పాడి పంటలు

Sunday, March 13, 2011

ద్రాక్షరత్న

నాకు ఎక్కువ పేరొచ్చింది విదేశాల్లోనే!

"నాకు ఎనిమిదేళ్ల వయసుండగా నాన్న ముత్యం రెడ్డి అల్వాల్‌లో వందెకరాల ఆసామిగా ఉండేవారు. కాయగూరలు, వరి సాగు చేస్తుండేవారు. నేను పన్నెండో తరగతి చదివాక ఏదైనా ఉద్యోగం చేసుకోమన్నారు మా వాళ్లు. కాని నాకు వ్యవసాయరంగం అంటే చాలా ఆసక్తి. అప్పటికే మా పొలం పక్కన గోదావరి జిల్లా వాసులైన మంతెన ఆదినారాయణ రాజుకి ద్రాక్షతోట ఉండేది. వారికి లక్షల్లో ఆదాయాలు వచ్చేవి. ' ఏంటి రెడ్డిగారు..ఎన్నాళ్లు ఈ వరీ,కూరగాయలు...ద్రాక్ష పెట్టకూడదూ' అన్నారాయన.

పక్కనే ఉండటంతో ద్రాక్షసాగు విషయాలన్నీ తెలుసుకున్నాం. నాన్నకు తోడు నేను, అన్నయ్య శంకర్‌రెడ్డి ద్రాక్షసాగులోకి దిగాం. మొదట్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా వాతావరణం అనుకూలించడంతో ముందుకు సాగాము. అల్వాల్, గోధుమకుంట, కీసర, రాంపల్లి....ఇలా చాలా చోట్ల భూములు తీసుకుని ద్రాక్షసాగు చేశాం. మమ్మల్ని చూసి చాలామంది ఈ రంగంలోకి వచ్చారు. మొదట్లో బాగానే ఆదాయం కళ్ల చూసినా..రాను రాను నష్టాల రుచి కూడా చూశారు. దాంతో మెల్లగా కొందరు రైతులు ద్రాక్షకు గుడ్‌బై చెప్పారు. కొందరంటే ఒకరిద్దరు కాదు రియలెస్టేట్ బూమ్‌లో పడి చాలామంది ద్రాక్షకు దూరమయ్యారు.

ద్రాక్ష రత్న అవార్డు...

ఎవరు ఏ కారంణంతో పక్కకు జరిగినా...మేము మాత్రం ద్రాక్ష తోటలోనే నడిచాం. ద్రాక్షసాగులో నేర్చుకున్న మెళకువలు రంగారెడ్డి జిల్లాలో నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పలుకుబడే గ్రేప్ గార్డెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ని చేసింది. పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్ వంటి విషయాల్లో చాలామంది రైతులు నా వద్ద సలహాలు తీసుకోవడం మొదలుపెట్టారు. జిల్లాలో పెద్దఎత్తున ద్రాక్ష పండిస్తున్న రైతుగా నన్ను గుర్తించి 1990లో గవర్నరు ద్రాక్షరత్న బిరుదును ప్రదానం చేశారు.

సేంద్రీయ ద్రాక్ష...

లాభాలకోసం రైతులు రసాయనాల వెంటపడడం మొదలుపెట్టాక లక్షరూపాయలయ్యే పెట్టుబడి రెండు లక్షలకు పెరిగింది. ఎంతో ఆశతో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టిన రైతులు అకాలవర్షాల వల్ల, తుఫాన్ల వల్ల నష్టాలబాట పట్టాల్సి వచ్చింది. దాంతో చాలామంది రైతులు ద్రాక్షకు దణ్ణం పెట్టారు. నేనూ అలా దెబ్బ తిన్నవాణ్ణే. సమస్యను చూసి పారిపోవడం కన్నా..పరిష్కారం కనుగొని పదిమందికి ఆదర్శంగా నిలవాలని అనుకున్నాను. ద్రాక్షసాగుకి కావాల్సింది ఎన్‌పికే( నైట్రోజన్,ఫాస్పరస్, పొటాషియం). ఇవన్నీ కూడా రసాయనాల రూపంలో చెట్టుకు అందిస్తున్నాం. ఈ పోషకాలను సహజసిద్దంగా తయారుచేయగలిగితే చాలనుకున్నాను. ద్రాక్ష చెట్లమధ్య మొలిచే గడ్డిని ఎప్పటికప్పుడు తీసేసి శుభ్రంగా ఉంచుతారు.

నేను అలా చేయకుండా గడ్డిని అలాగే వదిలేసాను. వానాకాలం ఏపుగా పెరిగేది, ఎండకాలం ఎండిపోయేది. అలా ఎండిన గడ్డి వర్షాకాలంలో కుళ్లిపోయేది. కుళ్లిన గడ్డికింద ఉన్న మట్టిలో వానపాములు చేరేవి. చెట్టుకు కావలసిన ఎరువు దొరికిందనుకున్నాను. ఎందుకంటే ఒక వానపాము ఆయుఃప్రమాణం 120 రోజులు. రోజూ వందల సంఖ్యలో పుట్టుకొచ్చే వానపాములు రోజుల వ్యవధిలోనే చనిపోతూ ఉంటాయి. ఇలా చనిపోయిన వానపాముల వల్లే ఎన్‌పికే తయారవుతుంది. నేల పైపొరలో చనిపోయిన వానపాముల్ని తినడానికి రెండు మూడు అడుగుల లోతునుంచి రకరకాల సూక్ష్మజీవులు వస్తాయి.

