఎరమ్రట్టితో కూడిన ప్రత్యేక మట్టి మిశ్రమం.. పంచగవ్య (15 రోజులకోసారి.. 3 శాతం పంచగవ్యను 97 శాతం నీటిలో కలిపి), వేప నూనె (నెలకోసారి.. 5 మిల్లీలీటర్ల వేపనూనెను లీటరు నీటిలో కలిపి) వంటి సహజ సస్య రక్షణ ఉత్పత్తులతోనే ఈ మడుల్లో సాగు చేస్తుండడం విశేషం. ప్రత్యేక మట్టి మిశ్రమం వాడుతున్నందున పంట దిగుబడి సాధారణ నేలలో కన్నా ఎక్కువగా వస్తున్నాయి.


మడుల్లో అధిక దిగుబడి

ఒక్కో టమాటా మొక్క సాధారణంగా 45 రోజులపాటు కాయలు కాస్తుంది. ప్రత్యేక మడిలో పోషకాలు నేలలోకన్నా బాగా అందుతాయి. కాబట్టి 60 రోజుల పాటు కాయలు కాస్తుందని, ఒక్కో మొక్క 20 నుంచి 25 కిలోల దిగుబడినిస్తుందని డాక్టర్ రామారావు ‘ఇంటి పంట’ ప్రతినిధితో చెప్పారు. టమాటా మొక్కలను రెండు అడుగులకో మొక్కను నాటాలన్నారు. ప్రత్యేక మడిలో వాడే మట్టి మిశ్రమం మొక్కకు వేళ్లు బాగా ఏర్పడేందుకు సాయపడుతుందని, పోషకాలు పుష్కలంగా అందడం వల్ల చక్కటి దిగుబడి ఇస్తుందని ఆయన తెలిపారు. మడులు ఏర్పాటుచేసుకున్న మొదటి పంట దిగుబడి అంతబాగా రాదని, లోపాలు సరిదిద్దుకుంటే ఆ తర్వాత నుంచి మంచి దిగుబడి తీయవచ్చన్నారు. అన్నిటికీ మించి అత్యంత ఆరోగ్యదాయకమైన, రుచికరమైన పంటలను ఇలా పెంచుకోవచ్చన్నారు. సహజాహారం ప్రాధాన్యం తెలుసుకున్న వారికి ఇంటి దగ్గర మడులలో, కుండీల్లో సాగుచేయడం సులువేనని రామారావు చెప్పారు. సందేహాలున్న వారు తనకు ఫోన్ చేయవచ్చని డాక్టర్ రామారావు (99484 39329) తెలిపారు.

ఒక్క రోజు శిక్షణ చాలు!
అందరూ తమ కుటుంబానికి అవసరమయ్యే ఆకుకూరలు, కూరగాయల్లో కనీసం 50 శాతం మేరకైనా ఇంటిపట్టున పండించుకోవాలని డాక్టర్ జీబీకే రావు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరడంతో పాటు, కూరగాయల రవాణాకు వాడే ఇంధనం ఆదాతో పర్యావరణపరంగా దేశానికి మేలు జరుగుతుందని అన్నారు. కిచెన్ గార్డెనింగ్‌పై తమ రిసార్ట్స్‌లో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ హార్టికల్చరిస్ట్ ప్రవీణ్‌ను *  91601 75197 నంబరులో సంప్రదించవచ్చన్నారు. కనీసం పది మంది అడిగితే ఏ రోజైనా శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.

సహజ సేద్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి

ప్రభుత్వం సహజ సేద్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని డాక్టర్ రావు అన్నారు. రసాయనిక సేద్యాన్ని భారీ సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. ప్రపంచం యావత్తూ ఆదరిస్తున్న సహజ సేద్యాన్ని, దీనిపై పరిశోధనను విస్మరించడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఏ పార్కులోనో, ఖాళీ స్థలమో కేటాయించి ప్రోత్సహిస్తే శిక్షణ కేంద్రాలు నెలకొల్పడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రైవేటు సంస్థలను సైతం ప్రభుత్వం తగురీతిలో ప్రోత్సహించాలన్నారు.