వీటి వల్ల మట్టి గుల్లబడుతుంది. చెట్టు ఆరోగ్యంగా ఎదగడానికి కావలసిన పక్రియ అది. చెట్టు మొదలు దగ్గర ఒక గంప పేడ వేసి డ్రిప్‌లతో నీళ్లు పెట్టి వదిలేసాను. చెట్టుకు ఇంజెక్షన్లు ఇచ్చి కాపాడుకునే పరిస్థితికి నేను కనిపెట్టిన ఈ విధానం తిరుగులేని ప్రత్యామ్నాయమైంది. రెండేళ్ల పాటు ఈ సహజపద్ధతిని పాటించాను. మునుపెన్నడూ లేని దిగుబడిని చూశాను. దురదృష్టం ఏంటంటే...అందరూ వచ్చి నా సేంద్రీయ ద్రాక్షను చూశారు, తిన్నారు కాని ఏ రైతు కూడా నేను చేసిన ప్రయోగం చేయడం లేదు.

విటమిన్ ఎ బియ్యం...

ద్రాక్షపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాక...నా దృష్టి వరిపైకి మళ్లింది. 2004లోనే వరిసాగులో అధిక దిగుబడితో ఆరోగ్యకరమైన ఆహారం పండించాలని అనుకున్నాను. మనం తినే ఆహారంలో ఆరోగ్యంకన్నా, హాని ఎక్కువున్నదని పరిశోధకులు మొత్తుకుంటున్నారు. కారణం పంటలకు వాడే రసాయనాలు. మనుషులు ఆరోగ్యంగా ఉండాలన్నా...ఒంటికి సరిపడా ఆహారం కావాలన్నా ప్రకృతి ఇచ్చే ఆహారాన్ని తినాలి. వాటి బదులు మనం తయారుచేసుకున్న టాబ్లెట్లు, టానిక్‌లు తింటే ఏమవుతుంది. ఒకటి రెండు రోజులు బాగానే ఉంటుంది. ఆ తరువాత ఒళ్లంతా మందులమయమైపోయి జీవకళ పోతుంది. అలాగే విత్తు మొలిచే చోట రసాయనాలు గుమ్మరిస్తే నేలంతా నిస్సారమవుతుంది.

దిగుబడులు రాకపోగా...రసాయనాలతో పండించే ఆహారాన్ని తినాల్సివస్తుంది. ప్రస్తుతం రైతులందరూ చేస్తున్నది ఇదే. అప్పటివరకూ బీడుగా ఉన్న నేలలో మొదటిసారి వరి నాటితే పంట దిగుబడి అద్భుతంగా వస్తుంది. దానికి ఎలాంటి మందులు వేయక్కర్లేదు. ఎందుకంటే మట్టిలో సారం ఎక్కువగా ఉంటుంది. అదే నాలుగు పంటలయిన తర్వాత సారం పోతుంది కాబట్టి రసాయనాలపైన ఆధారపడాల్సి వస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు తల్లిని బలమైన ఆహారం ఎక్కువగా తీసుకోమని చెబుతారు డాక్టర్లు. ఈ సూత్రాన్ని వరి పంటకు వాడాను. సేంద్రీయ ఎరువులు వేసి వరి నాటాక... వరి పొట్టకు వచ్చే సమయంలో సహజంగా పొలం బీటలు వారుతుంది. ఆ సమయంలో నీళ్లు, రసాయన ఎరువులు బాగావేస్తే గింజ తోడుకుంటుంది. మట్టిలో బలం ఉంటేనే... లేకపోతే తోడుకోవు. నేను దీనికి ప్రత్నామ్నాయం ఆలోచించాను.

నీటిలో మట్టి కలిపి...
వరి నాటే ముందు ఒక్కొక్క మడిలో ఒక్కో చోట పది అడుగుల లోతు గొయ్యి తవ్వి ఎకరానికి టన్ను చొప్పున మట్టి తవ్వి పక్కన పెట్టుకోవాలి. ఆ గోతిలో మడిలో ఉన్న పైపైన మట్టిని వేసి పూడ్చేయాలి. వరి పొట్టకు వచ్చే సమయంలో మడుల్లోకి పారే నీళ్లలో ముందుగా తీసి పెట్టుకున్న మట్టిని కలపాలి. దీనికి మోటారు దగ్గర ఒక నీళ్లట్యాంకుని కట్టుకుని అందులో మట్టి కలుపుకోవాలి. పంట కోతకు వచ్చే లోపు ఈ పద్ధతిలో నాలుగైదు తడులు పెట్టాలి. మనం వేసిన కొత్త మట్టిలో ఉన్న సారమంతా నీళ్ల ద్వారా పొలంలోకి వెళుతుంది. దీని వల్ల చేను ఎండినా బీటలు రాకుండా ఉంటాయి. మట్టిలో ఉన్న బలమైన పోషకాలు గింజని గట్టిపడేలా చేస్తాయి. ఇలా పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న పరిశోధకులు కొన్ని రోజులపాటు చేసిన పరిశోధనలో తేల్చారు.

అరవై దేశాల్లో అంగీకరించాయి...

నేను పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని మన పరిశోధకులు నిర్ధారించాక, ఈ అంశంపై 32 పేజీల రికార్డు రాసి జెనీవాలోని అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థకు పంపాను. అక్కడ మొదట 35 దేశాల కూటమి నేను పంపిన అంశంపై ప్రత్యేక అధ్యయనం చేసింది. ఎనిమిది నెలల తర్వాత నా బియ్యంలో విటమిన్ ఎ ఉందని అంగీకరించి ఆయా దేశాల్లో నాకు పేటెంట్ హక్కులు కల్పించారు. యూరప్ వెబ్‌సైట్‌లో నా పరిశోధన గురించి వివరంగా పెట్టారు. నేను మొత్తం 75 దేశాలకు నా పరిశోధన వివరాలు పంపిస్తే దాదాపు 60 దేశాలు నా ప్రయోగాన్ని అంగీకరించి వారి దేశాల్లో పేటెంట్ హక్కుల్ని కల్పించాయి. 2006లో మన రాష్ట్రం వచ్చిన జార్జ్‌బుష్ నాతో ప్రత్యేకంగా ఈ విషయం గురించి మాట్లాడారు.

నా ఆరోగ్యమే నిదర్శనం...

2003 నుంచి నేను ఈ సేంద్రీయ వరి పంటనే పండిస్తున్నాను. అప్పటి నుంచి మా ఇంట్లో ఇవే బియ్యాన్ని తింటున్నాం. నాకు కంటిచూపు తగ్గడంతో అద్దాలు వాడేవాడిని. అలాంటిది నాలుగేళ్ల నుంచి అద్దాలు లేకుండానే పేపరు చదువుతున్నాను. అప్పటివరకూ ఉన్న మోకాళ్ల నొప్పులు, అజీర్తి, ఆయాసం వంటి జబ్బులన్నీ ఎగిరిపోయాయి. నాలో నాకు తెలియని కొత్త శక్తి వచ్చింది. రసాయనాలతో పండించిన ఆహారానికి, సహజ పోషకాలతో పండిన ఆహారానికి ఉన్న తేడాని నేను స్వయంగా చూశాను. ఈ బియ్యాన్ని ఎవరు తిన్నా...తినకపోయినా ముందుగా మన దేశంలో ఉన్న రైతులందరూ తినాలి. వాళ్లు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకే ఈ పంటపై పేటెంటు హక్కుని పొందినప్పటికీ రైతులు పండించుకుని తినడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు.

విత్తే మిషన్ వచ్చింది...

వరి పంటపై చేసిన ప్రయోగం ముగియగానే వరినాటుని సులభతరం చేసుకోవాలని అనుకున్నాను. రోజురోజుకూ పెరుగుతున్న కూలీల కొరత, మొలకల ఎదుగుదలలో మిషన్ చేసే సాయం వంటి విషయాలపై ఆలోచించాను. ఒకచోట వేసిన నారుని తీసి మరో చోట నాటడం వల్ల వేళ్లు తెగి, అవి మళ్లీ భూమిలోకి వెళ్లి అప్పుడు పిలకలు వేయడం దీని వల్ల చాలా సమయం వృధా అవుతుంది. అలాగే వరి కర్రలు కూడా చాలా తక్కువగా వస్తాయి. అందుకే ఒకటే విత్తుని విత్తితే అది మొక్క మొలిచి తనకున్న స్థలంలో చక్కగా వేళ్లూనుకుని పదుల సంఖ్యలో పిలకలు వచ్చే అవకాశం ఉంది.

అయితే ఒక్కొక్క గింజ నాటడం చాలా కష్టం. దీని కోసం ఒక మెషిన్ తయారుచేశాను. దీని వల్ల నేరుగా గింజభూమిలోకి వెళుతుంది. అదే సమయంలో గింజకు రెండువైపులా నేలను చదును కూడా చేస్తుంది. ఈ మిషన్‌తో ఒక్క వరి విత్తనాలే కాదు గోధుమ, సజ్జ, మొక్కజొన్న, పెసలు, మినుములు...అన్ని రకాల విత్తనాలు సులువుగా నాటుకోవచ్చు. ఈ మిషన్‌కి పేటెంట్ కోసం చెన్నైలోని పరిశోధనా సంస్థకు పంపించాను. వారు నా మిషన్ గురించి వారి వెబ్‌సైట్‌లో పెట్టారు. అది చూసిన అమెరికావాళ్లు అక్కడ తమ దినపత్రికలలో రాశారు.

జూ భువనేశ్వరి
ఫొటోలు: సాయి

Gouthamaraju as WUA