Monday, January 31, 2011

వలస బతుకుల్లో తులసి కాంతులు * మార్పు తెచ్చిన తులసి సాగు...* మహిళలు సాగించిన తులసి విప్లవం

ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు తప్ప మరేమీ ఉండేవి కావు. పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్‌ లేవు.సరైన పోషకాహారం లేదు. భర్తలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఆదాయం అంతంత మాత్రమే. ఈ దృశ్యం ఒక దశాబ్దం కిందటిది. పదేళ్ళు గిర్రున తిరిగేసరికి ఇప్పుడక్కడ అంతా ఆనందమే.ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాదు, అన్ని రకాల వసతులతో కూడుకున్న ఆ గ్రామాలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయి. సుమారు 300మంది మహిళలు సాగించిన తులసి విప్లవం వారి జీవితాలనే మార్చేసింది.

tulasi1 
1998.. ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌ జిల్లాలో ఉన్న మహిళ లు అంతవరకు తమ గ్రామంలో చేస్తున్న వ్యవసాయంలో సమూలమార్పులు తీసుకు రావడానికి నడుం బిగించారు. తద్వా రా తమ జీవితాలతో పాటు తమ కుటుంబాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకో వాలని సంకల్పించారు. వీరంతా వలస జీవితం గడిపే కార్మికుల భార్యలు. వారంతా కుటుంబ సభ్యులను ఊరిలోనే వదిలేసి ఎక్కడ పని దొరికితే అక్కడికి వలస వెళుతుంటారు. అనే క ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేస్తుంటారు. వ్యవసాయ పనులు ఉన్న సమయంలో మాత్రమే సొంత గ్రామానికి వచ్చి పనులు చేసుకుంటారు.

అలా ఓసారి అందరూ కలిసినప్పుడు వచ్చిన ఆలోచనే తులసి పెంపకం. తులసిలో అనేక ఆర్గానిక్‌ పదార్థాలు ఉన్నాయి. అందుకే దాని పెం పకం ద్వారా తమ కుటుంబాలను బాగుచేసుకోవాలని నిర్ణయించారు. తులసి పెంప కానికి సంబంధించి అన్ని రకాల విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే అందు లోకిి అడుగు పెట్టారు. ఇందుకు సాయం చేసేందుకు ఒక కార్పొరేట్‌ సంస్థ ముందుకు వచ్చింది.వారి లక్ష్యం ముందు వారు పడిన శ్రమ చాలా చిన్నది గా మారిపోవడంతో ఇప్పుడు వారి ఆనందానికి ఆకాశమే హద్ద యింది.

మార్పు తెచ్చిన తులసి సాగు...
Tulsi2 
ఇప్పుడు వారి కుటుంబాలు వల స వెళ్లకుండా ఊరిలోనే వ్యవసా యపనులు చూసుకుంటూ హా యిగా జీవిస్తున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు విజయం సాధించారు. ప్రస్తుతం వారు లక్నోలో ఉన్న ఆర్గానిక్‌ ఇండియా అనే మల్టీ నేషనల్‌ కంపెనీ కోసం ఆర్గానిక్‌ తులసిని ఉత్పత్తి చేస్తున్నారు. ఆ ర్గానిక్‌ ఇండియా సంస్థ తులసి ఉత్పత్తికి అజమ్‌ఘర్‌ను ఎన్నుకోవడానికి ప్రధానకారణం అక్కడి భూములు తులసి పండించడానికి అనుకూలంగా ఉండడం తో పాటు ఆ జిల్లా అన్ని రకాలుగా అభివృ ద్ధి చెందే అవకాశాలు ఉండడమే.

40 సంవత్సరాల విమలమౌర్య అజమ్‌ ఘర్‌ జిల్లాలోని బిజౌరా గ్రామానికి చెందిం ది. గత 10 సంవత్సరాలుగా ఆర్గానిక్‌ తు లసిని పండిస్తున్నారు. ఈ తులసితో ఆర్గా నిక్‌ టీలు, ఆరోగ్యానికి ఉపయోగపడే వివి ధరకాల మందులు తయారు చేస్తున్నారు. మొదట తులసి పండించడం ప్రారంభిం చింది వివులనే. ఆర్గానిక్‌ ఇండియా నుంచి మొదటి అవకాశాన్ని వినియోగించుకున్న ది కూడా ఆమె.తనతోపాటు మరి కొంత మంది మిహళలతో కలసి తులసి పండించ డం ప్రారంభించారు. 35 సంవత్సరాల బీను విశ్వకర్మ కమెన్‌ పూర్‌ గ్రామానికి చెందినవారు. నలుగురు పిల్లలు.

tulasi 
‘కుటుంబాన్ని పోషించడమే చాలా కష్టంగా వున్న సమయంలో మేము తులసి పెంపకం మొదలు పెట్టిన తర్వాత దానితో మా అనుబంధం ఎంతగానో పెరిగింది. గతంలో మేము చేసిన వ్యవసాయానికి భిన్నంగా తులసి పెంప కం మొదలెట్టాం. కంపెనీ నిర్దేశించిన మార్గదర్శ కాలను అనుసరించే తులసిని పండిస్తాము.మొదట మేము చేయగలమా? అనుకున్నాము. కానీ తులసి పండించడానికి ప్రత్యేక పద్ధతులు వినియోగించాల్సిన అవసరం లేదని సాధారణ పంటల మాదిరే పండించ వచ్చని నిరూ పణ అయిన తర్వాత మా మీద మాకు విశ్వాసం పెరిగింది’ అని ఆమె చెబుతున్నారు.

అందరూ విజేతలే..
జిల్లాలోని మహిళలను ఎవరిని కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తాయి. ఆర్గానిక్‌ ఇండి యా కంపెనీ ఇక్కడి గ్రామస్తులకు తులసి పం డించడం మూలంగా కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పింది. పెట్టుబడి పెట్టడానికి కూ డా ముందుకు వచ్చింది. అయితే వారి గ్రామా లు అభివృద్ధి చెందిన తర్వాత సంస్థ పెట్టుబడి సంస్థకు ఇచ్చేలా ఒక ఒప్పందం కుదుర్చు కుంది. ఇప్పుడు జిల్లాలోని వివిధ గ్రామాల్లో సుమారు 300 మంది మహిళలు తులసి సా గు మీదే అధారపడి ఉన్నారు. సుమారు 2వేల ఎకరాల్లో తులసి సాగవుతుంది. జులై, ఆగస్టు లో తులసిని విత్తితే నవంబర్‌ వరకు కోతకు వస్తుంది. కనీసం 2వేల టన్నుల వరకు ఇక్కడ ఉత్పత్తి సాగిస్తున్నారు. కిలో ఒక్కింటికి రూ. 100 చొప్పున కంపెనీ రైతులకు చెల్లిస్తోంది.

Tulsi3 
తులసి సాగు తర్వాత పది సంవత్సరాల క్రితం ఉన్న గ్రామాలకు ఇప్పుడున్న గ్రామాల కు చాలా తేడా వచ్చింది. గ్రామాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పడ్డాయి.ప్రత్యేకంగా అల్లో పతి, ఆయుర్వేదిక్‌ ఆసుపత్రులు, వైద్యులు ఉన్నారు. గ్రామస్తులకు వారు ఉచిత వైద్యం అందిస్తారు. రోగులకు అవసరమైన మందులు అందజేయడంతో పాటు, హెర్బ ల్‌ ఉత్పత్తులను అందిస్తారు. శానిటేషన్‌ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది.వారి ఇళ్ళ ల్లో టాయ్‌లెట్ల నిర్మాణానికి కూడా సంస్థ సహకరించింది. బ్యాంకింగ్‌ సంస్థలు ఉన్నా యి. రైతులు పండించిన పంటకు సంబంధిం చి వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఆ యా బ్యాంకుల్లో నేరుగా వారి ఖాతాలో జమా అయ్యేలా ఆర్గానిక్‌ ఇండియా ఏర్పాట్లు చేసింది.

వెల్లివిరిసిన గ్రామీణ వికాసం....
ఆయా గ్రామాల్లో సామాజిక పరిస్థితులు కూడా అంతంత మాత్రం గానే ఉండేవి. బిజౌరా, కమెన్‌పూర్‌ గ్రామాల్లో 1999లో 63 శాతం స్కూల్‌ డ్రాపౌవుట్స్‌ ఉండేవారు. ఇప్పుడది 29 శాతానికి తగ్గింది. విమల, బీను వంటి రైతుల పిల్లలు స్కూల్‌కు వెళ్లి చదువుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడి డాక్టర్‌ను కలవాలంటే వారం ముందే పేరు నమోదు చేయించుకోవాలి. వైద్యులు ప్రతి రోజు రెండు పూటల వైద్య సేవలు అందిస్తారు. ఇతర ప్రాంతాలకు వలసవెళ్లే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. తులసి సాగు, కోత సమయంలో మగవారు వారి భార్యలకు సహాకారం అందిస్తున్నారు.

భవిష్యత్తులో మరిన్ని పంటలు..
ఈ వ్యవసాయ పద్ధతిని ప్రవేశ పెట్టడంలో ఆర్గానిక్‌ ఇండియా అం తర్జాతీయ సిఇఓ కృష్ణగుప్తా కృషి కూడా ఎక్కువే అని చెప్పా లి. అక్కడి మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆయ న చేసిన ప్రయత్నం విజయవం తమైనందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో వారితో గోధమ, పప్పుధాన్యాలు, వేరుశనగ, కూరగాయలు, పుష్పాలు సాగు చేయించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.చేేయూతనందిస్తే ఎంతటి కార్యానై్ననా అవలీలగా పూర్తి చేయగలమని ఈ మహి ళామణులు నిరూపించారు. తక్కువ కాలంలోనే వారి కుటుంబాలతో పాటు గ్రామా న్ని అభివృద్ధి చేసుకున్నారు.

Gouthamaraju as WUA